death
-
ఒక్క రక్త పరీక్ష : రానున్న పదేళ్లలో మన మరణం గుట్టు! కొత్త పరిశోధన
ఎన్నాళ్లు బతుకుతాం? ఎపుడు చచ్చిపోతాం? ఎలాంటి జబ్బులొస్తాయి? సాధారణంగా ఇలాంటి సందేహాలు ఎపుడో ఒకపుడు అందరికీ వస్తాయి. అందులోనూ ఏ కాస్త అనారోగ్యం బారిన పడినా ఇలాంటి అనుమానాలు పట్టిపీడిస్తాయి. ఇలాంటి ప్రశ్నలు ఇప్పటిదాకా మిలియన్ డాలర్ల ప్రశ్నలు. మరిపుడు ఒక సాధారణ రక్త పరీక్ష ద్వారా, ఒక వ్యక్తికి కేన్సర్ లేదా మతిమరపు వంటి ప్రధాన వ్యాధుల ప్రమాదాన్ని అంచనా వేయవచ్చని, ఏ అవయవాలు ఎలాంటి స్థితిలో ఉన్నాయో, గుర్తించవచ్చని ఒక కొత్త అధ్యయనం కనుగొంది. రానున్న పదేళ్లలో ఎలాంటి జబ్బులు రాబోతున్నాయో కూడా తెలుస్తుందట. ఏంటి నమ్మలేకపోతున్నారా? అయితే మీరీ కథనం సాంతం చదవాల్సిందే.యూనివర్సిటీ కాలేజ్ లండన్ (UCL) పరిశోధకులు, ప్రారంభంలో ఆరోగ్యంగా ఉన్న వ్యక్తుల్లో రానున్న 20 ఏళ్లలో అవయవాలు దెబ్బతినే తీరును, 30 వేర్వేరు వ్యాధుల ప్రమాదాన్ని గుర్తించ గలిగారు కేవలం ఒక రక్తపరీక్ష ద్వారా. ఈ పరీక్ష ద్వారా నిర్దిష్ట అవయవాలకు సంబంధించిన భవిష్యత్తు సమస్యలను మాత్రమే కాకుండా, అవి శరీరంలోని మరొక భాగంలో సమస్యలను ఎలా సృష్టిస్తాయో కూడా తెలుసుకోవచ్చుస్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ, హెల్సింకి యూనివర్సిటీ నిపుణులతో,యూసీఎల్ పరిశోధనా బృందం, బ్రిటిష్ వైట్హాల్ II అధ్యయనంలో పాల్గొన్న 45 నుంచి 69 సంవత్సరాల వయస్సు గల 6,235 మంది వ్యక్తుల రక్త ప్లాస్మా నమూనాలను సేకరించి వాటిపై పరిశోధన జరిపారు. తొమ్మిది అవయవాల (గుండె, రక్త నాళాలు, కాలేయం, రోగనిరోధక వ్యవస్థ, క్లోమం, మూత్రపిండాలు, ఊపిరితిత్తులు, పేగులు మెదడు) మొత్తం శరీరానికి సంబంధించిన జీవసంబంధమైన వయస్సును నిర్ణయించడానికి పరిశోధకులు పనిచేశారు.తాజా పరిశోధనల ప్రకారం ఒక్క రక్త పరీక్షతో మనిషిలోని అవయవాలు ఎలా పనిచేస్తున్నాయి; ఎంత వేగంగా వాటి వయసు పెరుగుతోంది అనే విషయాలను అంచనా వేయడం ద్వారా రానున్న పదేళ్ల కాలంలో ఆ వ్యక్తి ఎలాంటి రోగాలకు గురి అవుతాడు, ఏ అవయవం దెబ్బతినడం కారణంగా మరణిస్తాడనే విషయాన్ని తెలుసుకోవచ్చు. చదవండి: ఓవర్ ఆయిల్ వద్దన్నమోదీ : ఎవరెంత వాడాలో తెలుసా?Shivaratri 2025 : శివరాత్రికి, చిలగడ దుంపకి ఉన్న సంబంధం ఏమిటి?ఉదాహరణకు గుండె వయసు వేగంగా పెరిగినవారిలో గుండె జబ్బుల ప్రమాదం, ఊపిరితిత్తుల వృద్ధాప్యం ఉన్న వ్యక్తులు తరువాతి కాలంలో శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు, దీర్ఘకాలిక అబ్స్ట్రక్టివ్ పల్మనరీ వ్యాధి (COPD) , ఊపిరితిత్తుల కేన్సర్తో బాధపడే అవకాశం ఉందని అంచనా వేసింది. అంతేకాదు ఒక మనిషికి ఈ ప్రత్యేకమైన బ్లడ్ టెస్ట్ ద్వారా, అతని శరీరంలోని గుండె, కాలేయం, ఊపిరితిత్తులు, రక్తనాళాలు, మెదడు, మూత్ర పిండాలు లాంటి ముఖ్యమైన భాగాల ఏజింగ్ ప్రాసెస్ను అంచనా వేయవచ్చు. మధ్య వయసులో మెదడు వయసు పెరుగుతున్నవారితో పోలిస్తే రోగనిరోధక వ్యవస్థ సాధారణం కంటే వేగంగా వృద్ధాప్యం చెందుతున్న వారిలో చిత్తవైకల్యం (dementia) ప్రమాదం ఎక్కువ అని కనుగొన్నారు. తీవ్రమైన ఇన్ఫెక్షన్లకు గురయ్యే వ్యక్తుల్లో ఈవ ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు చెప్పారు.అలాగే మూత్రపిండాల ఆరోగ్యం ఇతర అవయవాలతో ముడిపడి ఉందని కూడా గుర్తించారు. మూత్రపిండాల వృద్ధాప్యం వేగవంతం అయిన వ్యక్తులు తరువాతి కాలంలో వాస్కులర్ వ్యాధి, టైప్ 2 డయాబెటిస్ ,కాలేయ వ్యాధుల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంది. దాదాపు అన్ని అవయవాల జీవసంబంధమైన వృద్ధాప్యం మూత్రపిండాల వ్యాధి ప్రమాదాన్ని పెంచుతుందని అంచనా వేసింది. వ్యక్తికి వయసుకు తగ్గట్టే అవయవాల వయసు ఉండాలి. కానీ జీవనశైలి, తినే ఆహారం, కాలుష్యం, శారీర శ్రమలేని కారణంగా అవయవాల వయస్సు మనిషి వయసుకు మించి శరీరంలోని అవయవాల వయస్సు త్వరగా పెరుగుతోందని తేల్చారు. యూసీఎల్ పరిశోధన ఫలితాలు లాన్సెట్ డిజిటల్ హెల్త్ జర్నల్లో ప్రచురించారు. న్యూరోడీజెనరేటివ్ వ్యాధుల అభివృద్ధిలో శోథ ప్రక్రియలు కీలక పాత్ర పోషిస్తాయని ఈ పరిశోధన మరింత సూచిస్తుందని యూసీఎల్ ఫ్యాకల్టీ ఆఫ్ బ్రెయిన్ సైన్సెస్ ప్రొఫెసర్ మికా కివిమాకి చెప్పారు. “మన అవయవాలు ఒక సమగ్ర వ్యవస్థగా పనిచేస్తాయి, కానీ అవి వేర్వేరు రేట్ల వద్ద వృద్ధాప్యం చెందుతాయి.ముఖ్యంగా అవయవాలలో వృద్ధాప్యం అనేక వృద్ధాప్య సంబంధిత వ్యాధులకు దోహదం చేస్తుంది, కాబట్టి అన్ని అంశాలను జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. ఒక నిర్దిష్ట అవయవం ఊహించిన దానికంటే వేగంగా వృద్ధాప్యం చెందుతుందో లేదో సులభంగా రక్త పరీక్ష ద్వారా గుర్తించవచ్చని మేం కనుగొన్నాం. రాబోయే సంవత్సరాల్లో, “ఆరోగ్య సంరక్షణ యస్సు సంబంధిత వ్యాధుల నివారణ చాలా ముందుగానే ప్రారంభమవుతుందని నేను నమ్ముతున్నాను. ఇలాంటి రక్త పరీక్షలు అనేక వ్యాధులను నివారించడంలో కీలక పాత్ర పోషిస్తాయి.” అని ఆయన అన్నారు. -
పాకిస్తాన్లో ముష్కరుల అకృత్యం
ఇస్లామాబాద్: పాకిస్తాన్లోని బలూచిస్తాన్ ప్రావిన్స్లో దారుణం జరిగింది. గుర్తు తెలియని ముష్కరులు ఏడుగురు ప్రయాణికులను పొట్టనపెట్టుకున్నారు. బస్సు నుంచి ఏడుగురు ప్రయాణికులను కిందికి దించి తుపాకులతో కాల్చిచంపారు. బలూచిస్తాన్ ప్రావిన్స్ రాజధాని క్వెట్టా నుంచి పంజాబ్ ప్రావిన్స్కు బస్సు వెళ్తుండగా బుధవారం ఈ ఘోరం చోటుచేసుకుంది. బస్సు బుర్ఖాన్ ప్రాంతానికి రాగానే జాతీయ రహదారిపై సాయుధ ముష్కరులు బారీకేడ్లు అడ్డంగా పెట్టి నిలిపివేశారు. బస్సులోకి ప్రవేశించి, ప్రయాణికుల గుర్తింపు కార్డులు తనిఖీ చేశారు. ఏడుగురిని బలవంతంగా కిందికి దించారు. సమీపంలోని పర్వతంపైకి తీసుకెళ్లి తుపాకులతో కాల్చారు. దాంతో ఏడుగురు ప్రయాణికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. మృతదేహాలను రాక్నీ ఆసుపత్రికి తరలించారు. ముష్కరుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఈ అకృత్యానికి పాల్పడింది ఎవరన్నది ఇంకా తెలియరాలేదు. దాదాపు 12 మంది సాయుధాలు బస్సులోకి వచ్చారని, వారివద్ద ఆధునిక ఆయుధాలున్నాయని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. స్థానిక బలూచ్ ఉగ్రవాద గ్రూప్లు ఇటీవల ఒక్కసారిగా చురుగ్గా మారిపోయాయి. ప్రజలపై దాడులకు పాల్పడుతున్నాయి. తాజా దాడి సైతం ఆయా గ్రూప్ల పనే అయి ఉంటుందని అంచనా వేస్తున్నారు. అమాయలకు బలి తీసుకున్న రాక్షసులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని బలూచిస్తాన్ ముఖ్యమంత్రి సర్ఫరాజ్ బుగ్తీ తేల్చిచెప్పారు. బుర్ఖాన్లో జరిగిన హత్యాకాండను పాకిస్తాన్ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ, ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ ఖండించారు. -
రైల్వే స్టేషన్ తొక్కిసలాట: ఏడేళ్ల రియా ప్రాణాలు కోల్పోయిందిలా..
న్యూఢిల్లీ: ఆ కుటుంబంలోని వారంతా మహాకుంభ్లో స్నానం చేసేందుకు శనివారం న్యూఢిల్లీ రైల్వేస్టేషన్కు చేరుకున్నారు. వారిలో ఏడేళ్ల బాలిక రియా కూడా ఉంది. రైల్వే స్టేషన్లో జరిగిన తొక్కిసలాటలో ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. తన కుమార్తెల ఎలా ప్రాణాలు కోల్పోయిందనే విషయాన్ని రియా తండ్రి ఓపిల్ సింగ్ మీడియాకు చెబుతూ కంటతడి పెట్టుకున్నారు.ఆయన తెలిపిన వివరాల ప్రకారం ముందుగా వారంతా 14వ నంబరు ప్లాట్ఫారానికి చేరుకున్నారు. అయితే అక్కడి రద్దీని చూసి వారు తిరిగి ఇంటికి వెళ్లి పోదామని అనుకున్నారు. దీంతో అతని భార్య, కుమారుడు ప్లాట్ఫారం నుంచి తిరిగి మెట్లు మీదుగా పైకి చేరుకున్నారు. వారి వెనుక ఓపిల్ సింగ్, అతని కుమార్తె రియా ఉన్నారు. ఇంతలో ఐదారువేల మంది పైనుంచి ఒక్కసారిగా ఒకరిని తోసుకుంటూ మరొకరు కిందకు దిగసాగారు. ఇంతటి రద్దీలో వారంతా ఒకరిపై మరొకరు పడిపోయారు. దీంతో ఏం జరుగుతోందో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. ఇంతలో వారి కుమార్తె రియా కిందపడిపోయింది. ఆమె తలకు ఒక రాడ్డు బలంగా తగిలింది. వెంటనే రక్తం కారసాగింది. తొక్కిసలాట జరుగుతున్నా పోలీసులు అప్రమత్తం కాలేదు. నామమాత్రంగా విజిల్ వేసుకుంటూ వెళ్లిపోయారు.అంతటి రద్దీలో కుమార్తెను ఎత్తుకుని ఓపిల్ సింగ్తో అతని భార్య, కుమారుడు ఎలాగోలా కిందకు దిగి, రైల్వే స్టేషన్ బయటకు చేరుకున్నారు. ఇదే సమయంలో ఓపిల్ సింగ్ జేబులోని పర్సుతో పాటు మొబైల్ ఫోనును ఎవరో కొట్టేశారు. అక్కడ అంబులెన్స్ లేకపోవడంతో ఓపిల్సింగ్ తన కుమార్తె రియాను తీసుకుని, ఆటోలో కళావతి ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు ఆ చిన్నారి రియాను పరీక్షించి, ఆమె ప్రాణాలు కోల్పోయిందని తెలిపారు. తమ కుమార్తె చనిపోయాక ప్రభుత్వం ఇచ్చే రూ. 10 లక్షల పరిహారం ఎందుకుని ఓపిల్ సింగ్ మీడియా ముందు కంటతడిపెట్టుకున్నారు. ఇది కూడా చదవండి: ఢిల్లీలో భూకంపం.. ఇళ్ల నుంచి జనం పరుగులు -
ప్రముఖ నిర్మాత–నటి–గాయని కృష్ణవేణి కన్నుమూత
తెలుగు సినిమా స్వర్ణయుగం నుండి ప్రపంచ స్థాయికి ఎదగడం వరకూ చూసిన నాటి తరం ప్రముఖ నిర్మాత–నటి–గాయని చిత్తజల్లు కృష్ణవేణి(Krishnaveni) (101) ఇక లేరు. పదిహేను రోజులుగా ఆమె హైదరాబాద్లోని సిటీన్యూరో ఆస్పత్రిలో చికిత్స పొందారు. ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకు తుది శ్వాస విడిచారు.ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమగోదావరి జిల్లా పంగిడి గ్రామంలో 1924 డిసెంబరు 24న కృష్ణవేణి జన్మించారు. చిన్నతనంలోనే నాటకాల్లో ప్రహ్లాదుడు, ధ్రువుడు వంటి వేషాలు వేసి, బహుమతులు అందుకున్నారామె. కాగా ప్రముఖ దర్శక–నిర్మాత సి. పుల్లయ్య బాలనటీనటులతో ‘సతీ అనసూయ’ చిత్రానికి శ్రీకారం చుట్టిన సమయంలో రాజమండ్రిలో ‘తులాభారం’ నాటకం చూశారు. ఆ నాటకంలో కృష్ణవేణి నటన నచ్చి, ‘సతీ అనసూయ’కు అవకాశం ఇచ్చారు.అలా ‘సతీ అనసూయ’ (1936) సినిమాతో కృష్ణవేణి తొలిసారి వెండితెరపై కనిపించారు. బాల నటిగా కొన్ని చిత్రాల్లో నటించారు. సినిమాల్లో నటించడానికి మద్రాసు వెళ్లారామె. కృష్ణవేణి హీరోయిన్గా నటించిన తొలి చిత్రం ‘కచదేవయాని’ (1938) విజయం సాధించడంతో ఆమెకు మంచి గుర్తింపు, పేరు దక్కాయి. కాగా ప్రముఖ నిర్మాత మీర్జాపురం రాజు (మేకా రంగయ్య) బేనర్లో ఆమె ‘జీవన జ్యోతి’ సినిమాలో మెయిన్ హీరోయిన్గా చేశారు.నటిగా కృష్ణవేణిని బాగా ఎస్టాబ్లిష్ చేసిన సినిమా అది. ఆ చిత్రం తర్వాత మీర్జాపురం రాజుతో ఆమె పెళ్లయింది. వారిది ప్రేమ వివాహం. ఆ తర్వాత జయా పిక్చర్స్పై తన భర్త తీసిన సినిమాలకు నిర్వహణ బాధ్యతలు చూసుకునేవారు. అలా నిర్మాణరంగంవైపు వచ్చారామె. ఇక వివాహం తర్వాత జయా పిక్చర్స్ని శోభనాచల స్టూడియోస్గా మార్చారు. ఈ బేనర్ నిర్మించిన ‘దక్షయజ్ఞం (1941), గొల్లభామ (1947), లక్ష్మమ్మ (1950)’ వంటి చిత్రాల్లో మాత్రమే నటించారు కృష్ణవేణి.ఒకవైపు నటిస్తూనే ‘బాల మిత్రుల కథ, కీలు గుర్రం’ వంటి సినిమాల్లో పాటలు కూడా పాడారు. కాగా ‘తిరుగుబాటు’ సినిమాలో కృష్ణవేణి చేసిన వ్యాంప్ క్యారెక్టర్ అప్పట్లో చర్చనీయాంశమైంది. ఇక 1942లో మీర్జాపురం రాజా–కృష్ణవేణి దంపతులకు కుమార్తె రాజ్యలక్ష్మి అనురాధ జన్మించారు. ఒకవైపు అనురాధ ఆలనా పాలనా, మరోవైపు సినిమాల నిర్మాణ పనులు చూసుకోవాల్సి రావడం... వంటి కారణాల చేత కృష్ణవేణి నటించడం తగ్గించారు.ఆమె హీరోయిన్గా నటించిన ఆఖరి చిత్రం ‘సాహసం’ (1952). అప్పట్లో అత్యధిక పారితోషికం అందుకున్న హీరోయిన్గా కృష్ణవేణికి పేరుంది. ‘ధర్మాంగద’ చిత్రానికి గాను ఆమె రూ. 45 వేలు పారితోషికం అందుకున్నారట. ఎన్టీఆర్ని పరిచయం చేసిన నిర్మాతగా... ‘మన దేశం’ చిత్రం ద్వారా ఎన్టీఆర్ని పరిచయం చేసిన నిర్మాతగా కృష్ణవేణి బాగా పాపులర్ అయ్యారు. పూర్తి స్థాయి నిర్మాతగా ఎల్వీ ప్రసాద్ దర్శకత్వంలో కృష్ణవేణి నిర్మించిన ‘మన దేశం’ ఘనవిజయం సాధించింది. ఈ సినిమాలో ఆమె హీరోయిన్గానూ చేశారు. ఇదే చిత్రంతో గాయనిగా పి. లీలను పరిచయం చేశారు. అలాగే ‘వరూధిని’ చిత్రం తర్వాత, ఊరికి వెళ్లిపోయిన ఎస్వీ రంగారావును పిలిపించి, ‘మన దేశం’కు అవకాశం కల్పించారామె. అలాగే ఘంటసాల వెంకటేశ్వరరావుకు పూర్తి స్థాయి సంగీతదర్శకునిగా తొలి అవకాశం కల్పించింది కూడా కృష్ణవేణియే కావడం మరో విశేషం. ‘దాంపత్యం’ (1957) నిర్మాతగా కృష్ణవేణికి ఆఖరి చిత్రం. నటిగా, నిర్మాతగా, గాయనిగా తనకంటూ ప్రత్యేక ప్రతిభను చాటుకున్నారామె. కృష్ణవేణి 2004లో ప్రతిష్ఠాత్మక రఘుపతి వెంకయ్య అవార్డు అందుకున్నారు. 2022లో ‘సాక్షి ఎక్స్లెన్స్’ అవార్డుల్లో భాగంగా ‘జీవిత సాఫల్య పురస్కారం’ అందుకున్నారు. ఇక ఆమె కుమార్తె అనురాధ తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో 17 సినిమాలు నిర్మించారు. కన్నడంలో ‘భక్త కుంభార’ (1974) నిర్మాతగా ఆమె తొలి చిత్రం.అదే సినిమాని తెలుగులో నాగేశ్వరరావు హీరోగా ‘చక్రధారి’గా రీమేక్ చేశారు. ‘రాముడే రావణుడైతే, శ్రీవారి ముచ్చట్లు, రాముడు కాదు కృష్ణుడు, అనుబంధం, ఆలయ దీపం, ఇల్లాలే దేవత’ వంటి తెలుగు చిత్రాలతో పాటు తమిళ , కన్నడ భాషల్లోనూ సినిమాలు నిర్మించారామె. తెలుగులో తీసిన ‘మా పెళ్లికి రండి’ నిర్మాతగా ఆమె చివరి చిత్రం. ప్రపంచంలో అత్యధిక చిత్రాలు నిర్మించిన మహిళా నిర్మాతగా లిమ్కా బుక్ రికార్డ్ని సొంతం చేసుకున్నారామె.కృష్ణవేణి మృతి పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు. ఫిల్మ్నగర్లోని ఆమె భౌతికకాయాన్ని సందర్శించిన సినీ ప్రముఖులు సినీ పరిశ్రమకు ఆమె అందించిన సేవలను కొనియాడారు. ఆదివారం సాయంత్రం మహాప్రస్థానంలో ఆమె అంత్యక్రియలు ముగిశాయి. కృష్ణవేణికి కూతురు అను రాధా దేవి, మనుమలు, మనవరాళ్లు ఉన్నారు. ఆమె చిన్న మనమరాలు అర్చన అంత్యక్రియలకు సంబంధించిన కార్యక్రమాలను నిర్వహించారు.కృష్ణవేణి కాశీ మజిలీ కథలతో పాటు చాలా పుస్తకాలు చదివేవారు. వాటిలో సినిమా తీయడానికి పనికొస్తాయనిపించే పాయింట్స్ తీసుకుని, కథ తయారు చేయించేవారు. స్టోరీ సిట్టింగ్స్, మ్యూజిక్ సిట్టింగ్స్ నుంచి షూటింగ్ షెడ్యూల్స్ ΄్లాన్ చేసి, షూటింగ్ స్పాట్లో ఉండటంవరకూ అన్నీ దగ్గరుండి చూసుకునేవారు కృష్ణవేణి.సినీ నిర్మాత, నటి, గాయని, రఘుపతి వెంకయ్య అవార్డుగ్రహీత కృష్ణవేణి మృతిపై మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. అనేక భాషల్లో నటించి, బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరొంది, నటిగా తనదైన ముద్ర వేసిన కృష్ణవేణి మృతి సినీ రంగానికి తీరని లోటు అని పేర్కొన్నారు. పలు గొప్ప చిత్రాలు తీసి, నిండు నూరేళ్లు సంపూర్ణంగా జీవించి, పరమపదించిన ఆమె పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడినిప్రార్థిస్తున్నానని అన్నారు. ఆమె కుటుంబ సభ్యులకు వైఎస్ జగన్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.‘‘అలనాటి నటీమణి, సినీ నిర్మాత కృష్ణవేణి మృతి నన్ను బాధించింది. పరిపూర్ణ జీవితం గడిపిన కృష్ణవేణిగారి ఆత్మకు శాంతి చేకూర్చాలని ఆ భగవంతుడినిప్రార్ధిస్తున్నాను’’ అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ‘‘మన దేశం’ చిత్రంతో ఎన్టీఆర్ను చిత్ర రంగానికి పరిచయం చేసి, కళారంగానికి వారు చేసిన సేవ మరువలేనిది. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను’’ అన్నారు. -
జమ్ములో పేలుడు..ఇద్దరు జవాన్ల దుర్మరణం
జమ్ము:జమ్ముకశ్మీర్లో మంగళవారం(ఫిబ్రవరి11) ఐఈడీ(మందుపాతర) పేలుడు సంభవించింది. ఈ పేలుడు ధాటికి ఇద్దరు సైనికులు మృతి చెందారు. మరో ముగ్గురు సైనికులకు తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. జమ్మూలోని అఖ్నూర్ సెక్టార్లోని అంతర్జాతీయ సరిహద్దు సమీపంలో పేలుడు జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు సైనికులకు తీవ్ర గాయాలైనట్లు అధికారులు తొలుత తెలిపారు. పేలుడు జరిగిన ప్రాంతంలో భద్రతాదళాల కూంబింగ్ జరుగుతోంది. -
వైరస్తో కుప్పకూలి.. రెండ్రోజుల్లో 4,500 కోళ్లు మృతి
రుద్రూర్/నిజామాబాద్: పౌల్ట్రీ ఫామ్లలో కోళ్లు కుప్పలుకుప్పలుగా మృతి చెందుతున్నాయి. దీంతో పౌల్ట్రీ నిర్వాహకులు ఆందోళన చెందుతున్నారు. పొతంగల్ మండలం చేతన్నగర్ శివారులోని కోళ్ల ఫామ్లో గత రెండు రోజులుగా కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. జల్లాపల్లికి చెందిన రవి చేతన్నగర్ శివారులో కోళ్ల ఫామ్ను లీజుకు తీసుకుని నడిపిస్తుండగా, సోమ, మంగళ వారాల్లో సుమారు 4,500 కోళ్లు మృతి చెందాయి. రూ.7లక్షల మేర నష్టం వాటిల్లిందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. బర్డ్ ఫ్లూతోనే కోళ్లు మృతి చెందుతున్నాయేమోనని అనుమానం వ్యక్తం చేశాడు. వేల్పూర్ మండలం లక్కోర గ్రామానికి చెందిన కొట్టాల గోవర్ధన్కు చెందిన పౌల్ట్రీఫామ్లో మంగళవారం 25 కోళ్లు మృతి చెందాయి. సమాచారం అందుకున్న అధికారులు పౌల్ట్రీఫామ్ను సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. కోళ్ల నుంచి రక్త నమూనాలను సేకరించి ల్యాబ్కు పంపించారు. -
రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మహాకుంభ్ యాత్రికులు మృతి
యూపీలోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న కుంభమేళాకు జనం పోటెత్తుతున్నారు. కుంభమేళా సందర్భంగా పలు ఆసక్తికర ఘటనలతో పాటు విషాదకర ఉదంతాలు కూడా చోటుచేసుకుంటున్నాయి. అటువంటి ఉదంతం బీహార్లోని ముజఫర్పూర్లోని మధుబని నాలుగు లేన్ల రోడ్డులో చోటుచేసుకుంది.బైక్ రైడర్లను కాపాడే ప్రయత్నంలో స్కార్పియో వాహనం(Scorpio vehicle) రోడ్డుపై బోల్తా పడింది. ఈ ఘటనలో స్కార్పియోలోని ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. రూరల్ ఎస్పీ విద్యా సాగర్ తన బృందంతోపాటు సంఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాలను పోస్ట్ మార్టం కోసం ఎస్కేఎంసీహెచ్కు తరలించారు. గాయపడిన వారిని ఆసుపత్రిలో చేర్చారు. ఈ ప్రమాదంలో స్కార్పియో వాహనం పూర్తిగా ధ్వంసమైంది.మీడియాకు అందిన వివరాల ప్రకారం నేపాల్లోని మొహతారికి చెందిన కొందరు ప్రయాగ్రాజ్(Prayagraj)లో జరుగుతున్న మహా కుంభ్లో స్నానం చేసి, స్కార్పియో వాహనంలో తిరిగి నేపాల్ వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటన గురించి స్థానికులు మాట్లాడుతూ ఈ ఘటనకు ముందు కొంతమంది యువకులు నాలుగు లేన్లలో బైక్లపై విన్యాసాలు చేస్తుండగా, ఒక స్కార్పియో వాహనం చాలా వేగంగా వారికి ఎదురుగా వచ్చిందన్నారు. ఆ వాహనం బైక్ నడుపుతున్నవారిని తప్పించే ప్రయత్నంలో డివైడర్ను ఢీకొని, ఆపై బోల్తా పడిందన్నారు. ఇది చూసిన ఆ యువకులు బైక్లతో సహా అక్కడి నుంచి పారిపోయారని తెలిపారు. స్కార్పియో వాహనం మూడు సార్లు బోల్తా పడటంతో దానిలో ఉన్న ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారని వివరించారు. కాగా మృతుల్లో ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.ఇది కూడా చదవండి: Mahakumbh-2025: తొక్కిసలాట బాధితులను పరామర్శించిన సీఎం యోగి -
ఐర్లాండ్లో రోడ్డు ప్రమాదం..ఇద్దరు తెలుగు విద్యార్థుల దుర్మరణం
డబ్లిన్:ఐర్లాండ్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్కు చెందిన ఇద్దరు యువకులు దుర్మరణం పాలయ్యారు. ఒకరు ఎన్టీఆర్ జిల్లాకు చెందిన చిట్టూరి భార్గవ్ (25) కాగా మరొకరిని పల్నాడు జిల్లాకు చెందిన చెరుకూరి సురేష్ (26)గా గుర్తించారు. యువకుల మృతితో రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట పట్టణానికి చెందిన భార్గవ్(25) ఉన్నత చదువుల కోసం ఐర్లాండ్ వెళ్ళాడు. భార్గవ్ శుక్రవారం(జనవరి31) రాత్రి స్నేహితులతో కలిసి బయటికి వెళ్లగా కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో భార్గవ్తో పాటు పల్నాడు జిల్లా రొంపిచర్లకు చెరుకూరి సురేశ్(26) కూడా ప్రాణాలు కోల్పోయాడు. చేతికి అందివచ్చిన కుమారులు చనిపోవడంతో వారి తల్లిదండ్రులు రోదిస్తున్నారు.ఇటీవలి కాలంలో అమెరికా సహా విదేశాల్లో చదువుకుంటున్న తెలుగు విద్యార్థుల మరణాలు ఎక్కువవడం కలవరం కలిగిస్తోంది. విదేశాల్లో చదువులు, ఉద్యోగాలకు పిల్లలను పంపాలంటే ఎప్పుడు ఏం వార్త వినాల్సి వస్తుందోనని తల్లిదండ్రులు భయాందోళనలకు గురయ్యే పరిస్థితి నెలకొంది. విదేశాల్లో రోడ్డు ప్రమాదాలతో పాటు దుండగుల కాల్పుల్లో విద్యార్థులు చనిపోతున్న ఘటనలు తరచుగా జరుగుతుండడం వారి కుటుంబాల్లో విషాదం నింపుతోంది. -
మరొకరిని బలిగొన్న పూణె వైరస్
పూణే: మహారాష్ట్రలో జీబీఎస్ వైరస్ (గ్విలియన్-బారే సిండ్రోమ్) మరొకరి ప్రాణాన్ని బలిగొంది. రాష్ట్రంలో జీబీఎస్ వైరస్ కారణంగా రెండవ మరణం నమోదయ్యింది. పూణేకు చెందిన ఒక మహిళ జీబీఎస్ బారినపడి ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన మహారాష్ట్రలో జీబీఎస్ వైరస్ వ్యాప్తి చెందుతోందనడానికి ఉదాహరణగా నిలిచింది.గతంలో ఈ వైరస్ ఒకరి ప్రాణాన్ని బలిగొంది. పూణేలో ఇప్పటివరకు 127 జీబీఎస్ కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్ పూణేలోని ప్రజలను భయాందోళనలకు గురిచేస్తోంది. కేసులు కూడా మరింతగా పెరుగుతున్నాయి. రాష్ట్ర ఆరోగ్యశాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం అనుమానిత జీబీఎస్(Guillain-Barré syndrome) కేసుల సంఖ్య 127కి చేరింది. ఈ వైరస్తో బాధపడుతున్న 13 మంది వెంటిలేటర్పై చికిత్స పొందుతున్నారు. ఇదే వైరస్తో షోలాపూర్కు చెందిన 40 ఏళ్ల వ్యక్తి మృతి చెందాడు. పూణేలో అతనికి ఇన్ఫెక్షన్ సోకింది.షోలాపూర్ ప్రభుత్వ వైద్య కళాశాల డీన్ డాక్టర్ సంజీవ్ ఠాకూర్ తెలిపిన వివరాల ప్రకారం.. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, కాళ్ల నొప్పులు, విరేచనాలతో బాధపడుతున్న ఒక బాధితుడిని జనవరి 18న ఆసుపత్రిలో చేర్చించారు. అతను వెంటిలేటర్పై చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందాడు.జీబీఎస్ అనేది ఒక అరుదైన వ్యాధి. దీని బారినపడితే శరీర భాగాలు అకస్మాత్తుగా మొద్దుబారిపోతాయి. కండరాల బలహీనత ఏర్పడుతుంది. బ్యాక్టీరియల్, వైరల్ ఇన్ఫెక్షన్లు సాధారణంగా జీబీఎస్కి కారణమవుతాయని వైద్యులు తెలిపారు.ఇది కూడా చదవండి: ఆ రాష్ట్రంలోనూ ‘లివ్ ఇన్’కు రిజిస్ట్రేషన్ తప్పనిసరి -
కుంభమేళా నుంచి వస్తుండగా ప్రమాదం.. కుటుంబమంతా దుర్మరణం
ఫతేహాబాద్: యూపీలోని ఆగ్రా పరిధిలో గల ఫతేహాబాద్లోని లక్నో ఎక్స్ప్రెస్వేపై సోమవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోయారు.కుంభమేళాకు వెళ్లి, పుణ్యస్నానాలు ఆచరించి, తిరిగి వస్తున్న ఒక కుటుంబం రోడ్డు ప్రమాదం బారినపడింది. ఈ కుటుంబ యజమాని హైకోర్టు న్యాయవాది అని తెలుస్తోంది. తొలుత వీరు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టి, మరో లేన్లోకి వెళ్లింది. తరువాత ఎదురుగా వస్తున్న ట్రక్కును ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో కారులో ప్రయాణిస్తున్న కుటుంబ సభ్యులంతా అక్కడికక్కడే మృతిచెందారు.ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కారులో చిక్కుకున్న భార్యాభర్తలతో పాటు వారి కుమారుడు, కుమార్తె మృతదేహాలను పోలీసులు బయటకు తీశారు. వారిని గుర్తించిన అనంతరం మృతదేహాలను పోలీసులు పోస్ట్మార్టం కోసం తరలించారు.ఢిల్లీలోని ఉత్తమ్ నగర్ నివాసి ఓం ప్రకాష్ ఆర్య ఢిల్లీ హైకోర్టులో న్యాయవాదిగా పనిచేస్తుంటారు. తన హ్యుందాయ్ కారులో తన కుటుంబంతో కలిసి ప్రయాగ్రాజ్ కుంభ స్నానం చేసేందుకు వెళ్లారు. కార్యక్రమం పూర్తయ్యాక భార్య పూర్ణిమ సింగ్ (34), కుమార్తె అహానా (12), కుమారుడు వినాయక్ (4)లతో పాటు తిరిగి కారులో ఢిల్లీకి బయలుదేరారు. ఈ వారు ప్రయాణిస్తున్న కారు ఆగ్రా-లక్నో ఎక్స్ప్రెస్వేపై ముందుగా డివైడర్ను ఢీకొని ప్రమాదం బారినపడింది.ఈ ప్రమాదంలో ఓం ప్రకాష్తో పాటు అతని కుటుంబమంతా అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యింది. సమాచారం అందిన వెంటనే ఫతేహాబాద్ పోలీస్ స్టేషన్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఎస్ఎన్ హాస్పిటల్ అత్యవసర విభాగానికి తరలించారు. దెబ్బతిన్న వాహనాన్ని క్రేన్ సహాయంతో తొలగించారు. ఈ ప్రమాదం కారణంగా ఎక్స్ప్రెస్వేపై కొద్దిసేపు ట్రాఫిక్జామ్ ఏర్పడింది. ఇది కూడా చదవండి: Mahakumbh-2025: ఏడాదిన్నరగా పరారై.. పుణ్యస్నానం చేస్తూ పోలీసులకు చిక్కి.. -
పరవాడ ఫార్మాసిటీలో మరో ప్రమాదం.. కార్మికుడి దుర్మరణం
సాక్షి,అనకాపల్లిజిల్లా: పరవాడ ఫార్మాసిటీలో మరో ప్రమాదం జరిగింది. విష్ణు కెమికల్స్ ఫ్యాక్టరీలో శనివారం(జనవరి25) జరిగిన ప్రమాదంలో కాంట్రాక్టు కార్మికుడొకరు ప్రాణాలు కోల్పోయాడు. ఫ్యాక్టరీ కన్వేయర్ బెల్ట్లో పడి కార్మికుడు దుర్మరణం పాలయ్యాడు. మృతుడిని ఉత్తరప్రదేశ్కు చెందిన కార్మికుడిగా గుర్తించారు. ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఫార్మాసిటీలో ఇటీవలి కాలంలో వరుస ప్రమాదాలు జరుగుతున్నాయి. జనవరి 21వ తేదీన ఇక్కడ ఓ ప్రమాదం జరిగింది. మెట్రోకెన్ పరిశ్రమ స్టోరేజ్ ట్యాంక్లో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాదంలో ఎవరికీ ఏమీ కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.కాగా, గత ఏడాది డిసెంబర్లో ఫార్మాసిటిలో విజయశ్రీ ఆర్గానిక్స్ పరిశ్రమలో ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో విష రసాయనాలు మీద పడడంతో ఇద్దరు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. విజయశ్రీ ఆర్గానిక్స్ పరిశ్రమలో ప్రొడక్షన్ బ్లాక్–1లో ఏఎన్ఎఫ్–డి రియాక్టర్ మ్యాన్హోల్ ఓపెన్ చేసినప్పుడు మంటలు ఎగసిపడ్డాయి. ఆ సమయంలో విధి నిర్వహణలో ఉన్న ఏఎన్ఆర్గా పనిచేస్తున్న రజ్జూ, మరో ఉద్యోగి సీహెచ్ వెంకట సత్య సుబ్రహ్మణ్య స్వామి తీవ్రంగా గాయపడ్డారు. ఇదీ చదవండి: మంటల్లో దగ్ధమైన నివాసాలు.. పలువురికి గాయాలు -
టాప్ హెజ్బొల్లా కమాండర్ షేక్ ముహమ్మద్ అలీ హమాదీ హతం
బీరూట్ : ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ( FBI ) హిట్ లిస్ట్లో ఉన్న హెజ్బొల్లా సీనియర్ కమాండర్ (Hezbollah commander) షేక్ ముహమ్మద్ అలీ హమాదీ (Sheikh Muhammad Ali Hammadi) దారుణ హత్యకు గురయ్యాడు. లెబనాన్లోని గుర్తు తెలియని వ్యక్తులు ఆయన ఇంటి ముందు కాల్చి చంపారు. అయితే గత కొంత కాలంగా అలీ హమాదీ కుటుంబంలో కలహాలు కొనసాగుతున్నాయి. వాటి కారణంగానే ఆయనపై దాడి జరిగిందనే అనుమానాలు వెలుగులోకి వచ్చాయి. మంగళవారం రాత్రి గుర్తుతెలియని దుండగులు హమాదీపై ఆరుసార్లు కాల్పులు జరిపారని, కాల్పుల్లో అక్కడికక్కడే మరణించినట్లు స్థానిక మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. అయితే,ఆయన మరణం వెనుక రాజకీయ కోణం, లేదంటే ప్రత్యర్థులు ఉన్నారనే అంశంపై మీడియా కథనాలు ఖండించాయి. సంవత్సరాల తరబడి హమ్మదీని కుటుంబ కలహాలు వెంటాడుతున్నాయని, వాటి కారణంగా చంపినట్లు పేర్కొన్నాయి. -
ఊడిన కారు టైరు.. మంత్రాలయ విద్యార్థుల దుర్మరణం
బెంగళూరు, సాక్షి : కర్ణాటకలో బుధవారం(జనవరి22) తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు టైర్ ఊడిపడడంతో.. వాహనం బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ సహా నలుగురు మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మృతుల్లో ముగ్గురిని కర్నూలు జిల్లా మంత్రాలయ రాఘవేంద్రస్వామి మఠం వేద పాఠశాల విద్యార్థులుగా గుర్తించారు.హంపిలోని శ్రీ నరహరి తీర్థుల బృందావనంలో ఆరాధానోత్సవాల కోసం వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. నట్లు, బోల్టులు ఊడిపోవడంతో తుఫాన్ వాహనం బోల్తాపడినట్లు ప్రాథమికంగా తేలింది. ప్రమాద సమయంలో వాహనంలో మొత్తం 14 మంది విద్యార్థులున్నారు. పోలీసులు ప్రమాద స్థలాన్ని సందర్శించి కేసు నమోదు చేసుకున్నారు. -
టర్కీలో ఘోర అగ్ని ప్రమాదం.. 10 మంది మృతి
టర్కీలోని ఒక రిసార్ట్లో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. వాయువ్య టర్కీలోని ఒక స్కీ రిసార్ట్ హోటల్లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో 10 మంది మృతి చెందారు. 32 మంది గాయాలపాలయ్యారు. అతికష్టం మీద అగ్నిమాపక దళం మంటలను అదుపు చేసింది. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. బోలు ప్రావిన్స్లోని కర్తల్కాయ రిసార్ట్లోని ఒక రెస్టారెంట్లో రాత్రిపూట మంటలు చెలరేగాయని టర్కీ మంత్రి అలీ యెర్లికాయ తెలిపారు. భయంతో భవనం నుంచి దూకి, ఇద్దరు ప్రాణాలు కోల్పోయారని గవర్నర్ అబ్దుల్ అజీజ్ అయిదిన్ తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో ఆ హోటల్లో 234 మంది అతిథులు బస చేస్తున్నారని, ఈ అగ్ని ప్రమాదానికి గల కారణం ఇంకా తెలియరాలేదన్నారు. మంటలు చెలరేగినప్పుడు తాను నిద్రలో ఉన్నానని, అయితే ప్రమాదాన్ని గుర్తించి, భవనం నుండి తప్పించుకోగలిగానని హోటల్ సిబ్బంది నెక్మీ కెప్సెట్టుటన్ తెలిపారు. తాను బయటపడ్డాక 20 మంది అతిథులు హోటల్ నుంచి బయటకు వచ్చేందుకు సహాయం అందించానని తెలిపారు.హోటల్ బయట ఉన్న కలప కారణంగా మంటలు వేగంగా వ్యాపించాయని స్థానికులు చెబుతున్నారు. కర్తాల్కాయ అనేది ఇస్తాంబుల్కు తూర్పున 300 కిలోమీటర్లు (186 మైళ్ళు) దూరంలో ఉన్న కొరోగ్లు పర్వతాలలోని స్కీ రిసార్ట్. 30 అగ్నిమాపక యంత్రాలు, 28 అంబులెన్స్లతో సంఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.ఇది కూడా చదవండి: ట్రంప్ నిర్ణయాలు.. అంతర్జాతీయంగా అమెరికాకు దెబ్బ? -
అమెరికాలో కాల్పులు..హైదరాబాద్ యువకుడి దుర్మరణం
వాషింగ్టన్: అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. దుండగులు జరిపిన కాల్పుల్లో మరో తెలుగు యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. హైదరాబాద్ చైతన్యపురికి చెందిన కొయ్యడ రవితేజ కాల్పుల్లో దుర్మరణం పాలయ్యారు.రవితేజ మరణవార్త విని చైతన్యపురి ఆర్కేపురం డివిజన్లో నివసిస్తున్న అతడి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. రవితేజ 2022లో ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లారు. మాస్టర్ డిగ్రీ పూర్తి చేసి ప్రస్తుతం ఉద్యోగాణ్వేషణలో ఉన్నారు. ఘటన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇదీ చదవండి: ఒక్కసారి కనబడు బిడ్డా -
ఏనుగుల దాడిలో టీడీపీ యువనేత మృతి
తిరుపతి, సాక్షి: చంద్రగిరి మండలంలో ఘోరం చోటు చేసుకుంది. ఏనుగుల దాడిలో టీడీపీ యువనేత రాకేశ్ చౌదరి(33) మృతి చెందాడు. రాకేష్ చంద్రగిరి ఐటీడీపీ అధ్యక్షుడిగా, కందులవారిపల్లి ఉప సర్పంచ్గా ఉన్నాడు. తమ పార్టీ యువనేత హఠాన్మరణంపై తెలుగు దేశం పార్టీ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. తిరుపతి జిల్లాలోని చంద్రగిరి మండలం చిన్నరామాపురం, కొంగరవారిపల్లిలో శనివారం రాత్రి ఏనుగులు సంచరించాయి. మామిడిమాను గడ్డ గ్రామ పంటపొలాలపై ఏనుగుల గుంపు దాడి చేస్తుందన్న సమాచారంతో రాకేష్తో పాటు మరికొందరు అక్కడికి వెళ్లారు. అరుస్తూ వాటిని కొంతదూరం తరిమారు. ఈ క్రమంలో.. అవి తిరగబడడంతో పరుగులు తీశారు. ఓ ఏనుగు వాళ్లపై దాడికి దిగడంతో అంతా చెట్లెక్కి లైట్లు ఆఫ్ చేసుకున్నారు. అయితే.. రాకేష్ వాళ్లలో ముందు ఉండడం, తెల్ల చొక్కా ధరించి ఉండడంతో, పైగా అతని చేతిలో లైట్ ఆన్ చేసి ఉండడంతో ఏనుగు అతనిపై దాడికి దిగింది. తొండంతో ఎత్తి చెట్లకు కొట్టి.. కిందపడేసి తొక్కింది. దీంతో రాకేష్ అక్కడికక్కడే మృతి చెందాడు.రాకేష్కు భార్య, ఒక కూతురు ఉన్నారు. ఈయన సీఎం కుటుంబానికి సన్నిహితుడిగా తెలుస్తోంది. రాకేశ్ మృతి వార్త తెలుసుకొని ఎమ్మెల్యే పులివర్తి నాని ఘటనాస్థలికి చేరుకొని స్థానికులతో మాట్లాడారు. -
Jammu and Kashmir: వణికిస్తున్న అంతుచిక్కని వ్యాధి.. 15 మంది మృతి
జమ్ముకశ్మీర్ను అంతుచిక్కని వ్యాధి పట్టిపీడిస్తోంది. రాజౌరి జిల్లాలో వ్యాపించిన ఈ రహస్య వ్యాధి కారణంగా మరణించిన వారి సంఖ్య 15కుపెరిగింది. మీడియాకు అందిన వివరాల ప్రకారం తాజాగా జమ్మూలోని ఒక ఆసుపత్రిలో తొమ్మిదేళ్ల బాలిక అంతుచిక్కని రుగ్మతతో మరణించింది. దీంతో రాజౌరి జిల్లాలోని మారుమూల గ్రామమైన బాధల్లో గడచిన ఒకటిన్నర నెలల్లో మరణించిన వారి సంఖ్య 15కి పెరిగింది.గత ఏడాది డిసెంబర్ 7 నుండి..ఈ అంతుచిక్కని వ్యాధితో సంభవిస్తున్న మరణాలకు గల కారణాలను పరిశోధించడానికి పోలీసులు ఒక సిట్ను ఏర్పాటు చేశారు. అయితే బాధల్ గ్రామంలో మరణాలకు అంతుచిక్కని వ్యాధి కారణమనే వాదనను రాష్ట్ర ఆరోగ్య మంత్రి సకీనా మసూద్ ఖండించారు. కాగా జమ్మూలోని ఎస్ఎంజీఎస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జబీనా అనే బాలిక బుధవారం సాయంత్రం మృతిచెందిందని అధికారులు తెలిపారు. గడచిన నాలుగు రోజుల్లో ఆమె నలుగురు తోబుట్టువులు, తాత కూడా మృతిచెందాడని వారు పేర్కొన్నారు. గత ఏడాది డిసెంబర్ 7 నుండి కోట్రాంకా సబ్ డివిజన్లోని బాధల్ గ్రామంలోని మూడు కుటుంబాల్లో ఇటువంటి పరణాలు సంభవించాయని తెలుస్తోంది.ప్రయోగశాలలకు నమూనాలుతాజాగా ఆరోగ్య మంత్రి సకీనా మసూద్ మీడియాతో మాట్లాడుతూ గ్రామంలో ఐదుగురు మరణించారని తెలియగానే ఆరోగ్య శాఖ ఇంటింటికీ వెళ్లి 3,500 మంది నుంచి నమూనాలను తీసుకుని, వివిధ ప్రయోగశాలలకు పరీక్ష కోసం పంపిందన్నారు. ఇదే సమయంలో ఈ వ్యాధితో మరో ముగ్గురు వ్యక్తులు మరణించడంతో దేశంలోని ప్రధాన ఆరోగ్య సంస్థల నుండి సహాయం కోరామన్నారు. దీంతో పలు వైద్య బృందాలు బాధిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నాయన్నారు.11 మంది సభ్యులతో కూడిన సిట్ ఏర్పాటుమరోవైపు ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, బుధల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఆపరేషన్స్) వజాహత్ హుస్సేన్ అధ్యక్షతన 11 మంది సభ్యులతో కూడిన సిట్ను ఏర్పాటు చేసినట్లు రాజౌరి ఎస్ఎస్పీ గౌరవ్ సికార్వర్ తెలిపారు. ఏదైనా వ్యాధి కారణంగా మరణాలు సంభవించినట్లయితే, అది వెంటనే వ్యాపించి ఉండేదని, అది ఆ మూడు బాధిత కుటుంబాలకే పరిమితమై ఉండేదికాదన్నారు. పూణేలోని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్), ఢిల్లీలోని నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (ఎన్సీడీసీ), గ్వాలియర్లోని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ (డీఆర్డీఈ) మైక్రోబయాలజీ విభాగం బాధితుల నమూనాలను సేకరించి, పరీక్షలు నిర్వహిస్తున్నాయని తెలిపారు. ఇది కూడా చదవండి: Delhi Elections-2025: బడా పార్టీలకు ఛోటా దళాల షాక్? -
Tirupati Stampede: మా ఇంటి మహాలక్ష్మి వెళ్లిపోయింది..
