
మధ్యవయస్కులు మితంగా మద్యం తీసుకుంటే..
లండన్ : మితంగా మద్యం సేవిస్తే గుండె జబ్బులు, స్ర్టోక్ ముప్పు తగ్గుతుందని తాజా అధ్యయనం వెల్లడించింది. పరిమిత మోతాదులో మద్యం తీసుకునే వారిలో గుండె పదిలంగా ఉండటంతో పాటు స్ర్టోక్ వంటి సమస్యలు తగ్గుమఖం పడతాయని పేర్కొంది. అయితే అతిగా మద్యం సేవిస్తే మాత్రం ప్రమాదకరమని తేల్చిచెప్పింది.
9000 మందికి పైగా మధ్యవయస్కుల మద్యం అలవాట్లను 1985 నుంచి 2004 వరకూ పరిశీలించిన శాస్త్రవేత్తలు ఈ అంశాలను గుర్తించారు. మధ్యవయసులో మద్యం ముట్టని వారు పరిమితంగా మద్యం సేవించే వారితో పోలిస్తే డిమెన్షియా, స్ట్రోక్ ముప్పు 47 శాతం అధికంగా ఎదుర్కొంటున్నారని యూనివర్సిటీ పారిస్-సాక్లే శాస్త్రవేత్తలు గుర్తించారు.
వారానికి 14 యూనిట్ల వరకూ మద్యం సేవిస్తే సానుకూల ఫలితాలు ఉంటాయని తమ అధ్యయనంలో వెల్లడైందని పరిశోధకులు చెబుతున్నారు. మద్యం అధికంగా సేవిస్తే కాలేయ వ్యాధులతో పాటు క్యాన్సర్లు సోకే ప్రమాదం ఉందని హెచ్చరించారు. తగిన మోతాదులో మద్యాన్ని తీసుకుంటే మేలని వారు సూచించారు. ఈ రీసెర్చ్ వివరాలు బ్రిటిష్ మెడికల్ జర్నల్లో ప్రచురితమయ్యాయి.