
తేనెతో ముఖకాంతి...
బ్యూటిప్స్
ఆపిల్ పై తొక్క తీసి, ముక్కలు కోసి, మిక్సర్లో వేసి గుజ్జు చేయాలి. దీంట్లో రెండు టీ స్పూన్ల తెనె, విటమిన్ ‘ఇ’ క్యాప్సుల్ కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్ వేసి, పదిహేను నిమిషాల తర్వాత శుభ్రపరుచుకోవాలి. ఈ ప్యాక్ ముఖకాంతిని పెంచుతుంది. టీ స్పూన్ తేనె, అర స్పూన్ ముల్తానా మిట్టి, రెండు టీ స్పూన్ల రోజ్వాటర్, కొన్ని చుక్కల నిమ్మరసం కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్లా వేసి, పదిహేను నిమిషాల తర్వాత శుభ్రపరచుకోవాలి. వారానికి ఒకసారి ఈ ప్యాక్ వాడటం వల్ల చర్మకాంతి పెరుగుతుంది.
ఒక గిన్నెలో బాగా మగ్గిన అరటిపండును వేళ్లతో గుజ్జు చేయాలి. అందులో టేబుల్ స్పూన్ తేనె, గుడ్డులోని పచ్చసొన, టేబుల్ స్పూన్ వీట్ జెర్మ్ ఆయిల్, టీ స్పూన్ ఓట్స్, ఒక చుక్క నిమ్మరసం, అర టీ స్పూన్ ఎసెన్షియల్ ఆయిల్ వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు ప్యాక్ వేయాలి. పది నిమిషాల తర్వాత శుభ్రపరుచుకోవాలి. ఈ ప్యాక్ పొడి చర్మాన్ని మృదువుగా మారుస్తుంది.ఆముదం, తేనె సమపాళ్లలో కలపాలి. ఈ మిశ్రమాన్ని శిరోజాలకు, ముఖ్యంగా వెంట్రుకల చివరలకు పట్టించి, అరగంట తర్వాత తలస్నానం చేయాలి. దీని వల్ల వెంట్రుకల చివర్లు చిట్టకుండా, మృదువుగా ఉంటాయి.
అర టీ స్పూన్ తేనె, రెండు టేబుల్ స్పూన్ల రోజ్ వాటర్ కలిపి ముఖానికి, మెడకు రాసుకోవాలి. పదిహేను నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. తేనె చర్మానికి మాయిశ్చరైజర్లా ఉపయోగపడుతుంది. రోజ్ వాటర్తో పోర్స్ శుభ్రపడి ముఖ చర్మం కాంతివంతమవుతంది.