వైకుంఠ ద్వారం నుంచి ఆ కలియుగ వేంకటేశ్వరస్వామివారిని దర్శించి పునీతులు కావాలని తరలివచ్చారు. కానీ అధికా రులు, సిబ్బంది నిర్లక్ష్యంతో జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు మృత్యు వాత పడ్డారు. వారి జ్ఞాపకాలు తలుచుకుని బంధువులు నేటికీ కన్నీటి పర్యంతమవుతున్నారు.తిరుపతి టాస్క్ఫోర్స్: వారిని కదిలిస్తే చాలు.. కన్నీళ్లే సమాధానం చెబుతున్నాయి. తోడుగా ఉన్నవారు దూరమవడంతో దిక్కుతోచని స్థితిలో కుమిలిపోతున్నారు. తల్లిలేని ఆడ బిడ్డల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఆ ఘటన నుంచి తేరుకోలేక పోతున్నామని, ఆ జ్ఞాపకాలు తలుచుకుని మంచానికే పరిమితమయ్యామని మృతుల కుటుంబీకులు ఆవేదన చెందుతున్నారు. వైకుంఠ ద్వార దర్శన టోకన్ల జారీ సందర్భంగా తిరుపతి బైరాగిపట్టెడ, శ్రీనివాసం కౌంటర్లలో ఈనెల 8వ తేదీన జరిగిన తొక్కిలాటలో ఆరుగురు మృతి చెందిన విషయం తెల్సిందే. అందులో నలుగురు ఏపీకి చెందిన వారు కాగా ఒకరు తమిళనాడు, మరొకరు కేరళకు చెందిన భక్తులు ఉన్నారు. ఘటన జరిగి సుమారు ఆరు రోజులు కావస్తున్నా మరణించిన భక్తుల రక్తసంబంధీకులు, బంధువులు ఆ షాక్ నుంచి ఇంకా తేరుకోలేకపోతున్నారు. కొందరు మంచానికే పరిమితమయ్యామని, జీవితాంతం ఆ లోటు వెంటాడుతూనే ఉంటుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారువైజాగ్కు చెందిన మృతురాలు లావణ్య కుటుంబ పరిస్థితి దారుణంగా ఉంది. ఆమెకు ఇద్దరు ఆడ పిల్లలు. తల్లి దూరమైన ఆ పసిపాపల ఆవేదన వర్ణ నాతీతం. తల్లి లేని జీవితాన్ని ఊహించుకోలేమంటూ ఆవేదన చెందుతున్న ఆ పిల్లలను బంధువులు ఓదార్చలేని పరిస్థితి. తల్లిని కోల్పోయా.. మాది కేరళ. ఈనెల 8వ తేదీన వైకుంఠ ద్వార దర్శన టోకన్ల జారీ సందర్భంగా తిరుపతి కౌంటర్లలో జరిగిన తొక్కిసలాటలో మా తల్లి నిర్మల చనిపోయారు. ఆ విషాదం నుంచి తేరుకోలేకున్నాం. మా తల్లి నా కళ్ల ఎదుటే తి రుగుతున్నట్లు ఉంది. మా కుటుంబానికి ఆ మే పెద్ద దిక్కు. అలాంటిది తల్లి లేకపోవడం కలచివేస్తోంది. ఏ జన్మలో పాపం చేశానో త ల్లిని పోగొట్టుకున్నాను.–కౌషిగ, మృతురాలు నిర్మల కుమార్తె, కేరళఅమ్మ జ్ఞాపకాలతో..ఊహించని ఘటనతో కుటుంబం అంతా షాక్లోనే ఉంది. దైవదర్శనానికి వెళితే ఇలా జరగడం మనసును కలచివేస్తోంది. అమ్మ జ్ఞాపకాలు ప్రతి క్షణం వెంటాడుతున్నాయి. గత ఏడాది సంక్రాంతి అమ్మతో కలసి సంతోషంగా గడుపుకున్నాం. ఇప్పుడు నాన్నతో పాటు యావత్ కుటుంబం, బంధువులు విషాదంలో మునిగిపోయి ఉన్నాం. జ్వరాలతో మంచాన పడ్డాం. – మహేష్, మృతురాలు శాంతి కుమారుడు, వైజాగ్మా ఇంటి మహాలక్ష్మి వెళ్లిపోయింది మాది వైజాగ్ దగ్గర మద్దెలపాళెం. నేను ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాను. మాకు ఒక్కడే కుమారుడు. కుటుంబ సమేతంగా శ్రీవారి దర్శనానికి వెళ్లాం. తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో నా భార్య రజిని మరణించింది. మా ఇంటి మహాలక్ష్మి మాకు దూరమైంది. ఇంట్లో నేను, నా కుమారుడు ఇద్దరమే మిగిలాం. ప్రతి క్షణం ఆమె జ్ఞాపకాలు వెంటాడుతున్నాయి. గత ఏడాది సంక్రాంతి సంతోషంగా గడిపాం. ఈ ఏడాది ఆమెను దేవుడు దూరం చేశాడు. మా అబ్బాయి విదేశాలకు వెళ్లి చదువుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్న సమయంలో ఇలాంటి దుర్ఘటన చోటు చేసుకోవడం జీర్ణించుకోలేకపోతున్నాం. – లక్ష్మణరెడ్డి, మృతురాలి భర్త, మద్దెలపాళెం, వైజాగ్ఆయన జ్ఞాపకాలతో కుమిలిపోతున్నా.. వైకుంఠ వాకిలి నుంచి స్వామివారిని దర్శనం చేసుకోవాలనే తపనతో నా భర్త నాయుడుబాబుతో క లసి 8వ తేదీన తిరుపతికి వచ్చాం. అదే రోజు జరిగిన తొక్కిసలాటలో నా భర్త చనిపోయాడు. కూలి చేసుకుంటూ సంతోషంగా జీవనం సాగిస్తున్న మా కుటుంబంలో ఈ విషాదం భారీ నష్టాన్ని మిగిల్చింది. నా భర్త వెంట లేడనే బాధను దిగమింగుకోలేక పోతున్నా. కుటుంబంలో 90 ఏళ్ల పెద్దవారు ఉన్నా రు. వారి బాగోగులు చూసుకోవాలి. ఆయన తోడు విడిచాడు. నా పరిస్థితి తలచుకుంటేనే భయమేస్తోంది. ప్రభుత్వం సాయం అందించింది. నేను పెద్దగా చదువుకున్న దానిని కాదు. అధికారులు ఉద్యోగం నర్సీపట్నంలోనే కల్పిస్తే నాకు కాస్త వెసులుబాటుగా ఉంటుంది.– మణికుమారి,మృతుడు నాయుడుబాబు సతీమణి, నర్సీపట్నం -
South Africa: బంగారు గనిలో చిక్కుకుని 100 మంది కార్మికులు మృతి
దక్షిణాఫ్రికాలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. ఒక గనిలో చిక్కుకుని, 100 మంది కార్మికులు మృతిచెందారని సమాచారం. మీడియాకు తెలిసిన వివరాల ప్రకారం ఈ కార్మికులంతా దక్షిణాఫ్రికాలోని ఒక బంగారు గనిలో అక్రమంగా పనులు చేస్తున్నారు.గనిలో చిక్కుకున్న కార్మికులకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఒక బృందం మీడియాతో మాట్లాడుతూ ఈ కార్మికులు నెలల తరబడి భూగర్భ గనిలో చిక్కుకున్నారని తెలిపింది. ఈ నేపధ్యంలోనే వారు మరణించారని పేర్కొంది. కాగా గనిలో చిక్కుకున్న కార్మికులను రక్షించడానికి పోలీసులు ప్రయత్నించినప్పటికీ, విజయం సాధించలేకపోయారు.మైనింగ్ ప్రభావిత కమ్యూనిటీస్ యునైటెడ్ ఇన్ యాక్షన్ గ్రూప్ ప్రతినిధి సబెలో మ్ంగుని మీడియాతో మాట్లాడుతూ కొందరు గని కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారని, వారి దగ్గర రెండు వీడియోలు లభ్యమయ్యాయన్నారు. ఆ వీడియోల్లో డజన్ల కొద్దీ మృతదేహాలు భూగర్భంలో గనిలో కనిపిస్తున్నాయన్నారు.వాయువ్య ప్రావిన్స్లోని ఈ గనిలో 100 మంది వరకూ మృతిచెందారని ఆ సంస్థ ప్రతినిధి తెలిపారు. ఇప్పటివరకు భూగర్భ గనిలో నుంచి 18 మృతదేహాలను బయటకుతీశారు. వారు ఆకలి, డీహైడ్రేషన్ కారణంగా చనిపోయి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు.ఇది కూడా చదవండి: Mahakumbh-2025: మకర సంక్రాంతి వేళ.. అమృత స్నానానికి పోటెత్తిన జనం -
Lal Bhadur Shastri: నాటి ప్రధాని అభ్యర్థనతో దేశమంతా ఉపవాసం
దేశానికి సేవలు అందించిన మహనీయులను స్మరించుకోవడం దేశవాసులుగా మన కర్తవ్యం. ఈరోజు (జనవరి 11) భారతదేశ రెండవ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి వర్థంతి. 1966 జనవరి 11న ఆయన కన్నుమూశారు. ఆడంబరాలకు దూరంగా ఉండే వ్యక్తిగా శాస్త్రి పేరుగాంచారు. దేశ తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ మరణానంతరం శాస్త్రి 1964, జూన్ 9న ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.18 నెలల పాటు దేశ ప్రధానమంత్రిగా కొనసాగిన శాస్త్రి నాయకత్వాన 1965లో భారత్-పాక్ మధ్య యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో పాక్ ఘోరపరాజయాన్ని ఎదుర్కొంది. పాకిస్తాన్ అధ్యక్షుడు అయూబ్ ఖాన్తో తాష్కెంట్(Tashkent)లో యుద్ధాన్ని ముగించే ఒప్పందంపై శాస్త్రి సంతకం చేశారు. ఆ తర్వాత 1966, జనవరి 11న రాత్రి ఆయన అనుమానాస్పద పరిస్థితుల్లో కన్నుమూశారు. ప్రధానిగా లాల్ బహదూర్ శాస్త్రి పదవీకాలం చాలా తక్కువ. కానీ అదే సమయంలో ఆయన తన సరళమైన స్వభావం, దృఢ సంకల్ప శక్తి ప్రభావాలను దేశప్రజలకు చాటిచూపారు. క్లిష్ట సమయంలో దేశంలో అధికారాన్ని చేపట్టిన ఆయన పలు సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొన్నారు.లాల్ బహదూర్ శాస్త్రి(Lal Bahadur Shastri) 1964, జూన్ నుండి 1966, జనవరి వరకు భారత ప్రధానిగా ఉన్నారు. ఆ సమయంలో భారతదేశంలో ఆహారధాన్యాల కొరత అధికంగా ఉండేది. అటువంటి పరిస్థితుల్లో భారత్ ఆహార ధాన్యాల కోసం అమెరికాపై ఆధారపడింది. ఇంతలో 1965లో పాకిస్తాన్.. భారతదేశంపై దాడికి దిగింది. అయితే పాక్కు భారత సైన్యం(Indian Army) తగిన సమాధానం ఇచ్చింది. కానీ మన సైనికులకు తీవ్ర ఆహార సమస్య ఏర్పడింది. అటువంటి పరిస్థితిలో ప్రధాని శాస్త్రి.. దేశ ప్రజలంతా ఒక ఉపవాసం ఉండాలని విజ్ఞప్తి చేశారు. దీనికి దేశ ప్రజలంతా అంగీకరించారు. ఆ తదుపరి సంవత్సరాల్లో భారత్ ఆహార ఉత్పత్తుల విషయంలో స్వయం సమృద్ధిని సాధించింది.ఇది కూడా చదవండి: Mahakumbh-2025: అంబాసిడర్ బాబా.. 35 ఏళ్లుగా కారులోనే సాధన -
చచ్చినోడు తిరిగొచ్చాడు
సేలం: కావేరి నదిలో మునిగి మృతి చెందాడని భావించి అంత్యక్రియలు చేసి దహనం చేయబడిన స్థితిలో ఆ వ్యక్తి ప్రాణాలతో తిరిగి వచ్చిన సంఘటన మైలాడుదురైలో కలకలం రేపింది. మైలాడుదురై జిల్లా తరంగంపాడి తాలూకా మేలప్పాది ప్రాంతంలో గత డిసెంబర్ 22వ తేది గుర్తు తెలియని పురుషుడి మృతదేహం కావేరి నదిలో తేలుతూ కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఆ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, శవ పంచనామా నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి విచారణ చేపట్టారు. అప్పుడు మురుదూర్ లక్ష్మీ నారాయణపురానికి చెందిన సెల్వరాజ్(62) అని తెలిసింది. దీంతో సెంబనార్కోవిల్ పోలీసులు సెల్వరాజ్ భార్య శాంతిని కలుసుకుని మృతదేహాన్ని గుర్తించమని కోరారు. అనంతరం ఆ మృతదేహానికి శవ పంచనామా నిర్వహించి తర్వాత శాంతికి అప్పగించారు. అనంతరం కుటుంబీకులు సెల్వరాజ్ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించి దహనం చేశారు. ఈ స్థితిలో ఆదివారం అకస్మాత్తుగా సెల్వరాజ్ మరుదూర్ గ్రామానికి తిరిగి వచ్చాడు. చనిపోయాడని భావించిన సెల్వరాజ్ ప్రాణాలతో తిరిగి రావడంతో గ్రామస్తులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అప్పుడు గుర్తుతెలియని వ్యక్తి మృతదేహానికి అంత్యక్రియలు చేసి అది సెల్వరాజ్గా భావించినట్టు తెలిసింది. "என்னோட இறுதி சடங்கு படையலுக்கு சரக்கு எங்கே?".. சுடுகாட்டில் எரிக்கப்பட்டவர் உயிருடன் வந்ததால் அதிர்ச்சி..!#Mayiladuthurai | #Death | #Funeral | #OldMan | #Crematorium | #PolimerNews pic.twitter.com/lUfoBFJvev— Polimer News (@polimernews) January 6, 2025 -
బీహార్ భూకంపం: 90 ఏళ్ల క్రితం ఇదేవిధంగా.. చెరగని ఆనవాళ్లు
నేపాల్-టిబెట్ సరిహద్దు ప్రాంతంలో ఈరోజు (మంగళవారం) భారీ భూకంపం సంభవించింది. ఈ విపత్తులో 53 మంది మృతి చెందారు. ఈ భూకంప ప్రభావం భారత్లోని ఢిల్లీ, బీహార్లోనూ కనిపించింది. బీహార్లో పట్నా, సమస్తీపూర్, సీతామర్హి తదితర జిల్లాల్లో కొన్ని సెకెన్ల పాటు భూమి కంపించింది. ఈ నేపధ్యంలో 90 ఏళ్ల క్రితం బీహార్లో సంభవించిన భారీ భూకంపం గురించి తమ పూర్వీకులు చెప్పిన విషయాలను స్థానికులు గుర్తుకు తెచ్చుకుంటున్నారు.1934 జనవరి 15న బీహార్లో సంభవించిన భారీ భూకంపం(Major earthquake) ఆనవాళ్లు ఇప్పటికీ బీహార్లో కనిపిస్తాయి. తాజాగా భూకంపం సంభవించిన దరిమిలా 90 ఏళ్ల క్రితం నాటి బీతావహ భూకంపం జ్ఞాపకాలను స్థానికులు గుర్తుచేసుకున్నారు. బీహార్ ప్రాంతం భూకంపాలకు సంబంధించిన అత్యంత ప్రమాదకరమైన జోన్లో ఉంది. 1934లో సంభవించిన భూకంపం కారణంగా బీహార్ మొత్తం ధ్వంసమైంది. నాటి ఆ భూకంపం మధుబని జిల్లాలోని రాజ్నగర్ను శిథిలాల నగరంగా మార్చివేసింది. కోసి ప్రాంతంలో రైలు కనెక్టివిటీ విధ్వంసానికి గురైంది. నేటికీ ఇక్కడ నాటి ఆనవాళ్లు కనిపిస్తాయి.బీహార్లో పలుమార్లు భూకంపాలు సంభవించాయి. 1764, 1833లో బీహార్ ప్రాంతంలో భూకంపాలు సంభవించినట్లు చరిత్ర చెబుతోంది. బీహార్లో 1988, ఆగస్టు 21న 6.6 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. అయితే 1934లో 8.4 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. బీహార్లో భూకంప ప్రభావంపై నిపుణులు(Experts) అధ్యయనం చేసినప్పుడు ముజఫర్పూర్, దర్భంగా, ముంగేర్ వంటి జిల్లాల్లో ప్రకంపనలు అధికంగా వచ్చాయని వెల్లడయ్యింది.1934లో సంభవించిన భూకంపం కారణంగా దర్భంగాలో 1,839 మంది, ముజఫర్పూర్లో 1,583, ముంగేర్లో 1,260 మంది మృతిచెందారు. మొత్తంగా 7253 మంది మృతిచెందారు. దాదాపు 3,400 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో భూకంప ప్రభావం కనిపించింది. నాటి భూకంపం తీవ్రతకు రాజ్నగర్ నగరం పూర్తిగా శిథిలమయ్యింది. ఇప్పటికీ ఈ నగరాన్ని శిథిలాల నగరం అని పిలుస్తారు. నాటి భూకంపంలో దేశంలోని మూడు అత్యుత్తమ ప్యాలెస్లలో ఒకటైన రాజ్నగర్లోని రామేశ్వర్ విలాస్ ప్యాలెస్(Rameshwar Vilas Palace) పూర్తిగా ధ్వంసమైంది.బీహార్లో భూకంపాలు అనేకసార్లు విధ్వంసం సృష్టించాయి. శాస్త్రవేత్తలు కూడా ఇక్కడ ఎప్పుడైనా పెద్ద ఎత్తున భూకంపాలు సంభవించవచ్చనే ఆందోళనను వ్యక్తం చేశారు. బీహార్లోని ప్రతి జిల్లాకు భూకంపం ముప్పు పొంచి ఉంది. 38 జిల్లాల్లో ఎనిమిది జిల్లాలు అత్యంత ప్రమాదకరంగా భావించే జోన్-5లో ఉన్నాయి. ఇక్కడ ఎత్తయిన భవనాలను నిర్మించడాన్ని నిషేధించారు. ఇది కూడా చదవండి: నాడు సస్పెండ్.. నేడు కుంభమేళా బాధ్యతలు.. ఎవరీ వైభవ్ కృష్ణ? -
బర్డ్ ఫ్లూతో పులులు, చిరుత మృతి
నాగ్పూర్: మహారాష్ట్రలోని నాగ్పూర్ సమీపంలోని గోరేవాడ రెస్క్యూ సెంటర్లో మరణించిన మూడు పులులు, ఒక చిరుత మృతికి బర్డ్ఫ్లూ కారణమని తేలింది. డిసెంబర్ చివరణ మృతి చెందిన వన్య మృగాలు ఏవియన్ ఫ్లూ హెచ్5ఎన్1 బారిన పడ్డాయని అధికారులు ధ్రువీకరించారు. దీంతో మహారాష్ట్ర అంతటా రెడ్ అలర్ట్ ప్రకటించారు. మనుషుల మీద దాడి నేపథ్యంలో డిసెంబర్లో వీటిని చంద్రాపూర్ నుంచి గొరేవాడకు తరలించారు. ఈ నేపథ్యంలో డిసెంబర్ 20న ఒక పులి, 23న రెండు పులులు మృతి చెందాయి. నమూనాలను భోపాల్లోని ఐసీఏఆర్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్ (నిషాద్)కు పంపించారు. ల్యాబ్ ఫలితాల్లో బర్డ్ఫ్లూతో జంతువులు మృతి చెందినట్లు నిర్ధారించారు. హెచ్5ఎన్1 వైరస్ మూలాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. బర్డ్ ఫ్లూ సోకిన జంతువులను వేటాడటం లేదా ముడి మాంసం తినడం వల్ల బర్డ్ ఫ్లూ వచ్చి ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. ఈ మృతుల నేపథ్యంలో కేంద్రంలో ప్రస్తుతం ఉన్న 25 చిరుతలు, 12 పులులకు పరీక్షలు నిర్వహించారు. అన్ని ఆరోగ్యంగా ఉన్నట్లు తేలింది. -
ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్..నలుగురు మావోయిస్టుల మృతి
రాయ్పూర్:ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. అబూజ్మడ్ అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో నలుగురు నక్సలైట్లు,ఒక జవాను మృతి చెందారు. నారాయణపూర్,దంతేవాడ జిల్లాల సరిహద్దులో ఉన్న అబూజ్మడ్ అడవుల్లో శనివారం సాయంత్రం భద్రతాబలగాలు కూంబింగ్ ఆపరేషన్ చేస్తుండగా మావోయిస్టులు ఎదురుపడ్డారు.దీంతో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఘటనా స్థలం నుంచి ఏకే 47,ఎస్ఎల్ఆర్ వంటి ఆటోమేటిక్ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఎదురుకాల్పుల్లో మృతిచెందిన కానిస్టేబుల్ను దంతెవాడ డీఆర్జీ హెడ్ కానిస్టేబుల్ సన్ను కరమ్గా గుర్తించారు.ఇటీవలి కాలంలో ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు, భద్రతాబలగాలకు మధ్య ఎదురుకాల్పుల ఘటనలు ఎక్కువయ్యాయి. ఈ ఎదురుకాల్పుల్లో మావోయిస్టుల వైపు నుంచి ఎక్కువ ప్రాణనష్టం జరుగుతోంది. భద్రతాబలగాలు కూడా తమ జవాన్లను కోల్పోతున్నాయి. ఇదీ చదవండి: లోయలో పడ్డ ఆర్మీ వాహనం..నలుగురు సైనికులు దుర్మరణం -
స్విస్ విమానంలో పొగలు.. అత్యవసర ల్యాండింగ్
జ్యూరిచ్:గత వారం తమ సంస్థకు చెందిన విమానంలో సాంకేతిక లోపం తలెత్తిందని స్విస్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ తెలిపింది. ఇంజిన్లో లోపం కారణంగా విమానంలో పొగలు వచ్చాయని ఈ ఘనటనలో ఆస్పత్రి పాలైన విమాన సిబ్బంది ఒకరు మృతి చెందారని వెల్లడించింది. ఈమేరకు ఎయిర్లైన్స్ సీఈవో మీడియాతో మాట్లాడారు.‘బుకారెస్ట్ నుంచి జ్యూరిచ్ వెళుతుండగా మా ఎయిర్బస్ ఎ220 విమానంలో సాంకేతిక లోపం ఏర్పడింది. వెంటనే విమానాన్ని గ్రాజ్ నగరంలో అత్యవసర ల్యాండింగ్ చేశాం. విమానంలో పొగలు రావడం వల్ల అస్వస్థతకు గురైన ప్రయాణికులు,సిబ్బందిని ఆస్పత్రిలో చేర్చాం. వీరిలో మా సిబ్బంది ఒకరు చికిత్స పొందుతూ మృతి చెందడం షాక్కు గురిచేసింది’అని స్విస్ ఎయిర్లైన్స్ సీఈవో ఫెలింగర్ తెలిపారు. సాంకేతిక లోపం ఏర్పడినపుడు విమానంలో 74 మంది ప్రయాణిస్తున్నారు. పొగల కారణంగా సిబ్బంది సహా మొత్తం 12 మంది అస్వస్థతకు గురయ్యారు. ఇదీ చదవండి: విమానంలో ఏ సీటు భద్రం -
హమాస్ చీఫ్ హత్య..ఇజ్రాయెల్ కీలక ప్రకటన
టెల్అవీవ్:హమాస్ ముఖ్య నేత ఇస్మాయిల్ హనియే ఈ ఏడాది జులైలో హత్యకు గురైన విషయం తెలిసింది. హనియేను తామే అంతం చేశామని ఇజ్రాయెల్ తాజాగా ధ్రువీకరించింది. ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కాట్జ్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఇటీవల కాలంలో యెమెన్కు చెందిన హౌతీ ఉగ్రవాద గ్రూపు ఇజ్రాయెల్పై క్షిపణులు ప్రయోగిస్తుంది.ఈ క్రమంలో వారికి ఓ స్పష్టమైన సందేశం అందించాలనుకుంటున్నా. హమాస్, హెజ్బొల్లాలను ఓడించాం. వారి మౌలిక సదుపాయాలను దెబ్బతీయడంతో పాటు హనియా, సిన్వర్, నస్రల్లాలను హతమార్చాం. ఇరాన్ రక్షణ,ఉత్పత్తి వ్యవస్థలను నాశనం చేశాం.సిరియాలో బషర్ అల్ అసద్ పాలనను పడగొట్టాం. హౌతీలకు కూడా గట్టి దెబ్బ తప్పదు’ అని కాట్జ్ హెచ్చరించారు.ఇరాన్ రాజధాని టెహ్రాన్లో జులైలో జరిగిన ఆ దేశ నూతన అధ్యక్షుడి ప్రమాణస్వీకారంలో పాల్గొన్న హనియా హత్యకు గురైన విషయం తెలిసిందే. పథకం ప్రకారమే ఇజ్రాయెలే ఈ పని చేసిందని ఇరాన్ అప్పుడే ఆరోపించింది.అయితే అప్పట్లో ఇజ్రాయెల్ దీనిపై ఎలాంటి ప్రకటన చేయలేదు.తాజాగా ఈవిషయాన్ని ధ్రువీకరించింది. మరోవైపు గాజాలో యుద్ధం మొదలైనప్పటినుంచి హౌతీలు ఇజ్రాయెల్పై క్షిపణి దాడులకు పాల్పడుతున్నారు. వీరికి ఇరాన్ మద్దతిస్తూ వస్తోంది. తాము పాలస్తీనియన్లకు సంఘీభావంగా వ్యవహరిస్తున్నామని హౌతీ రెబెల్స్ పేర్కొంటున్నారు. -
హత్య కేసులో ఒకరికి ఉరిశిక్ష
కాచిగూడ: నలుగురిని పెట్రోల్ పోసి చంపిన కేసులో ఒకరికి మరణ శిక్ష, మరో ముద్దాయికి యావజ్జీవ కారాగార శిక్షను విధిస్తూ నాంపల్లి అడిషనల్ సెషన్స్ జడ్జి వినోద్ కుమార్ తీర్పు వెలువరించారు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. 2022లో రాగుల సాయి అనే వ్యక్తి తన మాజీ భార్య ఆర్తికి మధ్య భేదాభిప్రాయాలు తలెత్తాయి. రాగుల సాయి స్నేహితుడైన నాగరాజును ఆర్తి రెండో వివాహం చేసుకుంది. కొన్నాళ్ల తర్వాత నాగరాజు ఆర్తిని వేధింపులకు గురి చేసేవాడు. ఆర్తిని చెల్లిగా పిలవాలని నాగరాజు స్నేహితుడైన రాగుల సాయికి తెలపడంతో వీరిద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీనిని మనసులో పెట్టుకున్న రాగుల సాయి తన స్నేహితుడు ఎ.రాహుల్ ఇద్దరూ కలిసి గర్భంతో ఉన్న ఆర్తిని, నాగరాజును, వీరి ఏడాది కుమారుడు విష్ణుపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల స్టేట్మెంట్స్ నారాయణగూడ పోలీసులు రికార్డ్ చేసుకొని కేసు నమోదు చేశారు. హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఆర్తి, నాగరాజు, వీరి ఏడాది కుమారుడు విష్ణు, ఆర్తి కడుపులోని బిడ్డతో సహా నలుగురూ మృతి చెందారు. అప్పట్లో ఈ కేసు సంచలనంగా మారింది. ఈ కేసును సవాల్గా తీసుకున్న నారాయగూడ పోలీసులు దర్యాప్తు సాగించారు. మొదటి ప్రాధాన్యతగా ఈ కేసుగా తీసుకున్న నాంపల్లి క్రిమినల్ కోర్టు జడ్జి వినోద్ కుమార్ శుక్రవారం నిందితుడైన రాగుల సాయికి మరణశిక్ష, అతని స్నేహితుడైన రాహుల్కు యావజ్జీవ కారాగార శిక్షను విధిస్తూ తీర్పు వెల్లడించినట్లు నారాయణగూడ ఇన్స్పెక్టర్ యు.చంద్రశేఖర్ తెలిపారు. -
సినిమా కథలా జాకీర్ హస్సేన్ ప్రేమ వివాహం
ప్రముఖ తబలా విద్వాంసుడు, సంగీత స్వరకర్త జాకీర్ హుస్సేన్(73) కన్నుమూశారు. శాన్ ఫ్రాన్సిస్కోలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. తన ఏడేళ్ల వయసులోనే జాకీర్ హుస్సేన్ తబలా వాయించడంలో ప్రావీణ్యం సంపాదించారు. అభిమానులు, శ్రేయోభిలాషులకు జాకీర్ హుస్సేన్ వృత్తిపరమైన విజయాల గురించి తెలుసుకానీ, అతని వ్యక్తిగత వివరాలు అంతగా తెలియదు. జాకీర్ హుస్సేన్ ప్రేమకథ సినిమా స్టోరీని తలపిస్తుంది.జాకీర్ హుస్సేన్ కథక్ నర్తకి ఆంటోనియా మిన్నెకోలాను వివాహం చేసుకున్నారు. ఆమె అతనికి మేనేజర్గా వ్యవహరించారు. జాకీర్ హుస్సేన్, ఆంటోనియా మిన్నెకోలాలకు 1978లో వివాహం జరిగింది. వీరికి అనిసా ఖురేషి, ఇసాబెల్లా ఖురేషి అనే ఇద్దరు కుమార్తెలున్నారు. జాకీర్ హుస్సేన్, ఆంటోనియాలు తొలిసారిగా 70వ దశకం చివరలో కాలిఫోర్నియాలోని బే ఏరియాలో తబలా, కథక్లలో శిక్షణ తీసుకుంటున్నప్పుడు కలుసుకున్నారు.జాకీర్ మొదటి చూపులోనే ఆంటోనియాను ఇష్టపడ్డారు. క్రమంగా ఇద్దరి మధ్య స్నేహం పెరిగింది. కానీ ఆంటోనియా మిన్నెకోలా.. జాకీర్ హుస్సేన్ను ప్రేమించే విషయంలో వెనుకాడారు. అయితే జాకీర్ ఆమె కోసం ప్రతిరోజూ తరగతి గది బయట వేచి ఉండేవాడు. జాకీర్, ఆంటోనియాలు ఎనిమిదేళ్లు స్నేహం కొనసాగించిన అనంతర వివాహం చేసుకున్నారు. దీనికి ముందు కొంతకాలంపాటు డేటింగ్ చేశారు. ఈ విషయంలో ఇరుకుటుంబాల వారికి తెలుసు.ఆ సమయంలో జాకీర్కు సరైన ఆదాయం లేకపోవడంతో ఆంటోనియా తండ్రి ఈ వివాహానికి అభ్యంతరం తెలిపారు. ఇదిలా కొనసాగుతుండగానే జాకీర్, ఆంటోనియాలు 1979లో పెళ్లి చేసుకున్నారు. జాకీర్ ఒక ఇంటర్య్యూలో తాను తన కుటుంబంలోనివారికి భిన్నంగా మతాంతర వివాహంచేసుకున్నానని తెలిపారు. ఆంటోనియాను తాను వివాహం చేసుకుంటానంటే తన తల్లి అందుకు నిరాకరించారని, అయితే తన తండ్రి తమ రహస్య వివాహానికి సహకరించారని జాకీర్ వివరించారు. తరువాతి కాలంలో తన తల్లి ఆంటోనియాను కోడలిగా అంగీకరించారని తెలిపారు.జాకీర్ హుస్సేన్, ఆంటోనియా దంపతులకు ఇద్దరు కుమార్తెలు. ఆంటోనియా అమెరికాలో ఉంటూ తమ కుమార్తెలను చూసుకుంటున్నారని గతంలో జాకీర్ తెలిపారు. జాకీర్ కెరియర్ కోసం, ఆయనకు అన్ని విషయాల్లో సహాయం అందించేందుకు ఆంటోనియా తన కెరియర్ను వదులుకున్నారు. జాకీర్ విదేశాలకు వెళ్లేటప్పుడు భావోద్వేగాలకు లోనయ్యేవారని ఆంటోనియా ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. భార్యాభర్తలుగా తామిద్దరం ఒకరి ఆచార వ్యవహారాలను, కుటుంబ విలువలను పరస్పరం గౌరవించుకుంటూ మెలుగుతున్నామని, తమ పిల్లలకు కూడా సదాచార లక్షణాలు నేర్పించామని ఆంటోనియా పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: Year Ender 2024: ఎప్పటికీ గుర్తుండే 10 రాజకీయ ఘటనలు -
నీ వెంటే వస్తున్నా బిడ్డా..!
కుల్కచర్ల(వికారాబాదు జిల్లా) : కొడుకు మరణాన్ని తట్టుకోలేక.. ఓ తల్లి గుండె ఆగింది. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు చూస్తుండగానే.. కుమారుడి శవం పక్కనే తుదిశ్వాస విడిచింది. ఈ విషాద సంఘటన వికారాబాద్ జిల్లా కుల్కచర్ల పీఎస్ పరిధిలోని చౌడాపూర్ మండలం లింగంపల్లిలో శుక్రవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మ్యాకల శ్రీశైలం (34) గత నెల 24న పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఇదే ఊరికి చెందిన బాల్రాజ్, లక్ష్మణ్, రాములు కలిసి భూ తగాదాలతో తనను వేధిస్తున్నారని అంతకు ముందే సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం మరణించాడు. శ్రీశైలం మృతిని జీర్ణించుకోలేని తల్లి వెంకటమ్మ (52) కొడుకు శవం వద్ద రోదస్తూ కింద పడిపోయింది. అక్కడున్నవారు చూస్తుండగానే ప్రాణాలు విడిచింది. దీంతో తల్లీ కొడుకుల అంత్యక్రియలను ఒకేసారి నిర్వహించారు. శ్రీశైలం ఆత్మహత్యకు కారణమైన బాల్రాజ్, లక్ష్మణ్, రామును అదుపులోకి తీసుకున్న పోలీసులు శుక్రవారం వారిని రిమాండ్కు తరలించారు. పోలీసులకు సవాల్గా మారిన విజయ హత్య కేసు -
కూతురు పెళ్లికి ముందు జవాను మృతి..దేవుడిలా వచ్చిన స్నేహితులు
లక్నో:తాము అందరికీ ఆదర్శమని ఆర్మీ జవాన్లు మరోసారి నిరూపించుకున్నారు. దేశాన్ని కంటికిరెప్పలా కాపాడడమే కాదు..అవసరమైతే పక్కవాడి కష్టాన్ని తమ కష్టంగా భావించి ఆదుకుంటామని చాటారు. ఉత్తరప్రదేశ్లోని మథురలో 48 ఏళ్ల దేవేంద్రసింగ్ నెలరోజుల క్రితమే ఆర్మీ నుంచి రిటైర్ అయ్యారు. మరో రెండు రోజుల్లో జరగాల్సిన కూతురు పెళ్లికి అన్ని ఏర్పాట్లు ఒక్కడే చకచకా చేసుకుంటున్నారు. ఇంతలో విధి వెక్కిరించింది. గురువారం(డిసెంబర్5) జరిగిన రోడ్డు ప్రమాదంలో సింగ్ దుర్మరణం పాలయ్యారు. ఈ దుర్ఘటనతో సింగ్ ఇంట్లో అంతులేని విషాదం అలుముకుంది. పెళ్లి ఆగిపోయిందని అంతా భావించారు. కానీ ఇక్కడే సీన్ పూర్తిగా మారిపోయింది. సింగ్తో పాటు ఆర్మీలో పనిచేసిన జవాన్లు, అధికారులు అతడి మరణం విషయం తెలుసుకున్నారు. వెంటనే మథురకు వచ్చారు. సింగ్ కుటుంబ సభ్యులను ఓదార్చారు. అన్నీ దగ్గరుండి చూసుకుని సింగ్ కూతురి పెళ్లిని అంగరంగ వైభవంగా జరిపించారు. చివరకు దగ్గరుండి కన్యాదానం కూడా చేశారు. సింగ్ స్నేహితుల మానవతా సాయంపై అతడి వియ్యంకుడు నరేంద్రసింగ్ స్పందించారు. అంతా అయిపోయిందనుకున్న తరుణంలో సింగ్ స్నేహితులంతా వచ్చి మాకు ధైర్యం చెప్పి పెళ్లి జరిపించారు’అని వారిపై ప్రశంసలు కురిపించారు. -
Year ender 2024: రతన్ టాటా మొదలుకొని శారదా సిన్హా వరకూ.. ఈ ఏడాది కన్నుమూసిన ప్రముఖులు
2024 కొద్దిరోజుల్లో ముగియబోతోంది. కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు అందరూ సిద్ధమవుతున్నారు. ఈ ఏడాది కొందరికి సవ్యంగానే సాగిపోగా, మరికొందరికి భారంగా గడిచింది. ఈ ఏడాది ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా, బీహార్ నైటింగేల్ శారదా సిన్హా తదితర ప్రముఖులు ఈ లోకాన్ని విడిచివెళ్లారు. 2024 ముగుస్తున్న తరుణంలో ఈ ఏడాదిలో కన్నుమూసిన ప్రముఖులను ఒకసారి స్మరించుకుందాం.రతన్ టాటాప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా 2024 అక్టోబర్ 9న తన 86 ఏళ్ల వయసులో కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడిన ఆయన ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. రతన్ టాటా 30 ఏళ్ల పాటు టాటా గ్రూప్కు సారధ్యం వహించారు. టాటా సన్స్కు ఛైర్మన్గా వ్యవహరించారు. రతన్ టాటా నాయకత్వంలో టాటా గ్రూప్ పలు విజయాలు సాధించడమే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. రతన్ టాటా భారతదేశానికి చేసిన సేవలు, ఆయన అందించిన విలువలను రాబోయే తరాలు కూడా గుర్తుచేసుకుంటాయి.బాబా సిద్ధిఖీమహారాష్ట్ర ఎన్సీపీ నేత బాబా సిద్ధిఖీని 2024, అక్టోబర్ 12న ముంబైలో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ కాల్చిచంపింది. ఈ కేసులో పోలీసులు పలువురు నిందితులను అరెస్ట్ చేశారు. ఈ ఘటన అనంతరం ముంబైలో భయాందోళనకర వాతావరణం నెలకొంది.సీతారాం ఏచూరి సీపీఎం ప్రధాన కార్యదర్శి, ప్రముఖ లెఫ్ట్ ఫ్రంట్ నేత సీతారాం ఏచూరి 2024, సెప్టెంబర్ 12న కన్నుమూశారు. శ్వాసకోశ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న ఆయన చాలా కాలం పాటు ఎయిమ్స్లో చికిత్స తీసుకున్నారు. శ్వాసకోశ వ్యాధితో ఆయన తుది శ్వాస విడిచారు. ఏచూరి మరణానంతరం ఆయన మృతదేహాన్ని కుటుంబ సభ్యులు ఎయిమ్స్కు దానం చేశారు.శారదా సిన్హా బీహార్ నైటింగేల్గా పేరొందిన జానపద గాయని శారదా సిన్హా 2024లో కన్నుమూశారు. ఆమె మల్టిపుల్ మైలోమా అనే అరుదైన రక్త క్యాన్సర్తో బాధపడ్డారు. శారదా సిన్హా 2024 నవంబర్ 5న ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. భారతీయ జానపద సంగీతానికి శారదా సిన్హా అమోఘమైన సేవలు అందించారు.అతుల్ పర్చురే ప్రముఖ మరాఠీ హాస్యనటుడు అతుల్ పర్చురే తన 57 ఏళ్ల వయసులో క్యాన్సర్తో పోరాడుతూ కన్నుమూశారు. ఒక ఇంటర్వ్యూలో ఆయన తన కాలేయంలో 5 సెంటీమీటర్ల కణితి ఉందని తెలిపారు. చికిత్స సమయంలో, అది ప్రమాదవశాత్తూ ప్యాంక్రియాస్కు వ్యాపించిందని, ఫలితంగా తాను నడిచేందుకు కూడా వీలులేని పరిస్థితిలో ఉన్నానని తెలిపాడు. అతుల్ పర్చురే 2024లో ఈ లోకాన్ని విడిచివెళ్లారు.పంకజ్ ఉధాస్ ప్రముఖ గజల్ గాయకుడు పంకజ్ ఉధాస్ 2024, ఫిబ్రవరి 26న తన 72 ఏళ్ల వయసులో కన్నుమూశారు. ఆయన మరణం భారతీయ సంగీత ప్రపంచానికి తీరని లోటని పలువురు ప్రముఖులు పేర్కొన్నారు. పంకజ్ ఉదాస్ గజల్స్ శ్రోతల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని ఆక్రమించుకున్నాయి. పంకజ్ ఉదాస్కు ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ సోకింది. ఆయన మృతికి నాలుగు నెలల ముందుగానే ఆయనకు ఈ విషయం తెలిసింది.సుహానీ భట్నాగర్అమీర్ ఖాన్ చిత్రం ‘దంగల్’లో కనిపించిన చైల్డ్ ఆర్టిస్ట్ సుహానీ భట్నాగర్ 2024, ఫిబ్రవరి 17న తన 19 ఏళ్ల వయసులో ఈ ప్రపంచానికి వీడ్కోలు పలికారు. సుహానీ డెర్మటోమయోసిటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడినట్లు ఆమె తండ్రి తెలిపారు.రితురాజ్ సింగ్ టీవీ, సినీ నటుడు రితురాజ్ సింగ్ తన 59 సంవత్సరాల వయస్సులో 2024, ఫిబ్రవరి 19న ముంబైలో గుండెపోటుతో మృతిచెందారు. చిన్న తెరపై తన కెరీర్ను ప్రారంభించిన ఆయన తదనంతరకాలంలో పలు ప్రధాన పాత్రలలోనూ కనిపించారు.రోహిత్ బాల్ ఫేమస్ ఫ్యాషన్ డిజైనర్ రోహిత్ బాల్ 2024 నవంబర్ 2న తన 63 ఏళ్ల వయసులో కన్నుమూశారు. ఆయన చాలా కాలంపాటు గుండె సంబంధిత వ్యాధులతో బాధపడ్డారు. 2010లో గుండెపోటు రావడంతో యాంజియోప్లాస్టీ కూడా చేయించుకున్నారు. అక్టోబర్ 13న ఢిల్లీలోని ఇంపీరియల్ హోటల్లో లాక్మే ఇండియా ఫ్యాషన్ వీక్లో తన చివరి ప్రదర్శన ఇచ్చారు. ఇది కూడా చదవండి: అగ్నికి ఆహుతై.. ఐదేళ్ల తర్వాత తెరుచుకున్న అందమైన చర్చి -
Bhopal Gas Tragedy: ప్రపంచం మరువలేని విషాదమిది..
భోపాల్: 1984, డిసెంబరు 3.. మధ్యప్రదేశ్లోని భోపాల్లో ప్రపంచం మరువలేని విషాదం చోటుచేసుకుంది. ఈ ఘటనకు నేటికి 40 ఏళ్లు.. ఇన్నేళ్లు దాటినా ఈ దుర్ఘటన ఆనవాళ్లు ఈనాటికీ వెంటాడుతూనే ఉన్నాయి.యూనియన్ కార్బైడ్ ప్లాంట్ నుంచి విషపూరిత వాయువు మిథైల్ ఐసోసైనేట్ (ఎంఐసీ) లీక్ అయిన ఘటన భారతదేశ చరిత్రలో అత్యంత ఘోరమైన పారిశ్రామిక ప్రమాదాలలో ఒకటిగా నిలిచింది. ఆ రోజు రాత్రి భోపాల్లోని జనం గాఢ నిద్రలో ఉండగా మృత్యువు విషవాయువు రూపంలో రెక్కలు విప్పి, లెక్కలేనంతమందిని కబళించింది. నాటి భయానక దృశ్యాలు నేటికీ చాలామంది కళ్లముందు మెదులుతుంటాయి.ఆ రోజు ఏం జరిగింది?భోపాల్లోని యూనియన్ కార్బైడ్ సంస్థలో నాడు పనిచేసిన ఒక అధికారి తన అనుభవాన్ని వివరిస్తూ.. ‘1984, డిసెంబర్ 3 మాకు ఎప్పటిలానే తెల్లారింది. ఉదయం 8 గంటలకు ఇంటి నుంచి బయలుదేరి, ఫ్యాక్టరీకి వెళ్లేందుకు బస్సు కోసం వేచి చూస్తున్నాను. ఆ సమయంలో ఫ్యాక్టరీ నుండి విడుదలైన విష వాయువు నగరాన్ని కమ్మేసిందని నాకు తెలియదు. మేం బస్సు కోసం ఎదురుచూస్తుండగా అక్కడున్న ఒక వ్యక్తి.. గ్యాస్ లీక్ అయ్యిందని, దాని వల్ల చాలా మంది చనిపోయారని చెప్పడంతో షాక్ అయ్యాను’ అని తెలిపారు.సీనియర్ ప్రెస్ ఫోటోగ్రాఫర్ అనుభవంలో..భోపాల్కు చెందిన సీనియర్ ప్రెస్ ఫోటోగ్రాఫర్ గోపాల్ జైన్ తన ఇంటికి వచ్చిన ఒక బంధువు చేతిపై హఠాత్తుగా వచ్చిన ఎర్రని వాపును చూసి షాక్ అయ్యారు. పాత భోపాల్ ప్రాంతమంతా పొగతో కమ్ముకుందని ఆ మహిళ అతనికి చెప్పింది. ఉదయం హమీదియా హాస్పిటల్ చుట్టూ మృతదేహాలు చెల్లాచెదురుగా పడటంతో అతనికి జరిగినదేమిటో అర్థం అయ్యింది. నాటి పరిస్థితిని గుర్తుచేసుకున్న జైన్ మాట్లాడుతూ ‘ఉదయం నేను ఆసుపత్రికి చేరుకున్నప్పుడు, అక్కడి పరిస్థితి భయానకంగా ఉంది. మృతదేహాలు కుప్పలుగా పడివున్నాయి. అక్కడ గుమిగూడిన జనం తమవారి కోసం వెదుకుతున్నారు. యూనియన్ కార్బైడ్ ప్లాంట్ నుండి గ్యాస్ లీక్ అయిన కారణంగా ఈ దారుణం చోటు చేసుకున్నదని తెలిసింది’ అని అన్నారు.నాటి ప్రభుత్వ లెక్కల ప్రకారం ఈ దుర్ఘటనలో 5,474 మంది ప్రాణాలు కోల్పోగా, ఐదు లక్షల మందికి పైగా జనం గ్యాస్ విషపూరిత ప్రభావాలకు గురయ్యారు. ఈ ఘటన జరిగి నాలుగు దశాబ్దాలు గడిచినా దాని నాటి గాయం ఇంకా మానలేదు. గ్యాస్ లీకేజీ కారణంగా వేలాది మంది జనం అనారోగ్యం పాలయ్యారు. నాటి విషవాయువు ప్రభావం తరతరాలుగా వెంటాడుతూనే ఉంది. ఇది కూడా చదవండి: లండన్లో రేడియో జాకీగా రాణిస్తున్న హైదరాబాదీ -
వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం.. అనంతపురం సర్వజనాస్పత్రిలో తల్లీబిడ్డ మృతి
అనంతపురం మెడికల్: అనంతపురం ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యంతో సోమవారం తల్లీబిడ్డ ప్రాణాలు గాల్లో కలసిపోయాయి. బాత్రూంకు వెళ్లిన గర్భిణి అక్కడ కళ్లు తిరిగి కిందపడిపోయి అపస్మారక స్థితిలోకి వెళ్లింది. గైనిక్ విభాగం వైద్యులు, సిబ్బంది సకాలంలో స్పందించకపోవడంతో తల్లి, బిడ్డ ప్రాణాలు దక్కలేదు. అనంతపురం జిల్లా రాయదుర్గానికి చెందిన మంజునాథ్ తన భార్య జ్యోతి (30)ని మూడో కాన్పునకు గత నెల 27న సర్వజనాస్పత్రి ఎమర్జెన్సీ వార్డులో చేర్పించారు. హైరిస్క్ కేసు కావడంతో వైద్యులు, సిబ్బంది చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉన్నా.. ఆ స్థాయిలో పట్టించుకోలేదు. జ్యోతికి సోమవారం ఐరన్ సుక్రోజ్ ఇంజెక్షన్ ఇచ్చారు. కాసేపటికి కళ్లు తిరుగుతున్నాయని, బాత్రూంకు వెళ్లాలని చెప్పింది. బాత్రూంకు పంపించడంలో స్టాఫ్నర్సులు, ఎఫ్ఎన్వోల నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో కుటుంబసభ్యులే జ్యోతిని బాత్రూంకు తీసుకెళ్లారు. అక్కడే ఆమె కింద పడిపోయింది. భర్త మంజునాథ్ తదితరులు గట్టిగా కేకలు వేసినా సిబ్బంది వెంటనే స్పందించలేదు. కొద్దిసేపటి తరువాత వచ్చిన సిబ్బంది జ్యోతిని పరీక్షించి లేబర్ వార్డుకు తరలించి సీపీఆర్ ద్వారా శ్వాసనందించే ప్రయత్నం చేశారు. జ్యోతి పరిస్థితి అర్థంగాక దిక్కుతోచని స్థితిలో ఉన్న మంజనాథ్ను బయటకు వెళ్లి ఇంజక్షన్ తీసుకురమ్మని గైనిక్ వైద్యులు, స్టాఫ్నర్సులు చెప్పారు. దీంతో అతడు పరుగెత్తుకుంటూ వెళ్లి స్థానిక సప్తగిరి సర్కిల్లోని ఓ ప్రైవేటు మందుల షాపులో రూ.170 వెచ్చించి యాంటీ బయోటిక్ ఇంజెక్షన్ తీసుకొచ్చాడు.తర్వాత జ్యోతికి సిజేరియన్ చేశారు. అప్పటికే ఆడబిడ్డ చనిపోయింది. జ్యోతిని అక్యూట్ మెడికల్ కేర్ (ఏఎంసీ) యూనిట్లో వెంటిలేటర్పై ఉంచి చికిత్స చేసినా ఫలితం లేకపోయింది. ఆమె కన్నుమూసింది. తొమ్మిదేళ్ల పాప, ఏడేళ్ల బాబు ఉన్నారని, తల్లి మృతితో వాళ్ల పరిస్థితేంటని మంజునాథ్ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.తల్లిని బతికించాలని చూశాంజ్యోతికి రక్తహీనత ఉండడంతో రెండు యూనిట్ల రక్తం అందించాం. నెలలు నిండకపోవడంతో పాటు బాత్రూంకు వెళ్లిన సమయంలో కళ్లు తిరిగి పడిందని చెప్పారు. అప్పటికే పల్స్ లేదు. తల్లిని రక్షించాలనే ఉద్దేశంతో సిజేరియన్ చేశాం. కార్డియాక్ అరెస్టు అయి ఆమె మరణించింది. – డాక్టర్ షంషాద్బేగం, హెచ్వోడీ, గైనిక్ విభాగం, అనంతపురం సర్వజనాస్పత్రి -
‘మీరు ముసలాడవ్వకూడదు’
వృద్ధాప్యం దరిచేరనివ్వకూడదంటూ ప్రచారం సాగిస్తున్న ఓ ప్రముఖ కంపెనీ సహవ్యవస్థాపకుడు బ్రయాన్ జాన్సన్ తాజాగా తాను రాసిన పుస్తకంతోపాటు ‘డోంట్ డై’ అనే కమ్యునిటీని ప్రమోట్ చేసే పనిలో పడ్డారు. ప్రతివ్యక్తి వేగంగా వృద్ధాప్యం బారిన పడకుండా జాగ్రత్తలు పాటించాలని బ్రయాన్ జాన్సన్ కోరుతుంటారు. ఈమేరకు ‘బ్లూప్రింట్’ ప్రాజెక్ట్లో భాగంగా రివర్స్ ఏజింగ్(పెద్ద వయసులోనూ యువకుడిలా కనిపించేలా)ను ప్రమోట్ చేస్తున్నారు.బ్రయాన్ జాన్సన్ ఇటీవల తాను రాసిన పుస్తకంతో పాటు ‘డోంట్ డై’ అనే కమ్యునిటీని ప్రమోట్ చేసేందుకు భారత్లో ఆన్లైన్ పుడ్ డెలివరీ సేవలందిస్తున్న జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్ను కలవనున్నట్లు సమాచారం. బ్రయాన్ జాన్సన్ వెన్మో సంస్థ సహవ్యవస్థాపకుడు. అయితే ఈయన తన కంపెనీను సుమారు రూ.6,640 కోట్లకు పేపాల్కు విక్రయించారు. ఈ డీల్తో భారీగా నగదు పోగు చేసుకున్న జాన్సన్ వైద్య నిర్ధారణలు, చికిత్సలు, తన లక్ష్యాలను సాధించడానికి కఠినమైన జీవనశైలి కోసం ఏటా 2 మిలియన్ డాలర్లు(రూ.16.6 కోట్లు) పైగా ఖర్చు చేస్తున్నారు.‘హలో ఇండియా. డోంట్ డైపై నమ్మకం ఉన్న ఏకైక వ్యక్తి పూనమ్పాండే. తనకు దాని గురించి చెప్పాను. నేను డిసెంబర్ 1-3 వరకు ముంబైలో, డిసెంబర్ 4-6 వరకు బెంగళూరులో ఉంటాను’ అంటూ జాన్సన్ తన ఎక్స్ ఖాతాలో తెలియజేస్తూ ‘మర్నామత్(చనిపోకండి)’ అనే హ్యాష్ట్యాగ్ని ఉంచారు.ఇదీ చదవండి: రూ.1.82 లక్షల కోట్ల జీఎస్టీ వసూళ్లుజాన్సన్ వృద్ధాప్య చాయలు దరిచేరకూడదని తన టీనేజ్ కుమారుడి నుంచి రక్త మార్పిడి చేసుకున్నారు. జన్యుపరమైన ఇంజెక్షన్లు చేయించుకోవడం, కఠినమైన ఆహార విధానాన్ని అనుసరించడం, రోజూ 100కి పైగా సప్లిమెంట్లను తీసుకోవడం, కఠోర వ్యాయామం.. వంటివి చేస్తూంటారు. -
కొనసాగుతున్న షియా-సున్నీల హింసాకాండ.. 122 మంది మృతి
పెషావర్: పాకిస్తాన్లో షియా-సున్నీల మధ్య ఘర్షణలు కొనసాగుతున్నాయి. కాల్పుల విరమణ ఒప్పందం అమలులో ఉన్నప్పటికీ, తాజాగా కుర్రం జిల్లాలో జరిగిన కాల్పుల్లో ఇద్దరు మృతి చెందారు. దీంతో షియా-సున్నీల హింసాత్మక ఘటనల్లో మృతుల సంఖ్య 122కి చేరింది. ఈ వివరాలను పోలీసులు, ఆస్పత్రివర్గాలు మీడియాకు తెలియజేశారు.సున్నీ- షియా వర్గాల మధ్య హింస గత వారం రోజులుగా జరుగుతోంది. తాజాగా ఈ రెండు వర్గాల మధ్య మరోసారి కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు మరణించగా, ఆరుగురు గాయపడ్డారు. ఈ హింసాకాండ అనంతరం గవర్నర్ ఫైసల్ కరీం కుండీ.. ముఖ్యమంత్రి అలీ అమీన్ గండాపూర్ను ప్రాంతాన్ని సందర్శించాలని కోరారు. నవంబర్ 21న కుర్రం జిల్లాలోని పరాచినార్ సమీపంలో ప్రయాణికులతో వెళ్తున్న వ్యాన్పై ఆకస్మిక దాడి జరిగిన తర్వాత, అలీజాయ్- బగన్ గిరిజన సమూహాల మధ్య హింస చెలరేగింది.నాడు ప్యాసింజర్ వ్యాన్పై జరిగిన దాడిలో 47 మంది మృతిచెందారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన పలువురు ప్రయాణికులు చికిత్స పొందుతూ మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 57కి చేరింది. శుక్రవారం వరకు కొనసాగిన కాల్పుల ఘటనల్లో 65 మంది మృతి చెందినట్లు పోలీసులు, ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. అంతకుముందు ప్రభుత్వం సమక్షంలో షియా- సున్నీ వర్గాల మధ్య ఏడు రోజుల కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. తరువాత దీనిని 10 రోజులకు పొడిగించించారు.ఇది కూడా చదవండి: చైనాలో జర్నలిస్ట్పై గూఢచర్యం ఆరోపణలు.. ఏడేళ్ల జైలు -
Uttar Pradesh: ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు వైద్య విద్యార్థులు మృతి
కన్నౌజ్: ఉత్తరప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కన్నౌజ్లో మంగళవారం అర్థరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు వైద్య విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. ఆగ్రా-లక్నో ఎక్స్ప్రెస్వేపై కారు అదుపు తప్పి డివైడర్ను దాటి, అటువైపు నుంచి వస్తున్న ట్రక్కును ఢీకొంది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు మృతి చెందగా, ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. మృతులంతా సైఫాయి మెడికల్ కాలేజీలో పీజీ చదువుకుంటున్న వైద్య విద్యార్థులు.మీడియాకు అందిన సమాచారం ప్రకారం లక్నోలో ఓ వివాహ వేడుకకు హాజరైన వైద్య విద్యార్థులు కారులో సైఫాయికి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. విషయం తెలియగానే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. స్కార్పియో డ్రైవర్ నిద్రమత్తులో ఉండటం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు.మృతుల్లో డాక్టర్ అనిరుధ్ వర్మ, డాక్టర్ సంతోష్ కుమార్ మౌర్య, డాక్టర్ అరుణ్ కుమార్, డాక్టర్ నార్దేవ్, మరో గుర్తు తెలియని వ్యక్తి ఉన్నారు. మొరాదాబాద్లోని బుద్ధ విహార్కు చెందిన కరణ్ సింగ్ కుమారుడు జైవీర్ సింగ్ ఈ ప్రమాదంలో గాయపడ్డారు. మృతదేహాలను ప్రస్తుతం మార్చురీలో భద్రపరిచారు.ఇది కూడా చదవండి: World Oldest Man: ప్రపంచంలోనే అత్యంత వృద్ధుడు కన్నుమూత -
పెంపుడు కుక్క మృతితో విషాదం
సేలం: కోవైలో కౌండంపాళయంకు చెందిన శరత్(30) ప్రైవేటు సంస్థలో మేనేజర్గా పని చేస్తున్నారు. ఇతని తల్లిదండ్రులు గుణశేఖరన్, కుమారి, శరత్ చెల్లెలు శృతి. వీరి ఇంట్లో 11 సంవత్సరాలుగా పమేరియన్ జాతికి చెందిన శునకం సంజూను పెంచుకుంటున్నారు. ఈ స్థితిలో శరత్ చెల్లెలు శృతికి వివాహ ఏర్పాట్లు చేపట్టారు. ఈమెకు గత 22వ తేది కోవైలో నిశ్చితార్థం జరిగింది. ఈ క్రమంలో ఇంటిలో వివాహ కార్యక్రమాలు ఉండడంతో ఇంట్లో ఉన్న కుక్కను చూసుకునే వీలు లేకపోయింది. దీంతో మేట్టుపాళయం రోడ్డలో ఉన్న జంతు ఆస్పత్రిలో ఒక రోజు మాత్రమే ఉంచి చూసుకోవాలని కోరారు. అక్కడ 21వ తేదీ ఉదయం వదిలి వెళ్లారు. ఒక్క రోజు సంజూను చూసుకోవడానికి రూ.1,200 ఇచ్చి వెళ్లారు. ఆ కుక్కను వైద్యులు సురేంద్రన్, గోపి పర్యవేక్షించడానికి తీసుకున్నారు. ఈ స్థితిలో అదే రోజు సాయంత్రం డాక్టర్లు శరత్కు ఫోన్ చేసి కుక్క అనారోగ్యంతో ఉన్నట్టు తెలిపారు. హుటాహుటిన అక్కడికి వెళ్లి చూడగా ఆ కుక్క మృతి చెందినట్టు తెలిసింది. ఈ విషయంపై శరత్ సాయిబాబా కాలనీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణ చేపట్టగా ఆస్పత్రికి వెళ్లిన శరత్ కుటుంబీకులు తాము పెంచుకున్న శునకం మృతదేహాన్ని చూసి బోరున విలపించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతున్నాయి. கோவையில், விலங்குகள் நல மருத்துவமனையில் பராமரிப்புக்காக விடப்பட்ட நாய் உயிரிழந்தது. இதனால் நாயை வளர்த்த குடும்பத்தினர் கதறி அழுதனர்.#coimbatore #dogissue pic.twitter.com/CtjCW7uPDk— Indian Express Tamil (@IeTamil) November 25, 2024 -
బీజేపీ సీనియర్ నేత కన్నుమూత
వారణాసి: యూపీకి బీజేపీ సీనియర్ నేత శ్యామ్దేవ్ రాయ్ చౌదరి కన్నుమూశారు. ఆయన వారణాసి సౌత్ సీటు నుంచి ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. శ్యామ్దేవ్ రాయ్ చౌదరి చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇటీవల యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆయనను ఆస్పత్రిలో పరామర్శించారు. ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ కూడా ఆయనకు ఫోన్ చేసి, యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఆయన మృతికి అన్ని పార్టీలు సంతాపం వ్యక్తం చేశాయి.శ్యామ్దేవ్ రాయ్ వారణాసిలోని దుర్గాకుండ్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన అంత్యక్రియలు వారణాసిలో నిర్వహించనున్నట్లు సమాచారం. నిజాయితీపరుడైన నేతగా ఆయనకు గుర్దింపు ఉంది. 2017లో ఆయన క్రియాశీలక రాజకీయాల నుంచి తప్పుకున్నారు.ఇది కూడా చదవండి: Sambhal Controversy: ‘అది మసీదు కాదు.. హరిహరుల ఆలయం’ -
గూగుల్ మ్యాప్ను గుడ్డిగా నమ్ముకుని.. ముగ్గురి మృతి
బరేలీ: గూగుల్ మ్యాప్ను గుడ్డిగా నమ్ముకున్న ముగ్గురు మృత్యువాత పడ్డారు. యూపీలోని బరేలీలో ఈ ఉదంతం చోటుచేసుకుంది. జీపీఎస్ ఫాలోచేస్తూ నిర్మాణంలో ఉన్న వంతెనపైకి వెళ్లిన ఓ కారు అమాంతం అక్కడి నుంచి కింద పడిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించారు.వివరాల్లోకి వెళితే బరేలీలో నిర్మాణంలో ఉన్న ఒక వంతెనపై నుంచి వచ్చిన ఒక కారు రాంగంగా నదిలో పడిపోయింది. దీంతో కారులో ఉన్న ముగ్గురు మృతి చెందారు. వారు గూగుల్ మ్యాప్ ఉపయోగించి నావిగేట్ అవుతూవచ్చారు. అయితే వంతెనలోని కొంత భాగం దెబ్బతిన్నట్లు సూచించడంలో గూగుల్ మ్యాప్ విఫలమైందని పీటీఐ పేర్కొంది.బరేలీ నుంచి కారులో ముగ్గురు వ్యక్తులు బదౌన్ జిల్లాలోని డాటాగంజ్ వెళ్తుండగా ఖల్పూర్-దతాగంజ్ రహదారిపై ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ఫరీద్ పూర్, బరేలీ, దాతాగంజ్ పోలీస్ స్టేషన్ల నుంచి పోలీసు బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. గతంలో వచ్చిన వరదల కారణంగా వంతెన ముందు భాగం కూలిపోయి నదిలో పడిపోయింది. అయితే ఇది జీపీఎస్లో అప్డేట్ కాలేదు. ఫలితంగానే ఈ ప్రమాదం చోటుచేసుకుంది. 3 men in a car used Google Maps, which directed them to an under-construction bridge in Bareilly, UP. Their car fell off, and all 3 died.1) Why were there no barricades at the bridge?2) Why does Google Maps direct users to incomplete routes? Is the GPS data not updated? This… pic.twitter.com/8t8qQp0FQg— Anshul Saxena (@AskAnshul) November 24, 2024కారు బ్రిడ్జిపై అప్పటికే అతివేగంతో ఉండటానికి తోడు చివరి నిమిషంలో డ్రైవర్ కూడా ఏం చేయలేకపోయాడని, దట్టమైన పొగమంచు కారణంగా డ్రైవర్ ప్రమాదాన్ని గుర్తించలేకపోయి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. మృతుల్లో ఇద్దరిని అమిత్, వివేక్లుగా పోలీసులు గుర్తించారు. వీరంతా ఫరూకాబాద్లోని ఇమాద్పూర్ వాసులని, మూడో వ్యక్తి ఎవరనేది ఇంకా తెలియరాలేదని పోలీసులు తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించిన పోలీసులు.. ఈ ప్రమాదంపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.ఇది కూడా చదవండి: Jharkhand: ఇలా గెలిచి.. అలా రాజీనామాకు సిద్ధమై.. ఏజేఎస్యూలో విచిత్ర పరిణామం -
Udupi Encounter: మావోయిస్ట్ అగ్రనేత విక్రమ్ గౌడ మృతి
ఉడిపి: కర్ణాటకలోని ఉడిపి జిల్లా కర్కల తాలూకాలోని కబ్బినలే గ్రామంలో సోమవారం రాత్రి యాంటీ నక్సల్ ఫోర్స్ (ఏఎన్ఎఫ్), మావోయిస్టుల మధ్య ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో మావోయిస్టు నేత విక్రమ్ గౌడ్ హతమయ్యాడు.సీతాంబేలు ప్రాంతంలో నిర్వహిస్తున్న యాంటీ నక్సల్స్ సెర్చ్ ఆపరేషన్లో నక్సల్స్-ఏఎన్ఎఫ్ బృందానికి మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. నక్సల్ యూనిట్ అనుమానాస్పద కార్యకలాపాలపై సమాచారం అందుకున్న ఏఎన్ఎఫ్ బృందం ఈ ఆపరేషన్ను ముమ్మరం చేసింది. మీడియాకు అందిన వివరాల ప్రకారం చిక్మగళూరు జిల్లా జయపుర పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక ఇంటిని నక్సల్ యూనిట్ సందర్శించింది. తరువాత వారు కొప్ప తాలూకాలోని యెడగుండ గ్రామంలోకి కూడా చొరబడ్డారు. అక్కడ వారు అటవీ ఆక్రమణ, కస్తూరిరంగన్ నివేదికకు సంబంధించిన అంశాలపై చర్చించారు.దీనిపై వివరాలు అందిన దరిమిలా ఏఎన్ఎఫ్ ఆ ప్రాంతంలో నక్సల్ వ్యతిరేక ఆపరేషన్ను ముమ్మరం చేసింది. సోమవారం రాత్రి ఐదుగురు మావోయిస్టులు కిరాణా సామాన్లు కొనుగోలు చేసేందుకు కబ్బినలే గ్రామంలోకి వచ్చారు. ఈ నేపధ్యంలో ఏఎన్ఎఫ్ బృందం, మావోయిస్టుల మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో మావోయిస్టు నేత విక్రమ్ గౌడ్ మృతి చెందగా, మిగిలిన మావోయిస్టులు తప్పించుకున్నారు.కర్ణాటకలో యాక్టివ్గా ఉన్న మావోయిస్టు నేతల్లో విక్రమ్ గౌడ పేరు ప్రముఖంగా వినిపిస్తుంటుంది. విక్రమ్ గౌడ్ పలు హింసాత్మక ఘటనల్లో పాల్గొన్నాడు. ఈ ఎన్కౌంటర్ తర్వాత మావోయిస్టులకు చెందిన ఇతర గ్రూపులు యాక్టివ్గా మారే అవకాశాన్ని నిరోధించేందుకు పోలీసులు ఆ ప్రాంతంలో భద్రతా ఏర్పాట్లను మరింత పటిష్టం చేశారు.ఇది కూడా చదవండి: రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి వెయ్యి రోజులు -
Gujarat: ర్యాగింగ్కు ఎంబీబీఎస్ విద్యార్థి బలి
గాంధీనగర్: విద్యాసంస్థలోని సీనియర్ల ర్యాగింగ్కు ఓ విద్యాకుసుమం నేల రాలింది. ఈ ఘటన గుజరాత్లోని ఓ మెడికల్ కళాశాలలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే అనిల్ మథానియా అనే విద్యార్థి ఈ ఏడాది ధర్పూర్ పటాన్లోని జీఎంఈఆర్ఎస్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్లో అడ్మిషన్ తీసుకున్నాడు.హాస్టల్లోని తృతీయ సంవత్సరం విద్యార్థులు అనిల్ను పరిచయం పేరిట మూడు గంటల పాటు కదలకుండా నిలబెట్టారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతసేపు నిలుచుకున్న అనిల్ అపస్మారక స్థితికి చేరుకోవడంతో తోటి విద్యార్థులు అతనిని ఆస్పత్రికి తరలించారు. బాధిత విద్యార్థి తనను సీనియర్లు మూడు గంటల పాటు నిలబెట్టారని కాలేజీ యాజమాన్యానికి తెలిపాడు. చికిత్స పొందుతూ అనిల్ మృతి చెందాడు. పోలీసులు అనిల్ మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం తరలించారు. పోస్టుమార్టం నివేదిక వచ్చాక అనిల్ మృతికి గల కారణాలు తెలుస్తాయని పోలీసులు తెలిపారు. అనిల్ బంధువు ధర్మేంద్ర మీడియాతో మాట్లాడుతూ ‘అనిల్ కుటుంబం గుజరాత్లోని సురేంద్రనగర్ జిల్లాలో ఉంటుంది. ఇది పటాన్లోని కళాశాలకు 150 కిలోమీటర్ల దూరంలో ఉంది. నిన్న మాకు కాలేజీ నుండి ఫోన్ వచ్చింది. అనిల్ అపస్మారక స్థితిలో ఉన్నాడని, అతనిని ఆస్పత్రిలో చేర్చామని తెలిపారు. తాము ఇక్కడికి చేరుకోగా, అనిల్ను మూడవ సంవత్సరం విద్యార్థులు ర్యాగింగ్ చేసారని తెలిసింది. దీనిపై వెంటనే పోలీసులు దర్యాప్తు చేసి, తమకు న్యాయం చేయాలని’ కోరారు.మెడికల్ కాలేజీ డీన్ హార్దిక్ షా మాట్లాడుతూ ‘అనిల్ అపస్మారక స్థితికి చేరుకున్నాడని గుర్తించిన వెంటనే, అతన్ని ఆస్పత్రికి తరలించాం. ఆ సమయంలో అనిల్ తనను సీనియర్లు ర్యాగింగ్ చేశారని, మూడు గంటల పాటు నిలబెట్టాడని తెలిపాడు. ఈ విషయాన్ని మేము పోలీసులు, అనిల్ కుటుంబ సభ్యులకు తెలియజేశాం. ర్యాగింగ్కు పాల్పడిన సీనియర్ విద్యార్థులపై కఠిన చర్యలు తీసుకుంటాం’ అని పేర్కొన్నారు.విద్యార్థి తండ్రి ఫిర్యాదు మేరకు ఇది ప్రమాదవశాత్తు జరిగిన మృతిగా ముందుగా కేసు నమోదు చేసినట్లు సీనియర్ పోలీసు అధికారి కెకె పాండ్యా తెలిపారు. పోస్టుమార్టం నివేదిక అందాక, దానిలోని వివరాల ఆధారంగా తదిపరి చర్యలు తీసుకుంటామన్నారు. కాలేజీలో ర్యాగింగ్పై కూడా దర్యాప్తు చేస్తున్నామన్నారు. కాగా ఉన్నత విద్యా నియంత్రణ సంస్థ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ గతంలోనే క్యాంపస్లలో ర్యాగింగ్ను నిషేధించింది. ర్యాగింగ్కు పాల్పడే వారిపై కళాశాల యాజమాన్యాలు కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది.ఇది కూడా చదవండి: స్విమ్మింగ్ పూల్లో గంతులేస్తూ.. -
బీజింగ్: స్కూలులో కత్తితో ఉన్మాది దాడి.. 8 మంది మృతి
బీజింగ్: చైనాలో మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఒక స్కూలులోకి చొరబడిన ఉన్మాది కత్తితో దాడికి తెగబడిన ఘటనలో 8 మంది మృతి చెందారు. ఇదే ఘటనలో 17 మంది గాయపడ్డారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పోలీసులు ఈ దారుణానికి పాల్పడిన నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతను నేరాన్ని అంగీకరించాడు.ఈ ఘటన తూర్పు చైనాలోని జియాంగ్సు ప్రావిన్స్లో చోటుచేసుకుంది. ఓ ఉన్మాది ఒకేషనల్ స్కూల్లోకి ప్రవేశించి, అక్కడున్నవారిని విచక్షణా రహితంగా కత్తితో పొడిచాడు. ఈ ఘటనలో ఎనిమిది మంది అక్కడికక్కడే మృతి చెందగా, మరో 17మంది గాయపడ్డారు. యిక్సింగ్ నగరంలోని వుక్సీ వొకేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ టెక్నాలజీలో ఈ దాడి జరిగింది.రాష్ట్ర వార్తా సంస్థ ‘జిన్హువా’ తెలిపిన వివరాల ప్రకారం ఈ దారుణానికి పాల్పడిన 21 ఏళ్ల నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు ఇంటర్న్షిప్ జీతంపై అసంతృప్తితో ఉన్నాడని, దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, స్కూల్లోకి ప్రవేశించి, కత్తితో దాడికి తెగబడ్డాడని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు.ఇది కూడా చదవండి: ఎన్నికల ప్రచారంలో నటుడు గోవిందాకు అస్వస్థత -
మనిషి చనిపోయాక ఏమవుతుంది? కీలక విషయాలు చెప్పిన సీనియర్ నర్సు
మనిషి మరణించిన తరువాత ఏం జరుగుతుంది? ఆత్మలున్నాయా? ఇలాంటి సందేహాలు సాధారణంగా చాలా మందికి వస్తాయి కదా. దీనిపై పురాణాల్లో ప్రస్తావనలు, సైన్స్ రచనల్లో కొన్ని కీలక విషయాలు న్నప్పటికీ అమెరికాకు చెందిన సీనియర్ నర్సు కొన్ని విషయాలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. తన కెరీర్లో అనేక మరణాలను చూసిన ఆమె, మరణం చుట్టూ కొన్ని అపోహలు, భయాల్ని తొలగించాలనే లక్ష్యంతో ఒక వ్యక్తి మరణించిన తర్వాత ఏమి జరుగుతుందనే దానిపై వెలుగులోకి తెచ్చిన అంశాలు నెట్టింట ఆసక్తికరంగా మారాయి.ఇంటెన్సివ్ కేర్లో విస్తృతమైన అనుభవం ఉన్న నర్సు జూలీ మెక్ఫాడెన్, మరణం తర్వాత సంభవించే శారీరక మార్పులపై కొన్ని విషయాలను తాజాగా వివరించింది. చనిపోవడం గురించిన సాధారణ ప్రశ్నలకు సమాధానాలిచ్చే ఉద్దేశంతో ఈమె ఒక యూట్యూబ్ ఛానెల్ని ప్రారంభించింది. ఇందులో భాగంగానే మరణం తరువాత ఏమి జరుగుతుందనే అంశంపై చేసిన వీడియో వైరల్గా మారింది. ఇది ఆరు లక్షలకు పైగా వ్యూస్ను సాధించింది.నర్స్ జూలీ అందించిన వివరాల ప్రకారం, మరణించిన వెంటనే శరీరం 'రిలాక్స్' అవుతుంది. సహజమైన రిలాక్సేషన్ ప్రక్రియకు లోనవుతుంది. మరణం తరువాత శరీరం కుళ్లిపోవడంలో ఇదే మొదటి దశ, దీనిని హైపోస్టాసిస్ అంటారు. అందుకే కొంత మందికి మూత్ర విసర్జన, ప్రేగు కదలికలు ఉండవచ్చు లేదా ముక్కు, కళ్ళు లేదా చెవుల నుండి ద్రవాలు స్రవిస్తాయి. ఆ తరువాత అన్ని కండరాలు, వ్యవస్థలు రిలాక్స్ అయిపోతాయి. శరీర ఉష్ణోగ్రత పడిపోతుందిమరణం తర్వాత ఒక్కో శరీర స్పందన భిన్నంగా ఉంటుంది. అల్గోర్ మోర్టిస్ అనే శీతలీకరణ ప్రక్రియ కొందరికి వెంటనే ప్రారంభం అవుతుంది. మరికొందరిలో ఒకటి లేదా రెండు గంటలదాకా ఆలస్యం కావచ్చు. ఈ ప్రక్రియలో సగటున, శరీర ఉష్ణోగ్రత గంటకు 1.5 డిగ్రీలు పడిపోతుంది.ఎవరికీ తెలియని విషయంనర్స్ జూలీ ప్రకారం, శరీరంలోని గురుత్వాకర్షణ కారణంగా రక్తం కింది వైపు కదలడం ప్రారంభమవుతుంది. ఇది చాలా మందికి తెలియదు. దీన్నే లివర్ మోర్టిస్ అంటారు. అలాగే సాధారణంగా మన ఆప్తులు చనిపోయిన తరువాత చాలాసేపు బాడీని ఇంట్లో ఉంచుకుంటాం. అపుడు వారి బాడీ తిప్పి చూసినా, పాదాలను గమనించినా మొత్తం ఊదారంగు లేదా నల్లగా మారిపోతుంది. దీనికి కారణం రక్తం కిందికి ప్రవహించడమే.శరీరం గట్టిపడుతుందిజీవక్రియ ప్రక్రియల ఆగిపోవడం వల్ల కండరాలు గట్టిపడతాయి. ఇది (రిగర్ మోర్టిస్) సాధారణంగా పోస్ట్మార్టం తర్వాత 2-4 గంటలలోపు ప్రారంభమవుతుంది. అయితే ఇది వివిధ భౌతికఅంశాలపై ఆధారపడి 72 గంటల వరకు కూడా సమయం పట్టవచ్చు. శరీరం బరువెక్కిపోతుంది.బాడీ చల్లగా అయిపోతుంది దాదాపు 12 గంటల తర్వాత, జీవక్రియ ఆగిపోవడంతో ఉష్ణోగ్రత నియంత్రణ ఆగిపోతుంది. వైటల్ ఎనర్జీ ప్రొడక్షన్ ఆగిపోతుంది. దీంతో బాడీ చల్లగా అయిపోతుంది. కుళ్ళిపోవడంలో చివరి దశ మొదలైనట్టు అన్నమాట. కుళ్ళిపోవడం అనేది ఒక సాధారణ భాగం. అయితే ఈ ప్రక్రియ మొదలు కాకముందే అంత్యక్రియలు జరిగిపోతాయి కాబట్టి చాలా అరుదుగా ఈ విషయాన్ని మనం గమనిస్తాం అని నర్స్ జూలీ వెల్లడించింది. -
అనుమతి లేకుండా యాంజియోప్లాస్టీ.. ఇద్దరు మృతి
అహ్మదాబాద్: గుజరాత్లోని అహ్మదాబాద్లో ఘోరం చోటుచేసుకుంది. స్థానిక ప్రైవేట్ ఆస్పత్రి వైద్యుని నిర్లక్ష్యం కారణంగా ఇద్దరు మృతి చెందారు. మీడియాకు అందిన వివరాల ప్రకారం ఆ వైద్యుడు అనుమతి లేకుండా ఏడుగురు బాధితులకు యాంజియోప్లాస్టీ నిర్వహించాడు. వీరిలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మిగిలిన ఐదుగురు ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.మీడియాకు అందిన వివరాల ప్రకారం నవంబర్ 10న గుజరాత్లోని మెహసానా జిల్లాలో ఒక ప్రైవేట్ ఆసుపత్రి యాజమాన్యం ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించింది. దీనికి 19 మంది బాధితులు హాజరయ్యారు. వీరిలో 17 మంది రోగులకు వైద్యులు యాంజియోగ్రఫీ చేశారు. ఏడుగురికి యాంజియోప్లాస్టీ చేశారు. ఈ విషయాన్ని బాధితుల కుటుంబ సభ్యులకు కూడా తెలియజేయలేదు. చికిత్స అనంతరం బాధితుల ఆరోగ్యం దిగజారింది. ఈ నేపధ్యంలో మహేశ్ గిర్ధర్ భాయ్ బరోట్, నగర్ సేన్మా అనే బాధితులు మృతిచెందారు.విషయం తెలుసుకున్న బాధితుల గ్రామస్తులు ఆస్పత్రిని ధ్వంసం చేశారు. ఘటన అనంతరం ఆస్పత్రి యాజమాన్యం పరారయ్యింది. ఆసుపత్రి డైరెక్టర్, చైర్మన్ కూడా పరారయ్యారని సమాచారం. కాగా ఆయుష్మాన్ భారత్-ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన (పీఎంజేఏవై) సొమ్మును దక్కించుకునేందుకు ఈ ప్రైవేట్ ఆసుపత్రి.. బాధితుల అంగీకారం తీసుకోకుండా ఈ విధంగా వ్యవహరిస్తున్నదని బాధిత కుటుంబ సభ్యుల ఆరోపిస్తున్నారు.ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన గుజరాత్ మెడికల్ కౌన్సిల్ అహ్మదాబాద్లోని ఖ్యాతి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రికి నోటీసులు పంపింది. ఈ ఘటనపై ఆస్పత్రి సీఈవో సహా ఐదుగురి నుంచి జీఎంసీ సమాధానాలు కోరింది. యాంజియోగ్రఫీ, యాంజియోప్లాస్టీ గురించి బాధిత కుటుంబ సభ్యులకు ఎందుకు తెలియజేయలేదని కోరింది. మరోవైపు ఈ ఘటనపై గుజరాత్ ప్రభుత్వానికి చెందిన పీఎంజేఏవై ప్రత్యేక బృందం దర్యాప్తు చేపట్టింది.ఈ పథకం కింద ఆసుపత్రికి అందాల్సిన అన్ని బకాయి చెల్లింపులను నిలిపివేసింది. కాగా గుండె సంబంధిత కరోనరీ ఆర్టరీ వ్యాధికి చికిత్సలో భాగంగా యాంజియోప్లాస్టీ చేస్తారు. ఈ వ్యాధి గుండె కండరాలకు రక్త ప్రవాహాన్ని మందగింపజేస్తుంది. ఫలితంగా రక్త నాళాలు కుచించుకుపోతాయి. ఈ చికిత్సతో కుచించుకుపోయిన ధమనులు లేదా సిరలను విస్తరించేలా చేస్తారు. ఫలితంగా కరోనరీ ధమనులకు రక్త ప్రవాహ పునరుద్ధరణ సవ్యంగా జరుగుతుంది.ఇది కూడా చదవండి: ఘనంగా శంకర నేత్రాలయ మ్యూజికల్ కాన్సర్ట్ -
AP: దారుణం.. కుక్కల దాడిలో రెండేళ్ల బాలుడి మృతి
సాక్షి,ఎన్టీఆర్జిల్లా: ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు మోడల్ కాలనీలో సోమవారం(నవంబర్ 11) దారుణం జరిగింది. రెండేళ్ల బాలుడు బాలతోటి ప్రేమ్ కుమార్ తన ఇంటి ముందు ఆడుకుంటుండగా వీధి కుక్కలు ఒక్కసారిగా దాడి చేశాయి.దాడి చేసిన తర్వాత కుక్కలు బాలుడిని పొలాల్లోకి లాక్కెళ్లాయి. కుక్కల దాడిలో తీవ్ర గాయాలు కావడంతో బాలుడిని నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందాడు. బాలుడి మృతితో పెనుగంచిప్రోలు గ్రామంలో విషాదం నెలకొంది.ఇదీ చదవండి: రంగరాయలో ర్యాగింగ్ కలకలం -
ఆ మొక్కలే ఏనుగుల మృతికి కారణం
భోపాల్: ఇటీవలి కాలంలో మధ్యప్రదేశ్లోని బాంధవ్గఢ్ అభయారణ్యంలో 10 ఏనుగులు అనుమానాస్పద స్థితిలో మృతిచెందాయి. దీనినిపై విచారణ జరిపిన అటవీశాఖ అధికారులు వీటి మృతికి ‘న్యూరోటాక్సిన్ సైక్లోపియాజోనిక్ ఆమ్లం’ కారణమని తెలిపారు. ఏనుగులకు విషం ఇవ్వడం కారణంగానే అవి మరణించాయని వస్తున్న వార్తలను ఒక అటవీశాఖ అధికారి ఖండించారు. వాటి మృతికి విషపూరితమైన మొక్కలు కారణమని స్పష్టం చేశారు.అదనపు ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ (వైల్డ్ లైఫ్) ఎల్. కృష్ణమూర్తి మాట్లాడుతూ ఏనుగులు పెద్ద మొత్తంలో ‘కోడో’ మొక్కలను తినడం వలన వాటి శరీరంలోకి విషం వ్యాపించిందని అన్నారు. అక్టోబర్ 29 బాంధవ్గఢ్ పులుల అభయారణ్యంలో నాలుగు ఏనుగులు మృతిచెందాయి. ఆ తరువాత వాటి మరణాల సంఖ్య 10కి చేరింది.ఇంత పెద్ద సంఖ్యలో ఏనుగులు చనిపోయిన దరిమిలా ప్రభుత్వం దీనిపై దర్యాప్తునకు ఒక కమిటీని నియమించింది. ఈ దర్యాప్తులో కోడో మొక్కలే ఆ ఏనుగుల మృతికి కారణమై ఉండవచ్చని తేలింది. కాగా ఏనుగుల మృతి గురించి తెలిసిన మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ వెంటనే స్పందించారు. ఏనుగుల మరణాలను నివారించడం, మానవులపై వాటి దాడులను ఆపడం అనే లక్ష్యంతో దీర్ఘకాలిక ప్రణాళికను రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు.ఇది కూడా చదవండి: ప్లీజ్... ఇంకో బిడ్డను కనవచ్చు కదా! -
టీఎంసీ నేత దారుణ హత్య.. ఐదుగురు అరెస్ట్
బీర్భూమ్: పశ్చిమ బెంగాల్లో మరోదారుణం చోటుచేసుకుంది. బీర్భూమ్ జిల్లాలో తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ)కి చెందిన నేత హత్యకు గురయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బోల్పూర్ పట్టణ సమీపంలోని పరుల్దంగా వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది.టీఎంసీ నేత సమీర్ తాండర్ (40) తన ఇంటికి తిరిగి వస్తుండగా కొందరు వ్యక్తులు అతనిపై దాడి చేశారు. సమీర్ తాండర్ కంకలితల పంచాయతీ సభ్యునిగా ఉన్నారు. దాడిలో తీవ్రంగా గాయపడిన ఆయన బుర్ద్వాన్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ, మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. సమీర్ తాండార్ కుమారుడు ప్రతీక్ తాండర్ మాట్లాడుతూ గ్రామస్తులు కొందరు తన తండ్రిపై దాడి చేశారని, వెంటనే తన తండ్రిని ఆసుపత్రిలో చేర్పించినా ప్రయోజనం లేకపోయిందన్నారు.గ్రామంలో తలెత్తిన గొడవల కారణంగానే తాండర్పై దాడి జరిగివుండవచ్చని తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వికాస్ రాయ్ చౌదరి పేర్కొన్నారు. ఈ ఘటనపై వెంటనే విచారణ చేపట్టి, నిందితులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కాగా ఈ దాడిలో ప్రమేయం ఉన్న ఐదుగురు నిందితులను అరెస్టు చేసి, విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు.ఇది కూడా చదవండి: అమెరికా నుంచి లారెన్స్బిష్ణోయ్ తమ్ముడి బెదిరింపులు -
బ్యాటరీలు, బ్లేడ్లు సహా పొట్టలో 56 వస్తువులు
హథ్రాస్(యూపీ): వాచీ బ్యాటరీలు, బ్లేడ్లు, మేకులు ఇలా ఇంట్లో కనిపించే చిన్నపాటి వస్తువులన్నీ 15 ఏళ్ల బాలుడి కడుపులో కనిపించేసరికి ఢిల్లీ సఫ్దర్జంగ్ ఆస్పత్రి వైద్యులు అవాక్కయ్యారు. వెంటనే పెద్ద శస్త్రచికిత్స చేసి అన్నింటినీ బయటకు తీశారు. అయితే ఆ తర్వాతి రోజు బాలుడి గుండెవేగం విపరీతంగా పెరిగి, రక్తపోటు తగ్గి అనూహ్యంగా ప్రాణాలు కోల్పోయారు. వివరాలను బాలుడి తండ్రి సంచిత్ శర్మ మీడియాతో చెబుతూ వాపోయారు. ఉత్తరప్రదేశ్లోని హాథ్రాస్ పట్టణంలోని రత్నగర్భ కాలనీలో సంచిత్ కుటుంబం ఉంటోంది. అతనికి 9వ తరగతి చదివే 15 ఏళ్ల కుమారుడు ఆదిత్య శర్మ ఉన్నాడు. గత కొద్ది రోజులుగా కడుపు నొప్పితో బాధపడుతుండటంతో హాథ్రాస్ ఆస్పత్రిలో చూపించారు. తర్వాత జైపూర్ ఆస్పత్రిలో చూపించారు. కొద్దిరోజుల ట్రీట్మెంట్ తర్వాత ఇంటికొచి్చనా రోగం మళ్లీ తిరగబెట్టింది. తర్వాత అలీగఢ్లో శ్వాససంబంధ సర్జరీ తర్వాత కూడా ఎలాంటి మార్పు రాలేదు. తర్వాత అక్టోబర్ 26న అలీగఢ్లో అ్రల్టాసౌండ్ పరీక్ష చేయగా 19 చిన్నపాటి వస్తువులు కడుపులో ఉన్నట్లు గుర్తించారు. నోయిడాలో చికిత్స చేయించుకోవాలని వైద్యులు సూచించారు. నోయిడా వైద్యుల పరీక్షలో 56 వస్తువులు ఉన్నట్లు బయటపడింది. తర్వాత ఢిల్లీలోని సఫ్డర్జంగ్ ఆస్పత్రిలో అక్టోబర్ 27న టీనేజర్కు శస్త్రచికిత్స చేసి అన్నింటినీ బయటకుతీశారు. ఇన్ని వస్తువులు తెలీసో తెలీకో మింగినా నోటికిగానీ, గొంతుకుగానీ ఎలాంటి గాయలు లేకపోవడం చూసి వైద్యులు ఆశ్చర్యం వ్యక్తంచేశారు. సర్జరీ చేసిన ఒక రోజు తర్వాత టీనేజర్ మరణంపై ఆస్పత్రి వర్గాలు ఎలాంటి వివరణ ఇవ్వలేదు. -
దాడిలో భర్త మృతి.. గర్భిణి భార్య చేత బెడ్ శుభ్రం చేయించి..
దిండోరి: మధ్యప్రదేశ్లోని దిండోరిలో మానవత్వం మంటగలిగిన ఉదంతం చోటుచేసుకుంది. దాడిలో ఒక యువకుడు మృతి చెందగా, పుట్టెడు దు:ఖంలో మునిగిన అతని భార్యకు ఆస్పత్రిలో ఘోర అవమానం ఎదురయ్యింది. ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు వైరల్గా మారాయి. ఈ ఉదంతం దిండోరి జిల్లాలోని గడసరాయ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లాల్పూర్ గ్రామంలో చోటుచేసుకుంది.వివరాల్లోకి వెళితే లాల్పూర్ గ్రామంలో చోటుచేసుకున్న భూ వివాదం రక్తాపాతానికి దారితీసింది. భూవివాదం కారణంగా ఓ వర్గం ఒక కుటుంబ సభ్యులపై పదునైన ఆయుధాలతో దాడికి తెగబడింది. ఆ కుటుంబ పెద్దతో పాటు అతని ముగ్గురు కుమారులపై నిందితులు దాడి చేశారు. ఈ దాడిలో వృద్ధ తండ్రితో పాటు అతని ముగ్గురు కుమారుల్లో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు.బాధిత కుటుంబానికి చెందిన సోదరులు శివరాజ్, రామరాజ్ పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని స్థానికులు గడసరాయ్లోని ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అయితే శివరాజ్ ఆరోగ్య కేంద్రంలోని మంచంపై చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన అనంతరం శివరాజ్ భార్య తన భర్త మృతిచెందిన బెడ్పై ఉన్న రక్తపు మరకలను శుభ్రం చేసింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షం అయ్యాయి. దీంతో జిల్లా వైద్య యంత్రాంగంలో కలకలం చెలరేగింది. దీనిని తీవ్రంగా పరిగణించిన ఉన్నత వైద్యాధికారులు సదరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని వైద్యునితో పాటు సిబ్బందికి షోకాజ్ నోటీసు జారీ చేశారు. ఇది కూడా చదవండి: నేడు గంగోత్రి.. రేపు యమునోత్రి మూసివేత -
అగ్ని ప్రమాదం.. ముగ్గురు చిన్నారులు సజీవ దహనం
హౌరా: పశ్చిమ బెంగాల్లోని హౌరాలో దీపావళి వేళ పెను ప్రమాదం చోటుచేసుకుంది. బాణసంచా కాలుస్తున్న సమయంలో ఓ ఇంట్లో మంటలు చెలరేగాయి. చూస్తుండగానే మంటలు ఇంటినంతా చుట్టుముట్టాయి. ఈ సమయంలో ఇంట్లో ఉన్న ముగ్గురు చిన్నారులు మంటల్లో చిక్కుకుని సజీవదహనమయ్యారు. ఈ ఘటనలో ఓ మహిళ, చిన్నారి కూడా గాయపడ్డారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం హౌరాలోని ఉల్బీరియా ప్రాంతంలో శుక్రవారం బాణాసంచా కాలుస్తున్న సమయంలో ఓ ఇంట్లో మంటలు చెలరేగాయి. ఈ మంటలు పక్కనే ఉన్న దుకాణానికి కూడా అంటుకున్నాయి. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకునే సరికే ముగ్గురు చిన్నారులు తీవ్రంగా కాలిపోయి మృతి చెందారు. ఉలుబేరియా మున్సిపాలిటీలోని వార్డు నంబర్ 27లో ఈ ఘటన చోటుచేసుకుందని పోలీసు అధికారి ఒకరు తెలిపారు.ఈ ప్రాంతానికి చెందిన చిన్నారులు బాణసంచా కాలుస్తుండగా నిప్పురవ్వలు పక్కనే ఉన్న బాణసంచా సామగ్రిపై పడటంతో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు చిన్నారులు మృతి చెందగా, తీవ్రంగా గాయపడిన ఇద్దరు బాధితుల పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. మృతులను తానియా మిస్త్రీ, ఇషాన్ ధార, ముంతాజ్ ఖాతూన్లుగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ఇది కూడా చదవండి: సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్కు బాంబు బెదిరింపు -
అనుమానాస్పద రీతిలో 'కంగువ' ఎడిటర్ మృతి
సూర్య హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'కంగువ'. భారీ బడ్జెట్తో తీసిన ఈ చిత్రాన్ని నవంబర్ 14న థియేటర్లలోకి తీసుకురానున్నారు. ఇంతలో విషాదం జరిగిపోయింది. ఈ సినిమాకు పనిచేసిన ఎడిటర్ నిషాద్ యూసఫ్ (43).. అనుమానాస్పద రీతిలో చనిపోయి కనిపించాడు. ఇప్పుడీ వార్త అందరినీ షాక్కి గురిచేస్తోంది.(ఇదీ చదవండి: నా ఉద్దేశం అదికాదు.. 'బిగ్బాస్ 8' వివాదంపై మెహబూబ్ వీడియో)కేరళకు చెందిన నిషాద్ యూసఫ్.. ఎడిటర్గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తల్లుమలా, ఉండా, వన్, సౌదీ వెళ్లక్క, అడియోస్ అమిగోస్ తదితర చిత్రాలకు పనిచేశాడు. ఇవన్నీ గత రెండు మూడేళ్లలోనే రిలీజయ్యాయి. నిషాద్ పనిచేసిన లేటెస్ట్ మూవీ 'కంగువ'. ఇంతలో ఇలా మృతి చెందడంపై తమిళ, మలయాళ చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది.బుధవారం వేకువజామున 2 గంటలకు నిషాద్ మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు. కొచ్చిలోని పనంపిల్లి నగర్లోని తన అపార్ట్మెంట్ శవమై కనిపించాడు. మృతికి కారణాలు ఇంకా తెలిసిరాలేదు. ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఏదేమైనా మరో 15 రోజుల్లో సినిమా రిలీజ్ పెట్టుకుని.. ఇలా ఎడిటర్ చనిపోవడం 'కంగువ' టీమ్కి కూడా షాకే.(ఇదీ చదవండి: టాలీవుడ్ సీనియర్ నిర్మాత కన్నుమూత) -
హృదయ విదారకం: కుమారుడి మృతదేహం పక్కనే మూడురోజులుగా..!
