కైలాస వాహనంపై శ్రీశైలేశుడు
– కూష్మాండదుర్గగా భ్రామరి
శ్రీశైలం: జ్యోతిర్లింగ శైవక్షేత్రమైన శ్రీశైల మహాక్షేత్రంలో శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి శ్రీశైల మల్లికార్జునుడు దేవేరీ భ్రామరితో కలిసి కైలాస వాహనంపై భక్తులను ఆశీర్వదించారు. శ్రీశైల భ్రమరాంబాదేవి కూష్మాండదుర్గ రూపంలో దర్శనమిచ్చారు. వేద మంత్రోచ్చారణ.. మంగళవాయిద్యాల నడుమ అర్చకులు, వేదపండితులు వాహన, అలంకార ప్రత్యేక పూజలను చేశారు. అనంతరం కైలాస వాహనంపై అధిష్టింపజేసి స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను.. అమ్మవారి అలంకారరూపాన్ని ఆలయ ప్రాంగణం నుంచి మాడ వీధుల గుండా రథశాల వద్దకు చేర్చారు. అక్కడ గ్రామోత్సవ పూజలను నిర్వహించిన అనంతరం అంకాలమ్మ ఆలయం, నందిమండపం, బయలువీరభద్రస్వామి ఆలయం వరకు ఉత్సవం కొనసాగి రాత్రి 9.30గంటలకు తిరిగి ఆలయం చేరుకుంది.