కేసు పెట్టినా మాకేం కాదు
-
ఆటోను ఢీకొన్న టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని బంధువుల కారు
-
నలుగురికి గాయాలు
-
ఆటోడ్రైవర్, స్థానికులపై ఎమ్మెల్యే బంధువులు, గన్మెన్ల దౌర్జన్యం
-
కారు నుంచి కిందకు దిగని ఎమ్మెల్యే
కావలి రూరల్: గుంటూరు జిల్లా గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు బంధువులకు చెందిన కారు శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా రుద్రకోట సమీపంలో జాతీయ రహదారిపై శనివారం మధ్యాహ్నం ఆటోను ఢీకొట్టింది. ఈప్రమాదంలో ప్రకాశం జిల్లా గుడ్లూరు మండలం కొత్తపేటకు చెందిన టి.లక్ష్మమ్మ తలకు బలమైన గాయాలు కాగా గుడ్లూరుకు చెందిన వెంకటరావు, బ్రహ్మయ్య, సింహాద్రిలకు స్వల్పగాయాలయ్యాయి. బాధితుల వివరాల మేరకు.. గుడ్లూరు నుంచి కావలికి వస్తున్న ఆటో జాతీయ రహదారిపై రుద్రకోట పాలిటెక్నిక్ కాలేజి వద్దకు రాగానే ప్రయాణికులను ఎక్కించుకునేందుకు ఆగింది. ఈ సమయంలో ఏపీ07సీయు5555 నంబరుగల కారు వెనుక నుంచి వేగంగా వచ్చి ఆటోను ఢీకొట్టింది. దీంతో కారుపల్టీలు కొట్టడంతో ఆటోలో ఉన్న ప్రయాణికులు గాయపడ్డారు. వీరిని స్ధానికులు 108 సహాయంతో కావలి ఏరియా వైద్యశాలకు తరలించారు. అక్కడ వీరికి చికిత్స నిర్వహిస్తున్నారు. పోలీసులకు సమాచారమందించారు.
బాధితులపైనే దౌర్జన్యం
గుంటూరు జిల్లా గురజాల టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు బంధువులతో కలిసి తిరుపతి వెళుతున్నాడు. ఈక్రమంలో అతని బంధువులు ప్రయాణిస్తున్న కారు వేగంగా వచ్చి ఆటోను ఢీకొంది. దీంతో కారులోని వ్యక్తులు కిందకు దిగి ఆటో డ్రైవర్ పైన దౌర్జన్యానికి దిగారు. కనీసం గాయపడ్డవారికి సహాయం కూడా చేయకుండా దాడికి దిగడంతో అక్కడికి చేరుకున్న స్ధానికులు వారిని అడ్డుకున్నారు. దీంతో తాము అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే మనుషులమని కేసులు పెట్టినా తమకు ఏమీకాదని స్ధానికులను దబాయించారు. ముందు కారులో వున్న ఎమ్మెల్యే కారు నుంచి దిగలేదు. ఆయన గన్మెన్లు కారుదిగి స్ధానికులతో వాగ్వావాదానికి దిగారు. బాధితులపైనే కేసులు పెడుతామని బెదిరించారు. స్ధానిక రుద్రకోటకు చెందిన యువకులు, జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న వాహనదారులు వాగ్వాదానికి దిగడంతో వారు అక్కడినుంచి వెళ్లిపోయారు. అధికారపార్టీ ఎమ్మెల్యే కారు కావడంతో దీనిపై కేసు నమోదు చేసుకునేందుకు రూరల్ పోలీసులు వెనుకాడుతున్నారు.