
తెలంగాణకు 17.5.. ఏపీకి 18.5 టీఎంసీలు
♦ ఇరు రాష్ట్రాలకు నీటి విడుదలపై కృష్ణా బోర్డు నిర్ణయం
♦ తెలంగాణకు సాగర్ ఎడమ కాల్వ కింద 15 టీఎంసీలు
♦ హైదరాబాద్, నల్లగొండ తాగునీటి అవసరాలకు 2.5 టీఎంసీలు
♦ ఏపీ వాటాగా హంద్రీ-నీవాకు 5, చెన్నై తాగునీటికి 3, తెలుగుగంగకు 5 టీఎంసీలు
సాక్షి, హైదరాబాద్: శ్రీశైలం, నాగార్జునసాగర్లో అందుబాటులో ఉన్న జలాలను కృష్ణా నదీ యాజమాన్య బోర్డు తెలంగాణ, ఏపీకి కేటాయించింది. అక్టోబర్ అవసరాలకుగాను తెలంగాణకు 17.5 టీఎంసీలు, ఏపీకి 18.5 టీఎంసీలు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బుధవారం ఇరు రాష్ట్రాలకు లేఖలు రాసింది. ఖరీఫ్కు నాగార్జునసాగర్ ఎడమ కాల్వ కింద 30.2 టీఎంసీలు, హైదరాబాద్ తాగునీటికి 6 టీఎంసీలు, నల్లగొండ తాగునీటికి 4.1 టీఎంసీలు కలిపి మొత్తంగా 40.3 టీఎంసీలు కావాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం ఆగస్టులో కృష్ణా బోర్డును కోరింది. ఇందులో 15 టీఎంసీల నీటి విడుదలకు బోర్డు గతంలోనే అనుమతులిచ్చింది.
తర్వాత సాగర్ ఎడమ కాల్వ కింద జోన్-1, జోన్-2లోని ఖరీఫ్ సాగు అవసరాలకు 15 టీఎంసీలు కేటాయించాలంటూ తెలంగాణ మరో లేఖ రాసింది. ఇక ఏపీ ప్రభుత్వం పోతిరెడ్డిపాడు కింద 11 టీఎంసీలు, హంద్రీనీవా కింద 5, సాగర్ ఎడమ కాల్వ కింద 2.5 టీఎంసీలు కావాలని విన్నవించింది. వీటిని పరిశీలించిన బోర్డు తాజాగా ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు చేసింది. గతంలో ఇచ్చిన ఆదేశాలకు విరుద్ధంగా ఇరురాష్ట్రాలు ఎంత మేర నీటిని వినియోగించాయో వివరిస్తూ ప్రస్తుత కేటాయింపులు చేయడం గమనార్హం.
మూడు చోట్ల వాటాకు మించి..
కృష్ణా బేసిన్లో ఇప్పటివరకు తెలంగాణ ఏఎంఆర్పీ కింద 10.21 టీఎంసీలు, ఎడమ కాల్వ కింద 5.13, కల్వకుర్తి కింద 1.745 టీఎంసీలు కలిపి మొత్తంగా 17 టీఎంసీలను వినియోగించుకున్నట్లు బోర్డు తన లేఖలో పేర్కొంది. ఏపీ పోతిరెడ్డిపాడు కింద 23.79 టీఎంసీలు, సాగర్ కుడి కాల్వ కింద 9.98, కృష్ణా డెల్టా కింద 20.41, హంద్రీనీవా కింద 9.33 టీఎంసీలు కలిపి మొత్తంగా 63.524 టీఎంసీలు వినియోగించుకుందని వివరించింది. పోతిరెడ్డిపాడు, హంద్రీనీవా, ఏఎంఆర్పీ కింద వాటాకు మించి వినియోగం చేశారని లేఖలో తెలిపింది.
అధికంగా వినియోగిస్తే ఈ నీటిని వాడొద్దు
తాజాగా కృష్ణా బోర్డు తెలంగాణకు సాగర్ ఎడమ కాల్వ కింద 15 టీఎంసీలు, హైదరాబాద్, నల్లగొండ తాగునీటి అవసరాలకు 2.5 టీఎంసీలు కలిపి 17.5 టీఎంసీల వినియోగానికి అంగీకరించింది. హంద్రీనీవాకు 5 టీఎంసీలు, చెన్నై తాగునీటికి 3, ఎస్ఆర్బీసీకి 3, తెలుగుగంగ ప్రాజెక్టు 5, సాగర్ ఎడమ కాల్వ కింద 2.5 టీఎంసీలు కలిపి మొత్తంగా ఏపీకి 18.5 టీఎంసీల విడుదలకు అంగీకారం తెలిపింది.
ఇవి గత ఆగస్టులో నీటి కేటాయింపులకు అదనమని, అప్పటి ఆదేశాల్లో పేర్కొన్న దాని కంటే ఎక్కువగా వాడుకొని ఉంటే ప్రస్తుత నీటిని వాడటానికి అవకాశం ఉండదని స్పష్టంచేసింది. ఒకవేళ తక్కువగా వినియోగించి ఉంటే మిగిలిన నీటిని వినియోగించుకోవచ్చని వివరించింది. ఏ రాష్ట్రమైనా అధికంగా నీటిని వాడుకొని ఉంటే ఆ రాష్ట్రం త్రిసభ్య కమిటీకి ఆ విషయాన్ని తెలియజేయాలని సూచించింది.