
ఒట్టి ఫోజులేనా?
హిందూపురం పట్టణంలోని కూరగాయల మార్కెట్ కూల్చివేసిన మూడేళ్ల తర్వాత పాలకులు భూమిపూజకు సిద్ధమయ్యారు.
- మూడేళ్ల తర్వాత నేడు మార్కెట్కు భూమిపూజ
- హాజరు కానున్న ఎమ్మెల్యే బాలకృష్ణ
- టెండర్ కాలేదు.. నిధులు రాలేదు
హిందూపురం అర్బన్: హిందూపురం పట్టణంలోని కూరగాయల మార్కెట్ కూల్చివేసిన మూడేళ్ల తర్వాత పాలకులు భూమిపూజకు సిద్ధమయ్యారు. ఈమేరకు ఎమ్మెల్యే బాలకృష్ణ సోమవారం హిందూపురం రానున్నారు. వాస్తవ పద్ధతిలో ఏదైనా నిర్మాణ ప్రాజెక్టుకు ప్రతిపాదనలు మంజూరైన తర్వాత ప్రభుత్వం నిధులు విడుదల చేయాలి. అనంతరం నిధులు సమకూర్చుకుని, టెండర్ల ప్రక్రియ పూర్తి చేసుకుని కాంట్రాక్టు ఖరారైన తర్వాత నిర్మాణానికి భూమి పూజలు చేస్తారు. అయితే బాలకృష్ణకు ఇవేవీ సంబంధం లేదు. దినం బాగుంటే చాలు సినిమాల్లో కెమెరా ముందు యాక్షన్కు దిగే బాలయ్య భూమిపూజ అనగానే ఫొటోలకు ఫోజులిచ్చేందుకు సిద్ధమయ్యారు.
ప్రకటనలన్నీ గాలికే?
పట్టణంలోని పాత మార్కెట్ స్థలమైన 2.24 ఎకరాల్లో రూ.100 కోట్లతో హైటెక్ రీతిలో త్రీఫ్లోర్ కాంòప్టెక్ నిర్మించి రెండు సెల్లార్స్ హోల్సేల్ వ్యాపారాలు, గ్రౌండ్ఫ్లోర్ కూరగాయల విక్రయాలు, రిటైల్స్ వ్యాపారాలు, కోల్డ్ స్టోరేజ్తో పాటు కమర్షియల్ కాంప్లెక్స్, ఆడిటోరియం, ఏసీ గోదాములు, మూడోఫ్లోర్లో మల్టీఫ్లెక్స్ థియేటర్లు రెండు నిర్మించి జిల్లాలోనే ఎక్కడ లేని విధంగా అదరహో.. అనే రీతిలో నిర్మిస్తామని గొప్పలు చెప్పారు. అయితే ఆ ప్రకటనలన్నీ గాలికి ఎగిరిపోయాయి.
విశాలమైన రోడ్లు లేవని రాష్ట్ర టౌన్ ప్లానింగ్, డీఎంఏ అధికారులు అనుమతులు నిరాకరించారు. తర్వాత రూ.55 కోట్లతో రెండస్తుల భవన సదుపాయం నిర్మించాలని చేసిన ప్రతిపాదనలు కూడా కార్యరూపం దాల్చలేదు. చివరకు రూ.33 కోట్లతో అది కూడా గుడ్విల్ రూపంలో వ్యాపారులు నిధులు సమకూర్చుకుని, మున్సిపాల్టీ భాగస్వామ్యంతో రెండంతస్తుల భవనంలో 225 గదులతో మార్కెట్ నిర్మాణం ఖరారైంది.
నిర్మాణం చేయాలి ఇలా..
మార్కెట్ నిర్మాణానికి ప్రభుత్వం ఆమోదం ప్రకారం రూ.10 కోట్లు ప్రభుత్వం గ్రాంటు రూపంలో ఇవ్వగా రూ.10 కోట్లు వ్యాపారుల నుంచి గుడ్విల్ రూపంలో సమకూర్చుకోవాల్సి ఉంటుంది. దీనికి తోడు మున్సిపాల్టీ రూ.3 కోట్లు తనవంతు భాగం కలిపి మొత్తం రూ.33 కోట్లతో మార్కెట్గదుల నిర్మాణం చేయాల్సి చేపట్టాల్సి ఉంటుంది. అయితే ప్రభుత్వం నిధులు విడుదల చేస్తూ ఉత్తర్వులు ఇవ్వగానే మార్కెట్ కట్టేస్తున్నామనే రీతిలో పాలకులు భూమిపూజకు సిద్ధమైపోయారు. అయితే ఈç నిర్మాణానికి ఇంకా టెండరు ఖరారు కాలేదు. గుడ్విల్ ఎంత మొత్తంలో వసూలు చేస్తారు. ఎన్నేళ్లు లీజుకు ఇస్తారు అనేది తేల్చలేదు. మున్సిపాల్టీ తన ఖజానా నుంచి రూ.3 కోట్లు కేటాయించాలి. ఇవన్నీ పూర్తయిన తర్వాత ఏ నిర్మాణమైనా ప్రారంభానికి పూజలు చేయడం పరిపాటి. కానీ అధికార పార్టీ నాయకులు మసిపూసి మారేడుకాయ చూపినట్లు చేస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి.
రోడ్ల్లపై పడేశారు : షానవాజ్, మార్కెట్ అధ్యక్షుడు
వ్యాపారాలు బాగా జరుగుతున్న సమయంలో ఉన్నట్టుండి మార్కెట్ కూల్చి రోడ్లపై పడేశారు. రైతుబజారు ప్రాంతంలో ఉండాలని చెప్పారు. అక్కడ కనీస సదుపాయాలు కూడా లేవు. రైతులు తీసుకువచ్చిన సరుకులకు భద్రతలేదు. ఎండ వానకు ఇబ్బందులు పడుతున్నాం. ప్రభుత్వం మార్కెట్ కట్టించి ప్రస్తుతం ఉన్న రేట్లతో బాడుగలు కేటాయిస్తే చెల్లించగలం. మాకు న్యాయం చేయాలని ఇప్పటికే కోర్టును కూడా ఆశ్రయించాం.
ఆరు నెలల అడ్వాన్సు మున్సిపాల్టీలో ఉంది : శ్రీనివాసులు, మార్కెట్ ఉపాధ్యక్షుడు.
పాతమార్కెట్లో ఉన్నప్పుడు ఆరునెలల అడ్వాన్సులు ఇచ్చి ఉన్నాం. వాటిని జమ వేసుకుని ఇప్పుడున్న రేట్లకు అనుగుణంగా గదుల బాడుగలు నిర్ణయించాలి. మార్కెట్ వ్యాపారుల పరిస్థితులను అడిగిన నాయకులు లేరు. ఎమ్మెల్యేను కలిసి మా బాధలు చెప్పడానికి అవకాశం ఇవ్వలేదు. అప్పుల్లో కూరుకుపోయి చాలామంది వ్యాపారులు వలసలు వెళ్లారు. గుడ్విల్ లేకుండా ప్రభుత్వమే గదులు నిర్మించి వ్యాపారులకు జీవనం కల్పించాలని కోరుతున్నాం.