
మాండా ఉత్సవంలో భాగంగా సోమవారం రాంచీలో కలశ ప్రదర్శన చేస్తున్న స్త్రీలు
జార్ఖండ్ రాజధాని రాంచీలో మంచి వేసవిలో ‘మాండా ఉత్సవం’ జరుగుతుంది. ఇది గిరిజన పండుగ. గిరిజనులు చేసుకునే పండుగ. ఎండాకాలం వస్తే రాంచీ భగభగమని మండిపోతుంది. చుట్టు పక్కల అడవుల్లో కుంటలు, చెలమలు ఆవిరైపోతాయి. హతియ, రుక్కా, కంకె వంటి డ్యాముల్లో నీళ్లు అడుగంటుతాయి. అడవుల్లో ఉండే జీవులకే కాదు గిరిజనులకు కూడా ఇది కష్ట సమయం. అందుకే ఏప్రిల్ నెలలో వీరు మాండా ఉత్సవం జరుపుకుంటారు. రాంచీ చుట్టుపక్కల నూరు కిలోమీటర్ల పరిధిలో ఈ ఉత్సవం జరుగుతుంది.
ఎక్కడిక్కడ ఊళ్లలో శివుడి దేవాలయాలు గిరిజనులతో కిటకిటలాడతాయి. శివుడి నెత్తిన గంగమ్మ ఉంటుంది. కనుక శివుణ్ణి నమ్ముకుంటే మంచి ఎండల్లో నాలుగు వానలు పడి నీళ్లు వస్తాయని వీళ్లు ఉత్సవం చేస్తారు. సూర్యుడికి వందనం సమర్పిస్తు కలశ ప్రదర్శన చేస్తారు. ఆ నీళ్లను శివుడికి అర్పిస్తారు. ఈ క్రతువును ఆడవాళ్లు నిర్వహిస్తారు. ఉషాదేవి మాట సూర్యుడు, గంగమ్మ మాట శివుడు విన్నప్పుడు ఈ స్త్రీ భక్తుల మాట సదరు దేవుళ్లు వినకుండా ఉంటారా? ఎండల్లో నాలుగు వానలు కురిపించకపోతారా?