నకిలీ పత్తి విత్తనాల పట్టివేత
కనకదిన్నె (పత్తికొండ రూరల్) : కనకదిన్నె గ్రామంలో నకిలీ పత్తి విత్తనాలను వ్యవసాయాధికారులు స్వాధీనం చేసుకున్నారు. అగ్రికల్చర్ ఏఓ రాజకిషోర్ ఆధ్వర్యంలో అధికారులు ముందస్తు సమాచారం మేరకు సోమవారం సాయంత్రం గ్రామానికి చెందిన గొల్లపెద్దయ్య, గొల్ల కిస్టయ్యల ఇళ్లపై దాడి చేశారు. నిల్వ ఉన్న రూ.5లక్షలు విలువైన నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. ఎలాంటి గుర్తింపు లేని నకిలీ విత్తనాలను రైతులకు అంటగట్టి సొమ్ము చేసుకునేందుకు కొందరు వ్యాపారులు విత్తనాలను భారీగా నిల్వ చేయడంతో గ్రామస్తులు సమాచారం ఇవ్వడంతో అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. విత్తనాలను సీజ్ చేసి కేసు నమోదు చేసినట్లు రాజకిషోర్ తెలిపారు. ఈయన వెంట ఏఈఓలు యోగి, రంగన్న, హనుమన్న, వీఆర్ఓ అనురాధ, ఎంపీఈఓ రంగస్వామి ఉన్నారు.