బీసీలను అణగదొక్కుతున్న ప్రభుత్వం
బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
పోతిన వెంకట మహేష్
గాంధీనగర్ :
రాష్ట్రంలోని టీడీపీ ప్రభుత్వం బీసీలను అణగొక్కేం దుకు ప్రయత్నిస్తోందని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోతిన వెంకట మహేష్ అన్నారు. ఎన్నికల ముందు బీసీలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ధర్నా చౌక్లో శనివారం మహాధర్నా నిర్వహించారు. మహేష్ మాట్లాడుతూ ఎన్నికల ముందు చెప్పిన బీసీ డిక్లరేషన్, బీసీ సబ్ప్లాన్కు చట్టబద్దత వంటివి అటకెక్కించారని చెప్పారు. అగ్రవర్ణాలను, అర్హత లేని కులాలను బీసీ జాబితాలో చేరిస్తే సహించేది లేదని హెచ్చరించారు. రాష్ట్రంలో 56 శాతం ఉన్న బీసీలకు కార్పొరేషన్ ద్వారా రూ. 240 కోట్లు ప్రకటించిన ప్రభుత్వం కేవలం 6 శాతం ఉన్న కాపులకు రూ. 1000 కోట్లు కేటాయించి వివక్ష చూపుతోందన్నారు. విదేశీ విద్యా పథకం లోనూ బీసీలకు తీరని అన్యాయం జరిగిందని చెప్పారు. ఈ పథకం కింద 500 మందిని విదేశాలకు పంపాల్సి ఉండగా కేవలం 13మంది బీసీ విద్యార్థులనే ఎంపిక చేశారన్నారు. కాపు సామాజికవర్గానికి చెందిన 145 మందిని ఎంపిక చేయడం వివక్ష కాదా? అని ప్రశ్నించారు. ఆదరణ పథకాన్ని అటకెక్కించారన్నారు. బీసీ సబ్ప్లాన్కు చట్టబద్దత కల్పించాలని, బీసీ డిక్లరేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ధర్నాలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నూకాలమ్మ, కామరాజ్ హరీష్, చెరుకూరి సత్య, బీసీ విద్యార్థులు పాల్గొన్నారు.