krishna board
-
మిగులు జలాల వినియోగం ఎలా?
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల ఉమ్మడి జలాశయాలైన శ్రీశైలం, నాగార్జునసాగర్లో ప్రస్తుతం మిగిలి ఉన్న నిల్వల వినియోగంపై చర్చించేందుకు శుక్రవారం కృష్ణా నదీ యాజ మాన్య బోర్డు (కేఆర్ఎంబీ) ప్రత్యేక అత్యవసర సమావేశం జరగనుంది. మధ్యాహ్నం హైదరాబాద్ జలసౌధలో జరిగే ఈ సమావేశానికి ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నీటిపారుదల శాఖల కార్యదర్శులు హాజరు కావాలని కోరుతూ బోర్డు సభ్య కార్యదర్శి డీఎం రాయ్పూరే లేఖ రాశారు.శ్రీశైలం, సాగర్లో ప్రస్తుతం మిగిలి ఉన్న నిల్వల్లో ఏపీకి 27.03 టీఎంసీలు, తెలంగాణకు 131.75 టీఎంసీల వాటాలున్నాయని పేర్కొంటూ ఇటీవల రాసిన లేఖకు కొనసాగింపుగా ఈ అత్యవసర సమావేశాన్ని నిర్వహిస్తున్నట్టు కృష్ణా బోర్డు తెలి పింది. ఏపీ తన వాటాకు మించి కృష్ణా జలాలను అక్రమంగా వాడుకుంటోందని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy) ఇటీవల ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్.. కృష్ణా బోర్డు ద్వారా ఏపీని నియంత్రించే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే కృష్ణా బోర్డు అత్యవసర సమావేశాన్ని నిర్వహించనుంది.నిల్వలన్నీ తమవే అంటున్న తెలంగాణప్రస్తుత నీటి సంవత్సరంలో 1,010.134 టీఎంసీల జలాలు లభ్యతలోకి రాగా.. తాత్కాలిక సర్దుబాటు ప్రకారం ఏపీకి 666.68 టీఎంసీలు, తెలంగాణకు 343.44 టీఎంసీల వాటా లుంటాయని కృష్ణాబోర్డు తేల్చింది. ఏపీ ఇప్పటికే 639.652 టీఎంసీలు వాడుకోగా, ఆ రాష్ట్ర కోటాలో 27.03 టీఎంసీలు మాత్రమే మిగిలి ఉన్నట్టు తెలిపింది. తెలంగాణ 211.691 టీఎంసీలు వాడుకోగా, మరో 131.75 టీఎంసీలు మిగిలి ఉన్నాయని లెక్క గట్టింది. మరోవైపు నాగార్జునసాగర్ కనీస నీటిమట్టం (ఎండీడీఎల్) 510 అడుగులకు పైన 63.6 టీఎంసీలు, శ్రీశైలం జలాశయం కనీస నీటిమట్టం 834 అడుగులకు పైన 30.811 టీఎంసీల నిల్వలు మాత్రమే ప్రస్తుతం ఉన్నాయని స్పష్టం చేసింది.అయితే ఏపీ ఇప్పటికే తమ వాటాకు మించి నీళ్లను వాడుకుందని, కాబట్టి జలాశయాల్లో మిగిలి ఉన్న నిల్వలు పూర్తిగా తమవేనని పేర్కొంటూ తెలంగాణ తాజాగా కృష్ణా బోర్డుకు లేఖ రాసింది. కృష్ణా జలాల వినియోగం విషయంలో ఏపీ, తెలంగాణల మధ్య వివాదం ముదురుతున్న నేపథ్యంలో.. ఈ అంశంపై కృష్ణా బోర్డు అత్యవసర సమావేశాన్ని నిర్వహించతలపెట్టడడం ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా, గురువారం జలసౌధలో మంత్రి ఉత్తమ్తో కృష్ణా బోర్డ్ చైర్మన్ అతుల్ జైన్ సమావేశమయ్యారు. ఏపీ, తెలంగాణ మధ్య న్యాయమైన రీతిలో నీటి పంపకాలు జరిగేలా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఉత్తమ్ కోరారు.ఒక పంటకైనా నీళ్లు ఇవ్వండి: తెలంగాణతెలంగాణలోని కృష్ణా పరీవాహక ప్రాంతాల రైతులు కనీసం ఒక పంటనైనా సాగుచేసుకునేందుకు నీళ్లు కేటాయించాలని జస్టిస్ బ్రిజేష్కుమార్ నేతృత్వంలోని కృష్ణా ట్రిబ్యునల్–2కి రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఏపీ, తెలంగాణ మధ్య కృష్ణా జలాల పంపిణీపై విచారణ నిర్వహిస్తున్న ట్రిబ్యునల్ ఎదుట రాష్ట్రం తరఫున సీనియర్ న్యాయవాది సీఎస్ వైద్యనాథన్ గురువారం రెండోరోజు వాదనలు వినిపించారు. కావేరి ట్రిబ్యునల్ అవార్డుపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో తన వాదనలకు అనుకూలంగా ఉన్న కొన్ని వివరాలను ఆయన చదివి వినిపించారు.కావేరి, కృష్ణా బేసిన్ల మధ్య పలు అంశాల్లో పోలికలున్నాయని, రెండు బేసిన్లలో నీటి కొరత ఉండగా, అవసరాలు అధికంగా ఉన్నాయని చెప్పారు. అధిక నీళ్లు అవసరమైన వరి సాగుకు బదులుగా తక్కువ నీళ్లతో తక్కువ వ్యవధిలో పండే పంటలను సాగు చేయాలని కావేరి ట్రిబ్యునల్ చేసిన సూచనను కృష్ణా పరీవాహకంలో అమలు చేయాలని ప్రతిపాదించారు. మార్చి 5న గోదావరి బోర్డు సమావేశంగోదావరి నదీ యాజమాన్య బోర్డు సమావేశం మార్చి 5న హైదరాబాద్లోని జలసౌధలో జరగనుంది. -
శ్రీశైలం ప్రాజెక్ట్ ఖాళీ!
సాక్షి, అమరావతి: నాగార్జునసాగర్లో శుక్రవారం 552.4 అడుగుల్లో 215.1 టీఎంసీలు నిల్వ ఉన్నాయి... కుడి, ఎడమ కాలువ కింద ఆయకట్టుకు సరఫరా చేయడానికి సరిపడా నీళ్లున్నాయి... అంటే.. సాగర్ ఆయకట్టుతోపాటు దిగువన కూడా ఎలాంటి నీటి అవసరాలు లేవన్నది స్పష్టమవుతోంది. అయినా శ్రీశైలం ఎడమ గట్టు కేంద్రంలో తెలంగాణ జెన్కో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ శుక్రవారం 14,126 క్యూసెక్కులను తరలిస్తోంది. కొన్నాళ్లుగా ఇదే తంతు కొనసాగుతుండటంతో శ్రీశైలం జలాశయంలో నీటి నిల్వ కనీస నీటి మట్టం(minimum water level) 854 అడుగులకంటే దిగువకు చేరుకుంది. శ్రీశైలం జలాశయం(Srisailam Reservoir) గరిష్ట నీటిమట్టం 885 అడుగులకు 215.80 టీఎంసీలు కాగా, శుక్రవారం సాయంత్రం 6 గంటలకు 853.2 అడుగుల్లో 87.24 టీఎంసీలకు నీటిమట్టం తగ్గిపోయింది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా ఎస్సార్బీసీ, తెలుగుగంగ, గాలేరు–నగరి ఆయకట్టుకు నీళ్లందించలేని పరిస్థితి ఏర్పడింది. హంద్రీ–నీవా సుజల స్రవంతి పథకం ద్వారా కేవలం 1,600 క్యూసెక్కులను మాత్రమే మన రాష్ట్ర ప్రభుత్వం తరలిస్తోంది. తెలంగాణ జెన్కో ఇదే రీతిలో నీటిని తోడేస్తే.. రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు తాగునీటికి సైతం ఇబ్బందులు తప్పవని అధికారవర్గాలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. కృష్ణా జలాలపై రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల హక్కులను తెలంగాణ జెన్కో కాలరాస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం ప్రేక్షకపాత్ర వహిస్తోందని నీటిపారుదలరంగ నిపుణులు మండిపడుతున్నారు. కృష్ణా, తుంగభద్ర నదుల నుంచి 2019–20, 20–21, 21–22, 22–23 తరహాలోనే ఈ నీటి సంవత్సరంలోనూ శ్రీశైలానికి గరిష్టంగా 1,575.62 టీఎంసీల ప్రవాహం వచ్చింది. అయినా జనవరి ఆఖరుకే శ్రీశైలంలో నీటిమట్టం కనీస స్థాయికి దిగువకు చేరింది. రెండు రాష్ట్రాలను కృష్ణా బోర్డు సమన్వయం చేసి ఉంటే.. ప్రకాశం బ్యారేజీ నుంచి 869.72 టీఎంసీలు కడలిలో కలిసేవి కావని.. శ్రీశైలం ప్రాజెక్టులో ఇప్పటికీ గరిష్ట స్థాయిలో నీటి నిల్వ ఉండేదని నీటిపారుదలరంగ నిపుణులు స్పష్టంచేస్తున్నారు.ఆది నుంచి ఇదే తీరు...నీటి సంవత్సరం ప్రారంభం నుంచే వరద ప్రవాహం మొదలు కాకపోయినా శ్రీశైలం ప్రాజెక్టు నుంచి జూన్ మొదటి వారంలో నీటిని తరలించే ప్రక్రియకు తెలంగాణ సర్కార్, జెన్కో శ్రీకారం చుట్టాయి. కృష్ణా బోర్డు నీటి కేటాయింపులు లేకపోయినా యథేచ్ఛగా విద్యుత్ ఉత్పత్తి చేస్తూ దిగువకు నీటిని తరలిస్తూ శ్రీశైలాన్ని ఖాళీ చేస్తూ వచ్చింది. రబీలో సాగు.. వేసవిలో తాగునీటి అవసరాల కోసం శ్రీశైలం ప్రాజెక్టులో నీటిని నిల్వ ఉంచాలని, విద్యుత్ ఉత్పత్తి చేయొద్దని కృష్ణా బోర్డు ఆదేశించినా... తెలంగాణ జెన్కో ఖాతరు చేయలేదు. తెలంగాణ జెన్కో యథేచ్ఛగా విద్యుత్ ఉత్పత్తి చేస్తూ దిగువకు నీటిని తరలిస్తున్నా మన రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. దీంతో ఈ ఏడాది శ్రీశైలానికి 1,575.62 టీఎంసీల ప్రవాహం వచ్చినా ఫలితం లేకపోయిందని నీటిపారుదలరంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కృష్ణా బోర్డుకు మన రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఫిర్యాదు చేసి.. తెలంగాణ జెన్కోను కట్టడి చేసి ఉంటే శ్రీశైలంలో ఇప్పటికీ గరిష్ట స్థాయిలో నీటి నిల్వ ఉండేదని చెబుతున్నారు. -
కృష్ణా జలాల్లో పాత వాటాలే..
