ప్రతి ఇంటికి గ్యాస్ కనెక్షన్
-ఓర్వకల్లు వద్ద ఎయిర్పోర్టు
– కోవెలకుంట్ల ప్రాంతంలో ఆరు సిమెంట్ పరిశ్రమలు
– రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి వెల్లడి
కర్నూలు(అర్బన్): జూన్ నెలాఖరు నాటికి ప్రతి ఇంటికి గ్యాస్ కనెక్షన్లు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి పేర్కొన్నారు. మంగళవారం ఉదయం స్థానిక జిల్లా పరిషత్లో జెడ్పీ చైర్మన్ చాంబర్లో ఆయన రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్, జెడ్పీ చైర్మన్ మల్లెల రాజశేఖర్, ఎమ్మెల్యే ఎస్వీ మోహన్రెడ్డితో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేఈ మాట్లాడుతూ జిల్లాలోని ఓర్వకల్లు ప్రాంతంలో త్వరలో విమానాశ్రయం రాబోతోందని, అలాగే పలు పరిశ్రమలు పురుడుపోసుకోనున్నాయని చెప్పారు. ఉర్దూ విశ్వ విద్యాలయం నిర్మాణం శరవేగంగా జరుగుతుందని చెపా్పరు. కోవెలకుంట్ల ప్రాంతంలో త్వరలో ఆరు చిన్న, పెద్ద సిమెంట్ పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయని వెల్లడించారు. నగర పాలక సంస్థ పరిధిలోని నిరుద్యోగులు, మహిళలకు ఆర్థిక చేయూత ఇచ్చేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నామని చెప్పారు. బడుగుబలహీన వర్గాలకు రుణాలు ఇవ్వనున్నట్లు వెల్లడించారు. 2015 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పత్తికొండ నియోజకవర్గానికి ఇవ్వాల్సిన ఇన్పుట్సబ్సిడీ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకోపోయినట్లు చెప్పారు.ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణా సంఘం సభ్యులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.