
కౌన్సెలింగ్లో దంపతుల రాజీ
రాయదుర్గం టౌన్: మనస్పర్థలతో విడిపోయిన దంపతులకు కుటుంబ సంక్షేమ సలహా కేంద్రం (ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్) సభ్యులు శనివారం కౌన్సెలింగ్ ఇచ్చి రాజీ చేయించారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్ అధ్యక్షుడు ఇ.రామాంజనేయులు వెల్లడించారు. రాయదుర్గానికి చెందిన వడ్డే తిప్పేస్వామికి కర్ణాటకలోని నాగసముద్రం గ్రామానికి చెందిన రాజేశ్వరితో ఆరేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. తిప్పేస్వామి తాగుడుకు బానిసై కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తుండటంతో విసుగెత్తిపోయిన రాజేశ్వరి నెల రోజుల క్రితం పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో తన కాపురాన్ని నిలబెట్టాలని తిప్పేస్వామి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించాడు. ఈ మేరకు ఇరుపక్షాల పెద్దలనూ పిలిపించి కౌన్సెలింగ్ ద్వారా దంపతుల మధ్య రాజీ చేయించి, వారి కాపురాన్ని చక్కదిద్దారు. కార్యక్రమంలో అధ్యక్షుడు రామాంజనేయులతోపాటు సభ్యులు బండి కిష్టప్ప, న్యాయవాదులు వసుంధర, రవిచంద్ర పాల్గొన్నారు.