
నాకు డయాబెటిస్ అంటున్నారు... మంచి డైట్ సూచించండి
నా వయసు 34 ఏళ్లు. ఇటీవలే జనరల్ హెల్త్ పరీక్ష చేయించుకుంటే డయాబెటిస్ ఉన్నట్లు వచ్చింది. దయచేసి నాకు ఆరోగ్యకరమైన డైట్ సూచించండి. – ఎల్. సునీత, ఖమ్మం
డయాబెటిస్ కనుగొన్న తర్వాత డాక్టర్ సూచించిన మందులతో పాటు వారి వారి వ్యక్తిగత బరువు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుంటూ, ఆహారనిపుణులు వారికి వ్యక్తిగతంగా ఆహారపు నిబంధనలు (డైట్ చార్ట్) సూచిస్తారు. అయితే ఈ కింద పేర్కొన్నవి డయాబెటిస్ ఉన్నవారు పాటించాల్సిన సాధారణ ఆహార నిబంధనలు మాత్రమే. పిండిపదార్థాల విషయానికి వస్తే అవి తీసుకోవడం వల్ల రక్తంలో గ్లూకోజ్ (పంచదార) పాళ్లు వేగంగా పెరుగుతాయి. అందుకే డయాబెటిస్ రోగులు పిండిపదార్థాలు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తక్కువగా తీసుకోవాలి.
కార్బోహైడ్రేట్స్ ఉండే పదార్థాలను తీసుకోవాల్సి వస్తే... ముడిబియ్యం, దంపుడు బియ్యం లాంటి పొట్టుతీయని ధాన్యాలు తీసుకోవడం వల్ల పీచు పదార్థాలు (ఫైబర్) శరీరానికి ఎక్కువగా అందుతాయి. రక్తంలో గ్లూకోజ్ను తగ్గించడానికి ఈ పీచుపదార్థాలు ఉపయోగపడతాయి. బెండకాయ, వంకాయ, టొమాటో, గుమ్మడికాయ వంటి కాయగూరలు, తోటకూర, బచ్చలికూర, మెంతికూర వంటి ఆకుకూరలు (గ్రీన్ లీఫీ వెజిటబుల్స్)లోనూ, బొప్పాయి, జామపండు వంటి పండ్లు, సజ్జలు, జొన్నలు, బార్లీ, రాగులు, కొర్రలు వంటి ధాన్యాల్లో పీచుపదార్థం ఎక్కువగా ఉంటుంది.
ప్రోటీన్ల విషయానికి వస్తే ఇవి శరీర కణాలను మరమ్మతు చేయడానికి అవసరం. ప్రోటీన్లు. గ్లూకోజ్ పాళ్లు పెరగకుండా చూసే అమైనో ఆమ్లాలను అందిచడంలోనూ దోహదపడతాయి. పాలు, పాల ఉత్పాదనలు, పప్పులు, బీన్స్ వంటివి వంటి వాటిల్లో ప్రోటీన్లు ఎక్కువ. మాంసాహారం ద్వారా కూడా ప్రోటీన్లు అందుతాయి. అంతే మాంసాహారం వల్ల కొవ్వు పాళ్లు పెరిగే అవకాశం ఉంది కాబట్టి వేటమాంసం, రెడ్ మీట్కు బదులుగా కొవ్వు తక్కువగా ఉండే చికెన్, చేపలు వంటివి తీసుకోవడం మంచిది.
ఇక కొవ్వుల విషయానికి వస్తే మన శరీర జీవక్రియలకు కొవ్వులు అవసరమైనందున వాటిని పూర్తిగా మానేయడం సరికాదు. డయాబెటిస్ ఉన్నవారు కొవ్వులు ఎక్కువగా ఉండే మాంసాహారం, నెయ్యి, వెన్న, జున్ను, మీగడ, వనస్పతి, పామోలిన్ వంటివి తీసుకుంటే రక్తనాళాల్లో కొవ్వు పేరుకునే అవకాశం ఎక్కువ. కాబట్టి డయాబెటిస్ ఉన్నవారు గుండె జబ్బు లేకపోయినా ఉన్నట్లుగా భావించి ఆమేరకు జాగ్రత్తలు తీసుకోవాలి కాబట్టి ఇలాంటి కొవ్వు లేదా నూనె పదార్థాలు తీసుకోవడం సరికాదు.
ఇక నూనెల విషయానికి వస్తే పాలీ అన్శాచ్యురేటెడ్ నూనెలైన (ప్యూఫా) పొద్దుతిరుగుడు, కుసుమ నూనెలనూ ఉదయం వేళల్లోనూ... ఇక మోనో అన్శ్యాచ్యురేటెడ్ నూనెలైన (మ్యూఫా) నువ్వుల నూనె, సోయానూనె, ఆలివ్ ఆయిల్ను సాయంత్రం వేళల్లో ఉపయోగించడం మంచిది. ఇలా వీలు కాకపోతే ఒక నెలంతా ప్యూఫా, మరో నెలంతా మ్యూఫా నూనెలను మార్చి మార్చి ఉపయోగించడం వల్ల మధుమేహం ఉన్నవారికే గాక అందరికీ మంచిది. గుండె, శరీరానికి సంబంధించిన రక్తనాళాల్లో కొవ్వు పేరుకోకుండా ఇది ఉపయోగపడుతుంది. ఒక పరిమితి మించకుండా కొవ్వు పదార్థాలు తీసుకోవాలంటే ప్రతి ఒక్కరూ రోజుకు 50 గ్రాములకు మించి నూనె ఉపయోగించకూడదు. అంటే నెలకు 450 గ్రాములు అన్నమాట. కొండగుర్తుగా చెప్పాలంటే ప్రతి ఒక్కరు నెలకు అర్ధలీటరుకు మించకుండా నూనె వాడటం శ్రేయస్కరం.
డయాబెటిస్ రోగులు నేరుగా తీసుకోకూడని పదార్థాలు
పంచదార / వాటితో తయారు చేసిన పదార్థాలు ,తేనె , జామ్స్ / జెల్లీస్ , కేకులు / పేస్ట్రీలు ,పళ్లరసాలు , మద్యం
(పండ్లను పండ్లరసాల రూపంలో తీసుకోవడం కంటే నారింజ, కమలాపండు, జామ, పుచ్చకాయ, బొప్పాయి వంటి పండ్లను కొరికి తినడం మంచిది).
గుర్తుంచుకోవాల్సిన విషయాలు
♦ మొలకెత్తిన గింజలు తీసుకోవడం మధుమేహరోగుల ఆరోగ్యానికి మంచిది.
♦ నేల కింద పండే దుంపలు (ఆలు, చిలగడ, కంద వంటి దుంపలు) డయాబెటిక్ రోగులకు మంచిది కాదు. నేల కింద పండే వాటన్నింటి నుంచి దూరంగా ఉండాలని డయాబెటిస్ రోగులు గుర్తుంచుకోవాలి. అయితే ఈ నిబంధన నుంచి ముల్లంగికి మినహాయింపు ఉంది. డయాబెటిస్ రోగులు ముల్లంగిని తీసుకోవచ్చు.
♦ మద్యం, పొగతాగడం అలవాట్లను పూర్తిగా మానేయాలి.
♦ ఈ ఆహారంతో పాటు వ్యాయామం చేస్తూ బరువు పెరగకుండా జాగ్రత్త పడితే డయాబెటిస్ దుష్ప్రభావాలనుంచి దూరంగా ఉండవచ్చు.
డయాబెటిస్ ఉంది... పాదాల జాగ్రత్తలు ఏమిటి?
నా వయసు 65. నేను గత పదేహేనేళ్లుగా డయాబెటిస్తో బాధపడుతున్నాను. ఇది ఉన్నవారు తమ పాదాలను సురక్షితంగా చూసుకోకపోతే కాళ్లను తొలగించే పరిస్థితి వస్తుందని విన్నాను. డయాబెటిస్ రోగులు పాదసంరక్షణలో పాటించాల్సిన సూచనలు ఏమిటి? – కె. రామచంద్రరావు, నిజామాబాద్
షుగర్ ఉన్న ప్రతివారూ, అందునా ఐదు నుంచి పదేళ్లుగా ఈ వ్యాధితో బాధపడుతున్నవారు తమ కాళ్లనూ ప్రత్యేకంగా పాదాలను చాలా జాగ్రత్తగానూ, నిశితంగానూ పరిశీలించుకుంటూ ఉండాలి. ఆ క్రమంలో పాటించాల్సిన మార్గదర్శకాలివి...
తరచూ కాలి పరీక్ష స్వయంగా చేసుకుంటూ ఉండటం ఈ ప్రక్రియంలో భాగంగా పాదాల కింద అద్దం పెట్టుకుని, పాదం ఏవిధంగా ఉందో చూసుకోవాలి. కాలి పైభాగాన్నీ నిశితంగా పరీశించుకోవాలి. అలాగే కాలి వేళ్ల మధ్య భాగాలనూ పరీక్షించుకుంటూ ఉండాలి. ఈ పరిశీలనలో చిన్న పొక్కులాంటిది ఉన్నా దాన్ని విస్మరించకూడదు. భవిష్యత్తులో అది పుండుగా మారే ప్రమాదం కూడా ఉండవచ్చు.
♦ నిత్యం పాదాలను పొడిగా ఉంచుకోవాలి. కాళ్లు కడుక్కున్న వెంటనే పొడిగా అయ్యేలా తుడుచుకోవాలి. కాలి వేళ్ల మధ్య కూడా పొడిగా ఉండటం కోసం పౌడర్ రాసుకోవాలి.
♦ కాలికి చెప్పులు, బూట్లు లేకుండా నడవకూడదు. అయితే ఈ చెప్పులు, బూట్లూ కాలికి చాలా సౌకర్యంగా ఉండాలి. ఏమాత్రం అసౌకర్యం ఉన్నా ఆ పాదరక్షలు వాడకండి. సౌకర్యంగా ఉండేవి మాత్రమే ఎంచుకోవాలి
♦ వేడి వస్తువులనుంచి మీ కాళ్లను దూరంగా ఉంచుకోండి. డయాబెటిస్ ఉన్నవారు హాట్ వాటర్ బ్యాగ్తో కాళ్లకు కాపడం పెట్టుకోకపోవడమే మంచిది
♦ పాదాలను మృదువుగా ఉంచుకోవాలి. ఇందుకోసం కాళ్లు కడుక్కున్న తర్వాత పొడిగా తుడుచుకొని, ఆ తర్వాత వేజ్లైన్తో కాళ్లను రుద్దుకొని, ఆ తర్వాత పొడిగా మారేలా శుభ్రం చేసుకోవాలి
♦ కాళ్ల మీద పులిపిరి కాయల్లాంటివి ఏవైనా ఏర్పడితే డాక్టర్ను సంప్రదించి, ఆయన పర్యవేక్షణలోనే వాటిని తొలగించుకోవడం చాలా ముఖ్యం
♦ కాలిగోళ్లను ప్రతివారమూ తొలగించుకోవాలి. ఈ సమయంలో గోళ్లను మరీ లోపలికి కట్ చేసుకోకూడదు. అలాంటప్పుడు ఒక్కోసారి గోరు మూలల్లో రక్తం వచ్చేంతగా గోరు కట్ కావచ్చు. ఇది జరిగినప్పుడు కొందరిలో గోరు లోపలి వైపునకు పెరగవచ్చు. ఇది డయాబెటిస్ రోగుల్లో ప్రమాదం.
♦ ఇంట్లో కూడా పాదరక్షలు లేకుండా నడవకండి. ప్రత్యేకంగా తడి, తేమలో పనిచేసే మహిళలు స్లిప్పర్స్ వంటివి తొడుక్కునే పనిచేసుకోవాలి
♦ ఏడాదికోసారి కాలి వైద్య నిపుణులకు చూపించుకుంటూ ఉండాలి.
బార్డర్లైన్ అంటున్నారు... డయాబెటిస్ దాదాపుగా వచ్చినట్టేనా?
నేను ఇటీవలే రక్తపరీక్ష చేయించుకుంటే నాకు డయాబెటిస్ బార్డర్లైన్లో ఉందన్నారు. అంటే నాకు డయాబెటిస్ వచ్చినట్లేనా? దయచేసి నాకు తగిన సలహా ఇవ్వండి.
– డి. కామేశ్వరి, విజయవాడ
మీరు పరగడుపున రక్తపరీక్ష చేయించుకున్నప్పుడు రక్తంలోని చక్కెర పాళ్ల విలువ 100 కంటే తక్కువ ఉండటం; భోజనం చేశాక చేయించిన రక్తపరీక్షలో ఆ విలువ 140 కంటే తక్కువ ఉండటం జరిగితే మీకు డయాబెటిస్ లేదని అర్థం. ఒకవేళ మీరు పరగడుపున చేయించిన పరీక్షలో రక్తంలోని చక్కెర పాళ్ల విలువ 125 కంటే ఎక్కువగానూ, భోజనం చేసిన తర్వాత చేసిన రక్తపరీక్షలో ఆ విలువ 200 కంటే ఎక్కువగానూ, హెచ్బీఏ1సీ అనే పరీక్షలో వచ్చిన విలువ 6.5 శాతం కంటే ఎక్కువగానూ ఉంటే మీకు డయాబెటిస్ ఉన్నట్లు లెక్క.
ఇక నిర్దిష్టంగా చెప్పాలంటే... హెచ్బీఏ1సి విలువ 5.6 నుంచి 6.5 వరకు ఉన్నా లేదా పరగడుపున చేయించిన రక్తపరీక్షలో చక్కెర 100 నుంచి 125 ఉన్నా, భోజనం చేశాక రక్తంలో చక్కెర 140 నుంచి 200 లోపు ఉన్నా దాన్ని బార్డర్లైన్ డయాబెటిస్ అంటారు. అంటే డయాబెటిస్ వచ్చే అవకాశాలు ఎక్కువ అన్నమాట. ఇలాంటివారు రోజూ కనీసం ఒక గంట సేపు వ్యాయామం చేయడం, తాము తీసుకునే ఆహారంలో కార్బోహైడ్రేట్లు, కొవ్వులు తక్కువగా తీసుకోవడం, స్థూలకాయం లేకుండా చూసుకోవడం చేస్తుంటే చాలాకాలం పాటు డయాబెటిస్ దరిచేరకుండా కాపాడుకోవచ్చు.
- డాక్టర్ ప్రశాంత్చంద్ర ,కన్సల్టెంట్ ఫిజీషియన్, ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్, అమీర్పేట్, హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment