అనంతపురం అగ్రికల్చర్ : జిల్లాలో ఈనెల 28 నుంచి వచ్చే నెల 2వ తేదీ వరకు మోస్తరు వర్షాలు కురిసే సూచనలు ఉన్నట్లు రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్తలు డాక్టర్ బి.రవీంద్రనాథరెడ్డి, డాక్టర్ బి.సహదేవరెడ్డి, సేద్యపు విభాగపు శాస్త్రవేత్త వై.పవన్కుమార్రెడ్డి తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటనలో వివరాలు వెల్లడించారు. హైదరాబాద్ వాతావరణ కేంద్రం నుంచి అందిన సమాచారం మేరకు ఈ నాలుగు రోజుల్లో ఆకాశం మేఘావృతమై 8 నుంచి 28 మిల్లీ మీటర్లు (మి.మీ) మేర వర్షపాతం నమోదు కావచ్చన్నారు. గరిష్ట ఉష్ణోగ్రత 35 నుంచి 36 డిగ్రీలు, కనిష్టం 25 నుంచి 26 డిగ్రీలు నమోదవుతుందన్నారు. గాలిలో తేమశాతం ఉదయం 74 నుంచి 78, మధ్యాహ్నం 40 నుంచి 49 శాతం ఉండొచ్చన్నారు. గంటకు 13 నుంచి 15 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు.