
గౌలిపురాలో బందోబస్తును పర్యవేక్షిస్తున్న డీజీపీ అనురాగ్ శర్మ
సాక్షి, సిటీబ్యూరో: నిమజ్జనం నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా పోలీసులు అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో జంట కమిషనరేట్ల అధికారులు పోలీసులు నిఘా, తనిఖీలు, గస్తీ, సోదాలు ముమ్మరం చేశారు. ప్రధాన ఉరేగింపు, నిమజ్జనం జరిగే చెరువుల దగ్గర, నగర వ్యాప్తంగా జరిగే కార్యక్రమాల్లో పాల్గొనే ప్రజలు సైతం అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నారు. ప్రతి చిన్న విషయాన్నీ పెద్దదిగా చేసి చూపిస్తూ, పుకార్లను పుట్టిస్తూ బల్క్ ఎస్సెమ్మెస్లు, సోషల్మీడియా ద్వారా ప్రచారం చేయడం ఇటీవల కాలంలో పెరిగింది. కొన్ని సందర్భాల్లో ఇవి కొత్త తలనొప్పులను తెచ్చిపెడుతున్నాయి. నగరంలో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకున్న అధికారులు పుకార్లను తీవ్రంగా పరిగణించాలని నిర్ణయించారు. సర్వీస్ ప్రొవైడర్లతోనూ సమన్వయంగా పని చేస్తున్నారు. పుకార్లను వ్యాపింప చేస్తున్న ఎస్సెమ్మెస్లు, సోషల్మీడియాలపై టెక్నికల్ నిఘా ఉంచే ఏర్పాటు చేశారు. దీనికోసం ప్రత్యేక వింగ్ను ఏర్పాటు చేశారు.
సామూహిక నిమజ్జనాన్ని తిలకించడానికి ప్రతి ఏడాదీ మహిళా భక్తులు సైతం అధిక సంఖ్యలో వస్తుంటారు. దీన్ని అదునుగా చేసుకుని ఆకతాయిలు, స్నాచర్లు రెచ్చిపోయే ప్రమాదం ఉంది. ఈ విషయాన్ని దష్టిలో పెట్టుకున్న సిటీ పోలీసులు ఈసారి గతానికి భిన్నంగా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఈవ్టీజర్లుకు చెక్ చెప్పడానికి 100 షీ–టీమ్ బృందాలను వివిధ ప్రాంతాల్లో మోహరిస్తున్నారు. దీంతోపాటు స్నాచర్లుకు చెక్ చెప్పేందుకు సీసీఎస్, టాస్క్ఫోర్స్లకు చెందిన డెకాయ్ బృందాలు రంగంలోకి దిగుతున్నాయి. వీరు అనుమానాస్పద, కీలక ప్రాంతాల్లో మఫ్టీల్లో సాధారణ వ్యక్తుల మాదిరి తిరుగుతూ నిఘా వేసి ఉంచుతారు. దాదాపు 40కి పైగా డెకాయ్ టీమ్స్ మోహరిస్తున్న ఉన్నతాధికారులు ఇందులో క్రైమ్ వర్క్పై పట్టున్న వాళ్లు ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. నగరంలో ఎవరికైనా పుకార్లతో కూడిన సందేశాలు వస్తే వాటిని తక్షణం పోలీసుల దృష్టికి తీసుకురావాలని స్పష్టం చేస్తున్నారు.
భారీ బందోబస్తు: డీజీపీ అనురాగ్శర్మ
యాకుత్పురా: గణేష్ నిమజ్జనోత్సవం కోసం 25 వేల మంది పోలీసులు, 13 కంపెనీల కేంద్ర పారా మిలటరీ బలగాలతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని డీజీపీ అనురాగ్ శర్మ తెలిపారు. బుధవారం సాయంత్రం ఆయన పాతబస్తీలో శోభాయాత్ర కొనసాగే ప్రధాన రోడ్డు, సమస్యాత్మక ప్రాంతాలు, వినాయక మండపాలను నగర సీపీ మహేందర్ రెడ్డి, ఇంటెలిజెన్ చీఫ్ నవీన్చంద్తో కలిసి సందర్శించారు. సుధా థియేటర్ వినాయక మండపాన్ని, అక్కడి నుంచి గౌలిపురా మహ్మద్ షుకూర్ మసీదు వద్ద బందోబస్తును పరిశీలించారు.