రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం
Published Sun, Jul 24 2016 11:42 PM | Last Updated on Mon, Sep 4 2017 6:04 AM
మందమర్రి : పట్టణంలోని రాష్ట్రీయ రహదారిపై పాత సోనియా దాభా వద్ద ఆదివారం రాత్రి గుర్తు తెలియని వాహనం ఢీకొని బైక్పై వెళ్తున్న బోయిన తిరుపతి(21) దుర్మరణం చెందాడు. అదనపు ఎస్సై తుకారాం కథనం ప్రకారం... మంచిర్యాల నుంచి బెల్లంపల్లి వైపు మోటార్సైకిల్పై వస్తున్న తిరుపతిని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. వెంటనే బైక్ పైనుంచి కింద పడ్డ తిరుపతి తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందాడు. తిరుపతిని తాండూరు మండలం కిష్టంపేట పంచాయతీ పరిధి తంగళ్లపల్లికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. అతడి తండ్రి సదయ్య సింగరేణి శ్రీరాంపూర్ డివిజన్లోని ఆర్కే–5 గనిలో విధులు నిర్వహిస్తున్నాడు. సదయ్యకు ముగ్గురు కూతుళ్లు కాగా, తిరుపతి ఒక్కడే కుమారుడు. మంచిర్యాలలోని స్నేహితుల వద్దకు వెళ్తున్నానని ఇంట్లో చెప్పినట్లు తెలిసింది. తిరుపతి మంచిర్యాలలోని ఎంవీఎన్ కాలేజీలో ఇటీవలే డిగ్రీ పూర్తి చేశాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తుకారాం తెలిపారు. కాగా, హెల్మెట్ లేకపోవడంతో తలభాగంలో అయిన గాయానికి తిరుపతి మృతిచెందడం గమనార్హం.
Advertisement
Advertisement