గుళ్లదూర్తిలో సైకో వీరంగం
– పైర్లు, కుళాయిలు, మోటార్లు ధ్వంసం
– చెట్టుకు కట్టేసి పోలీసులకు సమాచారమిచ్చిన గ్రామస్తులు
కోవెలకుంట్ల: మండలంలోని గుళ్లదూర్తిలో గురువారం ఓ సైకో వీరంగం సృష్టించాడు. అవుకు మండలం వేములపాడు గ్రామానికి చెందిన పుల్లయ్య, పుల్లమ్మ పదేళ్ల క్రితం గ్రామంలో స్థిరపడి రైతుల వద్ద వ్యవసాయ పనులు చేస్తూ జీవనం సాగించేవారు. వీరి కుమారుడు రమేష్ టిప్పర్ డ్రైవర్గా పనిచేసేవాడు. నాలుగేళ్ల క్రితం నుంచి ఈ యువకుడికి మానసిక స్థితి సరిగా లేక గ్రామంలో తిరుగుతుండేవాడు. ఈ క్రమంలో పుల్లయ్య కుటుంబం గ్రామాన్ని వదిలి వెళ్లిపోయారు. ఉన్నట్లుండి రమేష్ గ్రామంలో ప్రత్యక్షమయ్యాడు. మినరల్ వాటర్ప్లాంట్ పైపులు, కుళాయిలు, వ్యవసాయ మోట్లార్లు, ట్రాక్టర్ పరికరాలు పగులగొట్టడంతోపాటు రైతులు సాగుచేసిన మిరప, పత్తి, తదితర పైర్లను నాశనం చేశాడు. సైకో తిరుగుతున్నాడన్న విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఓ పొలంలో పత్తిమొక్కలు పీకేస్తుండగా చుట్టుముట్టి పట్టుకున్నారు. వారి నుంచి విడిపించుకునేందుకు విశ్వప్రయత్నం చేయగా గ్రామస్తులు ముందు జాగ్రత్తతో తాడుతో రెండు చేతుల బంధించి బస్టాఫ్ సమీపంలో చెట్టుకు కట్టేశారు. గ్రామంలో రమేష్ సృష్టించిన బీభత్సాన్ని పోలీసులకు తెలియజేశారు.