ఆర్టీవో కార్యాలయాల్లో స్వైపింగ్ మిషన్లు
నగరంపాలెం: జిల్లాలోని అన్ని రవాణాశాఖ కార్యాలయాల్లో మంగళవారం నుంచి నగదు రహిత లావాదేవీల కోసం స్వైపింగ్(పోస్) మిషన్లు ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా ఉప రవాణాశాఖ కమిషనర్ జీసీ రాజరత్నం తెలిపారు. చిలకలూరిపేట, తెనాలి, బాపట్ల, మంగళగిరి, పిడుగురాళ్ల, మాచర్ల మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ కార్యాలయాలకు సోమవారం పోస్ యంత్రాలు అందించినట్లు తెలిపారు. నవంబరు 23 నుంచి గుంటూరు ఉప రవాణ కమిషనర్ కార్యాలయం, నరసరావుపేట ఆర్టీవో కార్యాలయం, దాచేపల్లి, మాచర్ల చెక్పోస్టుల్లో పోస్ యంత్రాల ద్వారా నగదు రహిత సేవలందిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు వివిధ పనులకుగాను, పోస్ యంత్రాల ద్వారా రూ.3,04,540 వాహనదారులు చెల్లింపులు చేసినట్లు పేర్కొన్నారు. రవాణాశాఖ కార్యాలయానికి వచ్చే వాహనదారులు క్రెడిట్, డెబిట్ కార్డులను తెచ్చుకుని పోస్ యంత్రాలను ఉపయోగించుకుని నగదు రహిత సేవలు పొందాలని డీటీసీ రాజరత్నం కోరారు.