
సాంకేతిక కారణాలను మాత్రమే సాకుగా చూపి ఇంటర్మీడియట్ బోర్డు వైఫల్యాలను తక్కువ చేసి చూపడం ప్రస్తుత సంక్షోభానికి పరిష్కారం కాదు. మంచి లక్ష్యాలతోనే ప్రారంభించిన విద్యా సంస్థలకు మంచి వసతి, సౌకర్యాలు, వనరులు, స్టాఫ్ వగైరాలు సమకూర్చకుండా లక్ష్యాన్ని కుంటుపరచడంలో మనవాళ్లు మహాఘనులు. రాజకీయ ఒత్తిళ్లతో కుక్కగొడుగుల్లా పుట్టుకొచ్చిన కాలేజీల్లో వసతుల లేమి విద్యాప్రమాణాల పతనానికి ఒక కారణం కాగా ట్యుటోరియల్స్ నిర్వహణ, పరీక్షలు, మార్కులు, పరీక్షా పత్రాలిచ్చేవారు, వాటిని దిద్దేవారు మొత్తంగా ఈవెంట్ మేనేజ్మెంట్ కావడంతో విద్యావ్యవస్థే పెద్ద రాకెట్ అయిపోయింది. దీన్ని కంట్రోల్ చేయడం సాధ్యం కాని నేపథ్యమే విద్యార్థుల ఆత్మహత్యలకు కారణం అవుతోంది. స్కూళ్లు, కాలేజ్లు, యూనివర్సిటీలను రాజకీయాల బారిన పడేయడంతో ఇవి అనేక పైరవీలకు లోనయ్యాయి.
ఈ మధ్య జరిగిన ఇంటర్మీడియట్ పరీక్షల్లో చాలామంది విద్యార్థులు ఫెయిల్ కావడానికి, 27 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడానికి సాంకేతిక పరమైన కారణాలే కాక చారిత్రక కారణాలు కూడా చాలా ఉన్నాయి. నోరులేని టెక్నాలజీపై నిందలు మోపేటప్పుడు ప్రతి టెక్నాలజీ వెనకాల మనిషనేవాడొకడు ఉంటాడని గుర్తించవలసి ఉంటుంది. కంప్యూటర్ భాషలో ‘గార్బేజ్ ఇన్ – గార్బేజ్ అవుట్’ అని ఒక వాడుక ఉంది. అంటే మనం సమాచారాన్ని ఎలా ‘ఫీడ్’ చేస్తామో అలాగే అది దానిలో ప్రోగ్రామింగ్ చేసిందాన్నే మనకు ఇస్తుంది. ఒకప్పటి పాత హైదరాబాద్ రాష్ట్రంలో చాలాకాలం ఇంటర్మీడియట్ విద్య హయ్యర్ ఎడ్యుకేషన్తో ముడిపడి ఉండేది. హైస్కూల్ విద్య పదవ తరగతి వరకే పరిమితమయ్యేది.
ఇంటర్ కోర్సు హయ్యర్ ఎడ్యుకేషన్కు అనుబంధంగా ఉండేది. ఆనాటి డిగ్రీ కళాశాలల్లో ఇంటర్మీడియట్ కూడా కలిసి ఉండేది. అలా అపుడు దానికి హయ్యర్ ఎడ్యుకేషన్కు చెందిన వాతావరణమే కాక, నిజమైన ఉన్నత అధ్యాపకుల బోధనా అవకాశాలు కూడా లభించి ఆ విద్య స్టాండర్డ్ ఎంతో బాగుండేది. అలా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కూడా హయ్యర్ ఎడ్యుకేషన్గా ముద్రపడి విద్యార్థులు, సమాజం దృష్టిలో దానికి ఉన్నతస్థాయి గుర్తింపు లభించేది. అలా ఆనాటి ఇంటర్మీడియట్ విద్యాబోధన బాగా జరిగేది. పరీక్షలు బాగా జరిగేవి. కొన్నాళ్లకు ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ స్థానంలో గాంధీ ప్రాథమిక విద్యా భావన ప్రకారం బహుళార్థ సాధక పాఠశాలలు వచ్చాయి. పదవ తరగతి వరకున్న స్కూల్ విద్యను 11, 12 తరగతుల వరకు పెంచడమే కాకుండా, దాన్ని స్కూల్ ఎడ్యుకేషన్కు అనుబంధం చేశారు.
