
‘ఆసరా’కు బయోమెట్రిక్ చేటు!
- వృద్ధులు, వికలాంగులకు ఇబ్బందులు
- కంటిచూపు, చేతి వేళ్ల ముద్రలకు నో
- అయోమయంలో పింఛన్ దారులు
దుబ్బాక రూరల్: బయోమెట్రిక్ సహకరించక పోవడంతో ఆసరా లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. కంటిపాపల (ఐరిస్) నమోదు కాకపోవడంతో వారు పింఛన్ కు అర్హతను కోల్పోతున్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వృద్ధులకు, అంధులకు సహకరించని కారణంగా పింఛన్ కు దూరమయ్యే ప్రమాదం ఉంది. వృద్ధులు, వికలాంగులు, బీడీ కార్మికులు, ఇతరులకు ప్రభుత్వం ఆసరా పింఛన్ అందిస్తోంది. ఇటీవల మీసేవ ద్వారా ప్రతి ఒక్కరు బయోమెట్రిక్ లైఫ్ సర్టిఫికెట్ కోసం నమోదు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. అర్హత ఉండి ఆధార్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు పింఛన్ పొందారు.
బయోమెట్రిక్ నమోదుకోసం చేతి వేళ్లతోపాటు, కంటి చూపు నమోదు చేసుకోవాలి. వృద్ధులు, అంధులకు బయోమెట్రిక్ నమోదు కాకపోవడంతో వారు అయోమయానికి గురవుతున్నారు. గతంలో ఆధారు కార్డు నమోదు కోసం అన్ని నమోదైతే ఇప్పుడు ఎందుకు నమోదు చేసుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు. 80 ఏళ్లుదాటిన వారిలో చాలామందికి కంటిచూపు అంతగా కనిపించదు. కొంతమంది వికలాంగులకు సగం కంటి చూపు ఉంటుంది. సాంకేతిక సమస్య నుంచి తమను బయట పడేసి పింఛన్ వచ్చేలా చూడాలని వారు కోరుతున్నారు.