
ముగ్గురు చైన్స్నాచర్ల అరెస్ట్
దొంగలను పట్టించిన సీసీ కెమెరాలు, ఫేస్బుక్
ధర్మవరం అర్బన్ : ధర్మవరం పట్టణంలోని కదిరిగేటు సమీపంలోని శివానగర్లో జూన్ 28న మహిళ మెడలో బంగారు గొలుసు లాక్కెళ్లిన చైన్ స్నాచర్లను ధర్మవరం పోలీసులు అరెస్టు చేశారు. పట్టణ పోలీస్స్టేషన్లో సీఐ హరినాథ్ మంగళవారం మీడియాకు వివరాలు వెల్లడించారు. పట్టణానికి చెందిన షబరీ, ముద్దిరెడ్డిపల్లికి చెందిన నరేష్, నరసింహులు ఒంటరిగా ఉన్న మహిళల మెడలో బంగారు గొలుసులను లాక్కెళ్లేవారు. పట్టణంలో దొంగతనం చేసిన వారి వీడియోలు అక్కడేఉన్న సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.
దొంగల ఫోటోలను కొందరు యువకులు ఫేస్బుక్, వాట్సాప్లలో పోస్ట్ చేస్తూ ఆచూకీ తెలపాలని కోరారు. ఆ దొంగలు ముద్దిరెడ్డిపల్లిలో మగ్గం నేస్తూ జీవిస్తున్నారని కొందరు పోలీసులకు సమాచారం అందించారు. మంగళవారం పట్టణంలోని జీవనజ్యోతి పాఠశాల సమీపంలో బజాజ్ పల్సర్ ద్విచక్రవాహనంలో తిరుగుతున్న నరేష్, నరసింహులు, షబరీలను అరెస్టు చేశామని సీఐ తెలిపారు. వారి వద్ద నుంచి 13 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. చెడు వ్యసనాలకు అలవాటు పడ్డ యువకులు చైన్ స్నాచర్లుగా మారారని, వారిపై గతంలో నాలుగు కేసులున్నాయని తెలిపారు. చైన్ స్నాచర్ల అరెస్టులో పట్టణ ఎస్ఐలు సురేష్, జయానాయక్, పోలీసులు పాల్గొన్నారు.