సాక్షి, అమరావతి: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన కృష్ణా జలాలను ప్రస్తుత నీటి సంవత్సరంలో కూడా పాత వాటాల ప్రకారమే.. ఆంధ్రప్రదేశ్కు 66 శాతం (512 టీఎంసీలు), తెలంగాణకు 34 శాతం (299 టీఎంసీలు) చొప్పున పంపిణీ చేస్తామని కృష్ణా బోర్డు వెల్లడించింది. తెలంగాణలో కృష్ణా బేసిన్ 71 శాతం ఉందని, ఆ లెక్కన 71 శాతం వాటా తమకు రావాలని, బ్రిజేష్కుమార్ ట్రిబ్యునల్ తీర్పు వెలువడే వరకూ 50 శాతం వాటాను కేటాయించాలని తెలంగాణ నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జ, ఈఎన్సీ అనిల్కుమార్ డిమాండ్ చేశారు. దీనిపై ఆంధ్రప్రదేశ్ ఈఎన్సీ ఎం.వెంకటేశ్వరరావు అభ్యంతరం వ్యక్తంచేశారు. బచావత్ ట్రిబ్యునల్ ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు చేసిందని.. ఆ ప్రాతిపదికనే ఆంధ్రప్రదేశ్కు 66 శాతం, తెలంగాణకు 34 శాతం పంపిణీ చేస్తూ 2015, జూలై 18–19న కేంద్రం తాత్కాలిక సర్దుబాటు చేసిందని గుర్తుచేశారు. బ్రిజేష్కుమార్ ట్రిబ్యునల్ తీర్పు అమల్లోకి వచ్చేవరకూ 66 : 34 వాటాల ప్రకారమే నీటిని పంపిణీ చేయాలని పునరుద్ఘాటించారు. దీంతో.. ఇరు రాష్ట్రాల అధికారుల వాదనలు విన్న కృష్ణా బోర్డు చైర్మన్ అతుల్ జైన్ పాత వాటాల ప్రకారమే ఈ ఏడాది నీటిని పంపిణీ చేస్తామని తేల్చిచెప్పారు. నీటి అవసరాలు ఏవైనా ఉంటే త్రిసభ్య కమిటీలో చర్చించి, నిర్ణయం తీసుకోవాలని సూచించారు. హైదరాబాద్లోని జలసౌధలో మంగళవారం కృష్ణా బోర్డు కార్యాలయంలో చైర్మన్ అతుల్ జైన్ అధ్యక్షతన బోర్డు 19వ సర్వసభ్య సమావేశం వాడివేడిగా జరిగింది. ఏపీ ప్రభుత్వం తరఫున ఈఎన్సీ ఎం.వెంకటేశ్వరరావు, అంతర్రాష్ట్ర జలవనరుల విభాగం అధికారులు, తెలంగాణ సర్కారు తరఫున నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జ, ఈఎన్సీ అనిల్కుమార్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. టెలీమీటర్ల ఏర్పాటుపై భిన్నాభిప్రాయాలు..ప్రస్తుత నీటి సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే వాటాకు మించి 76 శాతం నీటిని వాడుకుందని.. పెన్నా బేసిన్కు నీటిని తరలించిందని తెలంగాణ నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జ వివరించారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ దిగువన బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్తోపాటు పెన్నా బేసిన్కు కృష్ణా జలాలను మళ్లించే 11 చోట్ల టెలీమీటర్లు ఏర్పాటుచేయాలని డిమాండ్ చేశారు. దీనిపై ఏపీ ఈఎన్సీ వెంకటేశ్వరరావు అభ్యంతరం వ్యక్తంచేశారు. ప్రకాశం బ్యారేజ్ నుంచి 833 టీఎంసీలు సముద్రంలో కలిశాయని.. వరద సమయంలో ఏ రాష్ట్రం మళ్లించినా ఆ నీటిని కోటాలో కలపకూడదని ఆది నుంచి తాము కోరుతూ వస్తున్నామని గుర్తుచేశారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్దే టెలీమీటరు ఏర్పాటుచేశారని.. దాని దిగువన టెలీమీటర్లు ఏర్పాటుచేస్తే ఏం ప్రయోజనమని ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై తమ ప్రభుత్వంతో చర్చించి, నిర్ణయం చెబుతామని బోర్డు ఛైర్మన్కు చెప్పారు.శ్రీశైలం ప్రాజెక్టులకు అత్యవసర మరమ్మతులు..ఇక కృష్ణా నదికి 2009లో వచ్చిన వరదలకు శ్రీశైలం ప్రాజెక్టు ఫ్లంజ్ పూల్ దెబ్బతిందని.. తక్షణమే మరమ్మతు చేయకపోతే ఆ ప్రాజెక్టు భద్రతకే ప్రమాదమని తెలంగాణ అధికారులు బోర్డు దృష్టికి తెచ్చారు. శ్రీశైలం ప్రాజెక్టు ఫ్లంజ్ పూల్పై కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థతో అధ్యయనం చేయించాలని నిర్ణయించామని.. అందులో వెల్లడైన అంశాల ఆధారంగా ఫ్లంజ్పూల్కు మరమ్మతులు చేస్తామని ఏపీ ఈఎన్సీ చెప్పారు. ఆలోగా శ్రీశైలం ప్రాజెక్టులో అత్యవసర మరమ్మతులను వచ్చే సీజన్లోగా పూర్తిచేస్తామన్నారు. మరోవైపు.. నాగార్జునసాగర్ నుంచి సీఐఎస్ఎఫ్ బలగాలను ఉపసంహరించుకుని, నిర్వహణ బాధ్యతను తెలంగాణకు అప్పగించాలని ఆ రాష్ట్ర అధికారులు కోరారు.రెండునెలలు చూస్తామని.. సాగర్ విషయంలో ఇరు రాష్ట్రాల మధ్య ఎలాంటి వివాదాలు ఉత్పన్నం కాకపోతే అప్పుడు సీఐఎస్ఎఫ్ బలగాలను ఉపసంహరించే అంశాన్ని పరిశీలిస్తామని బోర్డు చైర్మన్ అతుల్జైన్ తెలిపారు. కృష్ణా బోర్డు కార్యాలయాన్ని విజయవాడకు తరలించాలని ఏపీ ఈఎన్సీ చేసిన ప్రతిపాదనకు జైన్ సానుకూలంగా స్పందించారు. 50 శాతం వాటా అసంబద్ధం..కృష్ణా జలాల్లో 50 శాతం వాటా తెలంగాణ అధికారులు కోరడం అసంబద్ధం. బచావత్ ట్రిబ్యునల్ ప్రాజెక్టుల వారీగా చేసిన కేటాయింపుల ఆధారంగానే ఏపీకి 512 టీఎంసీలను 2015లో కేంద్రం కేటాయించింది.ఇప్పుడు ఏ ప్రాజెక్టుకు నీళ్లు ఇవ్వొద్దని తెలంగాణ అధికారులు చెబుతారు? ఇదే అంశాన్ని కృష్ణా బోర్డుకు చెప్పాం. బ్రిజేష్కుమార్ ట్రిబ్యునల్ తీర్పు అమల్లోకి వచ్చే వరకూ 66 : 34 నిష్పత్తిలోనే నీటిని పంపిణీ చేయాలని కోరగా బోర్డు చైర్మన్ సానుకూలంగా స్పందించారు. – ఎం. వెంకటేశ్వరరావు, ఈఎన్సీ, ఏపీ జలవనరుల శాఖ -
శ్రీశైలం జలాశయం ఖాళీ!
