పోలీసు శిక్షణ కేంద్రాన్ని తనిఖీ చేసిన ఐజీ
కర్నూలు: కర్నూలు శివారులోని జగన్నాథగట్టుపై ఉన్న పోలీసు శిక్షణ కేంద్రాన్ని మంగళవారం రాయలసీమ రీజియన్ ఐజీ శ్రీధర్రావు తనిఖీ చేశారు. ఎస్పీ ఆకే రవికృష్ణ, పోలీసు శిక్షణ కేంద్రం ప్రిన్సిపాల్ చంద్రశేఖర్రెడ్డి, ఓఎస్డీ రవిప్రకాష్, కర్నూలు టౌన్ డీఎస్పీ రమణమూర్తి, ఆర్ఐ రంగముని, తాలూకా సీఐ మహేశ్వరరెడ్డి, రూరల్ తాలూకా సీఐ నాగరాజు యాదవ్ తదితరులు ఐజీ వెంట ఉన్నారు. కర్నూలు జిల్లా నీటి యాజమాన్య సంస్థ సహకారంతో గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన మొక్కలు నాటే కార్యక్రమంలో ఐజీ పాల్గొన్నారు. శిక్షణ కేంద్రం పరిసరాలన్నింటినీ కలియ తిరిగి పరిశీలించారు. పచ్చదనం పరిరక్షణకు కేంద్రం వైస్ ప్రిన్సిపాల్ రాజశేఖర్రాజు, సిబ్బంది చేస్తున్న కృషిని ప్రత్యేకంగా అభినందించారు. డీటీసీలో జరిగే శిక్షణ కార్యక్రమాలను వైస్ ప్రిన్సిపల్ను అడిగి తెలుసుకున్నారు. త్వరలో ప్రారంభం కానున్న కానిస్టేబుల్ ప్రాథమిక శిక్షణకు అవసరమైన మౌలిక సౌకర్యాల అభివృద్ధికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలిలని ఎస్పీ ఆకే రవికృష్ణకు సూచించారు.