ఆటోలో ప్రయాణం..అటో...ఇటో...
-
అదుపు తప్పుతున్న ఆటోలు
-
ప్రమాదాల బారీన ప్రయాణికులు
-
పరిమితికి మించి రవాణా ప్రధాన కారణం
గంగాధర: ఆటోల్లో ప్రయాణించడం ప్రయాణికుల పాలిట శాపంగా మారుతోంది. పరిమితికి మించి ప్రయాణికులను తరలిస్తుండడం వల్ల ప్రమాదాలు జరిగి ప్రయాణికుల ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. ఆటో ప్రయాణికులు తమ గమ్య స్థానాలు చేరుకునే వరకు ప్రాణాలకు గ్యారంటీ లేకుండా పోతోంది. వరుస ఆటో ప్రమాదాల వల్ల ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. సోమవారం జరిగిన ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. మధ్యాహ్నం గంగాధర చౌరస్తా నుంచి బోయినపల్లి మండలంలోని తిప్పాయిపల్లికి వెళ్లేందుకు కరీంనగర్కు చెందిన నర్సయ్య ఆటో ఎక్కి డ్రైవర్ పక్కన కూర్చున్నాడు. కొద్ది దూరం వెళ్లే సరికి పట్టుతప్పి కింద పడిపోయాడు. ఆటో అతడి తలపై నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. హనుమాన్ జయంతి రోజు మాల విరమణకు కొండగట్టుకు వెళుతున్న ఆటో వెంకటాయిపల్లి బస్టాండ్ సమీపంలో బోల్తాపడింది. ఈ ఘటనలో హనుమాన్ భక్తుడు మృతి చెందాడు.
గంగాధర గ్రామానికి చెందిన రమేష్ ఆటోలో జిల్లా కేంద్రానికి వెళుతుండగా ఆటో బోల్తాపడి చేయి విరిగింది. బోయినపల్లి మండలంలో పనిచేసే ఓ మహిళా ఉద్యోగి ప్రయాణిస్తున్న ఆటో బోయినపల్లి రోడ్డులో బోల్తాపడగా తీవ్రగాయాలై చేయివిరిగింది. మిగితా ప్రయాణికులు గాయాల పాలయ్యారు. కరీంనగర్–జగిత్యాల ప్రధాన రహదారిలో ఇస్లాంపూర్ సమీపంలో మూడు సంవత్సరాల క్రితం లంబాడిపల్లి గ్రామం నుంచి తడగొండకు కూలీలను తీసుకువస్తున్న ఆటో బోల్తాపడి పదిహేను మందికి గాయలయ్యాయి. పోతుగంటì పల్లి గ్రామ సమీపంలో ఆటోబోల్తాపడి ఓ వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. ఇలా చూస్తే చాలా మంది ఆటోల్లో ప్రయాణించడం వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు.
అతివేగం, అజాగ్రత్త...
ఆటో ప్రమాదాలకు ప్రధాన కారణం అతివేగం, నిర్లక్షపు డ్రైవింగ్, అజాగ్రత్తేనని పలువురు అభిప్రాయ పడుతున్నారు. డ్రైవర్కు ఇరుపక్కల, లగేజీ వేసే చోట కూడా ప్రయాణికులను కూర్చొబెట్టి పరిమితికి మించి ప్రయాణికులను ఆటోల్లో తరలిస్తున్నారు. తగిన జాగ్రత్తలు పాటించకుండా అతివేగంతో వాహనాలు నడపడం వల్ల, మద్యం సేవించి నడపడం వల్ల తరుచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. డ్రైవర్లు పోటీ పడి నడపం వల్ల కూడా ప్రమాదాలు సంభవిస్తున్నాయి.
పరిమితికి మించి రవాణ.. పట్టించుకోని అధికారులు..
పరిమితికి మించి ప్రయాణికులను తరలించడంవల్ల ఆటోలు అదుపు తప్పుతున్నాయి. ఆటో కెపాసిటీ నలుగురు మాత్రమే కాగా పది మందికి మించి ప్రయాణికులను ఆటోల్లో ఎక్కిస్తున్నారు. కూలీలను తీసుకువెళ్లే ఆటోలలో పదిహేను నుంచి 20 మంది వరకు ప్రయాణికులను తరలిస్తుంటారు. దీంతో ఆటోలు ప్రమాదాల బారిన పడుతున్నాయి. గంగాధర చౌరస్తాలో ఉదయం సాయంత్రం పరిశీలిస్తే నలబై నుంచి యాౖభై ఆటోలకు పైగా కూలీలను రవాణా చేయడం కనిపిస్తుంది. మహిళా కూలీలు నిల్చోని మరీ ప్రయాణించడం కనిపిస్తుంది. వరుస ప్రమాదాలు జరుగుతున్నా, ప్రమాదాల కారణాలు అధికారులకు తెలిసినా ఎవరూ పట్టించుకోకపోవడంతో ప్రమాదాల తీవ్రత పెరుగుతోంది.