- పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్న చిరువ్యాపారి
టిఫిన్ చేస్తే.. మెుక్క ఫ్రీ
Published Tue, Aug 2 2016 12:18 AM | Last Updated on Tue, Sep 18 2018 6:30 PM
వర్ధన్నపేట టౌన్ : ఆయన ఓ టిఫిన్ సెంటర్ నడుపుకునే చిరు వ్యాపారి. అయితే ఆయన అందరిలా కేవలం టిఫిన్ పెట్టి డబ్బులు మాత్రమే తీసుకోడు. ఒక మెుక్క ఇచ్చి వాగ్దానం కూడా తీసుకుంటాడు. ఎందుకు.. ఏమిటి అంటే పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వం, అధికారులు మాత్రమే కృషి చేస్తే సరిపోదు అందరం శ్రమించాలి అంటూ మెుక్కలను ఉచితంగా అందజేస్తున్నాడు.
వివరాలు.. మండల కేంద్రానికి చెందిన పులుమాటి శంకర్, హైమావతి దంపతులు కొత్త బస్టాండ్ సమీపంలో ప్రధాన రహదారిపై ఓ చిన్న టిఫిన్ సెంటర్ను నిర్వహిస్తున్నారు. విభిన్న వంటకాలను రుచికరంగా చేయగలిగే ఆయనకు చెట్ల పెంపకం అంటే కూడా ఎంతో ఇష్టం. ఆ ఇష్టంతోనే తన ఆర్థిక స్థోమత అంతంత మాత్రమే అయినా ఇంటి ఆవరణలో మొక్కలను పెంచి తన టిఫిన్ సెంటర్కు వచ్చే వినియోగదారులకు వాటిని అందజేస్తూ నాటి పరిరక్షించేలా వాగ్దానం తీసుకుంటున్నాడు. విశేషమేమిటంటే తను పెంచిన మొక్కలు సమయానికి సరిపడా లేకుంటే కూరగాయ విత్తనాలను సైతం ఇస్తూ వినియోగదారులను పర్యావరణం పట్ల చైతన్యవంతులను చేస్తున్నాడు. ఉన్నంతలో ఊరందరికీ ఉపయోగపడుతున్న ఈ వన ప్రేమికుడిని ప్రతీ ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకుంటే కాలుష్యం అనే మాటే ఉండదేమో.
Advertisement
Advertisement