భూ సమీకరణ చట్ట విరుద్ధం
Published Sat, Oct 15 2016 5:11 PM | Last Updated on Mon, Sep 4 2017 5:19 PM
* తేల్చిచెప్పిన వెంకటపాలెం రైతులు
* ప్లాట్లకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్
* గ్రామసభలో రైతుల ప్రశ్నలకు అధికారులు ఉక్కిరిబిక్కిరి
సాక్షి, అమరావతి బ్యూరో : భూ సమీకరణ చట్టవిరుద్దమని వెంకటపాలెం గ్రామానికి చెందిన రైతులు తేల్చి చెప్పారు....అంతేకాక వీరు సంధించిన ప్రశ్నలకు అధికారులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు... సమాధానం చెప్పలేక తడబడ్డారు. వివరాలు... రాజధాని నిర్మాణం కోసం భూములు ఇవ్వని రైతులు కొందరికి భూ సేకరణకు నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే. మరి కొందరికి ఇవ్వాల్సి ఉంది. నోటిఫికేషన్ ఇవ్వకముందు సామాజిక ప్రభావ మదింపు సర్వే నిర్వహించాల్సి ఉంది. ఆ సర్వేలో 70శాతం మంది అభిప్రాయం మేరకు నోటిపికేషన్ ఇవ్వాలా? వద్దా? అనేది నిర్ణయిస్తారు. అందులో భాగంగా శుక్రవారం వెంకటపాలెంలో అధికారులు గ్రామసభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలువురు రైతులు హాజరయ్యారు.
గ్రామసభలో రైతులు మాట్లాడుతూ.. 2013 భూ సేకరణ చట్టం ప్రకారం రైతులకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. అలా కాకుండా రాష్ట్రపతి ఆమోదం లేకుండా భూ సమీకరణను తెరపైకి తీసుకురావటం చట్ట విరుద్దమని విద్యావంతులైన కొందరు రైతులు పేర్కొన్నారు. అలాగే ల్యాండ్పూలింగ్లో రైతులను భాగస్వాములుగా చేసిన విషయాన్ని గుర్తుచేశారు. గ్రామ కంఠాల సమస్యను ఎందుకు పరిష్కరించటం లేదని అధికారులను నిలదీశారు. రైతులకు సీఆర్డీఏ కేటాయించే ప్లాట్లకు చట్టబద్ధత∙కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం భూ సేకరణకు వెళితే... రిజిస్ట్రేషన్ వ్యాల్యూనే మార్కెట్ ధరగా పరిగణిస్తోందని, ఆ లెక్కన ప్రభుత్వం ఎకరానికి రూ.12.50 లక్షలు మాత్రమే ఇస్తామని చెబుతోందని గ్రామానికి చెందిన మరో రైతు వివరించారు. ప్రభుత్వం స్విస్ఛాలెంజ్ విధానంతో సింగపూర్ సంస్థకు ఎకరం భూమి రూ.4కోట్లకు కట్టబెడుతున్నప్పుడు... రైతుకు మాత్రం ఆ ధర ఎందుకు వర్తించటం లేదని ప్రశ్నించారు. తమ భూములతో ప్రభుత్వం వ్యాపారం చేయటానికేనా? అని నిలదీశారు. ఇదిలా ఉంటే ప్రభుత్వం ఇప్పటి వరకు రెండు పర్యాయాలు రిజిస్ట్రేషన్ ధరలను పెంచినా... రాజధాని ప్రాంతాల్లో మాత్రం భూముల విలువను ఎందుకు పెంచటం లేదని ప్రశ్నించారు. రైతులు అడిగిన ప్రశ్నలకు అధికారులు సమాధానం చెప్పలేక తడబడ్డారు. వారు చెప్పాల్సింది చెప్పి వెళ్లిపోవటం కనిపించింది.
Advertisement
Advertisement