సాక్షి, అమరావతి: దిగువన తాగు, సాగునీటి అవసరాలు ఉన్నప్పుడు కేటాయించిన నీటిని మాత్రమే శ్రీశైలం ప్రాజెక్టు నుంచి విద్యుత్ కేంద్రాల ద్వారా తరలించాలన్న నిబంధనను తెలంగాణ జెన్కో తుంగలోకి తొక్కేసింది. కృష్ణా బోర్డు ఉత్తర్వులను ఉల్లంఘించి యథేచ్ఛగా విద్యుత్ ఉత్పత్తి చేస్తూ దిగువకు నీటిని తరలించేస్తోంది. శ్రీశైలం ప్రాజెక్టును ఖాళీ చేస్తోంది. శుక్రవారం సాయంత్రం ఎడమ గట్టు కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ 35,315 క్యూసెక్కులను దిగువకు తరలించేస్తోంది. దీంతో శ్రీశైలం ప్రాజెక్టులో నీటి నిల్వ 862 అడుగుల్లో 112.21 టీఎంసీలకు తగ్గిపోయింది. అయినా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నోరుమెదపడం లేదు. తెలంగాణ జెన్కో ఇదే రీతిలో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ పోతే జనవరి 15వ తేదీలోగా శ్రీశైలం ప్రాజెక్టు ఖాళీ కావడం ఖాయమని అధికారవర్గాలు స్పష్టం చేస్తున్నాయి. దీనివల్ల రాయలసీమతోపాటు తెలంగాణలోని ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో సాగు, తాగునీటికి ఇబ్బందులు తప్పవని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. చంద్రబాబు సర్కార్ నిర్వాకం వల్లే... రాష్ట్ర విభజన నేపథ్యంలో కృష్ణా బోర్డు పరిధిని నిర్దేశిస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసే వరకు శ్రీశైలం ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్, నాగార్జునసాగర్ను తెలంగాణ సర్కార్ నిర్వహించాలని కేంద్ర జల్శక్తి శాఖ సూచించింది. కానీ.. శ్రీశైలం ప్రాజెక్టు ఎడమ గట్టు కేంద్రం తమ భూభాగంలో ఉందని సాకు చూపుతూ దాన్ని తెలంగాణ సర్కార్ తన ఆ«దీనంలోకి తీసుకుంది. ఇదే సమయంలో నాగార్జునసాగర్ కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్ ఏపీ భూభాగంలో ఉన్నప్పటికీ దాన్ని కూడా తెలంగాణ తన ఆధీనంలోకి తీసుకుంది. దీనిపై అప్పటి చంద్రబాబు సర్కార్ చూసీచూడనట్లు వ్యవహరించింది. తెలంగాణ, ఏపీలో టీడీపీ ప్రయోజనాలను కాపాడుకోవాలన్న రెండు కళ్ల సిద్ధాంతం.. ఆ తర్వాత ఓటుకు నోటు కేసులో వ్యక్తిగత ప్రయోజనాల కోసం అప్పట్లో చంద్రబాబు మౌనంగా ఉండిపోయారు. ఆ పాపం పర్యవసానంగానే కృష్ణా బోర్డు అనుమతి లేకుండా అక్రమంగా శ్రీశైలం ప్రాజెక్టులో తెలంగాణ జెన్కో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ దిగువకు నీటిని తరలిస్తూ మన రాష్ట్ర ప్రయోజనాలను హరిస్తూ వస్తోందని రైతులు మండిపడుతున్నారు. ‘ఏపీ వాదన సహేతుకం కాదు’ సాక్షి, అమరావతి: కృష్ణా జలాలపై ఏపీ పునర్విభజన చట్టం సెక్షన్–89 మార్గదర్శకాల ప్రకారమే వాదనలు వినాలన్న ఏపీ ప్రభుత్వ వాదన సహేతుకం కాదని తెలంగాణ ప్రభుత్వం చెప్పింది. సెక్షన్–89లోని మార్గదర్శకాలు, 2023 అక్టోబర్ 6న అంతర్రాష్ట్ర నదీ జల వివాదాల చట్టం –1956లో సెక్షన్ 3 ప్రకారం జారీ చేసిన అదనపు నిబంధనలు రెండూ ఒకటేనని.. రెంటినీ కలిపి వాదనలు వినాలంది. కాలయాపన, తాత్కాలిక ఏర్పాటును అడ్డంపెట్టుకుని నీటిని తరలించడం కోసమే ఏపీ ఆ రెండు భిన్నమైనవని వాదిస్తోందని పేర్కొంది. సెక్షన్–89, సెక్షన్–3 కింద ఇచ్చిన మార్గదర్శకాలు వేర్వేరని భావిస్తే.. తొలుత సెక్షన్–3 కింద వాదనలు వినాలని తేల్చి చెబుతూ జస్టిస్ బ్రిజేష్కుమార్ నేతృత్వంలోని కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్ (కేడబ్ల్యూడీటీ)–2లో తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం అఫిడవిట్ దాఖలు చేసింది. కేంద్రం 2023 అక్టోబర్ 6న జారీ చేసిన అదనపు నియమ, నిబంధనలపై సుప్రీం కోర్టు స్టే ఇవ్వలేదని తెలంగాణ తెలిపింది. అందువల్ల సుప్రీం కోర్టులో పెండింగ్లో ఉన్న అంశంపై విచారించడానికి వీల్లేదన్న ఏపీ వాదన అసంబద్ధమని కొట్టిపారేసింది. -
కరెంట్ కోసం ఖాళీ చేసేస్తున్నారు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఏపీ పోటీపడి జలవిద్యుదుత్పత్తి చేయడంతోపాటు సాగు, తాగునీటి అవసరాలకు రోజూ సగటున 40 వేల క్యూసెక్కుల నీటిని వాడుకుంటుండటంతో శ్రీశైలం జలాశయంలో నిల్వలు వేగంగా పడిపోతున్నాయి. శనివారం ఉదయం 6 గంటలకు సేకరించిన నీటి వినియోగ లెక్కల ప్రకారం విద్యుదుత్పత్తి ద్వారా తెలంగాణ 35,315 క్యూసెక్కులను దిగువన సాగర్కు విడుదల చేస్తుండగా పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ ద్వారా 8 వేల క్యూసెక్కులు, మల్యాల నుంచి హంద్రీ–నీవా సుజల స్రవంతి (హెచ్ఎన్ఎస్ఎస్) కాల్వకు 1,688 క్యూసెక్కులను ఏపీ తరలిస్తోంది. మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా తెలంగాణ 1,600 క్యూసెక్కులను తోడుకుంటోంది. ప్రస్తుత నీటి సంవత్సరంలో శ్రీశైలం జలాశయానికి ఏకంగా 1,532.67 టీఎంసీల వరద వచి్చంది. జలాశయ గరిష్ట నీటినిల్వ సామర్థ్యం 215 టీఎంసీలకుగాను ప్రస్తుతం 149.42 టీఎంసీల నిల్వలు మాత్రమే మిగిలి ఉండటం గమనార్హం. కృష్ణా బోర్డు సూచనలు బేఖాతరు! మళ్లీ వర్షాకాలం వచ్చే వరకు శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల్లోని నిల్వలను సాగు, తాగునీటి అవసరాల కోసం సంరక్షించాలని కృష్ణా బోర్డు ఇరు రాష్ట్రాలకు ఇటీవల పలుమార్లు లేఖలు రాసింది. రెండు జలాశయాల్లో విద్యుదుత్పత్తిని తక్షణమే ఆపాలని కోరింది. దిగువ ప్రాంతాల్లో తాగు, సాగునీటి