సాక్షి,నాగోలు : హైదరాబాద్లోని నాగోలులో పోలీసులను కంటతడి పెట్టించే హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. మూడు రోజుల క్రితం కుమారుడు చనిపోయినా అంధ వృద్ధ తల్లిదండ్రులు గుర్తించకపోవడం కలచి వేస్తుంది. నాగోలు పోలీసుల కథనం ప్రకారం.. నాగోలులో అంధుల కాలనీలో కలువ రమణ, శాంతికుమారి దంపతులు నివసిస్తున్నారు. వారి చిన్న కుమారుడు ప్రమోద్(32) పెయింటింగ్ పనిచేస్తుంటాడు. మూడు రోజుల క్రితం ప్రమోద్ మద్యం మత్తులో మరణించారు.అయితే కుమారుడు మరణించిన విషయాన్ని తల్లిదండ్రులు గుర్తించ లేకపోయారు. ఓ వైపు ఆకలి.. మరోవైపు కుమారుడు చనిపోయిన విషయాన్ని గుర్తించ లేక మూడు రోజుల పాటు ఏం చేయాలో పాలుపోక అలాగే ఉండిపోయారు. మూడు రోజుల త్వరాత ఇంటి నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు నాగోలు పోలీసులకు సమాచారం అందించారు.స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న నాగోలు సీఐ సూర్యనాయక్, ఎస్ఐ శివనాగప్రసాద్లు మానవత్వం చాటుకున్నారు. ఇంట్లో కుళ్లిన స్థితిలో మృతదేహం ఉండగా.. మంచంపై తల్లిని, కొద్ది దూరంలో తండ్రిని గుర్తించి కన్నీటి పర్యంతమయ్యారు. ఇంట్లో ఉన్న దంపతుల్ని మాట్లాడించే ప్రయత్నం చేసినా ఆహారం తీసుకోకపోవడంతో ఇద్దరూ మాట్లాడలేకపోతున్నారు. వెంటనే వాళ్లిద్దరిని ఇంట్లో నుంచి బయటకు తీసుకువచ్చారు. దంపతులకు స్నానం చేయించారు. ఆహారం,మంచినీళ్లు అందించారు.అనంతరం, వారి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. -
ఆర్మీ శునకం ‘ఫాంటమ్’ ఇకలేదు
అఖ్నూర్: జమ్ముకశ్మీర్లోని అఖ్నూర్లో జరిగిన ఎన్కౌంటర్లో భద్రతా దళాలు ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చాయి. అసన్ సమీపంలో ఆర్మీ కాన్వాయ్పై ఉగ్రవాదులు కాల్పులు జరిపిన నేపధ్యంలో భారత ఆర్మీ శునకం ‘ఫాంటమ్’ ప్రాణాలు కోల్పోయింది. ఫాంటమ్ బెల్జియన్ మాలినోయిస్ జాతికి చెందిన శునకం. అది 2020, మే 25న జన్మించింది. ‘మా నిజమైన హీరో, ధైర్యవంతుడైన ఇండియన్ ఆర్మీ డాగ్, ఫాంటమ్ చేసిన అత్యున్నత త్యాగానికి మేము వందనం చేస్తున్నాం’ అని భారత ఆర్మీ పేర్కొంది.కాల్పుల అనంతరం ఉగ్రవాదులు అటవీ ప్రాంతంలోకి పారిపోయారని అధికారులు తెలిపారు. ఆ ప్రాంతాన్ని సైన్యం చుట్టుముట్టి సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్న సమయంలో ‘ఫాంటమ్’కి శత్రువుల బుల్లెట్లు తగిలాయి.కే9 యూనిట్కి చెందిన శునకాలలో ఫాంటమ్ ఒకటి. ఇది ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలలో పోరాడేందుకు శిక్షణ పొందిన శునకం. మీరట్లోని రీమౌంట్ వెటర్నరీ కార్ప్స్ నుండి ఈ శునకాన్ని తీసుకువచ్చారు. ఈ శునకం 2022, ఆగస్ట్ 12 నుంచి అసాల్ట్ డాగ్ యూనిట్లో ఉంది.UpdateWe salute the supreme sacrifice of our true hero—a valiant #IndianArmy Dog, #Phantom.As our troops were closing in on the trapped terrorists, #Phantom drew enemy fire, sustaining fatal injuries. His courage, loyalty, and dedication will never be forgotten. In the… pic.twitter.com/XhTQtFQFJg— White Knight Corps (@Whiteknight_IA) October 28, 2024ఈ సందర్భంగా జమ్మూ డిఫెన్స్ పీఆర్ఓ మాట్లాడుతూ, ‘మా శునకం ఫాంటమ్ చేసిన అత్యున్నత త్యాగానికి వందనం చేస్తున్నాం. మన సైనికులు ఉగ్రవాదులను సమీపిస్తున్నప్పుడు, ఫాంటమ్ శత్రువుల కాల్పులకు గురయ్యింది. దీంతో అది తీవ్రంగా గాయపడి ప్రాణాలొదిలింది. దాని ధైర్యం, విధేయత, అంకితభావం ఎప్పటికీ మర్చిపోలేం’ అని అన్నారు.ఇది కూడా చదవండి: రోడ్డు ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్న కేరళ సీఎం -
మెక్సికోలో ఘోర రోడ్డు ప్రమాదం.. 19 మంది మృతి
మెక్సికో సిటీ: మెక్సికోలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో 19 మంది మృతి చెందారు. మెక్సికోలోని సెంట్రల్ స్టేట్ జకాటెకాస్లోని హైవేపై ఒక బస్సు ప్రమాదానికి గురైందని స్థానిక అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో 19 మంది అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఆరుగురికి గాయాలయ్యాయి. ప్రయాణికులతో వెళుతున్నఈ బస్సు మక్కా వెళుతున్న ట్రాక్టర్ను వెనుక నుంచి ఢీకొంది. వెంటనే బస్సు, ట్రాక్టర్ రెండూ కాలువలో పడిపోయాయి.జకాటెకాస్ గవర్నర్ డేవిడ్ మాన్రియల్ తొలుత ఈ ప్రమాదంలో 24 మంది మృతిచెందారని తెలిపారు. అయితే రాష్ట్ర అటార్నీ జనరల్ కార్యాలయం తరువాత ఒక ప్రకటనలో మృతుల సంఖ్యను సవరించింది. ఈ ఘటనలో 19 మంది మరణించారని, ఆరుగురు గాయపడ్డారని స్పష్టం చేసింది.స్థానిక ప్రభుత్వ అధికారి ఒకరు మాట్లాడుతూ ప్రమాదం దరిమిలా కాలువలో నుంచి మృతదేహాలను వెలికితీసేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. అటార్నీ జనరల్ కార్యాలయం తెలిపిన వివరాల ప్రకారం ప్రమాదానికి గురైన బస్సు యూఎస్-మెక్సికో సరిహద్దులోని చివావా రాష్ట్రంలోని క్యూడాడ్ జువార్జ్ అనే నగరానికి వెళుతోంది. ఇది కూడా చదవండి: ఈసారి 33 విమానాలకు బెదిరింపులు -
ఏనుగుతో సెల్ఫీకి యత్నం..యువకుడి దుర్మరణం
నాగ్పూర్: సెల్ఫీ సరదా మరో నిండు ప్రాణం తీసింది. 23 ఏళ్ల ఓ యువకుడు ఏకంగా ఏనుగుతో అడవిలో సెల్ఫీ తీసుకునే సాహసం చేశాడు. ఇంకేముంది ఆ అడవి గజరాజుకు కోపం కట్టలు తెంచుకుది. శశికాంత్ రామచంద్ర అనే ఆ యువకుడిని తొండంతో కొట్టి కిందపడేసి కాళ్ల కింద తొక్కి నలిపేసింది. దీంతో అతడు అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ హృదయవిదారక ఘటన మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలోని అటవీ ప్రాంతంలో గురువారం(అక్టోబర్ 24) జరిగింది. శశికాంత్ అతని స్నేహితులతో కలిసి అడవిలో కేబుల్ వేసే పని కోసం వెళ్లాడు. ఫారెస్ట్ సిబ్బంది ఎంత చెబుతున్నా వినకుండా ఏనుగులుండే ప్రదేశానికి వెళ్లి దానితో ఆటలాడి ప్రాణాలు కోల్పోయాడు. శశికాంత్ స్వస్థలం మహారాష్ట్రలోని చంద్రపూర్.ఇదీ చదవండి: ప్రాణం తీసిన సెల్ఫ్ డ్రైవింగ్ కార్ -
బీరూట్పై ఇజ్రాయెల్ భీకర దాడి.. 12 మంది మృతి
బీరూట్: లెబనాన్లోని ఉగ్రవాద సంస్థ హెజ్బొల్లా స్థావరాలను ఇజ్రాయెల్ టార్గెట్ చేసుకుంటోంది. తాజాగా ఇజ్రాయెల్ వైమానిక దళం బీరుట్తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో భీకర దాడులు చేసింది. ఈ దాడుల్లో 12 మందికి పైగా జనం మృతిచెందారు. అలాగే లెబనాన్లోని ప్రభుత్వ ఆస్పత్రికి భారీ నష్టం వాటిల్లింది.ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో మరో 57 మంది గాయపడ్డారని లెబనాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. దక్షిణ బీరుట్ శివార్లలోని రఫిక్ హరిరి యూనివర్శిటీ హాస్పిటల్ సమీపంలోని పలు భవనాలు ఈ దాడిలో ధ్వంసమయ్యాయి. హెజ్బొల్లా స్థావరాలపై దాడి చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం స్పష్టంగా తెలియజేయలేదు. మరోవైపు హెజ్బొల్లా కూడా సెంట్రల్ ఇజ్రాయెల్లోకి పలు రాకెట్లను వదలడం ద్వారా ప్రతీకారం తీర్చుకుంది. అయితే ఈ దాడులతో ఎలాంటి నష్టం వాటిల్లలేదని తెలుస్తోంది.గాజా కాల్పుల విరమణ చర్చలను పునఃప్రారంభించే లక్ష్యంతో అమెరికా విదేశాంగ మంత్రి ఆంథోనీ బ్లింకెన్ ఇక్కడకు చేరుకోవడానికి కొన్ని గంటల ముందు ఈ దాడి జరిగింది. ఇదిలావుండగా ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు మాట్లాడుతూ.. హమాస్ను మట్టుబెట్టి, అక్కడ బందీలుగా ఉన్న ప్రజలను విడిపిస్తామని హామీ ఇచ్చారు. మరోవైపు పాలస్తీనా ఖైదీల విడుదలకు బదులుగా మాత్రమే వారి బందీలను విడుదల చేస్తామని హమాస్ ప్రకటించింది.గత ఏడాది అక్టోబర్ 7న హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్పై దాడి చేశారు. ఈ ఉగ్రదాడిలో దాదాపు 1,200 మంది మరణించగా, 250 మంది జాడ తెలియరాలేదు. అప్పటి నుండి ఇజ్రాయెల్ వరుసగా హమాస్ స్థానాలపై దాడి చేస్తూవస్తోంది. గాజాలో ఇజ్రాయెల్ ఎదురుదాడిలో 42 వేల మందికి పైగా పాలస్తీనియన్లు మృతిచెందారని స్థానిక ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. ఈ యుద్ధంతో గాజాలో చాలా ప్రాంతం ధ్వంసమైంది. అక్కడి జనాభాలో 90 శాతం మంది ఇతర ప్రాంతాలకు తరలివెళ్లారు.ఇది కూడా చదవండి: నస్రల్లా వారసుడు హషేమ్ సఫీద్దీన్ హతం: ఇజ్రాయెల్ -
ప్రాణం తీసిన సెల్ఫీ సరదా.. ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు మృతి
కృష్ణాజిల్లా గన్నవరం మండలం మాదలవారిగూడెంలో విషాదం చోటు చేసుకుంది. సెల్ఫీ మోజు కాలేజీ విద్యార్థుల ప్రాణం తీసింది. లింగయాస్ ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన ఏడుగురు ఇంజినీరింగ్ విద్యార్ధులు వారంతం సెలవు కావడంతో స్నానం చేసేందుకు స్థానికంగా ఉన్న చెరువులోకి దిగారు. అనంతరం సెల్ఫీలు తీసుకుంటున్న క్రమంలో జారి నీటిలో పడిపోయారు. ఈత వచ్చినా.. నీటి ఉద్ధృతికి ఈదలేక కొట్టుకుపోయారు. అయినప్పటికీ ఐదుగురు విద్యార్థులు సురక్షితంగా ఒడ్డుకు రాగా.. ఇద్దరు విద్యార్థులు పాలడుగు దుర్గారావు , జె.వెంకటేష్లు ప్రాణాలు కోల్పోయారు.ఈ దుర్ఘటనపై సమాచారం అందుకున్న తల్లిదండ్రులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కుమారులు మృతితో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఘటన జరిగినా తమకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని లింగయాస్ కాలేజ్ యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
ప్రొఫెసర్ సాయిబాబా మృతిపై మావోయిస్టుల సంతాపం
సాక్షి,హైదరాబాద్: ప్రొఫెసర్ సాయిబాబా మృతిపై మావోయిస్టు పార్టీ సంతాపం ప్రకటించింది. ఈ మేరకు మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి మంగళవారం( అక్టోబర్ 15) ఒక ప్రకటన విడుదల చేశారు. ‘బడుగు బలహీన వర్గాల గొంతును సాయిబాబా వినిపించాడు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో సాయిబాబా కీలక పాత్ర పోషించాడు.జైలులో సుదీర్ఘకాలం దుర్భర పరిస్థితులను సాయిబాబా అనుభవించాడు. జైలులో ఉన్న పరిస్థితుల కారణంగానే సాయిబాబా ఆరోగ్యం క్షీణించింది. సాయిబాబా మృతికి ప్రభుత్వాలే బాధ్యత వహించాలి’అని జగన్ పేర్కొన్నారు. కాగా, ప్రొఫెసర్ సాయిబాబా ఇటీవలే హైదరాబాద్లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఇదీ చదవండి: ప్రొఫెసర్ సాయిబాబాకు కన్నీటి వీడ్కోలు -
బ్రెజిల్లో తుపాను బీభత్సం.. ఏడుగురు మృతి
సావోపాలో: బ్రెజిల్లోని సావోపాలోను తాకిన భారీ తుపాను బీభత్సం సృష్టించింది. తుఫాను కారణంగా సంభవించిన వివిధ ప్రమాదాల్లో ఏడుగురు మృతి చెందారు. గంటకు 67 మైళ్ల (108 కిలోమీటర్లు) వేగంతో దూసుకొచ్చిన తుఫాను కారణంగా పలుచోట్ల చెట్లు నేలకూలాయని, కొన్ని ప్రాంతాలకు తీవ్ర నష్టం వాటిల్లిందని సావోపాలో అధికారులు తెలిపారు.తుపాను తీవ్రతకు పలుచోట్ల కార్లు, ఇతర వాహనాలు నీటిలో కొట్టుకుపోయాయి. తుఫాను కారణంగా దేశంలోని పలు విమానాశ్రయాలను మూసివేశారు. అనేక ప్రాంతాల్లో తాగునీటికి అంతరాయం ఏర్పడింది. వేలాది ఇళ్లు అంధకారంలో మగ్గుతున్నాయి. సావోపాలో మహానగరంలో 2 కోట్ల 10 లక్షల మంది తుపానుకు ప్రభావితమయ్యారు. ఇది కూడా చదవండి: సాహస యాత్రల్లో దిట్ట,, అనంతపురం నివాసి సమీరా -
105 ఏళ్లు బతుకుతానని చెప్పింది!
వాన రాకడ... ప్రాణం పోకడ ఎవరూ చెప్పలేరంటారు. అయితే టెక్నాలజీ మారిపోయింది. ఫలానా సమయంలో.. ఫలానా చోట.. ఇంత మొత్తంలో వర్షం పడుతుందని కూడా చెప్పేయ గలుగుతున్నాం. మరి చావు సంగతి? రోజుల్లో పోతారనుకున్న వాళ్లు నిక్షేపంగా ఏళ్లు గడిపేయడం మనం చూశాం. అలాగే రాయిలా దిట్టంగా ఉన్నవాళ్లు ఉన్నట్టుండి కుప్పకూలిన వైనాలూ మనకు తెలుసు. అందుకే మరణాన్ని అంచనా వేయడం ఇప్పటికీ కష్టమే. కానీ.. మీ వివరాలు నాకివ్వండి.. మీరెంత కాలం బతుకుతారో చెప్పేస్తానంటోంది ఓ కృత్రిమమేధ సాఫ్ట్వేర్. ఆసక్తికరమైన ఆ వివరాలేమిటో చూసేద్దామా...!!!ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా కృత్రిమమేధ సంచలనాల వార్తలే. అడిగిన ప్రశ్నకు తడుముకోకుండా జవాబులు చెప్పడమే కాదు.. ఆఫీసుల్లో, ఫ్యాక్టరీల్లో, ఆసుపత్రుల్లో.. ఇలా అన్నిచోట్ల మనిషి పనిని మరింత సులువు చేసేస్తోంది ఈ కృత్రిమమేధ. ఆఖరకు మనం ఎంత కాలం బతుకుతామో చెప్పగలిగే స్థితికి చేరింది. నిజానికి చిరాయుష్షు.. అది కూడా ఆరోగ్యవంతమైన జీవితం అన్నది మనిషి యుగాలుగా కంటున్న కల. వైద్యులను అడిగితే, లేదా హెల్త్ వెబ్సైట్లు చూస్తే.... మంచి ఆహారం తీసుకోండి.. వ్యాయామం చేయండి. చెడు అలవాట్లకు దూరంగా ఉండండి ఎక్కువ కాలం బతుకుతారని తెలుస్తుంది. ఇలా కాకుండా... ప్రస్తుతం మనం ఎలా ఉన్నామో అలాగే ఉంటే.. అవే అలవాట్లు, ఆహారాన్ని కొనసాగిస్తే ఎంత కాలం బతుకుతామో ‘డెత్ క్లాక్’ వెబ్సైట్ (కథనం చివరలో లింక్ ఉంది) చెబుతుంది. మీరు చేయాల్సిందిల్లా సింపుల్. వెబ్సైట్లోకి ప్రవేశించి వివరాలు ఇవ్వడమే. డెత్ క్లాక్ వెబ్సైట్ను తెరవగానే... ‘‘నేను ఎప్పుడు చచ్చిపోతాను? అని మీరెప్పుడైనా ప్రశ్నించుకున్నారా’’ అని కనిపిస్తుంది. కిందనే.. మీ ఆయుష్షు తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అన్న టీజింగ్ ప్రశ్న కూడా కనిపిస్తుంది. దాని కింద...మీ పుట్టిన రోజు, స్త్రీ/పురుషుడు అన్న వివరం, ధూమపానం చేస్తారా? అన్న ప్రశ్నతోపాటు మరికొన్ని అనుబంధ ప్రశ్నలు ఉంటాయి. అన్నింటి వివరాలు ఇచ్చేస్తే... కృత్రిమమేధ సాయం రంగంలోకి దిగుతుంది. మీరిచ్చిన వివరాల ఆధారంగా ఆయుష్షును లెక్కకడుతుంది.ఇంకెందుకు ఆలస్యం.. మీరూ ట్రై చేయండి మరి..లింక్.. (నోట్: ఇది కేవలం సరదా కోసం ఉద్దేశించింది మాత్రమే. ఇది కచ్చితంగా వాస్తవంగా జరుగుతుందని ఏమీ లేదు. మరణ తేదీని కచ్చితంగా చెప్పలేమని వెబ్సైట్ నిర్వాహకులు కూడా స్పష్టం చేసిన విషయాన్ని గమనించగలరు. ఇప్పటివరకూ ఈ వెబ్సైట్ ద్వారా ఆయుష్షును అంచనా వేసుకున్న వారి సంఖ్య.. 60,039,306)-జి.గోపాలకృష్ణ మయ్యా -
చిన్న వయసు.. ముసలి శరీరం.. ఇకలేదు
అమితాబ్ నటించిన బాలీవుడ్ సినిమా ‘పా’ గుర్తుండేవుంటుంది. అందులో అమితాబ్ అత్యంత అరుదైన జన్యు సంబంధిత వ్యాధి ప్రొజెరియాతో బాధపడుతుంటాడు. ఈ వ్యాధి సోకిన చిన్నారులకు బాల్యంలోని వృద్ధాప్య ఛాయలు రావడంతో పాటు ఆ లక్షణాలు కూడా వచ్చి మరణిస్తుంటారు. ‘పా’ సినిమా వచ్చిన తరువాత చాలామందికి ఈ వ్యాధిపై అవగాహన ఏర్పడింది. ఇదే వ్యాధితో సుదీర్ఘ కాలం జీవించిన ‘సమ్మీ బస్సో’ తన 28వ ఏట కన్నుమూశాడు. ‘సమ్మీ బస్సో’ అరుదైన జన్యు వ్యాధి ‘ప్రొజెరియా’తో బాధపడుతూ ఎక్కువ కాలం జీవించిన వ్యక్తిగా రికార్డులకెక్కాడు. ఈ వ్యాధి సోకిన చిన్నారులు తమ రెండేళ్ల వయసు నుంచే వృద్ధాప్యానికి చేరుకుంటారు. మీడియాకు అందిన వివరాల ప్రకారం ‘సమ్మీ బస్సో’ తన 28వ ఏట కన్నుమూశాడు. ప్రొజెరియాను హచిన్సన్-గిల్ఫోర్డ్ సిండ్రోమ్ లేదా హెచ్జిపిఎస్ అని కూడా పిలుస్తారు. ప్రొజెరియా వ్యాధి సోకినప్పుడు చిన్నారులు వయసు మీద పడినట్లు కనిపిస్తారు, ప్రొజెరియా బారిన పడినవారి ఆయుర్ధాయం గరిష్టంగా 13.5 ఏళ్లు మాత్రమే ఉంటుంది.ఈ వ్యాధి ప్రతి ఎనిమిది మిలియన్ల మందిలో ఒకరిని ప్రభావితం చేస్తుంది . అంటే ప్రపంచవ్యాప్తంగా ప్రతి 20 మిలియన్లలో ఒకరిని బాధిస్తుంది. 1995లో ఇటలీలోని వెనెటోలో జన్మించిన సమ్మీ బస్సోకు రెండేళ్ల వయసులో ప్రొజెరియా ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఈ నేపధ్యంలో అతని తల్లిదండ్రులు ఇటాలియన్ ప్రొజెరియా అసోసియేషన్ను స్థాపించారు. నేషనల్ జియోగ్రాఫిక్ డాక్యుమెంటరీలో సమ్మీ బస్సో జీవితాన్ని చూపించిన నేపధ్యంలో ప్రొజెరియా వ్యాధి అంటే సమ్మీ బస్సో గుర్తుకు వచ్చేలా చేసింది.సమ్మీ బస్సో స్నేహితులలో ఒకరైన రికార్డో అతని మరణాంతరం తన ఆవేదనను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ‘ఈ రోజు మా ఇంటి దీపం ఆరిపోయింది. నీ అద్భుతమైన జీవితంలో మమ్మల్ని భాగస్వాములను చేసినందుకు ధన్యవాదాలు సమ్మీ ’ అంటూ ఆమె తన ఇన్స్టాగ్రామ్ పేజీలో రాశారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం ప్రపంచవ్యాప్తంగా క్లాసిక్ ప్రొజెరియా కేసులు 130 మాత్రమే నమోదయ్యాయి. వాటిలో నాలుగు ఇటలీలో ఉన్నాయి.ఇది కూడా చదవండి: హమాస్ చీఫ్ బతికే ఉన్నాడు: ఇజ్రాయెల్ మీడియా -
ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్ 40 మంది మృతి
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: మావోయిస్టు పార్టీకి వార్షికోత్సవాల వేళ గట్టి ఎదురుదెబ్బ తగి లింది. ఛత్తీస్గఢ్లో జరిగిన భారీ ఎన్కౌంటర్లో 40 మంది మావోయిస్టు అగ్రనేతలు, దళ సభ్యులు చనిపోయినట్టు రాష్ట్ర ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయ్ ప్రకటించారు. ఛత్తీస్గఢ్లోని నారాయణపూర్–దంతెవాడ జిల్లాల సరిహద్దులో శుక్రవారం మధ్యాహ్నం 12:30 గంటలకు మొదలైన ఎదురుకాల్పులు రాత్రి 9 గంటల వరకు కొనసాగుతూనే ఉన్నాయి.ఈ ఘటనలో మరణించిన 40 మందిలో తెలంగాణకు చెందిన సీనియర్ నేతలు నలుగురు ఉన్నట్టు తెలుస్తోంది. ఘటనా స్థలంలో పెద్ద ఎత్తున ఆయుధాలు, పేలుడు పదార్థాలను పోలీసులు స్వా«దీనం చేసుకున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం ఈ ఎన్కౌంటర్లో పోలీసులకు, భద్రతా దళాలకు ఎటువంటి నష్టం వాటిల్లలేదు. ఈ భారీ ఎన్కౌంటర్తో సౌత్ అబూజ్మడ్తో పాటు నార్త్ బస్తర్ మావోయిస్టు కమిటీలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయని పోలీసులు ప్రకటించారు. భారీ బలగాలతో ఆపరేషన్ భారత కమ్యూనిస్టు పార్టీ(మావోయిస్టు) ఏర్పాటై 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సెప్టెంబర్ 21 నుంచి అక్టోబర్ 20 వరకు వార్షికోత్సవాలు నిర్వహించాలని పార్టీ నాయకత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో దంతెవాడ జిల్లా బస్రూర్, నారాయణపూర్ జిల్లా ఓర్చా పోలీస్ స్టేషన్ల నడుమ గోవల్, నెందూర్, తుల్త్లీ గ్రామాల సమీపంలో మావోయిస్టు అగ్రనేతలు సమావేశమైనట్లు గురువారం మధ్యాహ్నం పోలీసులకు సమాచారం అందింది. దీంతో సీఆర్పీఎఫ్, జిల్లా రిజర్వ్ గార్డ్స్, బీఎస్ఎఫ్, కోబ్రా, ఎస్టీఎఫ్ విభాగాలకు చెందిన 1,500 మంది జవాన్లు ఆపరేషన్ ప్రారంభించారు.శుక్రవారం మధ్యాహ్నం ఇరువర్గాల మధ్య ఎదురు కాల్పులు మొదలయ్యాయి. సాయంత్రం 4 గంటల సమయానికి ఏడుగురు మావోయిస్టులు చనిపోయినట్టుగా బయటకు సమాచారం అందింది. రాత్రి వరకు కాల్పులు కొనసాగుతూనే ఉన్నాయి. దీంతో గంటగంటకు మృతుల సంఖ్య పెరుగుతూ వచి్చంది. రాత్రి 9 గంటల సమయానికి 36 మంది మావోయిస్టులు మరణించినట్లు తెలిసింది. భద్రతా దళాల ఘన విజయం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతంగా బస్తర్ ఏరియా ఉంది. ఇక్కడ ఏడు జిల్లాలు ఉండగా సుక్మా, బీజాపూర్, దంతేవాడ, బస్తర్ జిల్లాలను దండకారణ్యంగా.. కాంకేర్, నారాయణపూర్, కొండగావ్ జిల్లాలు పూర్తిగా, బీజాపూర్, దంతేవాడ జిల్లాలో కొంత భాగాన్ని అబూజ్మడ్గా పిలుస్తారు. ఆపరేషన్ గ్రీన్హంట్ మొదలయ్యాక దండకారణ్య ప్రాంతంలోనే మావోయిస్టులు, పోలీసుల ఘర్షణలు చోటుచేసుకున్నాయి. మావోయిస్టు పార్టీ అగ్రనేతలు ఇక్కడే ఉన్నట్టగా ప్రచారం సాగుతోంది. శుక్రవారం అబూజ్మడ్లో ఇంద్రావతి నది పరివాహక ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఏకంగా 36 మంది మావోయిస్టులు చనిపోవడం కామ్రేడ్లకు గట్టి ఎదురుదెబ్బగా, భద్రతా దళాల ఘన విజయంగా చెప్పుకోవచ్చు. మృతుల్లో.... అర్ధరాత్రి వరకు అందిన సమాచారం ప్రకారం ఎన్కౌంటర్లో తూర్పు బస్తర్ డివిజన్కు చెందిన అగ్రశ్రేణి నక్సలైట్ డీవీసీఎం నీతి అలియాస్ ఊరి్మళ, కొప్పే, ఎస్జెడ్సీఎం రామకృష్ణ కమలేశ్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో నీతి స్వస్థలం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా ఈరంగూడ గంగులూరు. ఇక రామకృష్ణది ఏపీలోని ఉమ్మడి కృష్ణా జిల్లా పెనమలూరు మండలం తమ్ముల రోడ్డు పాలంకి. -
రోడ్డు ప్రమాదం.. తొమ్మిదిమంది మృతి
మైహార్: మధ్యప్రదేశ్లోని మైహార్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో నిండిన ఒక బస్సు రోడ్డు పక్కనే నిలిపివుంచిన ఉన్న హైవా వాహనాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో నాలుగేళ్ల చిన్నారితో సహా తొమ్మదిమింది మృతిచెందారు. 24 మంది గాయపడ్డారు.ఈ ఘటనలో గాయపడిన వారిని మైహర్, అమర్పతన్, సత్నా జిల్లా ఆసుపత్రులకు తరలించారు. 30వ నెంబరు జాతీయ రహదారిపై ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదానికి గురైన బస్సు ప్రయాగ్రాజ్ నుంచి రేవా మీదుగా నాగ్పూర్ వెళుతోంది. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం ప్రమాదం జరిగిన సమయంలో బస్సు వేగంగా వెళుతోంది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం 53 సీట్లున్న ఈ బస్సులో 45 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రమాదం సమాచారం అందిన వెంటనే, నాదన్, మైహార్ పోలీసులు ఎస్డిఎం వికాస్ సింగ్, తహసీల్దార్ జితేంద్ర సింగ్ పటేల్, ఎస్పీ సుధీర్ కుమార్ అగర్వాల్ సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో బస్సు పూర్తిగా ధ్వంసమైంది. జేసీబీ, గ్యాస్ కట్టర్ సహాయంతో బస్సు డోర్ కట్ చేసి, ప్రయాణికులను బయటకు తీసుకువచ్చారు. ప్రయాణికుల్లోని కొందరు కిటికీలో నుంచి బయటకు దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇది కూడా చదవండి: జమ్ముకశ్మీర్లో ఎన్కౌంటర్.. ఒక పోలీసు వీరమరణం -
హెజ్బొల్లా వారసుడు హషీం?
