
కీచక టీచర్లపై చర్యలు చేపట్టాలి
సిద్దిపేట జోన్: ఉపాధ్యాయుల ముసుగులో విద్యార్థినులపై లైగింక వేధింపులకు పాల్పడిన కీచక టీచర్లపై కఠిన చర్యలు చేపట్టాలని విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. శుక్రవారం ఎన్ఎస్యూఐ, టీఎన్ఎస్ఎఫ్, పీడీఎస్యూ, బీడీఎస్ఎఫ్ ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద నోటికి నల్ల గుడ్డలు కట్టుకొని నిరసన తెలిపారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ కృష్ణవేణి టాలెంట్ స్కూల్ గుర్తింపును రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
]సంఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు చేపట్టాలని కోరారు. అనంతరం డిప్యూటీ ఈఓ శ్యాంప్రసాద్రెడ్డిని కలసి ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో విద్యార్థి సంఘాల నాయకులు సాయి ఈశ్వర్గౌడ్, రమేష్, ఆనంద్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
అత్యాచారాలు అరికట్టాలి
ప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్థినులపై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టాలని సామాజిక హక్కుల సంఘం జిల్లా కార్యదర్శ సంతోష్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన శుక్రవారం పత్రికా ప్రకటన విడుదల చేశారు. కృష్ణవేణి విద్యా సంస్థలో పనిచేస్తున్న రాజారాంపై చర్యలు చేపట్టాలని కోరారు. ప్రభుత్వం చొరవ చూపి భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరారు.
కఠినంగా శిక్షించాలి
విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడిన ఉపాధ్యాయుడు రామచంద్రంను కఠినంగా శిక్షించాలని వైఎస్సార్ సీపీ యువత జిల్లా ప్రధాన కార్యదర్శి రాజలింగం, నాయకులు విజయ్, మధు, తిరుపతి ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. విద్యార్థినుల పట్ల అనుచితంగా వ్యవహరించిన ఉపాధ్యాయులపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ టీచర్స్ ఫెడరేషన్ జిల్లా నాయకులు రామస్వామి అజిజ్ డిమాండ్ చేశారు. ఏబీవీపీ ఆధ్వర్యంలో శుక్రవారం సిద్దిపేట డీఎస్సీ, ఆర్డీఓ, డిప్యూటీ ఈఓ కార్యాలయాల్లో వినతి పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు హరీశ్, సాయి, భరత్, లక్ష్మణ్, లింగం, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.