ప్రాణాలకు రక్షణ కల్పించరూ..
Published Mon, Dec 12 2016 9:18 PM | Last Updated on Fri, Aug 17 2018 2:24 PM
గుంటూరు ఈస్ట్ : జిల్లా పోలీసు కార్యాలయంలోని రూరల్ కార్యాలయంలో అడిషనల్ ఎస్పీ వైటీ నాయుడు సోమవారం గ్రీవెన్స్ నిర్వహించారు. మొత్తం 18 ఫిర్యాదులు స్వీకరించారు.
ప్రాణాలకు రక్షణ కల్పించాలి
ఏఈఎల్సీ మాచర్ల ప్రాంత బిషప్గా 12 సంలుగా పనిచేస్తున్న తనకు ఏఈఎల్సీ కార్యవర్గ సభ్యుడైన ప్రొఫెసర్ లాం ప్రకాష్ నుంచి ప్రాణ హాని ఉందని, రక్షణ కల్పించాలని బిషప్ రెవరెండ్ వై.సువర్ణరావు రూరల్ అడిషనల్ ఎస్పీ వైటీ నాయుడుకు వినతి పత్రం ఇచ్చారు.
అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ వెస్ట్ గుంటూరు సినడు పరిధిలో నరసరావుపేట, తుర్లపాడు, వినుకొండ ప్రాంతాలు ఉన్నాయన్నారు. పల్నాడు ప్రాంతాన్ని ప్రత్యేక సినడుగా ఏర్పాటు చేయాలని ఆ ప్రాంత క్రీస్తు విశ్వాసులు అనేక సంవత్సరాలుగా కోరుతున్నారని చెప్పారు. అందుకు ఏఈఎల్సీ అధ్యక్షుడు పరదేశీబాబు అంగీకరించినట్లు తెలిపారు. ఈ నెల ఆరో తేదీ కౌన్సిల్ సమావేశంలో తీర్మానం చేయించేందుకు పల్నాడు ప్రాంతానికి చెందిన వందలాది మంది విశ్వాసులతో బ్రాడీపేటలోని ఏఈఎల్సీ కార్యాలయానికి వెళ్లి వినతి పత్రం ఇచ్చామన్నారు. అయితే ప్రొఫెసర్ లాం ప్రకాష్ తమకు వ్యతిరేకంగా కొంతమందిని పురికొల్పి అదే రోజు సాయంత్రం ఏఈఎల్సీ కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొల్పారని ఆరోపించారు. కొద్ది రోజులుగా కొందరు ఫోన్లో తనను బెదిరిస్తున్నారని, తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని అడిషనల్ ఎస్పీని కోరినట్లు వివరించారు. పల్నాడు ప్రాంతానికి చెందిన 83 ప్యారిష్ల ప్రతినిధులు అడిషనల్ ఎస్పీని కలిసిన వారిలో ఉన్నారు.
Advertisement
Advertisement