అవసరాలను తీర్చడానికే నీటిని తీసుకోవా లని సూచించింది. ఏపీ పునర్విభజన చట్టంలోని షెడ్యూల్–11లో జలవిద్యుత్కు అత్యల్ప ప్రాధా న్యత కల్పించిన విషయాన్ని గుర్తుచేసింది. అయితే బోర్డు సూచనలను ఇరు రాష్ట్రాలు బేఖాతరు చేస్తుండటంతో వేసవి ప్రారంభానికి ముందే శ్రీశైలం జలాశయంలో నిల్వలు అడుగంటిపోయే ప్రమాదముంది. అదే జరిగితే వేసవిలో సాగు, తాగు నీటి అవసరాలకు ఇబ్బందులు తప్పవు. గతేడాది తాగు, సాగునీటికి కటకట గతేడాది తీవ్ర వర్షాభావం నెలకొనడంతో శ్రీశైలం జలాశయం నిండలేదు. ఈ నేపథ్యంలో ఉన్న నిల్వలను తాగు, సాగునీటి అవసరాలకు పొదుపుగా వాడుకోవాలని.. జలవిద్యుదుత్పత్తి చేయొ ద్దని కృష్ణా బోర్డు కోరినా ఇరు రాష్ట్రాలు పోటాపోటీగా విద్యుదుత్పత్తి చేపట్టాయి. దీంతో గతేడాది సరిగ్గా ఇదే సమయానికి జలాశయంలో నిల్వలు 61.55 టీఎంసీలకు పడిపోయాయి. దీంతో గతే డాది వేసవిలో తాగు, సాగునీటికి రెండు రాష్ట్రాల్లోతీవ్ర ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయి.నేడు కృష్ణా బోర్డు భేటీ.. హైదరాబాద్లోని జలసౌధలో సోమవారం కృష్ణా బోర్డు సమావేశం జరగనుంది. ఈ భేటీలో శ్రీశైలం, సాగర్ జలాశయాల్లో విద్యుదుత్పత్తి అంశంపై ఇరు రాష్ట్రాల మధ్య వాడీవేడి చర్చ జరిగే అవకాశం ఉంది. రెండు జలాశయాలను జలవిద్యుదుత్పత్తి అవసరాల కోసమే నిర్మించారని చాలా కాలంగా తెలంగాణ వాదిస్తోంది. రెండు జలాశయా ల్లోని తమ జలవిద్యుదుత్పత్తి కేంద్రాల్లో పూర్తి స్థాపిత సామర్థ్యం మేరకు విద్యుదుత్పత్తి నిర్వహించాలని తెలంగాణ విద్యుదుత్పత్తి సంస్థ (జెన్కో)ను ఆదేశిస్తూ గత బీఆర్ఎస్ ప్రభు త్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో వేసిన కేసుపై విచారణ జరుగుతోంది. కృష్ణా బోర్డు భేటీలో ఇరు రాష్ట్రాలకు బోర్డు మళ్లీ కొత్త సూచనలు చేసే అవకాశం ఉంది. -
శ్రీశైలాన్ని ఖాళీ చేస్తున్నాపట్టించుకోరా?
సాక్షి, అమరావతి: శ్రీశైలం ప్రాజెక్టుకు దిగువన తాగు, సాగు నీటి అవసరాలు ఉన్నప్పుడే బోర్డు కేటాయించిన నీటిని ప్రాజెక్టు నుంచి విద్యుదుత్పత్తి చేస్తూ తరలించాలన్నది విభజన చట్టం, కృష్ణా బోర్డు పెట్టిన నిబంధన. కానీ.. తెలంగాణ ప్రభుత్వం ఈ నిబంధనను తుంగలో తొక్కుతోంది. దిగువన ఎలాంటి నీటి అవసరాలు లేకున్నప్పటికీ శ్రీశైలం ప్రాజెక్టు ఎడమ గట్టు కేంద్రంలో తెలంగాణ జెన్కో యథేచ్ఛగా విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు నీటిని తరలించేస్తోంది. మంగళవారం సాయంత్రం 6 గంటలకు ఎడమ గట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ 36,300 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తోంది. దాంతో ప్రాజెక్టులో నీటి మట్టం 874.4 అడుగులకు తగ్గిపోయింది. నీటి నిల్వ 160.91 టీఎంసీలకు పడిపోయింది. ఇదే కొనసాగితే శ్రీశైలం నీటి మట్టం 854 అడుగులకు దిగువకు చేరుకోవడానికి ఎంతో కాలం పట్టదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇదే జరిగితే తెలుగుగంగ, ఎస్సార్బీసీ, గాలేరు–నగరి ప్రాజెక్టులకు కృష్ణా బోర్డు నీటిని కేటాయించినా వాడుకొనే అవకాశం ఉండదు. తద్వారా రాయలసీమ జిల్లాలు, నెల్లూరు జిల్లాలోని ప్రాజెక్టులకు నీళ్లందించలేని దుస్థితి ఏర్పడుతుంది. అయినప్పటికీ చంద్రబాబు ప్రభుత్వం నోరు మెదపకపోవడంతో రైతులు, నీటి పారుదల రంగ నిపుణులు మండిపడుతున్నారు. ఆయకట్టులో పంటలు ఎండిపోతాయని రైతులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.తెలంగాణను నిలువరించని ప్రభుత్వంకృష్ణా జలాలపై రాష్ట్ర హక్కులను 2014లో తెలంగాణకు చంద్రబాబు తాకట్టు పెట్టిన పాపం ఇప్పటికీ వెంటాడుతోంది. తెలంగాణ ప్రభుత్వం బోర్డు ఆదేశాలను బేఖాతరు చేస్తూ శ్రీశైలం ఎడమ గట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు కృష్ణా జలాలను తరలిస్తోంది. సాగర్ కుడి కాలువ ద్వారా నీటిని విడుదల చేయకుండా రాష్ట్ర హక్కులకు అడ్డుపడుతోంది. రాష్ట్ర హక్కుల పరిరక్షణ కోసం 2021లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. కృష్ణా బోర్డు పరిధిని నిర్దేశించి వివాదానికి తెర దించాలని కేంద్రాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది. దాంతో 2021 జూలై 15న కృష్ణా బోర్డు పరిధిని నిర్దేశిస్తూ కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. దానికీ తెలంగాణ మోకాలడ్డుతుండటంతో రాష్ట్ర హక్కులను పరిరక్షించుకోవడానికి 2023లో రాష్ట్ర భూభాగంలో ఉన్న సాగర్ కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్, స్పిల్ వే సగం అంటే 13 గేట్లను ఏపీ ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకుంది. ఇప్పుడు మళ్లీ తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర హక్కులను కాలరాస్తున్నా కూటమి ప్రభుత్వం నిలువరించకపోవడంపై రైతులు మండిపడుతున్నారు. రాష్ట్ర హక్కులు తెలంగాణకు తాకట్టువిభజన తర్వాత 2014లో చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చింది. కృష్ణా జలాల వినియోగంలో రెండు రాష్ట్రాల మధ్య విభేదాలు తలెత్తకుండా కేంద్రం కృష్ణా బోర్డును ఏర్పాటుచేసింది. బోర్డు పరిధిని నోటిఫై చేసే వరకూ ఉమ్మడి ప్రాజెక్టులలో శ్రీశైలం ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్, నాగార్జునసాగర్ను తెలంగాణ నిర్వహించాలని కేంద్రం నిర్దేశించింది. కానీ.. శ్రీశైలం ఎడమ గట్టు విద్యుత్ కేంద్రం తన భూభాగంలో ఉందంటూ తెలంగాణ సర్కారు అప్పట్లో దానిని తన ఆధీనంలోకి తీసుకుంది. ఇదే తరహాలో రాష్ట్ర భూభాగంలో ఉన్న నాగార్జున సాగర్ కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్, సాగర్ స్పిల్ వేలో 13 గేట్లను నాటి చంద్రబాబు సర్కారు స్వాధీనం చేసుకోలేదు. తెలంగాణలోనూ టీడీపీని బతికించుకోవాలనే రెండు కళ్ల సిద్ధాంతం.. ఆ తర్వాత ఓటుకు కోట్లు కేసు నుంచి తప్పించుకోవడానికి కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కులను అప్పట్లోనే సీఎం చంద్రబాబు తెలంగాణకు తాకట్టు పెట్టేశారు. -
