రాజధానిలో రవాణా ప్రణాళిక కోసం అధ్యయనం
సాక్షి, అమరావతి :
రాజధాని ప్రాంతంలో ప్రస్తుతం ఉన్న రోడ్ నెట్వర్క్, బీఆర్టీఎస్, మెట్రో, రైల్ నెట్వర్క్, వాటర్ వేస్కు ఉన్న అవకాశాలను అధ్యయనం చేయాలని జపాన్కు చెందిన జైకా ప్రతినిధి బృందానికి సీఆర్డీఏ అధికారులు సూచించారు. అమరావతి రాజధాని నగరం, రీజియన్లో రవాణా వ్యవస్థపై అధ్యయనం చేసి ప్రణాళికS రూపకల్పనకు జైకా బృందం మూడు రోజుల పాటు పర్యటనకు వచ్చింది. ఆ సందర్బంగా గురువారం సీఆర్డీఏ కార్యాలయంలో జైకా ప్రతినిధులతో అధికారులు సమావేశమై రవాణా ప్రణాళికలపై అవగాహన కల్పించారు. రాజధాని నగరం పరిధిలోని, రీజియన్ పరిధిలో సమగ్ర రవాణా ప్రణాళిక రూపొందించాల్సిన అవశ్యకతను జైకా ప్రతినిధులకు సీఆర్డీఏ అధికారులు సూచించారు. కేపిటల్ సిటీ, రీజియన్కు, ప్రతి అర్బన్ సెంటర్కు ప్రత్యేక ప్రణాళిక ఉండాలని చెప్పారు. రీజియన్తో ఎలా లింక్ చేయాలి, టీఓడీ కారిడార్ ఎలా ఉండాలి, ఇంటిగ్రేషన్ విత్ ట్రాన్స్పోర్టు ప్లాన్, దశలవారీగా ప్రణాళిక, ఇనిస్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్, మేజరల్ రోడ్ నెట్వర్క్ ప్లాన్, ఇంటిలిజెంట్ ట్రాన్స్పోర్ట్ ప్లాన్, ట్రాఫిక్ మేనేజ్మెంట్ ప్లాన్, రోడ్ సేఫ్టీ ప్లాన్ తదితర అంశాలపై సమగ్ర అధ్యయనం చేసి నివేధిక రూపొందించాలని సూచించారు. రవాణా ప్రణాళిక, ఫిజిబిలిటీ రిపోర్ట్, ఫైనాన్సియల్ రిపోర్ట్ అందజేయాలని సూచించారు. 2020 నుంచి ప్రతి ఐదేళ్లకు ప్రత్యేక ప్రణాళిక, 2050 నాటికి సమగ్ర ప్రణాళిక తయారు చేయాలని కోరారు. ఈ సమావేశంలో జైకా ట్రాన్స్పోర్ట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సీనియర్ అడ్వయిజర్ కవహర షుంటారో, యాక్టింగ్ డైరెక్టర్ సనద అకికో, ప్రతినిధి హిరోషి యొషిదా, ఏపీసీఆర్డీఏ అదనపు కమిషనర్ వి.రామమనోహరరరావు, ఎడిసి చీఫ్ ఇంజినీర్ రామమూర్తి, ఎకనామిక్ డెవలప్మెంట్ డైరెక్టర్ వై.నాగిరెడ్డి, ట్రాఫిక్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ ప్రిన్సిపల్ ప్లానర్ అరవింద్, ప్రిన్సిపల్ ప్లానర్ వివిఎల్ఎన్ శర్మ, ఆర్వీ కన్సల్టెంట్స్ ప్రతినిధులు పాల్గొన్నారు.