
చిత్తూరు కోర్టులో పేలుడు వెనుక ఉగ్రవాస్తం!
-ఉగ్రవాద నీడలపై పోలీసుల చూపు
- వికారుద్దీన్ ఎన్కౌంటర్తో సంబంధం
- ఏడాది క్రితం ఎన్కౌంటర్.. అదే తేదీన కోర్టులో పేలుడు
- తమిళనాడు జైళ్లకు పలు లేఖలు
- ప్రధాన నిందితుడు ‘సిద్దికి’పై అనుమానాలు
- రంగంలోకి కేంద్ర దర్యాప్తు సంస్థలు
చిత్తూరు (అర్బన్): చిత్తూరు కోర్టులో జరిగిన బాంబు పేలుడు ఘటనలో లాగే కొద్ది కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ పేలుడుకు ఉగ్రవాద సంస్థలతో సంబంధం ఉందని ప్రాథమికంగా నిర్దారించుకున్న పోలీసులకు మరిన్ని ఆధారాలు లభించాయి. 2015 ఏప్రిల్ 7న తెలంగాణ రాష్ట్రంలో జరిగిన వికారుద్దీన్ గ్యాంగ్ ఎన్కౌంటర్ను నిరసిస్తూ చిత్తూరు కోర్టులో పేలుడు సృష్టించినట్లు నిర్దారణకు వచ్చారు. ఏడాది తరువాత 2016 ఏప్రిల్ 7న చిత్తూరు కోర్టులో బాంబు పేలడమే ఇందుకు నిదర్శనం. ఇది తమ పనేననంటూ ‘బేస్ మూవ్మెంట్’ పేరిట చిత్తూరులోని వాణిజ్య పన్నులశాఖ డిప్యూటీ కమిషనరుకు లేఖ రావడం, దీనిపై దర్యాప్తు చేసిన పోలీసులు పుత్తూరులో ఆల్-ఉమా తీవ్రవాదులను పట్టుకున్నారు. ఈ పేలుడు వారి పనే అయి ఉంటుందని అనుమానిస్తున్న సంగతి తెలిసిందే. ఈ దాడికి ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న సిద్దికి అనే వ్యక్తి కోసం పోలీసులు గాలింపులు చేపట్టారు.
ఎవరీ సిద్దికి..
ముస్లింల అణిచివేతను నిరసిస్తూ 20 ఏళ్ల క్రితం తమిళనాడుకు చెందిన సిద్దికి అనే వ్యక్తి ఆల్-ఉమా అనే సంస్థను ఏర్పాటు చేసినట్లు పోలీసుల రికార్డుల్లో ఉంది. అప్పట్లో తమిళనాడు పోలీసులు ఇతన్ని అరెస్టు చేసినా తప్పించుకున్నాడు. దాని తరువాత 1998లో ఎల్కే అద్వానీ లక్ష్యంగా కోయంబత్తూరులో పేలుడు జరగడం, 58 మంది మృతి చెందడంతో సిద్దికి పేరు మళ్లీ తెరపైకి వచ్చింది. అనంతరం ఇతను కనుమగైపోయాడు. ఎక్కడున్నాడు ? ఏమయ్యాడనే వివరాలు లేవు. కానీ పోలీసు రికార్డుల్లో మాత్రం సిద్దికి పరారీలో ఉన్నట్లు నమోదయ్యింది. 2013 అక్టోబర్లో పుత్తూరులో జరిగిన ఆపరేషన్లో ఆల్-ఉమాకు సంబంధించిన బిలాల్ మాలిక్, పన్నా ఇస్మాయిల్, ఫక్రుద్దీన్లను అరెస్టు చేశారు. తమిళనాడులో జరిగిన బీజేపీ, శివసేన కార్యకర్తల హత్య కేసుల్లో సైతం వీళ్లు నిందితులు. చెన్నై నుంచి వీళ్లను చిత్తూరు జిల్లాలోని కోర్టుల్లో వాయిదాలకు హాజరు పరుస్తున్నారు. ఈ నేపథ్యంలో చిత్తూరులో జరిగిన పేలుళ్లు ఆల్-ఉమా, బేస్ మూవ్మెంట్ సంస్థల పనేనని పోలీసులు గుర్తించారు. ఈ వ్యవహారంలో సిద్దికి హస్తం ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు.
జైళ్లకు లేఖలు..
కోయంబత్తూరు పేలుళ్లు, బీజేపీ నేతల హత్యల్లో నిందితులుగా ఉన్న వీరు ప్రస్తుతం తమిళనాడులోకి పలు జైళ్లల్లో ఉన్నారు. వీళ్లకు మద్దతుగా గత ఆర్నెళ్లుగా ఆయా జైళ్లశాఖలకు ఇంగ్లీషులో టైప్ చేసిన లేఖలు పోస్టుల ద్వారా వస్తున్నాయి. ముస్లింలపై నిర్బంధం, అణిచివేతకు ప్రతీకారం తప్పదని ఆ లేఖల సారాంశం. చిత్తూరు కోర్టులో బాంబు పెట్టింది కూడా తామేనంటూ, మరికొన్ని దాడులు చేస్తామంటూ వాణిజ్య పన్నులశాఖకు లేఖ వచ్చింది. ఈ నేపథ్యంలో తమిళనాడు జైళ్లకు వచ్చిన లేఖలను పరిశీలించడానికి కేంద్ర దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగుతున్నాయి. ఇప్పటికే కేంద్ర దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ), ఏటీఎఫ్ తదితర సంస్థలు రాష్ట్ర హోంశాఖ నుంచి చిత్తూరు ఘటన వివరాలు సేకరిస్తున్నాయని తెలిసింది.