మాకు ‘సాగర్’ పగ్గాలివ్వాలి
సాక్షి, హైదరాబాద్: నాగార్జునసాగర్ పగ్గాలను తమకే అప్పగించాలని తెలంగాణ చేస్తున్న డిమాండ్తోపాటు ఏపీ, తెలంగాణ మధ్య కృష్ణా జలాల పంపిణీపై చర్చించడానికి డిసెంబర్ 3న కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) సమావేశం జరగనుంది. హైదరాబాద్లోని జలసౌధలో జరగనున్న 19వ సమావేశం ఎజెండాలో మొత్తం 24 కీలక అంశాలను కృష్ణాబోర్డు చేర్చడంతో వీటిపై వాడీవేడీ చర్చ జరగనుంది. బోర్డు చైర్మన్, కన్వీనర్తోపాటు ఏపీ, తెలంగాణ అధికారులు హాజరు కానున్నారు. తెలంగాణ డిమాండ్లు ‘ఆనకట్టల భద్రత చట్టం 2021లోని సెక్షన్ 16(1ఏ) ప్రకారం నాగార్జునసాగర్ భద్రతకి సంబంధించిన నిఘా, 16(1బీ) ప్రకారంతనిఖీలు, 16(1సీ) ప్రకారం నిర్వహణ, పర్యవేక్షణ వంటి కార్యకలాపాలు తెలంగాణ పరిధిలోకే వస్తాయి. యావత్ జలాశయం కార్యకలాపాలన్నింటినీ తెలంగాణకే అప్పగించాలి. ఈ విషయంలో ఏపీ జోక్యానికి, తెలంగాణ విధుల ఆక్రమణకు తావులేదు. కృష్ణా బోర్డు సూచనల మేరకు రాష్ట్ర విభజన నాటి నుంచి సాగర్ డ్యామ్, కుడి, ఎడమ కాల్వల రెగ్యులేటర్ల నిర్వహణ, పర్యవేక్షణ తెలంగాణ చేతిలో ఉండగా, గతేడాది నవంబర్ 28న ఏపీ అధీనంలోకి తీసుకుంది. కుడికాల్వ రెగ్యులేటర్ నుంచి నీళ్లను విడుదల చేసింది. ఈ ఘటనకు పూర్వ స్థితిగతులను పునరుద్ధరించాలని కేంద్ర హోంశాఖ 2023 డిసెంబర్ 1న ఏపీని ఆదేశించింది’అనే అంశాలను తెలంగాణ సూచనల మేరకు ఎజెండాలో కృష్ణా బోర్డు పొందుపరిచింది. నో అన్న ‘అపెక్స్’.. మళ్లీ బోర్డుకు పంచాయతీ కృష్ణా జలాల్లో ఉమ్మడి ఏపీకి ఉన్న 811 టీఎంసీల వాటా నుంచి ఏపీ, తెలంగాణకు పంపకాలు జరగలేదు. రాష్ట్ర విభజన అనంతరం 2015లో కేంద్ర జలశక్తి శాఖ నిర్వహించిన సమావేశంలో 2015–16 అవసరాల కోసం ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీలను తాత్కాలికంగా కేటాయించారు. 2016–17లో సైతం ఇదే కేటాయింపులను కొనసాగించాలని 2016లో జరిగిన కౌన్సిల్ సమావేశంలో నిర్ణయించారు. దీని ఆధారంగానే 2017–18లో ఏపీ, తెలంగాణ మధ్య 66:34 నిష్పత్తిలో నీటి పంపకాలు జరపాలని 2017లో కృష్ణా బోర్డు నిర్ణయించింది. 2021–22 వరకూ దీన్నే కొనసాగించారు. 2022–23లో దీని కొనసాగింపును తెలంగాణ వ్యతిరేకించింది. 50:50 నిష్పత్తిలో పంపిణీ జరపాలని తెలంగాణ కోరగా, 66:34 నిష్పత్తిలోనే కొనసాగించాలని ఏపీ పట్టుబట్టింది. తాత్కాలిక కోటాపై అపెక్స్ కౌన్సిల్ నిర్ణయాన్ని కోరుతూ వివాదాన్ని కేంద్ర జలశక్తి శాఖకు కృష్ణా బోర్డు రెఫర్ చేయగా, అపెక్స్ కౌన్సిల్ నీటి పంపకాల జోలికి వెళ్లదని జలశక్తి శాఖ చెప్పింది. దీంతో వివాదం మళ్లీ కృష్ణా బోర్డుకు చేరింది. ఎజెండాలో కృష్ణా బోర్డు పొందుపరిచిన అంశాలివీ.. » కృష్ణా బోర్డు కార్యాలయం ఏపీకి తరలింపు. » గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం శ్రీశైలం, నాగార్జునసాగర్ నిర్వహణను కృష్ణా బోర్డుకు అప్పగించాలి. » ఇరు రాష్ట్రాల్లోని అనధికార ప్రాజెక్టుల పనులను నిలుపుదల చేయాలి. » రెండో విడతలో 9 టెలీమెట్రీ స్టేషన్ల ఏర్పాటుకు నిధుల కేటాయింపు. తెలంగాణ ఇతర డిమాండ్లు » తాము వాడుకోకుండా నాగార్జునసాగర్లో పొదుపు చేసిన తమ వాటా జలాలను తదుపరి నీటి సంవత్సరంలో వాడుకోవడానికి అనుమతించాలి. » సాగర్ టెయిల్పాండ్ నుంచి విద్యుదుత్పత్తి ద్వారా ఏపీజెన్కో అనధికారికంగా 4 టీఎంసీలను విడుదల చేసింది. ఇప్పటికే కృష్ణా డెల్టాకు ఏపీ 117 టీఎంసీలను విడుదల చేసింది. ఇకపై టెయిల్పాండ్ విద్యుత్ కేంద్రం నుంచి వరదలున్నప్పుడే నీళ్లు విడుదల చేయాలి. సాగర్ టెయిల్పాండ్ డ్యామ్ గేట్ల నిర్వహణనూ తెలంగాణకే అప్పగించాలి. » ఆర్డీఎస్ ఆనకట్ట ఆధునీకరణకు ఏపీ అడ్డుపడుతుండటంతో తమ వాటా జలాలను తీసుకోలేకపోతున్నాం. కృష్ణా ట్రిబ్యునల్–2 నీటి కేటా యింపులు జరిపే వరకు ఆర్డీఎస్ కుడికాల్వ పనులను కొనసాగించే అధికారం ఏపీకి లేదు. » ఏపీ నీటి వినియోగాన్ని లెక్కించడానికి శ్రీశైలం, సాగర్, ప్రకాశం, సుంకేశుల బరాజ్ల వద్ద టెలిమెట్రీ స్టేషన్లను ఏర్పాటు చేయాలి. » రాయలసీమ ఎత్తిపోతలతో సహా అనుమతుల్లేకుండా కృష్ణా బేసిన్లో ఏపీ చేపడుతున్న ప్రాజెక్టులు, ఎస్ఆర్ఎంసీ కాల్వ లైనింగ్ పనులను నిలుపుదల చేయాలి. » శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడు, ఎస్ఆర్బీసీ, జీఎన్ఎస్ఎస్, తెలుగు గంగ, హెచ్ఎన్ఎస్, నిప్పులవాగు ఎస్కేప్ చానల్ ఇతర మార్గాల ద్వారా బేసిన్ వెలుపలి ప్రాంతాలకు కృష్ణా జలాలను ఏపీ చేపట్టరాదు. » శ్రీశైలం జలాశయం ప్లంజ్ పూల్కి ఏపీ అత్యవసర మరమ్మతుల నిర్వహించాలి. -
శ్రీశైలం, సాగర్ను ఖాళీ చేస్తారా?
