
సీడీలు చూస్తుంటే.. కరెంటు పోయింది!
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ర్యాగింగ్ భూతానికి బలైపోయిన రిషికేశ్వరి మరణంపై విచారణలో హైడ్రామా చోటుచేసుకుంది. రిషికేశ్వరి మరణంపై వర్సిటీలో నిజనిర్ధారణ కమిటీ సమావేశం గురువారం సాయంత్రం జరిగింది. ఈ సమయంలో ఆర్కిటెక్చర్ కాలేజి ప్రిన్సిపల్ గతంలో సాగించిన లీలలకు సంబంధించి సీడీల రూపంలో విద్యార్థులు కమిటీకి ఆధారాలు సమర్పించారు. కానీ ఆ సీడీలు చూస్తుండగా మధ్యలో రెండుసార్లు కరెంటు పోయింది.
సరిగ్గా.. ఈ సమయంలోనే ప్రిన్సిపల్ అనుకూల వర్గానికి చెందిన విద్యార్థులు అక్కడకు ప్రవేశించారు. అక్కడే ఉన్న మీడియాపైన, విద్యార్థి సంఘాల నేతలపైన వాళ్లు దాడి చేశారు. ఇంతలో పోలీసులు జోక్యం చేసుకుని రెండు వర్గాలను చెదరగొట్టారు. నిజనిర్ధారణ కమిటీ సమావేశం తూతూ మంత్రంగా కొద్దిసేపట్లోనే ముగిసిపోయింది. ప్రిన్సిపల్ బాబూరావుపై సస్పెన్షన్ ఎత్తేయాలంటూ ఆయన అనుకూల విద్యార్థులు నినాదాలు చేశారు.