
మాస్లీవ్పై ట్రాన్స్కో ఏఈలు
ఆదోని రూరల్ : ఆదోని డివిజన్ పరిధిలోని 17మండలాల ట్రాన్స్కో ఏఈలు, ఏఏఈలు 18మంది శుక్రవారం మాస్ లీవ్ ప్రకటించారు. డీఈ అంజన్ కుమార్ డివిజన్ పరిధిలోని ఏడీఈలు, ఏఈలు, ఏఏఈలకు సమావేశం నిర్వహించేందుకు పిలిపించారు. తమకు పనిభారం పెరిగిందని, అందువల్ల తమ సమస్యను విన్నవిస్తామని అందుకు సమయం కేటాయించాలని డీఈని కోరగా అందుకు ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన చేతనైతే పనిచేయండి..లేకపోతే సెలవులో వెళ్లండని ఏఈలపై విరుచుకుపడుతూ చులకనగా వ్యవహరించడంతో డివిజన్లోని 18మంది ఏఈలు మనస్థాపం చెందినట్లు తెలిపారు. దీంతో మూకుమ్మడిగా మాస్ లీవ్ తీసుకొని వెళ్తున్నామని ఏఈలు, ఏఏఈలు సమావేశాన్ని బాయ్కట్ చేశారు. డీఈ కార్యాలయ ఆవరణలో సమావేశమై ఆందోళన చేపట్టారు. అనంతరం వారు సమావేశం నిర్వహించి మాస్ లీవ్లో వెళ్లాలని తీర్మానించారు. ప్రభుత్వం ఇచ్చిన సిమ్లతో పాటు డీఈకి వినతి పత్రాన్ని సమర్పించారు. ఆయా మండలాల్లో సిబ్బంది ఏఎల్ఎంలు, జేఎల్ఎంలు, లైన్మెన్లు లేకపోవడం వల్ల చిన్న పని నుంచి పెద్ద పని వరకు ఏఈలే చూడాల్సి వస్తోందని, దీంతో పనిభారం పెరిగి డ్యూటీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నామని తెలిపారు. డీఈకి విన్నవించుకున్నామంటే ముందుగానే డీఈ కించపరుస్తూ మాట్లాడారని ఏఈలు ఆరోపించారు. కార్యక్రమంలో ఏఈలు మద్దిలేటి, నాగభూషణం, నాగరాజు, చెన్నయ్య, సంతోష్, సురేష్ రెడ్డి, నర్సన్న, మోహన్ రావు, రామాంజినేయులు, నారాయణ స్వామినాయక్, రేఖ, శేఖర్ బాబు, మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు.