
కేన్సర్ చికిత్సలో ఓ చిత్రమైన చిక్కు ఉంది. మరీ ముఖ్యంగా కీమోథెరపీ విషయంలో. ఏ మందు ఎవరికి పనిచేస్తుందో కచ్చితంగా చెప్పడం కష్టం. మందు వాడాలి. పనిచేయకపోతే మళ్లీ కణితి నమూనా సేకరించి ఇంకో మందును ఉపయోగించాలి. ఇదీ ఇప్పటివరకూ జరుగుతున్న పద్ధతి. ఇకపై మాత్రం ఈ అవస్థల అవసరం ఉండదు. జర్మనీలోని హైడల్బర్గ్ యూనివర్సిటీ అధ్యాపకుడు, భారతీయ సంతతి శాస్త్రవేత్త ఉత్తరాల రమేశ్ పరిశోధనల పుణ్యమా అని ఇప్పుడు అతితక్కువ కాలంలో బోలెడన్ని కీమోథెరపీ మందులను పరీక్షించవచ్చు.
అతిసూక్ష్మమైన గొట్టాలతో తయారైన ఓ యంత్రంతో ఒకట్రెండు మందులు కలిపి, లేదా విడివిడిగా రాత్రికిరాత్రి పరీక్షించవచ్చు, అరచేతిలో ఇమిడిపోయే ఈ యంత్రం ఏకంగా వెయ్యి రకాల కాంబినేషన్లను పరిశీలించగలదు. దీనివల్ల పదేపదే బయాప్సీలు చేయాల్సిన అవసరం ఏర్పడదని.. రోగులకు సరిపడే మెరుగైన మందును ఎంచుకోవడం సాధ్యమవుతుందని రమేశ్ అంటున్నారు. రోగి శరీరం నుంచి సేకరించిన కణితి కణాలు అతితక్కువ సంఖ్యలో వాడుకుంటూ మందులు పరిశీలించవచ్చునని చెప్పారు. ఈ పరికరాన్ని తాము ఇప్పటికే నలుగురు కేన్సర్ రోగులపై పరీక్షించి మెరుగైన ఫలితాలు సాధించామని వివరించారు.