మన వాళ్లు ఏ విద్యనైనా మంచి లక్ష్యాలతోనే ప్రారంభిస్తారు కాని దానికి మంచి వసతి, సౌకర్యాలు, వనరులు, స్టాఫ్ వగైరాలు సమకూర్చకుండా లక్ష్యాన్ని కుంటుపరచడంలో ఘనులు. పైగా విద్యార్థుల కోసం ఉద్దేశించిన ఒక మంచి వ్యవస్థను.. సిబ్బంది ప్రమోషన్ల కోసం బదిలీల కోసం, యూనియన్ రాజకీయనేతల ఒత్తిళ్లతో క్రమశిక్షణ లేని విద్యా అవస్థగా మార్చడంలో కూడా వీరు ఘనులు. అలా నియామకాలు, ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్లు వంటివాటి కోసం మొదట స్కూళ్లు, ఆ పిదప కాలేజ్లు, యూనివర్సిటీలను రాజకీయాల బారిన పడేయడంతో ఇవి అనేకానేక పైరవీలకు, అవినీతులకు లోనయ్యాయి. విద్య, విద్యాలయాలు చెడిపోవడానికి అసలు బీజం అక్కడే ఉంది. ఆ బీజం మొదట మన లోకల్ విత్తనంలా మొదలై హైబ్రిడ్ బీజమై తద్వారా వటవృక్షమైంది.
మరి కొన్నాళ్లకు మల్టీపర్పస్ సిస్టమ్ను రద్దు చేసి, పి.యు.సి., పి.పి.సి. అనే రెండేళ్ల విద్యను ప్రవేశపెట్టారు. అవి రెండూ చాలాకాలం హయ్యర్ ఎడ్యుకేషన్కు అనుబంధంగా నడిచేవి. అది కూడా మునుపటి ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లా కొన్నాళ్లు బాగానే నడిచింది. స్కూళ్లలో పనిచేసే టీచర్ల ఒత్తిళ్ల వలన ఇంటర్మీడియట్ బోర్డును, డైరెక్టరేట్ ఫర్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ను ఏర్పరచి అటు స్కూల్ ఎడ్యుకేషన్కు ఇటు హయ్యర్ ఎడ్యుకేషన్కు అనుబంధంలా కాకుండా దాని పేరుకు తగినట్లు ప్రత్యేక వ్యవస్థగా ఇంటర్మీడియట్ బోర్డ్ పేర నెలకొల్పారు. దాని వ్యవహారాలన్నిటినీ దానికే చెందిన పరిపాలకులు, అధ్యాపకులు ప్రత్యేక శ్రద్ధతో చూసుకోగలరు కనుక అదీ ఒకందుకు మంచిదే అయింది. ఇప్పటి మాదిరి డిపార్ట్మెంట్ హెడ్స్ పదవుల్లోనూ సివిల్ సర్వీసుల వాళ్లను వేసే తప్పు పద్ధతి అప్పట్లో ఉండేది కాదు. దాని వలన ఫలితాల్లో చాలా తేడా ఉండేది. అయితే ఇంటర్మీడియట్ విద్య కొన్ని దశాబ్దాల కాలం దానికంటూ ఒక ప్రత్యేక అస్తిత్వం లేకుండా గడచింది. ఒకసారి దానికి, ఒకసారి దీనికి అనుబంధంగా ఉండడం వలన దాని విద్య చాలా దెబ్బతింది. అలా ఆ తరచు మార్పిళ్ల వలన విద్యాప్రమాణాలు దెబ్బతినే పరిస్థితి ఏర్పడింది. చాలామంది ఫెయిల్ అయ్యే పరిస్థితి.
విద్యార్థుల సంఖ్య పెరిగేకొద్దీ కొత్త విద్యాలయాల కోసం సామాజిక, రాజకీయ పరమైన ఒత్తిళ్లు పెరిగిన కొద్దీ మరి కొన్ని ఇంటర్మీడియట్ కాలేజీలు, మరికొన్ని యూనివర్సిటీలను స్థాపించారు. అడిగిన వారి కల్లా, ఒత్తిళ్లు తెచ్చినవారికల్లా ప్రైవేట్ కళాశాలలు స్థాపించుకోవడానికి పర్మిషన్లు ఇచ్చేశారు. అలాంటి పద్ధతి ఆంధ్రప్రదేశ్ స్థాపన కన్నా ముందే మొదలై ఆ తర్వాత మరీ ఎక్కువై కుక్కగొడుగుల్లా కాలేజీలు వెలిశాయి. ఇపుడు రాజకీయ ఒత్తిళ్లతో అనుమతులు తెచ్చుకోవడం వలన ఊరికో కాలేజీ, వీధి వీధికి ఎన్నో కాలేజీలు వచ్చేశాయి. అలా వసతి సౌకర్యాలు లేకుండా స్థాపించిన కాలేజీల్లో విద్యా ప్రమాణాలు దిగజారిపోయాయి.
ఈలోగా ఆంధ్రా ప్రాంత పెట్టుబడిదార్లు ట్యుటోరియల్ కాలేజీల పేరట మొదట రంగ ప్రవేశం చేశారు. అవి ట్యుటోరియల్స్ నిర్వహించడంతో పాటు పరీక్షల మేనేజ్మెంట్, మార్కుల మేనేజ్మెంట్, పరీక్షా పత్రాలు ఇచ్చేవారి మేనేజ్మెంట్, దిద్దేవారి మేనేజ్మెంట్ మొదలైనవన్నీ చేబట్టాయి.
అదొక ఈవెంట్ మేనేజ్మెంట్ లాంటిదయింది. అలాంటి వ్యాపారంలో వారికి పరిపాలకులను, పెద్ద ఉద్యోగులను, రాజకీయవేత్తలను మేనేజ్ చేయడం తప్పనిసరయింది. వారి బిడ్డలకు, బంధు మిత్రుల పిల్లలకు ఎక్కువ మార్కులు వచ్చేలా చేసి మెడికల్ సీట్లు, ఇంజనీరింగ్ సీట్లు మేనేజ్ చేయడం మామూలైపోయింది. ఎపుడైతే అలా అంత పెద్ద రాకెట్ ఏర్పడిందో దానిని కంట్రోల్ చేయడం ఇక ఎవరి తరం? అందరూ భాగస్వాములే కదా మరి అవకతవకల్లో, అక్రమాల్లో! ఇపుడు ఎడ్యుకేషన్ సెక్టార్, ఇంటర్మీడియట్ సెక్టార్ ఒక పెద్ద మాఫియా లాంటిదై పోయింది. దాని ప్రభావం ఇతర విభాగాలపైనా పడింది. దొంగ మెడికల్ సర్టిఫికెట్లు, దొంగ ఇంజనీరింగ్ డిగ్రీలు, వాటితోపాటు దొంగ పాస్పోర్టులు, వీసాలు సంపాదించుకొని బైటికి పోయే వారి సంఖ్య కూడా బాగా పెరిగిపోయిందని పత్రికలు ఆమధ్య రాశాయి. కాబట్టి ఏనాటినుండో పరిపాలకులంతా కుమ్మక్కై చేసిన, చేస్తుండిన నేరాన్ని కేవలం సాంకేతిక లోపమని ఎలా నిర్ధారిస్తారు? దురదృష్టవశాత్తు ఆంధ్రాలో ఎప్పటినుండో కొనసాగిన, ఇంకా ఈనాడు కొనసాగుతున్న ఎడ్యుకేషనల్ మాఫియాలాంటిది తెలంగాణా ప్రాంతమంతా పాకింది, ఇంకా పాకుతూనే ఉంది. అన్ని అస్తవ్యస్తతలకు అదే కారణం.
ఇపుడు తెలంగాణా రాష్ట్రంలో ఇసుక మాఫియా, ల్యాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా, గ్రానైట్ మాఫియా, ఫారెస్ట్ ఉడ్ మాఫియాలలో ఎడ్యుకేషన్ మాఫియా కూడా చేరింది. వీధుల్లో బాహాటంగా చెప్పుకుంటున్నారు దాని గురించి. ఇపుడు ‘‘ఈవెంట్ మేనేజ్మెంట్’’ అనేది ఒకటి చలామణీలో కొచ్చింది సిటీలో, ఒకప్పుడది పెళ్ళిళ్లకు ఉపయోగపడేది. ఈవెంట్ మేనేజ్మెంట్ చేసే ఒక ఘనాపాటీని పిలిచి, ‘ఇదుగోనోయి, నేను అసెంబ్లీకి, పార్లమెంట్కు పోటీ చేస్తున్నాను ఎంతైతది చెప్పు’ అని అంటే అతడు ‘దానికేమిటి సార్, మొత్తం నేనే చూసుకుంటా, నా ముఖాన ఒక వందకోట్లు పడేయండి’ అని అంటాడు. మీరప్పుడు కిళ్లీ నములుతూ, కాలుమీద కాలు వేసికొని కూర్చొని దర్జాగా గెలవవచ్చు. ఏ సందేహమూ లేదు.
అంతపాటి ఎలక్షన్లనే మేనేజ్ చేయగలిగినపుడు ఇంటర్మీడియట్కు కావలసినవి వారికి ఒప్పచెప్పి చేయించుకోవడం ఎంత సులభమో మీరే ఊహించుకోవచ్చు. మొన్న ఇంటర్ బోర్డులో జరిగింది కూడా జరిపించినవారికి ‘ఈవెంట్ మేనేజ్మెంట్’ లాంటిదే అయి ఉండవచ్చు. అన్ని స్థాయిల్లో అందరినీ మేనేజ్ చేయాలి కదా మరి! దానికి చాలా డబ్బవుతుంది కదా! ఇప్పుడు డబ్బుంటే చాలు, అన్నీ దొరుకుతాయి అమ్మకానికి, అందరూ దొరుకుతారు. మనుషులందరూ దినదినం దిగజారిపోతున్నారు. ఒక్క ఇంటర్మీడియట్ను, దాని స్టాఫ్ను, పరిపాలకులనే ఎందుకనాలి?
ఇప్పుడు ఏం చేద్దాం..!
దీనికి జవాబు సవరించడమే. అదీ అత్యున్నత స్థాయి నుండి అని తప్ప మరో జవాబు రావడానికి వీలులేదు! ఏళ్ల తరబడి ఒకవిధంగా నడిచిన, నడిపించిన ఇంటర్మీడియట్ బోర్డు లాంటి సంస్థను సవరించాలంటే, నాకు తోచినంత వరకు ముఖ్యమైన కొన్ని సూచనలు చేస్తున్నాను. 1. స్కూల్ ఎడ్యుకేషన్లో పనిచేసే సీనియర్ మోస్ట్ ప్రిన్సిపాల్ను ఒకరిని ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ డైరెక్టర్గా, మరొకరిని ఇంటర్మీడియట్ బోర్డు సెక్రటరీగా వేయాలి. అడపాదడపా బదిలీలకు గురయ్యే ఐ.ఏ. ఎస్.లను సివిల్ సర్వీసుకు చెందిన వారిని అండర్ ఆఫీసర్లుగా వేయకూడదు. 2. పరీక్షలకు చెందిన టెక్నికల్ పనులు బైటి సంస్థలకు ఇవ్వకుండా ఇంటర్నల్గానే చేసేందుకు తగు సన్నాహాలు చేసుకోవాలి. 3. అఫిలియేషన్ రికగ్నిషన్ రూల్స్ను ఖచ్చితంగా పాటించాలి. పాటించని కళాశాలలను బ్యాన్ చేయాలి.
4. ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ను స్కూళ్లలో, డిగ్రీ కాలేజ్లలో, ట్యుటోరియల్ కాలేజ్లలో నడపగూడదు. ఇంతవరకు అలా జరిగినందువలననే దాని స్టాండర్డ్స్ దెబ్బతిన్నాయి. 5. ఇక ముందు ట్యుటోరియల్స్ను ఎక్కడి స్టూడెంట్స్కు అక్కడ ఆయా కళాశాలల ఆధ్వర్యంలోనే సాయంకాలం వేళల్లో లేదా సెలవు రోజుల్లో నడిపే ఏర్పాటు చేయాలి. 6. ఇంటర్మీడియట్ పుస్తకాలకు, బోధనలకు, పరీక్షా పత్రాలకు సమన్వయత ఉండునట్లు చూడాలి. సమన్వయ లోపాల వలన కూడా విద్యార్థులు తట్టుకోలేక ఫెయిల్ అయ్యారు, ఇంకా అవుతున్నారు. 7. పరీక్షా పత్రాలు దిద్దడాన్ని వికేంద్రీకరించి, వాటి మూల్యాం కనం సరిగా జరుగుతున్నదా లేదా అని సాంపుల్ సర్వే చేబట్టాలి. సరిగా దిద్దలేదని తేలితే సస్పెన్షన్కు, తొలగింపుకు గురవుతారని మొదటే హెచ్చరించి వారి నుండి ఒక అండర్టేకింగ్ కూడా తీసుకోవాలి.
డా. కొండలరావు వెల్చాల
వ్యాసకర్త మాజీ డైరెక్టర్, తెలుగు అకాడమీ
మొబైల్ : 98481 95959