
తాగి వేధిస్తున్నాడని హత్య
సోదరులతో కలిసి
రాడ్డుతో దాడి చేసిన భార్య
తిరుపతి క్రైం: నగరంలోని జీవకోన రాజీవ్నగర్లో గురువారం సాయంత్రం మద్యం తాగి వేధిస్తున్నాడని భార్య తన సోదరులతో కలిసి భర్తను హత్య చేసింది. అలిపిరి సీఐ శ్రీనివాసులు కథనం మేరకు.. రాజీవ్నగర్లో భాస్కర్ (40), జ్యోతి (35) దంపతులు నివాసం ఉంటున్నారు. ఇద్దరూ తిరుపతి మున్సి పల్ కార్యాలయంలో కార్పొరేషన్ కాంట్రాక్ట్ కార్మికులుగా పనిచేస్తున్నారు. వీరికి ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. వారిలో ఒకరిని జ్యోతి సోదరునికి ఇచ్చి వివాహం జరిపించింది. మద్యానికి భానిసైన భాస్కర్ తరచూ మద్యం తాగి ఇంటికి వచ్చి భార్యతో గొడవపడి చితకబాదేవాడు.
బావ మరుదులు ఎన్నిసా ర్లు సర్దిచెప్పినా భాస్కర్ వినేవాడు కాదు. ఈ క్రమంలో గురువారం సాయంత్రం పూటుగా మద్యం తాగి ఇంటికి వచ్చాడు. దీనిపై భార్య ప్రశ్నిం చడంతో గోడవ పడ్డాడు. దీంతో ఆమె తన సోదరులు చలపతి, మునిరత్నంకు సమాచారం ఇచ్చింది. వారు ఇంటికి వచ్చి బావకు సర్ది చెప్పేందుకు ప్రయత్నించారు. అతను వినకపోవడంతో ముగ్గురూ కలిసి ఇనుపరాడ్డు, కర్రలతో భాస్కర్పై దాడి చేశారు. దీంతో అతను అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న అలిపిరి పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎస్వీ మెడికల్ కళాశాలకు తరలించారు. కేసు నమోదు చేసుకుని నిందితులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.