నిండు గర్భిణి ఆత్మహత్య
తెనాలి రూరల్ : స్వల్ప విషయంపై గర్భిణి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గుంటూరు జిల్లా తెనాలిలోని వైకుంఠపురం వెనుక ఉన్న పోతురాజు కాలనీలో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. కాలనీకి చెందిన బత్తుల సుబ్రహ్మణ్యంకు సమీప బంధువు చాముండేశ్వరి (19)తో ఏడాది కిందట వివాహమైంది. ప్రస్తుతం ఆమె ఏడు నెలల గర్భిణి. మందులు సరిగా వేసుకోకపోవడంతో భర్త భార్యను మందలించి వెళ్లాడు. దీంతో మనస్థాపానికి గురైన ఆమె ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఘటనాస్థలాన్ని వన్ టౌన్ సీఐ బి. శ్రీనివాసరావు, ఎస్ఐ కె. వెంకటేశ్వరరావు పరిశీలించారు. మృతురాలి కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.