పేద విద్యార్థికి ఫేస్బుక్ మిత్రుడి సాయం
Published Wed, Aug 31 2016 11:46 PM | Last Updated on Sat, Jul 6 2019 12:42 PM
వెల్గటూరు: ఫేస్బుక్ కాలక్షేపానికే కాదు.. సద్వినియోగం చేసుకుంటే కష్టాల్లో ఉన్నవారికి చేయూతనిచ్చేందుకూ ఉపయోగపడుతుంది. ఆర్థిక ఇబ్బందులతో బడి మానేసిన ఓ పేద విద్యార్థి పరిస్థితిని ఫేస్బుక్ ద్వారా తెలుసుకుని అమెరికా నుంచి ఓ దాత ఆర్థిక సాయం అందించారు.
వెల్గటూరు మండలం చెందిన కొండాపూర్కు చెందిన సాయిగణేశ్ అనే విద్యార్థి ఎండపెల్లి ఉన్నత పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్నాడు. తమ ఊరి నుంచి రోజూ ఎండపెల్లికి వెళ్లేందుకు బస్సు సదుపాయం లేదు. రోజూ ఆటోలో వెళ్లేందుకు పేద తల్లిదండ్రులు డబ్బులు చెల్లించలేక బడి మానేశాడు. సాయిగణేశ్ చురుకైన విద్యార్థి. ఈ విషయాన్ని ఉపాధ్యాయుల ద్వారా తెలుసుకున్న ధర్మపురిలోని రమేశ్ ఈ విషయాన్ని ఫేస్బుక్ ద్వారా తెలియజేయగా అమెరికాలో ఉన్న వైజాగ్కు చెందిన అతడి స్నేహితుడు మహేంద్ర వెంటనే స్పందించారు. ప్రధానోపాధ్యాయుడు శ్రీపతిరావు ఖతాలో రూ. ఆరు వేలు జమచేశారు. వాటితో ఒక సైకిల్ ,రెండు జతల దుస్తులు, పాదరక్షలు కొనుగోలు చేసి అందించారు. ఎండపెల్లిలో ఏర్పాటు చేసిన సమావేశంలో జగిత్యాలకు చెందిన సత్యసాయి అభయ హస్తం నిర్వాహకులు సామ ఉమాపతి వాటిని విద్యార్థికి అందించారు. స్పందించిన సామ ఉమాపతి రూ. 10 వేలు పేద విద్యార్థుల సహాయార్థం పాఠశాలకు విరాళంగా అందించారు. విద్యార్థి సహాయం పొందేందుకు సహకరించిన రమేశ్కు, విరాళం అందించిన ఉమాపతికి ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులు కృతజ్ఞతలు తెలిపారు.
Advertisement
Advertisement