
వైజాగ్ వాసుల స్ఫూర్తికి మోదీ సెల్యూట్!
విశాఖపట్నం: హుద్ హుద్ తుఫాన్ బీభత్సం నుంచి విశాఖపట్నం వాసులు 14 నెలల్లోనే తేరుకున్నారని, విశాఖ వాసుల స్ఫూర్తి అభినందనీయమని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రశంసించారు. విశాఖపట్నంలో జరుగుతున్న అంతర్జాతీయ యుద్ధనౌక సమీక్షలో ఆదివారం పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా ప్రసంగించారు. విశాఖపట్నం అందమైన నగరమని, ఈ నగరం తనకెంతో ఇష్టమని పేర్కొన్నారు. హుద్ హుద్ విలయం సృష్టించిన సమయంలో తాను విశాఖపట్నానికి వచ్చిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. విశాఖ వాసులకు స్ఫూర్తికి సెల్యూట్ అని పేర్కొన్నారు. అదేవిధంగా విశాఖపట్నంలో జరుగుతున్న అంతర్జాతీయ యుద్ధనౌకల సమీక్ష చరిత్రాత్మకమని, ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన నౌకాదళానికి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమానికి మద్దతుగా నిలిచిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ధన్యవాదాలు తెలిపారు. ఇంకా ఆయన తన ప్రసంగంలో ఏమన్నారంటే..
- ఫ్లీట్ రివ్యూ (యుద్ధనౌకల సమీక్ష)ను అద్భుతంగా నిర్వహించిన నౌక దళానికి అభినందనలు
- ఈ అద్భుత కార్యక్రమానికి ప్రపంచ నలుమూలల నుంచి ప్రతినిధులు వచ్చారు
- తీరప్రాంత దేశాలతో ఆర్థిక, వాణిజ్య సంబంధాల బలోపేతానికి మారిటైమ్ ఉపయోగపడుతుంది
- సముద్రాల ద్వారానే 90శాతం వాణిజ్యం కొనసాగుతోంది
- సముద్వాల ద్వారా అంతర్జాతీయంగా 20 ట్రిలియన్ డాలర్ల విలువైన వాణిజ్యం జరుగుతోంది
- సముద్ర మార్గ వాణిజ్యానికి సునామీ, తుఫాన్ వంటి ప్రకృతి వైపరీత్యాలు సవాలు విసురుతున్నాయి
- అన్ని దేశాల నౌకాదళాలు భద్రతపై సమిష్టిగా దృష్టి సారించాలి
- గ్లోబల్ ఎనర్జీ సెక్యూరిటీ కోసం మేం బిలియన్ డాలర్లు ఖర్చు చేశాం
- ఈ ఏడాది ఏప్రిల్లో గ్లోబల్ మారిటైమ్ సమ్మిట్ నిర్వహిస్తాం
- తీరప్రాంత రాష్ట్రాలన్నీ యువతకు శిక్షణ ఇవ్వాలి
- తీరప్రాంత భద్రత ఆర్థికాభివృద్ధికి ఎంతో కీలకం
- భారత్ సముద్రతీర విధానాన్ని మారిషస్లో ఇటీవల ప్రకటించాం
- భారత్కు 7,500 చదరపు కిలోమీటర్ల తీరప్రాంతముంది
- సార్క్ దేశాలతో మన సంబంధాలు బాగున్నాయి
- సింధు నాగరికత నాటి నుంచి ప్రపంచదేశాలతో భారత్కు సత్సంబంధాలు ఉన్నాయి.