ఎడతెరిపి లేకుండా ఇజ్రాయెల్ చేస్తున్న ప్రతీకార దాడుల ధాటికి లెబనాన్ ఉగ్రవాద సంస్థ హెజ్బొల్లా కకావికలవుతోంది. ముఖ్యంగా అగ్ర నాయకత్వమంతా దాదాపుగా తుడిచిపెట్టుకుపోయింది ముందు సంస్థ ఆపరేషన్స్ చీఫ్ ఇబ్రహీం అకీల్, తర్వాత టాప్ కమాండర్ ఫౌద్ షుక్ర్. ఇప్పుడు తాజాగా ఏకంగా సంస్థ అధినేత నస్రల్లా. ఇలా ఒకరి తర్వాత ఒకరుగా అగ్ర నేతలందరినీ రోజుల వ్యవధిలోనే మట్టుపెట్టింది ఇజ్రాయెల్. శుక్రవారం నాటి దాడుల్లో నస్రల్లాతో పాటు కనీసం మరో ఇద్దరు అగ్ర నేతలు కూడా మరణించారు. దాంతో హెజ్బొల్లాలో నాయకత్వ సంక్షోభం తలెత్తింది. మూడు దశాబ్దాల పైచిలుకు సారథ్యంలో సంస్థను తిరుగులేని సాయుధ శక్తిగా మార్చిన ఘనత నస్రల్లాది. ఆయన మృతితో ఇప్పుడు ఇజ్రాయెల్ నుంచి ఎదురవుతున్న పెను దాడులను కాచుకుంటూ కష్టకాలంలో సంస్థను ముందుండి నడిపేది ఎవరన్నది పెద్ద ప్రశ్నగా మారింది. కొత్త సారథిగా నస్రల్లాకు వరుసకు సోదరుడయ్యే హషీం సైఫుద్దీన్ పేరు గట్టిగా వినిపిస్తోంది. ద టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్లో ఇప్పటికే ఈ మేరకు కథనం కూడా వెలువడింది. హషీం ప్రస్తుతం హెజ్బొల్లా రాజకీయ వ్యవహారాల చీఫ్గా ఉన్నాడు. శుక్రవారం నాటి హెజ్బొల్లా ప్రధాన కార్యాలయంపై ఇజ్రాయెల్ లక్షిత దాడుల్లో అతను కూడా మరణించినట్టు తొలుత వార్తలొచి్చనా అదేమీ లేదని విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ రాయిటర్స్ తదితర వార్తా సంస్థలు తేల్చాయి. హషీం ప్రస్తుతం హెజ్బొల్లా రాజకీయ వ్యవహారాలు చూడటమే గాక సంస్థ జిహాద్ కౌన్సిల్లో కీలక సభ్యుడు కూడా. 2017 లోనే అమెరికా అతన్ని ఉగ్రవాదిగా ప్రకటించింది. పైగా హెజ్బొల్లాకు కొమ్ముకాసే ఇరాన్తో అతనికి అతి సన్నిహిత సంబంధాలున్నాయి. 2020లో అమెరికా మట్టుపెట్టిన ఇరాన్ సైనిక జనరల్ ఖాసీం సులేమానీ కూతురు జైనబ్కు హషీం మామ అవుతాడు. నస్రల్లా మాదిరిగానే ఇతను కూడా మతాధికారే. తలపాగతో అచ్చం నస్రల్లాను తలపిస్తాడు. 1964లో దక్షిణ లెబనాన్లో పుట్టాడు. 1990ల్లో ఇరాన్ లో ఉన్నత చదువులు చదువుతుండగానే హెజ్బొల్లా అతన్ని వెనక్కు పిలిపించింది. తర్వాత ఏడాదికే నస్రల్లా హెజ్బొల్లా్ల చీఫ్ అయ్యాడు. రెండేళ్లకే హషీం సంస్థ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సార థి అయ్యాడు. నాటినుంచే నస్రల్లా వారసునిగానూ గుర్తింపు పొందుతూ వస్తున్నాడు. విద్యా వ్యవస్థ, ఆర్థిక వ్యవహారాలు తదితరాలు చూసుకుంటున్నాడు. మారిన పరిస్థితుల్లో హెజ్బొల్లాకు సారథి కావాలంటే సంస్థ ఇతర అగ్ర నేతలతో పాటు ఇరాన్ మద్దతునూ హషీం కూడగట్టుకోవాల్సి ఉంటుందని అంటున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Hassan Nasrallah: అరబ్బుల హీరో
హెజ్బొల్లా గ్రూప్నకు సుదీర్ఘకాలం సారథ్యం వహించిన షేక్ హసన్ నస్రల్లా ప్రస్థానం ముగిసిపోయింది. నిరుపేద కుటుంబంలో జని్మంచి, ఉన్నత స్థాయికి చేరుకొని, లక్షల మందిని అభిమానులుగా మార్చుకున్న నస్రల్లా మరణం హెజ్బొల్లాకు తీరని నష్టమే అని చెప్పొచ్చు. ఆయన 1960 ఆగస్టు 31న ఉత్తర లెబనాన్లో షియా ముస్లిం కుటుంబంలో జని్మంచారు. కూరగాయలు విక్రయించే నస్రల్లా తండ్రికి మొత్తం 9 మంది సంతానం. అందరిలో పెద్దవాడు నస్రల్లా. ఆయన బాల్యం తూర్పు బీరూట్లో గడిచింది. మత విద్య అభ్యసించారు. చిన్నప్పటి నుంచే మత గ్రంథాలు విపరీతంగా చదివేవారు. తనకు కావాల్సిన పుస్తకాల కోసం సెకండ్–హ్యాండ్ బుక్ షాపుల్లో గాలించేవారు. షియా పండితుడు మూసా అల్–సదర్ను ఆరాధించేవారు. రాజకీయాలపై, షియా వర్గం సంక్షేమంపై నస్రల్లాకు చిన్నప్పుడే ఆసక్తి ఏర్పడింది. తమవాళ్ల కోసం పోరాటం చేయాలని నిర్ణయించుకున్నారు. 32 ఏళ్లకే నాయకత్వ బాధ్యతలు 1975లో అంతర్యుద్ధ సమయంలో నస్రల్లా కుటుంబం దక్షిణ లెబనాన్కు తరలివచి్చంది. ఆయన 1989లో ఇరాన్లోని నజఫ్ సిటీలో కొంతకాలం మత సిద్ధాంతాలు అభ్యసించారు. లెబనాన్కు తిరిగివచ్చి 16 ఏళ్ల వయసులో షియా రాజకీయ, పారామిలటరీ గ్రూప్ అయిన అమల్ మూవ్మెంట్లో చేరారు. ఆ సంస్థలో చురుగ్గా పనిచేశారు. పాలస్తీనియన్ లిబరేషన్ ఆర్గనైజేషన్(పీఎల్ఓ)ను అంతం చేయడానికి 1980లో లెబనాన్పై ఇజ్రాయెల్ దాడి చేసింది. ఈ దాడిలో పీఎల్ఓకు భారీ నష్టం వాటిల్లింది. ప్రతీకారమే లక్ష్యంగా ఇజ్రాయెల్ నిఘా సంస్థ కార్యాలయంపై షియా ఇస్లామిక్వాదులు దాడికి దిగారు. ఈ ఘటనలో చాలామంది ఇజ్రాయెల్ అధికారులు మరణించారు. అనంతరం షియా ఇస్లామిక్వాదులతో హెజ్బొల్లా గ్రూప్ ఏర్పాటైంది. ఈ సంస్థ ఏర్పాటు వెనుక సయ్యద్ అబ్బాస్ ముసావీతోపాటు నస్రల్లా కీలక పాత్ర పోషించారు. 1992లో ఇజ్రాయెల్ దాడిలో ముసావీ మరణించారు. దీంతో 32 ఏళ్ల వయసులో హెజ్బొల్లా నాయకత్వ బాధ్యతలను నస్రల్లా స్వీకరించారు. హెజ్బొల్లా శక్తివంతమైన సంస్థగా తీర్చిదిద్దారు. లెబనాన్ సైన్యం కంటే హెజ్బొల్లా పవర్ఫుల్ అనడంలో అతిశయోక్తి లేదు. మధ్యప్రాచ్యంలోని అరబ్ దేశాల్లో నస్రల్లా పలుకుబడి అమాంతం పెరిగిపోయింది. హెజ్బొల్లాకు ఇరాన్ ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలిచింది. ఆయుధాలు, డబ్బు అందజేసింది. హమాస్తోపాటు మధ్యప్రాచర్యంలోని పలు ఉగ్రవాద సంస్థలకు హెజ్బొల్లా శిక్షణ ఇచి్చంది. సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ పాలుపంచుకుంది. ఇజ్రాయెల్కు బద్ధ శత్రువు ఇజ్రాయెల్పై నస్రల్లా అలుపెరగని పోరాటం సాగించారు. పూర్తి అంకితభావంతో పనిచేశారు. 2000 సంవత్సరం నాటికల్లా దక్షిణ లెబనాన్ నుంచి ఇజ్రాయెల్ సేనలను తరిమికొట్టారు. అరబ్ ప్రపంచానికి ఒక ఐకాన్గా మారారు. 1997లో ఇజ్రాయెల్ సైన్యం చేసిన దాడిలో నస్రల్లా కుమారుడు హదీ మరణించాడు. 1997లో హెజ్బొల్లాను ఉగ్రవాద సంస్థగా అమెరికా ప్రకటించింది. 2006లో ఇజ్రాయెల్పై హెచ్బొల్లా సాగించిన యుద్ధం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. లెబనాన్లో 34 రోజులపాటు జరిగిన ఈ యుద్ధంలో ఇజ్రాయెల్ ఓడిపోయింది. నస్రల్లాను పలు దేశాలు హీరో అంటూ కీర్తించాయి. తమకు కంటిమీద కునుకు లేకుండా చేసిన నస్రల్లాను ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకుంది. గత 20 ఏళ్లలో ఆయన చాలా అరుదుగానే బహిరంగంగా కనిపించారు. టీవీ, రేడియో ద్వారా తన అనుచరులకు సందేశం చేరవేసేవారు. ఇజ్రాయెల్ ఏ క్షణమైనా దాడిచేసే ప్రమాదం ఉందన్న ఉద్దేశంతో నస్రల్లా ఎక్కువగా అండర్ గ్రౌండ్ బంకర్లలోనే ఉండేవారు. ఇజ్రాయెల్తోపాటు అమెరికాను నస్రల్లా తమ బద్ధ శత్రువుగా ప్రకటించారు. క్యాన్సర్ లాంటి ఇజ్రాయెల్ను సమూలంగా నాశనం చేయాలని తన అనుచరులకు పిలుపునిచ్చారు. నస్రల్లా వేషధారణ షియా మత బోధకుడిలాగే ఉండేది. వేలాది మంది హెజ్బొల్లా సాయుధులను ముందుకు నడిపించే నాయకుడంటే నమ్మడం కష్టం. ఉర్రూతలూగించే ప్రసంగాలకు ఆయన పెట్టిందిపేరు. హెజ్బొల్లాను రాజకీయ శక్తిగా కూడా మార్చారు. 2005లో లెబనాన్ పార్లమెంటరీ ఎన్నికల్లో హెజ్బొల్లా పోటీ చేసింది. రెండు సీట్లు గెలుచుకుంది. అంతేకాదు మంత్రివర్గంలో సైతం హెజ్బొల్లా చేరిందంటే నస్రల్లా చాతుర్యం అర్థం చేసుకోవచ్చు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్..ముగ్గురు మావోయిస్టులు మృతి
రాయ్పూర్:ఛత్తీస్గఢ్లోని నారాయణపూర్జిల్లా అబూజ్మడ్ అడవుల్లో సోమవారం(సెప్టెంబర్23) పోలీసులు,మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. వీరిలో ఇద్దరు పురుషులు కాగా ఒక మహిళా మావోయిస్టున్నట్లు గుర్తించారు.ఘటనాస్థలం నుంచి మూడు మృతదేహాలతో పాటు ఒక ఏకే 47,ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.ఎన్కౌంటర్ కొనసాగుతున్నట్లు సమాచారం. -
Death of Debbie Wolfe: డెబ్బీ వూల్ఫ్
‘రేయ్ కెవిన్! కొంచెం కారు వేగంగా పోనీరా ప్లీజ్?’ వణుకుతున్న స్వరంతో చెప్పాడు జాన్. అదే మాట కారు ఎక్కినప్పటి నుంచి చెబుతూనే ఉన్నాడు. వెనుకే కూర్చున్న జెన్నీ.. ఏడుపుని కంట్రోల్ చేసుకుంటూ, ‘జాన్! కంగారుపడొద్దు. కెవిన్ ఇప్పటికే స్పీడ్గా వెళ్తున్నాడు. తనని తొందరపెట్టకు’ అంది సముదాయింపుగా. వెంటనే కెవిన్ కారు నడుపుతూనే పక్కనే కూర్చున్న జాన్ చేతిని భరోసాగా పట్టుకుని, ‘రేయ్ జాన్! మన డెబ్బీకేం కాదురా, నువ్వు భయపడకు. దగ్గరకి వచ్చేశాం. ఇంకో పది నిమిషాలంతే!’ అన్నాడు ధైర్యాన్నిస్తూ. కారు ఆపగానే, ముందు నుంచి జాన్, వెనుక నుంచి జెన్నీ వేగంగా కారు దిగి, ‘డెబ్బీ.. డెబ్బీ!’ అని అరుస్తూ, తెరిచి ఉన్న తలుపులను క్షణం పాటు చూసి లోపలికి పరుగు తీశారు. కారు శబ్దానికి కుక్కలన్నీ గుమిగూడి అరవడం మొదలుపెట్టాయి. వచ్చిన వాళ్లను గుర్తుపట్టి కాస్త శాంతించాయి. అప్పుడు సరిగ్గా సాయంత్రం 4 కావస్తోంది. కారు పార్క్ చేసిన కెవిన్కి వాకి ట్లో ఖాళీ మందు బాటిల్స్ చెల్లాచెదురుగా పడి ఉండటం వింతగా అనిపించింది. ఎందుకంటే డెబ్బీ తన ఇంటి పరిసరాలను ఎప్పుడూ నీట్గా ఉంచుకుంటుంది.ఇంట్లో ఎక్కడా డెబ్బీ కనిపించలేదు. కిచెన్లో ఆమె యూనిఫామ్ పడుంది. మంచం కిందకు పర్స్ విసిరేసినట్లుంది. కుక్కలకు ఆహారం అందక నకనకలాడుతున్నాయి. ఆమె కారు పార్కింగ్ ప్లేస్లో కాకుండా, వేరే చోట ఉంది. అన్నింటికంటే ముఖ్యంగా డెబ్బీ ల్యాండ్ఫోన్ ఆన్సరింగ్ మెషిన్కొచ్చిన ఓ వాయిస్ మెసేజ్లోని మగ గొంతు.. ఆ ముగ్గురినీ బాగా భయపెట్టేసింది. ‘డెబ్బీ నీకేమైంది? చాలారోజుల నుంచి ఎందుకు నువ్వు డ్యూటీకి రావడం లేదు?’ అనేది దాని సారాంశం. నిజానికి ఆ ముగ్గురూ అక్కడికి వచ్చే గంట ముందే డెబ్బీ కోసం ఆమె పనిచేసే ఆసుపత్రికి వెళ్లారు. ‘నిన్న 4 గంటలకు డ్యూటీలోంచి వెళ్లిన డెబ్బీ, ఈరోజు డ్యూటీకి రాలేదు. ఫోన్కి స్పందించలేదు’ అని అక్కడివారు చెప్పడంతోనే వారు కంగారుగా డెబ్బీ ఇంటికి వచ్చారు. అంటే ఆ వాయిస్లో ఏదో కుట్ర దాగుందని వారికి అర్థమైంది. సుమారు 35 గంటలుగా డెబ్బీ నుంచి ఆ కుటుంబానికి ఎలాంటి అప్డేట్స్ లేవు. వెంటనే పోలీసులను ఆశ్రయిస్తే సరిగ్గా స్పందించలేదు. వేరే దారిలేక మర్నాడు డెబ్బీ ఇంటి ముందు చెరువుని తమ శక్తి మేరకు తనిఖీ చే శారు. సమీపంలో నివసించేవారిని ఆరా తీశారు. ఎక్కడా ఏ సమాచారం దొరకడం లేదు. ఇంటి ముందు చెరువు, చుట్టూ విశాలమైన స్థలంతో చక్కటి వాతావరణం మ«ధ్యనున్న ఆ ఇల్లంటే డెబ్బీకి చాలా ఇష్టం. కోరుకున్నట్లే ఆ ఇంట్లో ఒంటరిగా ఉంటూ చాలా రకాల కుక్కల్ని పెంచుకునేది. ఆవే ఆమెను సెక్యూరిటీగా కాపాడేవి. ‘ఫాయెట్విల్లే వెటరన్స్ అడ్మినిస్ట్రేషన్ హాస్పిటల్’లో నర్స్గా పనిచేస్తున్న డెబ్బీ వూల్ఫ్కి 28 ఏళ్లు. చాలా అందగత్తె. ఎప్పుడూ యాక్టివ్గా ఉండేది. కన్నవారంటే ప్రాణం. ఏ పని చేసినా వారికి చెప్పకుండా చేసేదే కాదు. రోజూ ఉదయం, సాయంత్రం వారికి ఫోన్ చేసేది. జాన్, జన్నీలే కాదు ఫ్యామిలీ ఫ్రెండ్ కెవిన్ అంటే కూడా ఆమెకు చాలా ఇష్టం. డెబ్బీ మిస్ అయిన ఐదు రోజులకు పోలీసులు.. విచారణ మొదలుపెట్టారు. అయినా జెన్నీ, జాన్, కెవిన్ మాత్రం డెబ్బీ కోసం తమ ప్రయత్నాలు ఆపలేదు. డెబ్బీ కనిపించకుండా పోయిన ఆరో రోజున కెవిన్, గోర్డాన్ అనే మరో వ్యక్తితో కలసి డెబ్బీ ఇంటి చుట్టూ క్లూ కోసం క్షుణంగా వెతుకుతున్నాడు. ఇంటికి కాస్త దూరంలో బురద నేలపై రెండుజతల పాదముద్రలు చెరువు వైపు నడిచినట్లుగా కనిపించాయి. వాటిని అనుసరించి చెరువు లోపలికి చూస్తే, పెద్ద గ్రిల్ పీపాలో మృతదేహం ఉన్నట్లు కనిపించింది. వెంటనే సమాచారం పోలీసులకు చేరింది. కాసేపటికి వారు చెరువులో అదే స్పాట్ నుంచి డెబ్బీ మృతదేహాన్ని బయటికి తీయించారు. అయితే పీపాలాంటిదేమీ చెరువులో దొరకలేదని, డెబ్బీ ఒంటి మీదున్న జాకెట్ నీటిలో తేలడాన్ని చూసి కెవిన్ వాళ్లు పొరబడి ఉంటారని పోలీసులు చెప్పారు. చెరువు నీళ్లు అపరిశుభ్రంగా ఉండగా, పోస్ట్ మార్టమ్లో డెబ్బీ మృతికి మంచి నీళ్లు కారణమని తేలింది. అయినా పోలీసులు.. ‘కుక్కలతో ఆడుకుంటూ డెబ్బీ ప్రమాదవశాత్తు చెరువులో పడి చనిపోయింది’ అని కేసు మూసేశారు. అయితే డెబ్బీ ఇంటి సమీపంలో ఉండే ఒక ఇంట్లోని పీపా మిస్ అయ్యిందని జెన్నీ తన విచారణలో గుర్తించింది. పీపా చాలాకాలం అక్కడే ఉన్న ఆనవాలును ఆమె కళ్లారా చూసిందట. అంటే కెవిన్, గోర్డాన్లు ఆ రోజు చెరువులో పీపా చూడటం నిజమేనని జెన్నీకి నమ్మకం కలిగింది.కేసు కొట్టేసిన కొన్ని నెలలకు డెబ్బీ మృతదేహంపై లభించిన దుస్తులు, వస్తువులు పేరెంట్స్కి అందాయి. అయితే ఆ దుస్తులు డెబ్బీ సైజ్ కంటే చాలా పెద్దవని, అవి అసలు డెబ్బీ దుస్తులే కావని పేరెంట్స్ మళ్లీ కోర్టుకెక్కారు. పైగా మృతదేహానికి వేసిన షూస్ మగవారికి చెందినవని న్యాయపోరాటం మొదలుపెట్టారు. దాంతో ఈసారి అధికారులు.. డెబ్బీ పనిచేసే ఆసుపత్రిలో ఇద్దరు అనుమానాస్పద వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించారు. నిజానికి ఆ ఇద్దరూ డెబ్బీ ప్రేమ కోసం తపించినవారే, ఆమె వెంటపడినవారే, ఆమెని వేధించినవారే! ఆమె ఇల్లు ఎక్కడో తెలుసున్నవారే! వారిలో ఒకడు డెబ్బీ ఫోన్ నంబర్ కనిపెట్టి మరీ కాల్స్ చేసి ఇబ్బంది పెట్టేవాడట! పైగా అతడు డెబ్బీ సహోద్యోగి కావడంతో డెబ్బీ ఫోన్కి ఫేక్ వాయిస్ మెసేజ్ పంపించింది అతడేనని నమ్మి, ఆ దిశగా కూడా విచారించారు. కానీ ఏ క్లూ దొరకలేదు.నార్త్ కరోలినా, ఫాయెట్విల్లేకి 7 మైళ్ల దూరంలో ఒంటరిగా నివసించే డెబ్బీ 1985 డిసెంబరు 26 సాయంత్రం 4 గంటలకు ఆసుపత్రి డ్యూటీ నుంచి వెళ్లి ఇక తిరిగి రాలేదు. సరిగ్గా ఆరు రోజులకు తన ఇంటి ముందున్న చెరువులో శవమై తేలింది. ఈ కేసును నేటికీ పరిష్కరించలేదు. న్యాయపోరాటం చేసిన జాన్, జెన్నీ, కెవిన్ అనారోగ్య సమస్యలతో ఒకరి తర్వాత ఒకరు కన్నుమూశారు. డెబ్బీని ఇంటికి వచ్చి ఎత్తుకెళ్లారా? ఇంటి ముందు ఖాళీ మందు సీసాలు ఎవరు వేశారు? ఆమె మిస్ అయినరోజే ఫేక్ వాయిస్ మెసేజ్ ఎవరు పంపారు? ఇలా ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు లేవు. దాంతో ఈ ఉదంతం నేటికీ మిస్టరీగానే మిగిలిపోయింది.∙సంహిత నిమ్మన -
గాడిద మృతితో గందరగోళం.. 65 మందిపై కేసు నమోదు
బక్సర్: బీహార్లోని బక్సర్ జిల్లాలో విచిత్ర ఉదంతం చోటుచేసుకుంది. ఒక గాడిద మృతి అనంతరం గందరగోళం చెలరేగింది. ఇది పోలీసుల వరకూ చేరడంతో వారు ఈ ఘటనలో ప్రమేయం ఉన్న 65 మందిపై కేసు నమోదు చేశారు.మీడియాకు అందిన వివరాల ప్రకారం జిల్లాలోని కేసత్ బ్లాక్లో విద్యుదాఘాతం కారణంగా గాడిద మృతి చెందింది. దీంతో ఆ ప్రాంతంలోనివారు ఆందోళనకు దిగి, విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగించారు. ఈ దరిమిలా పోలీసులు 65 మందిపై కేసు నమోదు చేశారు. ఈ కేసు గురించి బక్సర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శుభమ్ ఆర్య మీడియాకు తెలియజేస్తూ సంఘటన జరిగిన వెంటనే చకోడా పవర్ గ్రిడ్ స్టేషన్కు చేరుకున్న పలువురు గ్రామస్తులు మృతిచెందిన గాడిదకు సంబంధించిన పరిహారం వెంటనే ఇప్పించాలని డిమాండ్ చేశారు. కొందరు గ్రామస్తులు పవర్ గ్రిడ్ కార్యాలయంలోకి ప్రవేశించి, ఆ ప్రాంతానికి విద్యుత్ సరఫరాను నిలిపివేశారు.అనంతరం ప్రభుత్వ ఉద్యోగుల పనులకు ఆటంకం కలిగించారు. దీనిపై స్పందించిన రాష్ట్ర విద్యుత్ శాఖ సీనియర్ అధికారి పోలీసులకు గ్రామస్తులపై ఫిర్యాదు చేశారు. మూడు గంటల పాటు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగించిన 65 మంది గ్రామస్తులపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు ఎస్పీ తెలిపారు. ఈ ఘటనపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.ఇది కూడా చదవండి: ట్యాంకర్ను మింగేసిన భారీ గుంత.. చూస్తుండగానే ఒక్కసారిగా.. -
ఉద్యోగి అంత్యక్రియలకు వెళ్లని యాజమాన్యం.. కంపెనీపై తీవ్ర విమర్శలు
పూణేకి చెందిన ‘ఎర్నెస్ట్ అండ్ యంగ్ ఇండియా’(ఈవై) కంపెనీలో పనిచేస్తున్న చార్టెడ్ అకౌంటెంట్ (26) అన్నా సెబాస్టియన్ పెరియాలి మృతి సర్వత్రా చర్చనీయాంశమైంది. మరణం తర్వాత ఆమె అంత్యక్రియల్లో పాల్గొనేందుకు సంస్థ తరుపున ఒక్క ప్రతినిధి కూడా పాల్గొనకపోవడం, రేయింబవళ్లు పని భారం మోపడం వల్లే తన కుమార్తె మరణించిందని బాధితురాలి తల్లి ఆరోపిస్తోంది.ఇది మన సంస్కృతికి పూర్తి విరుద్ధంఅయితే అన్నా మరణంపై నెటిజన్లు ఈవై సంస్థ ఛైర్మన్ రాజీవ్ మెమానీ స్పందించారు. తన ఉద్యోగి అంత్యక్రియలకు హాజరు కాకపోవడంపై లింక్డిన్ వేదికగా విచారం వ్యక్తం చేశారు. అన్నా కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. వారి జీవితంలో అన్నా లేని వెలితిని ఎవరూ తీర్చలేరు. ఆమె అంత్యక్రియలకు మేము హాజరు కాలేకపోయినందుకు చింతిస్తున్నాను. ఇది మన సంస్కృతికి పూర్తి విరుద్ధం. ఇది గతంలో ఎన్నడూ జరగలేదు.. ఇంకెప్పుడూ జరగదు’అని అన్నారు. ఈ సందర్భంగా సామరస్య పూర్వకమైన ఆఫీస్ వాతావరణాన్ని ఉద్యోగులకు అందించేందుకు తాను కట్టుబడి ఉన్నానని, లక్ష్యం నెరవేరే వరకు విశ్రమించబోనని ఉద్ఘాటించారు.ఇదీ చదవండి : 100 రోజుల్లో సూపర్ సిక్సూ లేదు.. సెవెనూ లేదు : వైఎస్ జగన్సంస్థ తీరు దారుణంఈ ఏడాది మార్చిలో ఈవైలో చేరిన అన్నా సెబాస్టియన్ పెరియాలి మరణించారు. పని ఒత్తిడి కారణంగా తన కుమార్తె మరణించినట్లు తల్లి అనితా అగస్టిన్ కంపెనీకి బహిరంగ లేఖ రాశారు. ఆ లేఖలో తన కుమార్తె అంత్యక్రియలకు కంపెనీ నుంచి ఎవరూ హాజరు కాలేదని అగస్టిన్ పేర్కొన్నారు. ఆమె అంత్యక్రియల తర్వాత, నేను ఆమె నిర్వాహకులను సంప్రదించాను. కానీ నాకు యాజమాన్యం నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. విలువలు,మానవ హక్కుల గురించి మాట్లాడే ఒక సంస్థ ఉద్యోగి మరణిస్తే అంత్యక్రియల్లో పాల్గొనకపోవడం దారుణమని అన్నారు. పని ఒత్తిడి ఆరోపణల్ని ఖండించిన మెమోనీకాగా, ఈవైలో పని ఒత్తిడి కారణంగా అన్నా మరణించిందనే తల్లి చేసిన ఆరోపణలపై రాజీవ్ మెమానీ ఖండించారు. దీంతో మెమానీపై ఈవై మాజీ ఉద్యోగులు విమర్శలు గుప్పిస్తున్నారు. మోయలేని పని భారం కారణంగా ఆ సంస్థ నుంచి బయటకు వచ్చినట్లు కామెంట్లు చేయగా.. లింక్డిన్ పోస్ట్లో మెమానీ మాత్రం ఎలాంటి వివరణ ఇవ్వలేదు. రంగంలోకి కేంద్రంఈ అంశంపై దేశ వ్యాప్తంగా ఉద్యోగులపై సంస్థల కఠిన వైఖరితో పాటు పనిభారం వంటి అంశాలు చర్చకు దారి తీస్తున్నాయి. ఈ తరుణంలో అన్నా సెబాస్టియన్ పెరియాలి మరణంపై కేంద్రం స్పందించింది. పని వాతావరణంలో అసురక్షిత, శ్రమ దోపిడీకి గురవుతున్నారనే ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు జరుగుతోందని కార్మిక శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజే తెలిపారు. -
