రాజమండ్రి: గోదావరి పుష్కరాల సందర్భంగా రాజమండ్రి పుష్కర ఘాట్ వద్ద జరిగిన తొక్కిసలాటలో మరణించిన వారి కుటుంబాలను వైఎస్ఆర్సీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు. విజయవాడ పర్యటనను సగంలోనే ముగించుకుని హుటాహుటిన రాజమండ్రి వెళ్లిన ఆయన.. అక్కడి ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ఓదార్చారు.
పుష్కరానికి వచ్చి మృతిచెందిన భక్తుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన భక్తులను ఆయన పరామర్శించారు. యాత్రికుల మృతి విషయాన్ని తెలుసుకున్న ఆయన హుటాహుటిన రాజమండ్రికి చేరుకున్నారు. రాజమండ్రి కోటిలింగాల రేవు పుష్కర ఘాట్ వద్ద తొక్కిసలాట జరిగి 27 మంది మృతిచెందడంతో పాటు మరికొంత మంది గాయపడిన విషయం తెలిసిందే. బాధితులకు ప్రభుత్వం ప్రకటించిన సాయాన్ని తక్షణం అందజేయాలని, క్షతగాత్రులకు సరైన వైద్య సదుపాయాలు అందించాలని ఆయన కోరారు.