విజయవాడ : హాస్టల్లో విద్యార్థిని వాచ్మన్ చితకబాదాడు. దాంతో తీవ్ర గాయాలతో కుప్పకూలిపోయాడు. అనంతరం వాచ్మన్ అక్కడి నుంచి పరారైయ్యాడు. దాంతో తోటి విద్యార్థులు... బాధితుడిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లిలోని ఎస్సీ సంక్షేమ హాస్టల్లో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. విద్యార్థుల కథనం ప్రకారం... మంగళవారం 8-9 గంటల మధ్య హాస్టల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
ఆ సమయంలో కొందరు విద్యార్థులు బిగ్గరగా కేకలు వేశారు. 7వ తరగతి చదువుతున్న రాము గట్టిగా అరిచాడని వాచ్మన్ రవికుమార్ భావించాడు. ఆ క్రమంలో కర్రతో రామును తీవ్రంగా కొట్టాడు. దాంతో అతడికి తీవ్రంగా గాయపడ్డాడు. అనంతరం భయంతో రవికుమార్ అక్కడి నుంచి పరారైయ్యాడు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఎంఈవో, ఎంపీడీవో హాస్టల్కి వెళ్లి విచారించారు. అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థి రామును పరామర్శించారు. ఈ ఘటనకు బాధ్యుడైన వాచ్మన్ రవికుమార్పై కఠిన చర్యలు తీసుకుంటామని వారు విద్యార్థులకు హామీ ఇచ్చారు.