ఉత్తమ ఫలితాలే లక్ష్యంగా పనిచేద్దాం
- పది పరీక్షలపై డీఈఓ తాహెరా సుల్తానా
- రోజుకు రెండు హైస్కూల్స్ విజిట్
- కోడ్ వల్ల బయోమెట్రిక్ తాత్కాలిక వాయిదా
కర్నూలు సిటీ: వచ్చే నెల17వ తేదీ నుంచి జరుగునున్న పదవ తరగతి పబ్లిక్ పరీక్షల్లో ఉత్తమ ఫలితాల సాధనే లక్ష్యంగా పని చేయాలని డీఈఓ తాహెరా సూల్తానా ఎంఈఓలను ఆదేశించారు. స్థానిక ఎస్ఎస్ఏ సమావేశ మందిరంలో గురువారం డిజాస్టర్ మేనేజ్మెంట్, పదవ తరగతి పరీక్షలు, బయోమెట్రిక్ తదితర అంశాలపై డీఈఓ మండల విద్యాధికారులతో సమీక్షించారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో తీసుకోవాల్సిన చర్యలపై ప్రతి ఒక్కరూ అవగహన కలిగి ఉండాలన్నారు. ఈ ఏడాది నుంచి పదవ తరగతి పరీక్షలు నూతన విధానంలో జరుగనున్నాయని, ఈ మేరకు విద్యార్థులను పూర్తిస్థాయిలో సన్నద్ధం చేసే బాధ్యత ప్రధానోపాధ్యాయులపై ఉందన్నారు. గతేడాది కంటే మెరుగైన ఫలితాలు సాధించేందుకు కృషి చేయాలన్నారు.
మండల విద్యాధికారులు ప్రతి రోజు కనీసం రెండు హైస్కూళ్లను విజిట్ చేసి, అక్కడి విద్యార్థులతో మాట్లాడి సమస్యలుంటే పరిష్కరించాలన్నారు. ఇటీవల కమిషనర్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో బయెమెట్రిక్ హాజరు గురించి వివరించారని, అయితే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు తెలిపరు. కోడ్ ముగిసిన తరువాత దీన్ని అమలు చేయాల్సి ఉంటుందని, ఇందుకు అవసరమైన ఏర్పాట్లు సిద్ధం చేసుకోవాలని ఆమె ఎంఈఓలకు సూచించారు.