సాక్షి, అమరావతి: శ్రీశైలం, నాగార్జున సాగర్లో విద్యుదుత్పత్తిని నిలిపేసి, జలాలను సంరక్షించాలన్న తమ ఆదేశాలను ఏపీ తెలంగాణ రాష్ట్రాలు ఉల్లంఘించడంపై కృష్ణా బోర్డు ఆగ్రహం వ్యక్తం చేసింది. రెండు రాష్ట్రాలపై చర్యలకు ఉపక్రమించింది. ఉమ్మడి ప్రాజెక్టుల్లో పోటీ పడి విద్యుదుత్పత్తి చేస్తూ జలాశయాలను ఖాళీ చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. రెండు రాష్ట్రాల నీటి పారుదల అధికారులతో మళ్లీ రిజర్వాయర్ నిర్వహణ కమిటీ (ఆర్ఎంసీ) సమావేశం నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ఆన్లైన్ ద్వారా శుక్రవారం ఈ సమావేశం నిర్వహిస్తామని బోర్డు సభ్యులు ఆర్ఎన్ శంఖ్వా ఇరు రాష్ట్రాలకు లేఖ రాయగా.. ఏపీ ప్రభుత్వ విజ్ఞప్తితో వాయిదా వేశారు. ఈ నెల 25 తర్వాత సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు.ఏడాది తర్వాత ఆర్ఎంసీ సమావేశంశ్రీశైలం, నాగార్జున సాగర్ జలాశయాల్లో నీటి నిల్వలపై సరైన పర్యవేక్షణ, జల విద్యుత్ కేంద్రాల నిర్వహణకు మార్గదర్శకాలను ఖరారు చేయడం ఆర్ఎంసీ ప్రధాన ఉద్దేశం. శ్రీశైలం, సాగర్ నిర్వహణకు కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) రూపొందించిన ముసాయిదా నిబంధనలను పరిశీలించి, అవసరమైన సవరణలతో తుదిరూపు ఇవ్వడం, జలాశయాలన్నీ నిండిన తర్వాత రెండు రాష్ట్రాలు జరిపే మిగులు జలాల వినియోగాన్ని లెక్కిల్లోకి తీసుకోకుండా మినహాయింపు కల్పించడంపైనా చర్చించి నిర్ణయం తీసుకోవాలని కూడా కృష్ణా బోర్డు ఆర్ఎంసీని కోరింది. తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో ఆర్ఎంసీ పలు దఫాలుగా సుదీర్ఘ చర్చలు జరిపినా ఏకాభిప్రాయం కుదరలేదు. మళ్లీ ఏడాదికి పైగా విరామం తర్వాత కృష్ణా బోర్డు ఆర్ఎంసీ సమావేశాన్ని తలపెట్టడం గమనార్హం.21న కృష్ణా బోర్డు సమావేశంకృష్ణా బోర్డు 19వ సర్వ సభ్య సమావేశం ఈ నెల 21న ఉదయం 11 గంటలకు హైదరాబాద్లోని జలసౌధలో జరగనుంది. బోర్డు చైర్మన్ అతుల్ జైన్ నేతృత్వంలో జరిగే ఈ సమావేశంలో ఏపీ జలవనరుల శాఖ కార్యదర్శి జి.సాయిప్రసాద్, ఈఎన్సీ ఎం.వెంకటేశ్వర రావు, తెలంగాణ నీటి పారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, ఈఎన్సీ జి.అనిల్ కుమార్ తదితరులు పాల్గొననున్నారు. ఏపీ, తెలంగాణ మధ్య తాత్కాలిక కృష్ణా జలాల సర్దుబాటుతో పాటు ఇతర అంశాలపై చర్చించనున్నారు. -
హంద్రీ–నీవాకు నీళ్లిచ్చేదెప్పుడు?
సాక్షి, అమరావతి : శ్రీశైలం ప్రాజెక్టు నుంచి తెలంగాణ ప్రభుత్వం ఆ రాష్ట్రంలోని ప్రాజెక్టులకు నీటిని విడుదల చేస్తున్నా, మన రాష్ట్రంలోని హంద్రీ–నీవా ప్రాజెక్టు గురించి మాత్రం ఏపీ సర్కారు పట్టించుకోవడం లేదు. శ్రీశైలం ప్రాజెక్టులో గురువారం నాటికి నీటి మట్టం కనీస స్థాయికి అంటే 854 అడుగులకు పైగా చేరింది.. ఎగువ నుంచి ప్రాజెక్టులోకి రెండు లక్షల క్యూసెక్కుల ప్రవాహం వచ్చి చేరుతోంది.. కృష్ణా బోర్డు అనుమతి తీసుకోకుండానే ఎడమ గట్టు కేంద్రంలో తెలంగాణ జెన్కో విద్యుదుత్పత్తి చేస్తూ 31,784 క్యూసెక్కులను ప్రాజెక్టు నుంచి దిగువకు తరలిస్తోంది.. జూన్ 3 నాటికి శ్రీశైలం ప్రాజెక్టులో 806.3 అడుగుల్లో 32.19 టీఎంసీలు మాత్రమే నిల్వ ఉన్నప్పటికీ తెలంగాణ ప్రభుత్వం కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా నీటి తరలింపు ప్రారంభించింది.. కానీ ఇప్పటికీ హంద్రీ–నీవా సుజల స్రవంతి ప్రధాన కాలువలోకి నీటిని ఎత్తిపోయడంపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోవడం గమనార్హం.నైరుతి రుతు పవనాల ప్రభావం వల్ల రాయలసీమలోని అధిక ప్రాంతాల్లో చెదురుముదురు వర్షాలే కురిశాయి. హంద్రీ–నీవాలో అంతర్భాగమైన జలాశయాలు.. కాలువకు ఇరు వైపులా ఉన్న చెరువులు నీళ్లు లేక నోళ్లు తెరుచుకోవడం.. భూగర్భ జల మట్టం తగ్గిపోవడంతో తాగు, సాగునీటికి సీమ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా జూన్ 3 నుంచే తెలంగాణ సర్కార్ నీటిని తరలిస్తున్నప్పటికీ.. రాష్ట్ర ప్రభుత్వం హంద్రీ–నీవాకు నీటిని విడుదల చేయక పోవడంపై రైతులు మండిపడుతున్నారు. రాయలసీమపై సీఎం చంద్రబాబుకు ఉన్న చిత్తశుద్ధి ఏపాటిదో మరోసారి నిరూపితమైందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఐదేళ్లూ రాయలసీమ సస్యశ్యామలం శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 120 రోజుల్లో 40 టీఎంసీలను తరలించి ఉమ్మడి కర్నూలు, అనంతపురం, వైఎస్సార్, చిత్తూరు జిల్లాల్లో 6.02 లక్షల ఎకరాలకు సాగునీరు, 33 లక్షల మంది దాహార్తి తీర్చి.. రాయలసీమను సస్యశ్యామలం చేయడమే లక్ష్యంగా రూ.6,850 కోట్లతో 2004లో మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి హంద్రీ–నీవా సుజల స్రవంతి పథకాన్ని ప్రారంభించారు. 2009 నాటికే చాలా వరకు పనులు పూర్తవడంతో 2012–13 నుంచి హంద్రీ–నీవా ద్వారా రాయలసీమకు ప్రభుత్వం నీటిని తరలిస్తోంది. ప్రస్తుత డిజైన్ మేరకు హంద్రీ–నీవా ద్వారా 40 టీఎంసీలు ఎత్తిపోయాలంటే 120 రోజులపాటు రోజుకు 3,850 క్యూసెక్కుల చొప్పున నీటిని ఎత్తిపోయాలి. తెలంగాణ సర్కార్ ఎడమ గట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు నీటిని తరలిస్తూ శ్రీశైలాన్ని ఖాళీ చేస్తుండటంతో 120 రోజులు నీరు నిల్వ ఉండని పరిస్థితి. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక 60 రోజుల్లోనే 40 టీఎంసీలను తరలించేలా హంద్రీ–నీవా సామర్థ్యం పెంచే పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. జూన్ రెండో వారం నుంచే 800 అడుగుల నుంచే నీటిని ఎత్తిపోయడం ద్వారా ఏటా సామర్థ్యం కంటే ఎక్కువ నీటిని తరలించి.. రాయలసీమలో చెరువులు, జలాశయాలను నింపారు. ప్రధాన కాలువ కింద, చెరువులు, జలాశయాల ఆయకట్టుతోపాటు భూగర్భ జల మట్టం పెరగడంతో రైతులు బోర్లు, బావుల కింద భారీ ఎత్తున పంటలు సాగు చేసి ప్రయోజనం పొందారు. దాంతో గత ఐదేళ్లూ సీమ సస్యశ్యామలమైంది.