రోడ్డుపై బైఠాయించిన టీడీపీ నాయకులు, నిర్వాసితులు
-
2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించాలి
-
ఆ తర్వాతే సర్వే చేపట్టాలి
-
కాంగ్రెస్, టీడీపీ నాయకుల డిమాండ్
-
కన్నేపల్లి గ్రామస్తులతో కలిసి ధర్నా
కాళేశ్వరం : మేడిగడ్డ బ్యారేజీ పేరుతో ప్రభుత్వం రైతుల కడుపు కొడుతోందని జిల్లా పరిషత్ ఫ్లోర్లీడర్ చల్లా నారాయణరెడ్డి ఆరోపించారు. మేడిగడ్డ బ్యారేజీలో భాగంగా కన్నెపల్లిలో చేపట్టే పంప్హౌస్ నిర్మాణం కింద భూములు కోల్పోతున్న రైతులతో కలిసి కాంగ్రెస్, టీడీపీ ఆధ్వర్యంలో వేర్వేరుగా మహదేవపూర్ మడంలం కాళేశ్వరం బస్టాండ్ వద్ద ఆదివారం ధర్నా, రాస్తారోకో చేశారు. నారాయణరెడ్డి మాట్లాడుతూ, మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణానికి కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం కాదని, నిర్వాసితులకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించాలని, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని, గిరిజనులకు డబుల్ బెడ్రూం ఇళ్లు మంజూరు చేయాలన్నారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల గ్రామస్తులకు న్యాపరమైన పరిమారం అందించాలని కోరారు. మేడిగడ్డ ప్రాజెక్టు నిర్మాణానికి రూ.32వేల కోట్లు మంజూరయ్యాయని, అందులో పదిశాతం కమీషన్ కోసమే అధికార పార్టీ నాయకులు నిర్వాసితులకు అనుకూలంగా మాట్లాడడంలేదని ఆరోపించారు. టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి గుడాల శ్రీనివాస్ మాట్లాడుతూ, కన్నేపల్లి పంప్హౌస్ నిర్మాణంలో భూములు కోల్పోతున్న వారికి ఎకరాకు రూ.20లక్షల పరిహారం చెల్లించాలన్నారు. పూర్తి పరిహారం చెల్లించాకే సర్వే చేపట్టాలని డిమాండ్ చేశారు. కాటారం సీఐ సదన్కుమార్, ఎస్పై ఉదయ్కుమార్ సంఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులను శాంతింపజేశారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జవ్వాజీ తిరుపతి, సర్పంచులు కోట రాజబాబుగౌడ్, లోకుల పోసక్క, టీడీపీ నాయకులు పోటు సుశీల, నాగుల బాపురెడ్డి, చల్లా రమేష్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.