కాంగ్రెస్ విందు రాజకీయం కాస్తా సీనియర్ల మధ్య మాటలయుద్ధానికి దారితీసింది.
♦ వికారాబాద్ కాంగ్రెస్లో సీనియర్ల మధ్య మాటామాటా
♦ పార్టీలో ఉంటారా? పోతారా? చెప్పాలని నిలదీత
♦ జీవితాంతం కాంగ్రెస్లోనే ఉంటానని ప్రసాద్ స్పష్టీకరణ
♦ కొందరి నమ్మకద్రోహం వల్లే ఓడిపోయానని ఆవేదన
వికారాబాద్ కాంగ్రెస్లో సీనియర్ల మధ్య మాటామాటా పార్టీలో ఉంటారా? పోతారా? చెప్పాలని నిలదీత జీవితాంతం కాంగ్రెస్లోనే ఉంటానని ప్రసాద్ స్పష్టీకరణ కొందరి నమ్మకద్రోహం వల్లే ఓడిపోయానని ఆవేదన
వికారాబాద్: కాంగ్రెస్ విందు రాజకీయం కాస్తా సీనియర్ల మధ్య మాటలయుద్ధానికి దారితీసింది. తాజా రాజకీయ సమీకరణల నేపథ్యంలో మాజీ కౌన్సిలర్ రత్నారెడ్డి తన ఫామ్హౌస్లో వికారాబాద్ కాంగ్రెస్ ముఖ్యనేతలకు విందు ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి హాజరైన నాయకులు.. కాంగ్రెస్లో చోటుచేసుకుంటున్న పరిణామాలపై చర్చిం చారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చినప్పటికీ పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారడం.. పలువురు సీనియర్లు పార్టీని గులాబీ గూటికి చేరుతుండడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమావేశానికి మాజీ మంత్రి ప్రసాద్కుమార్ కూడా హాజరైన నేపథ్యంలో జరిగిన సంభాషణ వాడీవేడి చర్చకు దారితీసింది.
ఈ క్రమంలోనే ప్రసాద్కుమార్ గతంలో టీఆర్ఎస్లో చేరాలని నిర్ణయించుకొని వెనక్కి తిరిగి వచ్చిన అంశాన్ని గుర్తుచేసిన మర్పల్లి మండలం రావులపల్లికి చెందిన మోహన్రెడ్డి.. ‘అసలు మీరు పార్టీలో ఉంటున్నారా? వెళ్లిపోతున్నారా? ఈ విషయాన్ని స్పష్టం చేయండి’ అని ప్రశ్నించడంతో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. దీనికి దీటుగా స్పందించిన ప్రసాద్.. ‘నేను పార్టీ మారడంలేదు. కష్టకాలంలో పార్టీకి వెన్నంటి నిలిచా. కొందరి నమ్మకద్రోహం వల్ల ఓడిపోయా’ అని అన్నారు. ఒకరిద్దరు మరో నేతను పార్టీలోకి తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారు. నన్ను కాదని పార్టీలోకి ఎవరూ రాలేరని స్పష్టం చేశారు.
డబుల్ గేమ్ ఆడకుండా పార్టీకోసం శ్రమిస్తే.. వచ్చే ఎన్నికల్లో మనదే విజయమని స్పష్టం చేశారు. అనుకోని పరిస్థితుల్లో తానేమైనా పొరపాట్లు చేస్తే పట్టించుకోవద్దని, సీనియర్లు మనసులో పెట్టుకోకుండా పార్టీ పటిష్టత కోసం తనతో కలిసిరావాలని విజ్ఞప్తి చేశారు. ఇదిలా ఉండగా, తాజాగా వివేక్ సోదరులు కాంగ్రెస్ పార్టీని వీడి తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరుతున్న నేపథ్యంలో విందు భేటీ జరిగిందనే వార్తలపై ‘సాక్షి’ ప్రసాద్కుమార్ను సంప్రదించగా.. గులాబీ గూటికి చేరాలనే ఆలోచన తనకులేదని, జీవితాంతం కాంగ్రెస్లోనే కొనసాగుతానని ఆయన స్పష్టం చేశారు.