లేలేలే.. లేలేలే.. నా రాజా
నిద్ర నుంచి ఎవరినైనా లేపొచ్చు.. ఈ పాటనే కాదు గానీ.. వేరే పాట పాడి కూడా లేపొచ్చు.. లేదా అలారం పెట్టి మరీ లేపొచ్చు. మరి.. శాశ్వత నిద్ర నుంచి.. అదేనండి.. చచ్చిపోయాక ఎవరినైనా లేపొచ్చా?? మేం లేపుతాం అని అంటున్నాయి కొన్ని కంపెనీలు.. అంతేకాదు.. తాము చెబుతున్నది అబద్ధం కాదని.. కావాలంటే మీరు చచి్చనంత ఒట్టు అని కొంచెం గట్టిగానే చెబుతున్నాయి. ఇప్పటికే వేల సంఖ్యలో జనం ఈ ఒట్లను నమ్మారు. చచ్చాక కచి్చతంగా లేపుతారు కదూ అంటూ కంపెనీలతో తిరిగి ఒట్టేయించుకున్నారు కూడా.. వీళ్లంతా ఒట్లు తీసి గట్లు మీద పెట్టేలోపు.. మనం విషయంలోకి వెళ్లిపోదాం... రేయ్.. ఎవుర్రా వీళ్లంతావీళ్లంతా ఎవరంటే.. అల్కార్, టుమారో బయో, సదరన్ క్రయోనిక్స్, క్రియోరస్, క్రయోనిక్స్ ఇన్స్టిట్యూట్ అని ఇలా కొన్ని కంపెనీలు ఉన్నాయి. వీళ్లేం చెబుతున్నారంటే.. చనిపోయాక మన శరీరాన్ని ప్రత్యేక పద్ధతిలో పరిరక్షించి.. ‘ఫ్రిజ్’లాంటి దాంట్లో పెట్టేసి.. భవిష్యత్తులో అంటే ఏ 2100లోనో.. లేదా కల్కి 2898 ఏడీలోనో.. మరణాన్ని జయించే మందు లేదా ఏ జబ్బుతో చనిపోయారో దానికి చికిత్స వచి్చనప్పుడు మళ్లీ ‘లేపుతారట’!! ఇందుకోసం జస్ట్.. రూ.1.5–1.8 కోట్లు ఇస్తే చాలట.ఎవరు నమ్ముతారు అని అనుకుంటున్నారా.. చెప్పాంగా.. చాలామంది నమ్మారు. ఏకంగా 6 వేల మంది ఈ సరీ్వసును బుక్ చేసుకున్నారు. అందులో 500 మంది దాకా.. ఆల్రెడీ ‘ఫ్రిజ్’లో శాశ్వత నిద్రలో ఉన్నారు. భవిష్యత్తులో తమను నిద్ర లేపే అలారం కోసం వెయిట్ చేస్తున్నారు. ఇందులో సదరన్ క్రయోనిక్స్ ఇటీవలే 80 ఏళ్ల సిడ్నీవాసి మరణించాక.. అతడిని ప్రత్యేక పద్ధతిలో పరిరక్షించి.. భద్రపరిచింది. ఇలా భద్రపరిచిన వాటిల్లో పెంపుడు జంతువులు కూడా ఉన్నాయి.ఏం జరిగింది.. ఏం జరుగుతోంది.. నాకు తెలియాలి.. అంతా క్రయోప్రిజర్వేషన్ మహిమ. అంటే.. అత్యంత శీతల వాతావరణంలోమానవ శరీరాన్ని భద్రపరచడం.1 మనిషి చనిపోయాక.. ఈ కంపెనీల ఎమర్జెన్సీ బృందాలు రంగంలోకి దిగుతాయి. మెదడు ‘చనిపోకుండా’ప్రత్యేక పరికరాల ద్వారా ఆక్సిజన్, రక్తాన్ని సరఫరా చేస్తారు.2 శరీరాన్ని ఐసులో ఉంచుతారు. రక్తం గడ్డకట్టకుండా హెపారిన్ ఇంజెక్షన్ ఇస్తారు..3 ప్లాంట్కు వెళ్లాక.. శరీరంలోని కణాలు ఫ్రీజ్ అయి దెబ్బతినకుండా ఉండటానికి వాటి నుంచి ద్రవాలను తీసేసి.. బదులుగాగ్లిజరాల్ బేస్డ్ రసాయనాన్ని ఎక్కిస్తారు (ఈ కంపెనీల్లో టుమారో బయో మాత్రం వాహనంలో ప్లాంటుకు తెస్తున్నప్పుడే ఈ ప్రక్రియను పూర్తి చేస్తామని చెబుతోంది)4 తర్వాత శరీరాన్ని డ్రై ఐసులో –130 డిగ్రీల ఉష్ణోగ్రతకు వెళ్లేదాకా ఉంచుతారు..5 అనంతరం లిక్విడ్ నైట్రోజన్ (–196 డిగ్రీలు) ఉన్న మెటల్ కంటైయినర్లో తలకిందులుగా వేలాడదీస్తారు. ఎందుకంటే.. ఎప్పుడైనా ప్రమాదవశాత్తూ లిక్విడ్ నైట్రోజన్ లీక్ అయినా సరే.. మన మెదడు భాగం ద్రవాల్లోనే సురక్షితంగా ఉంటుంది. నమ్మకమే జీవితం..మనమా.. రెండు చేతులూ జేబులో పెట్టుకుని.. అలానడుచుకుంటూ వెళ్లిపోదాం.. ఇంత చెబుతున్నారు సరే.. ఇంతకీ ఇది సాధ్యమేనా అంటే.. సినిమాల్లోనే అయితే సాధ్యమే. కానీ బయట అంటే.. ప్రస్తుతానికైతే చాన్సే లేదని నిపుణులు చెబుతున్నారు. వీళ్లను బతికించే టెక్నాలజీయే లేనప్పుడు ఇలా చేయడం మోసపుచ్చడమే అని విమర్శిస్తున్నారు. ఎప్పటికి వస్తుంది అంటే.. చెప్పడం కష్టమేనంటున్నారు.అయితే.. ఏదో సినిమాలో ‘నమ్మకమే జీవితం’అన్నట్లు ఈ కంపెనీలు మాత్రం భవిష్యత్తుపై ఆశలు చూపుతున్నాయి. ఇటు జనమూ అలాగే డబ్బులు కట్టేస్తున్నారు. వీళ్లలో ఎక్కువ మంది సంపన్నులే. వీరు తమ సంపదను అనుభవించడానికి.. అలాగే అమరత్వం సాధించడానికి అన్నట్లుగా చేస్తుంటే.. మరికొందరు భవిష్యత్తులో వచ్చే కొత్త టెక్నాలజీలు, అద్భుతాలను వీక్షించేందుకు ఇదో అవకాశమని భావిస్తున్నారు. ఇప్పుడు నయంకాని జబ్బులను నయం చేసే మందులు భవిష్యత్తులో వస్తాయని వాళ్లు నమ్ముతున్నారు. అందుకే ఇలా చేస్తున్నామని అంటున్నారు. ఇంతకీ మనమేం చేద్దాం.. -
మరణంలోనూ వీడని బంధం
మిడ్జిల్: వారి దాంపత్య జీవితం అర్ధ శతాబ్దంపాటు అన్యోన్యంగా సాగింది. ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమ వారి మరణంలోనూ తోడయ్యింది. భార్య మరణాన్ని తట్టుకోలేక గంట వ్యవధిలోనే భర్త మృతిచెందిన సంఘటన మహబూబ్నగర్ జిల్లా మిడ్జిల్ మండలంలోని చిల్వేర్లో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. చిల్వేర్ గ్రామానికి చెందిన బొల్గం అనసూయ(72) వారం రోజులుగా అనారోగ్యంతో హైదరాబాద్లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మధ్యాహ్నం మృతిచెందింది. అయితే మూడు నెలల క్రితం కాలు విరిగి మంచానికే పరిమితమైన ఆమె భర్త మాసయ్యగౌడ్(76)కు కుటుంబ సభ్యులు సమాచారం అందించారు. ఈ క్రమంలో తీవ్ర మనోవేదనకు గురైన మాసయ్యగౌడ్.. గంట వ్యవధిలోనే మృతిచెందాడు. ఒకే రోజు భార్యాభర్తల మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. వారికి ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమను గుర్తుచేసుకొని గ్రామస్తులు కన్నీటి పర్యంతమయ్యారు. -
కెనడాలో హైదరాబాదీ మృతి
హైదరాబాద్: విదేశాల్లో మరో భారతీయ యువకుడి జీవితం అర్ధాంతరంగా ముగిసింది. కెనడాలో తెలుగు యువకుడు కన్నుమూశాడు. మృతి చెందిన యువకుడ్ని హైదరాబాద్ మీర్పేటకు చెందిన ప్రణీత్గా అక్కడి అధికారులు నిర్ధారించారు. మీర్పేటకు చెందిన ప్రణీత్.. బర్త్ డే పార్టీ కావడం అన్న, స్నేహితులతో ఔటింగ్కు వెళ్లాడు. పార్టీ ముగిశాక బోటులో కాకుండా ఈత కొడుతూ రావాలని ప్రయత్నించాడు. అయితే చెరువు మధ్యలోకి రాగానే మునిగిపోయాడు. స్నేహితులు దూకి రక్షించాలని ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. ఈ ఉదంతానికి సంబంధించిన అదనపు సమాచారం అందాల్సి ఉంది. క్లిక్ చేయండి: సివిల్ సర్వీసెస్ వ్రాసే పేద విద్యార్ధులకు నాట్స్ చేయూత! -
మూడంతస్తుల భవనం కూలి ముగ్గురు మృతి
మీరట్: ఉత్తరప్రదేశ్లోని మీరట్ జిల్లా హెడ్ క్వార్టర్స్లోని జనసాంద్రత అధికంగా ఉండే జాకీర్ కాలనీలో మూడు అంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో ముగ్గురు మృతిచెందారు. మరో ముగ్గురు గాయపడ్డారు. ఆరుగురు శిథిలాల కింద చిక్కుకున్నారని స్థానికులు అంటున్నారు. సంఘటనా స్థలంలో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి.అకస్మాత్తుగా ఇల్లు కూలిపోవడంతో 12 మంది శిథిలాల కింద చిక్కుకుపోయారని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు, శిథిలాల నుండి మొత్తం ఆరుగురిని వెలికితీశారు. వారిలో ముగ్గురు మృతిచెందారు. గాయపడిన ముగ్గురిని లాలా లజపతి రాయ్ మెమోరియల్ మెడికల్ కాలేజీకి తరలించారు.మీరట్ డిఎం దీపక్ మీనా మీడియాతో మాట్లాడుతూ సంఘటనా స్థలంలో ప్రస్తుతం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపడుతున్నాయన్నారు. వర్షం కారణంగా రెస్క్యూ ఆపరేషన్కు ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. మీరట్ జిల్లా మేజిస్ట్రేట్ దీపక్ మీనా జాకీర్ కాలనీలోని మూడంతస్తుల ఇల్లు కూలిన విషయాన్ని ధృవీకరిస్తూ, శిథిలాల కింద ఆరుగురు సమాధి అయ్యారని తెలుస్తోందని సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయని చెప్పారు.ఇది కూడా చదవండి: చమురు ట్యాంకర్కు మంటలు -
బీహార్లో వెయ్యి దాటిన డెంగ్యూ కేసులు
పట్నా: బీహార్లో డెంగ్యూ వ్యాధి విస్తరిస్తూ, అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. పట్నా జిల్లాలో గత 10 రోజుల్లో డెంగ్యూ కారణంగా మొత్తం ఏడుగురు మృతిచెందారు. మీడియాకు అందిన వివరాల ప్రకారం తాజాగా మృతి చెందిన యువకుని వివరాలిలా ఉన్నాయి.పాలిగంజ్లోని సిగౌరి పోలీస్ స్టేషన్ పరిధిలోని 17 ఏళ్ల సంజీత్ కుమార్ కొన్ని రోజుల క్రితం డెంగ్యూ బారిన పడ్డాడు. దీంతో పీఎంసీహెచ్లోని డెంగ్యూ వార్డులో చికిత్స పొందుతూ మృతి చెందాడు. కాగా గత 24 గంటల్లో ఒక్క పట్నా జిల్లాలోనే కొత్తగా 18 మంది డెంగ్యూ వ్యాధిగ్రస్తులను గుర్తించారు. పట్నా జిల్లాలో ఇప్పటివరకు 538 మంది డెంగ్యూతో బాధపడుతున్న రోగులను గురించారు. రాష్ట్రం మొత్తం మీద చూసుకుంటే ఈ సంఖ్య వెయ్యి దాటింది. బీహార్లోని 11 జిల్లాలు డెంగ్యూ బారిన పడ్డాయి. డెంగ్యూ బాధితులు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. పట్నా తర్వాత గయలో అత్యధికంగా 70 డెంగ్యూ కేసులు నమోదయ్యయి. -
తెలంగాణ మలిదశ ఉద్యమనేత జిట్టా కన్నుమూత
సాక్షి, యాదాద్రి: తెలంగాణ మలిదశ ఉద్యమనేత, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు భువనగిరికి చెందిన జిట్టా బాలకృష్ణారెడ్డి (53) కన్నుమూశారు. అనారోగ్యంతో ఆయన సుమారు రెండు నెలలుగా సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. శరీరంలోని అన్ని అవయవాలు పాడైపోవడంతో శుక్రవారం ఉదయం జిట్టా ఆరోగ్యం పూర్తిగా విషమించింది. డాక్టర్ల సూచనల మేరకు కుటుంబ సభ్యులు వెంటిలేటర్ మీద ఆయన్ను స్వగ్రామమైన భువనగిరి సమీపంలోని ఫాంహౌస్కు తరలించారు. ఫాంహౌస్కు చేరుకున్న అనంతరం ఆయన తుదిశ్వాస విడిచారు. బాలకృష్ణారెడ్డిని ఆస్పత్రి నుంచి తరలించే సమయంలో ఆయన కుటుంబ సభ్యులతోపాటు తెలంగాణ ఉద్యమనేత డాక్టర్ చెరుకు సుధాకర్ తదితరులు ఉన్నారు. అమరవీరుల స్తూపం వద్ద నివాళులు తన ఫాంహౌస్లోనే తుదిశ్వాస విడవాలన్న జిట్టా కోరిక మేరకు వెంటిలేటర్పై ఉన్న ఆయన్ను బొమ్మాయిపల్లికి త రలించారు. మార్గమధ్యలో భువనగిరి పట్టణంలో ఆయన నిర్మించిన తెలంగాణ అమరవీరుల స్తూపం వద్దకు భారీ ర్యాలీతో తీసుకొచ్చి అభిమానులు నివాళులర్పించారు. ఫాంహౌస్కు చేరుకున్న తర్వాత జిట్టాకు వెంటిలేటర్ తొలగించడంతో తుదిశ్వాస విడిచారు. అధికార లాంఛనాల కోసం ప్రయత్నంప్రభుత్వ అధికార లాంఛనాలతో జిట్టా అంత్యక్రియలు నిర్వహించాలని అభిమానులు పట్టుబట్టారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి, భువనగిరి ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డిలు సీఎం కార్యాలయ అధికారులతో ఫోన్లో మాట్లాడారు. అధికారిక లాంఛనాల కోసం ఇచ్చే ఆరుగురు ఆర్మ్డ్ఫోర్స్లో కనీసం ఇద్దరినైనా ఇవ్వాలని విన్నవించినా అమలు కాలేదు. 4.30 గంటలకు ప్రారంభించాల్సిన జిట్టా అంతిమ యాత్ర గంట ఆలస్యంగా 5.30 గంటలకు ప్రారంభమైంది. టీచర్స్కాలనీ మీదుగా బొమ్మాయిపల్లిలోని ఆయన సొంత వ్యవసాయ భూమిలో జిట్టా అంత్యక్రియలు నిర్వహించారు. వేలాదిగా వచ్చిన అభిమానులు తుది వీడ్కోలు పలికారు. పలువురి నివాళి కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీతోపాటు అన్ని పార్టీల నేతలు, నాయకులు, కార్యకర్తలు, జిట్టా అభిమానులు, కళాకారు లు ఆయన భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య, భువనగిరి ఎంపీ చామల కిరణ్కుమార్రెడ్డి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, మాజీ మంత్రి హరీశ్రావు, ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి, తదితరులు నివాళులర్పించారు. జిట్టా కుటుంబ సభ్యులను మంత్రి కోమటిరెడ్డి ఓదార్చారు. ⇒ జిట్టా బాలకృష్టారెడ్డి మృతి పట్ల హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ, కేంద్రమంత్రులు జి.కిషన్రెడ్డి, బండి సంజయ్, ఎంపీలు డా.కె.లక్ష్మణ్, డీకే అరుణ, ఈటల రాజేందర్ తదితరులు సంతాపం ప్రకటించారు. ⇒ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన పోరాటంలో జిట్టా బాలకృష్ణారెడ్డి క్రియాశీలకంగా పాల్గొన్నారంటూ ఆయన కృషిని కేసీఆర్ స్మరించుకున్నారు. ఆయన మరణం దిగ్భ్రాంతిని కలిగించిందని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. సంతాపం వ్యక్తం చేసిన వారిలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు వేముల ప్రశాంత్రెడ్డి, సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, మాజీ ఎంపీ వినోద్ ఉన్నారు. -
TG: జిట్టా బాలకృష్ణారెడ్డి కన్నుమూత
సాక్షి,యాదాద్రిభువనగిరిజిల్లా: తెలంగాణ ఉద్యమకారుడు, బీఆర్ఎస్ నేత జిట్టా బాలకృష్ణారెడ్డి(52) అనారోగ్యంతో కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న జిట్టా హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందారు.శుక్రవారం( సెప్టెంబర్6) ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించింది. చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. తెలంగాణ ఉద్యమంలో జిట్టా కీలక పాత్ర పోషించారు. బీఆర్ఎస్ పార్టీ యువజన సంఘాల రాష్ట్ర అధ్యక్షునిగా చురుగ్గా పనిచేశారు. 2009లో భువనగిరి అసెంబ్లీ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అనంతరం యువతెలంగాణ పార్టీని స్థాపించి తర్వాత దానిని బీజేపీలో విలీనం చేశారు. అనంతర పరిణామాల్లో 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు తిరిగి సొంతగూడు బీఆర్ఎస్కు చేరారు. ఒక దశలో జిట్టాకు ఇటీవలి లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి భువనగిరి ఎంపీ సీటు ఇస్తారన్న ప్రచారం జరిగింది. జిట్టా మృతి పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్రావుతో పాటు పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. -
మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ తండ్రి కన్నుమూత
భోపాల్: మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ తండ్రి పూనమ్ చంద్ యాదవ్(100) కన్నుమూశారు. ఆయన గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఉజ్జయినిలోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.తన తండ్రి మృతి గురించి సీఎం మోహన్ యాదన్ ఎక్స్లో ట్వీట్ చేశారు. ‘పూనంచంద్ యాదవ్ జీ మరణం నా జీవితంలో ఒక పూడ్చలేని నష్టం. నా తండ్రి నేర్పిన నైతిక విలువలు, సూత్రాలతో నేను గౌరవప్రదమైన మార్గంలో ముందుకు సాగేందుకు ప్రయత్నిస్తాను. మీ జ్ఙాపకాలు ఎల్లప్పుడూ మాతో ఉంటాయి’ అని పేర్కొన్నారు.దీనికి ముందు తన తండ్రి పూనమ్ చంద్ యాదవ్ మరణ వార్త విన్న ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ భోపాల్ నుండి ఉజ్జయిని చేరుకున్నారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం పూనమ్ చంద్ యాదవ్ అంత్యక్రియలను బుధవారం ఉజ్జయినిలో నిర్వహించనున్నారు. కాగా పూనమ్ చంద్ యాదవ్ మృతికి మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సంతాపం వ్యక్తం చేశారు. -
జైలు నుంచి తప్పించుకుంటూ... 129 మంది ఖైదీలు మృతి
కిన్షాసా: కాంగో రాజధాని కిన్షాసాలోని సెంట్రల్ మకాలా జైలు నుంచి తప్పించుకునే ప్రయత్నంలో 129 మంది మృతి చెందారు. వారిలో 24 మంది కాల్పుల్లో చనిపోయినట్టు అంతర్గత వ్యవహారాల మంత్రి జాక్వెమిన్ మంగళవారం తెలిపారు. ‘‘తప్పించుకునేందుకు జైలుకు ఖైదీలు నిప్పు పెట్టారు. జైలు భవనం, ఫుడ్ డిపోలు, ఆసుపత్రిలో మంటలు చెలరేగి ఊపిరాడక చాలామంది చనిపోయారు.ఈ గందరగోళం మధ్యే పలువురు మహిళా ఖైదీలు అత్యాచారానికి కూడా గురయ్యారు’’ అని వివరించారు. తప్పించుకోవడానికి ప్రయత్నించిన వారిలో పలువురిని పోలీసులు హతమార్చినట్టు సమాచారం. మకాలా జైలు సామర్థ్యం 1,500 మాత్రమే. కానీ అధికారిక లెక్కల ప్రకారమే 15,000 మంది ఖైదీలున్నారు. వీరిలో ఎక్కువ విచారణ ఖైదీలేనని ఆమ్నెస్టీ నివేదిక పేర్కొంది. -
Bihar: కలుషిత నీరు తాగి బాలిక మృతి.. 9 మంది విద్యార్థులు అస్వస్థత
నలంద: బీహార్లోని నలంద జిల్లాలోగల కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో కలుషిత నీరు తాగి ఒక బాలిక మృతి చెందగా, 9 మంది బాలికలు అస్వస్థతకు గురయ్యారు. మృతిచెందిన బాలిక పాఠశాల విద్యార్థిని కాదని, పాఠశాలలోని తన స్నేహితురాలిని కలిసేందుకు వచ్చిందని నలంద జిల్లా అధికారులు చెబుతున్నారు. కలుషిత నీరు తాగి అనారోగ్యం బారినపడిన మరో 9 మంది బాలికలను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. కాగా నీటి నమూనాను అధికారులు పరీక్షల నిమిత్తం పంపారు.నలంద జిల్లా మేజిస్ట్రేట్ శశాంక్ శుభాంకర్ మంగళవారం మాట్లాడుతూ పాఠశాల ఆవరణలోని ఆర్ఓ సిస్టమ్ దగ్గర నీటిని తాగిన కొంతమంది బాలికలు వాంతులు, కడుపునొప్పితో బాధపడ్డారన్నారు. వెంటనే వారిని ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందించామమన్నారు. అయితే చికిత్స పొందుతూ ఓ బాలిక మృతి చెందిందని తెలిపారు. అస్వస్థతకు గురైన తొమ్మిది మంది విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉందన్నారు. పాఠశాలలోని ఆర్ఓ వ్యవస్థను సక్రమంగా నిర్వహించడం లేదని తమ దృష్టికి వచ్చిందని, దానిలోని నీటి నమూనాలను టెస్టింగ్ కోసం పంపించామన్నారు. పాఠశాల వార్డెన్పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని జిల్లా యంత్రాంగం ఆదేశించింది. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు అతన్నిఅధికారులు సస్పెండ్ చేశారు. -
పరారీకి యత్నం.. 129 మంది ఖైదీలు మృతి
కిన్సాసా: డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలోని సెంట్రల్ మకాల జైలులో విషాద ఘటన జరిగింది. జైలులో నుంచి పారిపోయేందుకు ప్రయత్నించి 129 మంది ఖైదీలు మరణించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ విషయాన్ని కాంగో అంతర్గత వ్యవహారాల మంత్రి షబానిలుకో మంగళవారం(సెప్టెంబర్3) ఎక్స్(ట్విటర్)లో తెలిపారు.ఖైదీల్లో 24 మంది మంటల్లో చిక్కుకొని ప్రాణాలు కోల్పోయినట్లు మంత్రి తెలిపారు. మకాల జైలు నుంచి తప్పించుకొనేందుకు ఖైదీలు ప్రయత్నించారని, దీంతో గార్డులు అప్రమత్తమై రంగంలోకి దిగడంతో జైలులో తొక్కిసలాట జరిగిందని చెప్పారు. తొక్కిసలాటకు తోడు జైలు కిచెన్లో చెలరేగిన మంటల్లో మొత్తం 129 మంది మరణించారు. మరో 59 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. ఖైదీలు ఎవరూ తప్పించుకోలేదని.. తప్పించుకొనేందుకు ప్రయత్నించినవారు మరణించారని జైలు అధికారులు చెప్పారు. జైలు నుంచి కాల్పుల శబ్దం వినిపించిందని ప్రత్యక్ష సాక్షులు కొందరు చెబుతున్నారు.