నాటి లానే నేడూ రాష్ట్రంలో 2014–19 మధ్య అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం హంద్రీ–నీవాకు నీటి విడుదలపై మీనమేషాలు లెక్కించింది. నీటి తరలింపును ఆలస్యంగా ప్రారంభించడం వల్ల ఎన్నడూ సామర్థ్యం మేరకు అంటే ఏటా 40 టీఎంసీలు తరలించిన దాఖలాలు లేవు. నీటి తరలింపును ఆలస్యంగా ప్రారంభించడం.. ఆలోగా శ్రీశైలం నీటి మట్టం తగ్గిపోవడం వల్ల ఏటా సగటున 27.46 టీఎంసీలను మాత్రమే అప్పట్లో చంద్రబాబు సర్కార్ ఇవ్వగలిగింది. కానీ.. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక 2019–20, 20–21లో సామర్థ్యం కంటే అధికంగా నీటిని తరలించింది. 2021–22, 22–23లలో రాయలసీమలో భారీ వర్షాలు కురవడం.. చెరువులు నిండిపోవడం.. వరదలతో హంద్రీ–నీవా నీటి అవసరం పెద్దగా లేకపోయింది. 2023–24లో కృష్ణా బేసిన్లో తీవ్రమైన వర్షాభావంతో నీటి కొరత ఉన్నప్పటికీ.. హంద్రీ–నీవా ద్వారా 32.49 టీఎంసీలను తరలించి వైఎస్ జగన్ ప్రభుత్వం రాయలసీమ సాగునీటి సమస్య పరిష్కారంపై చిత్తశుద్ధిని చాటుకుంది. కానీ.. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం మాత్రం హంద్రీ–నీవాకు నీటి విడుదలపై మళ్లీ మీనవేషాలు లెక్కిస్తోంది. -
15 నాటికి శ్రీశైలానికి కృష్ణమ్మ
సాక్షి, హైదరాబాద్: ఎగువన భారీగా వర్షాలు కురుస్తుండడంతో కృష్ణా నదీ పరీవాహక ప్రాంతాల్లో ఆశాజనక పరిస్థితులు నెలకొంటున్నాయి. మహారాష్ట్ర, కర్ణాటకల్లోని పశ్చిమ కనుమల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో కృష్ణా ప్రధాన పాయలో వరద ఉధృతి పెరిగింది. ఆల్మట్టి డ్యామ్లోకి బుధవారం సాయంత్రం 6 గంటలకు 84,645 క్యూసెక్కులు చేరడంతో నీటి నిల్వ 81.44 టీఎంసీలకు చేరుకుంది. డ్యామ్ గరిష్ట నిల్వ సామర్థ్యం 129.72 టీఎంసీలు కాగా, ఆపరేషన్ ప్రొటోకాల్ ప్రకారం వరద ముప్పును నివారించేందుకు నిల్వలు గరిష్ట స్థాయికి చేరకముందే గేట్లను ఎత్తి వరదను దిగువన విడుదల చేస్తారు. గతేడాది జూలై 27న నిల్వ 93.28 టీఎంసీలకు చేరిన వెంటనే ఆల్మట్టి డ్యామ్ గేట్లను పైకి ఎత్తారు. ప్రస్తుత పరిస్థితుల్లో నిల్వలు 105 టీఎంసీలకు చేరే లోపే గేట్లను ఎత్తే అవకాశముంది. వర్షాలు, వరదలు కొనసాగితే మరో రెండు రోజుల్లోగా ఆల్మట్టి డ్యామ్ గేట్లను ఎత్తి నీళ్లను దిగువన విడుదల చేసే అవకాశముంది. ఆల్మట్టికి దిగువన ఉన్న నారాయణపూర్ డ్మామ్ గరిష్ట నిల్వ సామర్థ్యం 37.64 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 25.06 టీఎంసీల నిల్వలున్నాయి. ఆల్మట్టి డ్యామ్ గేట్లను ఎత్తిన ఒకటి రెండు రోజుల్లోనే నారాయణపూర్ డ్యామ్ గేట్లను ఎత్తి నీళ్లను విడుదల చేయనున్నారు. దీంతో తెలంగాణ భూభాగంలోని జూరాల జలాశయానికి వరద చేరుకోనుండగా, వెంటనే గేట్లను ఎత్తి దిగువన ఉన్న శ్రీశైలం జలాశయానికి నీళ్లను విడుదల చేయనున్నారు. జూరాల జలాశయం గరిష్ట నిల్వ సామర్థ్యం 9.66 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 7.72 టీఎంసీల నిల్వలున్నాయి. ఈ నెల 15 లేదా 16వ తేదీలోగా శ్రీశైలం జలాశయానికి వరదనీరు చేరుకోవచ్చని నీటిపారుదల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. తుంగభద్రకు పెరిగిన వరద ప్రవాహం కృష్ణా ప్రధాన ఉప నది తుంగభద్ర బేసిన్లోనూ వర్షాలు కురుస్తుడడంతో తుంగభద్రలో వరద ప్రవాహం మరింత పెరిగింది. తుంగభద్ర జలాశయానికి వరద ప్రవాహం బుధవారం ఉదయం 35వేల క్యూసెక్కులకు పెరిగి సాయంత్రానికి 27,544 క్యూసెక్కులకు తగ్గింది. జలాశయం గరిష్ట నిల్వ సామర్థ్యం 100.86టీఎంసీలు కాగా, ప్రస్తుతం 25.17 టీఎంసీల నిల్వలున్నాయి. వర్షాలు విస్తారంగా కురిస్తే మరో వారం రోజుల్లో తుంగభద్ర గేట్లను ఎత్తే అవకాశముంది. అప్పుడు తుంగభద్ర జలాలు కూడా సుంకేశుల బ్యారేజ్ మీదుగా శ్రీశైలం ప్రాజెక్టుకు చేరుతాయి. సాగర్ నుంచి 5 టీఎంసీల విడుదలకు అనుమతించండి: ఏపీ విజ్ఞప్తి తాగునీటి అవసరాల కోసం నాగార్జునసాగర్ నుంచి కుడి ప్రధాన కాల్వ ద్వారా 5 టీఎంసీల నీళ్లను విడుదల చేసేందుకు అనుమతించాలని ఏపీ ప్రభుత్వం కృష్ణా నదియాజమాన్య బోర్డు(కేఆర్ఎంబీ)కి విజ్ఞప్తి చేసింది. ఈ నెల 15 నుంచి రోజుకు 5500 క్యూసెక్కుల చొప్పున 11 రోజుల పాటు నీళ్లను కుడి ప్రధాన కాల్వ రెగ్యులేటర్ ద్వారా విడుదల చేసుకుంటామని, పర్యవేక్షణ కోసం కృష్ణా బోర్డు సిబ్బందిని పంపించాలని కోరింది. నీటి విడుదలకు అనుమతివ్వాలని సీఆర్పీఎఫ్ బలగాలను సైతం కోరాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఏపీ జలవనరుల శాఖ ఈఎన్సీ సి.నారాయణరెడ్డి ఈ నెల 8న కృష్ణా బోర్డు చైర్మన్కు లేఖ రాశారు. గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాల తాగునీటి అవసరాలను తీర్చే వేసవి నిల్వ ట్యాంకుల్లో నీటిమట్టం పడిపోయిందని, అందుకే నీటి విడుదల చేసుకుంటామని తెలిపారు. -
తెలంగాణకు 8.5 టీఎంసీలు
సాక్షి, హైదరాబాద్: వేసవి తాగునీటి అవసరాలకు తెలంగాణకు 8.5 టీఎంసీలు, ఏపీకి 5.5 టీఎంసీలు కేటాయిస్తూ కృష్ణా బోర్డు ఆధ్వర్యంలోని త్రిసభ్య కమిటీ నిర్ణయం తీసుకుంది. కేఆర్ఎంబీ మెంబర్ సెక్రటరీ డీఎం రాయపురే నేతృత్వంలో ఈ ముగ్గు రు సభ్యుల కమిటీ శుక్రవారం జలసౌధలో ప్రత్యేకంగా సమావేశమైంది. తెలంగాణ ఈఎన్సీ అనిల్కుమార్, ఏపీ ఈఎన్సీ నారాయణరెడ్డితో రాయపురే 2 గంటలకు పైగా చర్చించారు. తుదకు శ్రీశైలం రిజర్వాయర్లోని నీటి నిల్వలను వినియోగించుకోవద్దని నిర్ణ యించారు. సాగర్ రిజర్వాయర్లోని నీటి నిల్వలపై చర్చించారు. సాగర్ ఎండీడీఎల్ 510 ఫీట్లు కాగా, గతంలో 505 ఫీట్ల వరకు అందుబాటులో ఉన్న నీటిని లెక్కగట్టి ఆ మేరకు వినియోగించుకోవాలని నిర్ణయించారు. తాజా సమావేశంలో దీన్ని 500 అడుగులకు తగ్గించారు. సాగర్ ప్రస్తుత నీటిమట్టం 510.53 అడుగులు కాగా, 132.86 టీఎంసీలు అందుబాటులో ఉన్నా యి. అందులో 500 అడుగుల ఎండీడీఎల్ మేరకు మొత్తం 17.55 టీఎంసీలు ప్రస్తుతం వినియోగానికి అందుబాటు లో ఉన్నాయి. అందులో 3.55 టీఎంసీలను భవిష్యత్ అవసరాలకు మినహాయించి మిగతా 14 టీఎంసీలను వినియోగించుకోవాలని నిర్ణయించారు. తదుపరి అవసరాలపై మేలో సమా వేశం కావాలని త్రిసభ్య కమిటీ నిర్ణయించింది. రెండు రాష్ట్రాల విజ్ఞప్తితో.. మే మాసాంతం వరకు ఉమ్మడి ప్రాజెక్టుల నుంచి నీటి విడుదలకు సంబంధించిన అంశంపై కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ గత అక్టోబర్లో చివరి సారిగా సమావేశమైంది. శ్రీశైలం ప్రాజెక్టు కనీస మట్టం (ఎండీడీఎల్)ను 805 ఫీట్లు, సాగర్ ఎండీడీఎల్ను 505 ఫీట్లకు నిర్ణయించి, వేసవి ఆవిరి నష్టాలను కూడా లెక్కగట్టి రెండు జలాశయాల్లో 92.78 టీఎంసీలు అందుబాటులో ఉన్నట్టు నిర్ధారించింది. అయినప్పటికీ మే మాసాంతం వరకు మొత్తంగా రెండు ప్రాజెక్టుల్లో 82.78 టీఎంసీలనే వినియోగించాలని అప్పట్లో కమిటీ నిర్ణయించింది. అందులో 2.78 టీఎంసీలను జూన్, జూలై తాగునీటి అవసరాల కోసమని రిజర్వ్ చేసింది. మిగిలిన 80 టీఎంసీల్లో 35 టీఎంసీలను తెలంగాణకు, 45 టీఎంసీలను ఏపీకి కేటాయించిన విషయం విదితమే. కాగా కమిటీ నిర్ణయించిన కోటాకు మించి తెలంగాణ ఇప్పటికే 11 టీఎంసీలను వినియోగించుకుంది. ఏపీ కోటా మేరకు వినియోగించుకుంది. అయితే ఇరు రాష్ట్రాలు తాగునీటి అవసరాలకు అదనంగా జలాలను విడుదల చేయాలని బోర్డుకు విజ్ఞప్తి చేశాయి. ఈ నేపథ్యంలోనే కమిటీ సమావేశమై నిర్ణయం తీసుకుంది. సమావేశంలో సాగర్ సీఈ అజయ్కుమార్, ఈఈ విజయ్భాస్కర్, కృష్ణా బోర్డు డిప్యూటీ డైరెక్టర్ సల్లా విజయ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఏపీలో మంచినీటి కొరత ఎక్కువగా ఉంది: ఈఎన్సీ త్రిసభ్య కమిటీ సమావేశంలో కేవలం తాగునీటి అంశంపైనే చర్చించామని ఏపీ ఈఎన్సీ నారాయణరెడ్డి సమావేశానంతరం చెప్పారు. 2 రాష్టాల అంగీకారంతో నీటి వాటాల పంపిణీ జరిగిందని తెలిపారు. ఏపీలో మంచినీటి కొరత కొంత ఎక్కువగా ఉందని వివరించారు. -
సాగర్ కుడి కాలువకు మరో 3 టీఎంసీలు
సాక్షి, అమరావతి: ప్రకాశం, పల్నాడు, బాపట్ల, గుంటూరు జిల్లాల తాగునీటి అవసరాల కోసం నాగార్జునసాగర్ కుడి కాలువకు మరో 3 టీఎంసీలు కేటాయించాలని కృష్ణా బోర్డుకు త్రిసభ్య కమిటీ సిఫార్సు చేసింది. కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి డీఎం రాయ్పురే కన్వీనర్గా వ్యవహరిస్తున్న త్రిసభ్య కమిటీ శుక్రవారం హైదరాబాద్లో సమావేశమైంది. ఏపీ ఈఎన్సీ సి.నారాయణరెడ్డి, తెలంగాణ ఈఎన్సీ అనిల్కుమార్ ఈ సమావేశానికి హాజరయ్యారు. కేటాయించిన నీటి కంటే 8.66 టీఎంసీలు అధికంగా వాడుకుంటూ తెలంగాణ ప్రభుత్వం ఏపీ హక్కులను కాలరాస్తోందని ఏపీ ఈఎన్సీ నారాయణరెడ్డి కమిటీ దృష్టికి తీసుకొచ్చారు. ఈ వ్యవహారంపై బోర్డుకు ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాగునీటి అవసరాల కోసం సాగర్ కుడి కాలువకు ప్రస్తుతం విడుదల చేస్తున్న 5 టీఎంసీలకు అదనంగా మరో 3 టీఎంసీలు విడుదల చేయాలని ఈఎన్సీ నారాయణరెడ్డి చేసిన ప్రతిపాదనకు త్రిసభ్య కమిటీ కన్వీనర్ డీఎం రాయ్పురే అంగీకరించారు. హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం 8.5 టీఎంసీలు కేటాయించాలని తెలంగాణ ఈఎన్సీ చేసిన విజ్ఞప్తికి కూడా కమిటీ సానుకూలంగా స్పందించింది. త్రిసభ్య కమిటీ చేసిన సిఫార్సుల ఆధారంగా రెండు రాష్ట్రాలకు నీటిని విడుదల చేస్తూ బోర్డు ఉత్తర్వులు జారీ చేయనుంది. -
శ్రీశైలంలో మిగిలిన నీళ్లు మాకే ఇవ్వండి
సాక్షి, హైదరాబాద్: శ్రీశైలం జలాశయంలో నిల్వ ఉన్న 15.23 టీఎంసీల జలాలను అత్యవసర తాగు నీటి అవసరాల కోసం తెలంగాణకు ఇవ్వాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. తీవ్ర కరువు పరిస్థితి ఉన్నా కూడా శ్రీశైలం జలాశయం నుంచి ఏపీ 51 టీఎంసీలను ఆ రాష్ట్రంలోని కృష్ణా బేసిన్ వెలుపలి ప్రాంతాలకు తరలించిందని పేర్కొంది. ఇతర నదీ బేసిన్లకు కృష్ణా జలాలను తరలించేందుకు కృష్ణా ట్రిబ్యునల్–1 అనుమతి లేదని గుర్తు చేసింది. ఇకపై శ్రీశైలం జలాశయం నుంచి నీళ్లు తీసుకోకుండా ఏపీని నిలువరించాలని కోరింది. ఈ మేరకు రాష్ట్ర నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా తాజాగా కృష్ణాబోర్డు చైర్మన్కు లేఖ రాశారు. తాగునీటి అవసరాలు ముఖ్యం తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో శ్రీశైలం జలాశయంలోని నీటి నిల్వలను తాగు అవసరాలకు కేటాయించడానికే ప్రాధాన్యత ఇవ్వాలని ఈ లేఖలో కోరారు. గత ఏడాది అక్టోబర్ 6న జరిగిన త్రిసభ్య కమిటీ సమావేశంలో కూడా ఈ నిర్ణయం తీసుకు న్నట్టు గుర్తు చేశారు. అయినా ఏపీ ప్రభుత్వం సాగు అవసరాలకు సైతం నీటిని తరలించుకుందని ఆరో పించారు. కృష్ణా బేసిన్ పరిధిలో తెలంగాణ జనాభా 2 కోట్ల మంది అయితే.. ఏపీ జనాభా 78లక్షల మంది మాత్రమేనని తెలిపారు. 2011 నాటి లెక్కల ప్రకారమే.. తెలంగాణ తాగునీటి అవసరాలకు 46.4 టీఎంసీలు, ఏపీ తాగునీటి అవసరాలకు 18 టీఎంసీలు అవసరమని వివరించారు. కృష్ణా ట్రిబ్యునల్–2కు సమర్పించిన ప్రాజెక్టుల డీపీఆర్ల ప్రకారం చూస్తే.. తాగునీటి అవసరాల కోసం ఏపీకి 8.85 టీఎంసీలు, తెలంగాణకి 40 టీఎంసీలు అవసరమని స్పష్టం చేశారు. గత వానాకాలంలో తెలంగాణ వాడుకోకుండా మిగిల్చిన 18.7 టీఎంసీలను ఈ ఏడాది వాడుకోవడానికి అనుమతి ఇవ్వాలని కృష్ణా బోర్డును కోరారు. హైదరాబాద్ తాగునీటి అవసరాలను పణంగా పెట్టి శ్రీశైలం నుంచి చెన్నై తాగునీటి అవసరాలకు 15 టీఎంసీలను కేటాయించాలన్న నిబంధనేదీ లేదన్నారు. -
నాగార్జునసాగర్కు ఎన్డీఎస్ఏ బృందం
నాగార్జునసాగర్: ‘నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ)’ బృందం మంగళవారం నాగార్జున సాగర్ ప్రాజెక్టును సందర్శించింది. తొలుత విజ యవిహార్ అతిథిగృహంలో తెలంగాణ, ఆంధ్ర ఇంజనీర్లతోపాటు కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ), కృష్ణాబోర్డు (కేఆర్ఎంబీ) సభ్యులతో ఎన్డీఎస్ఏ అధికారులు సమావేశమయ్యారు. 2009లో వచ్చిన భారీ వరదల నుంచి డ్యామ్ను ఏవిధంగా కాపా డారు? వచ్చిన వరదను ఎలా విడుదల చేశారన్న అంశాలపై చర్చించారు. తర్వాత ప్రధాన డ్యామ్ ను, ప్రాజెక్టు లోపలి గ్యాలరీలను, అక్కడి సీపేజీ (జాలు నీరు)లను పరిశీలించారు. సీపేజీ నీటి మళ్లింపు వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రా జెక్టు స్పిల్వేపై ఉన్న వాక్వే బ్రిడ్జి మీదుగా వెళ్లి స్పి ల్వేను పరిశీలించారు. ప్రాజెక్టు గేట్ల పరిస్థితి, స్పిల్ వేకు అవసరమైన మరమ్మతులు, నిర్వహణ వివ రాలను ఆరా తీశారు. స్పిల్వే దిగువన బకెట్ పో ర్షన్ ప్రాంతాన్ని పరిశీలించారు. ఎన్డీఎస్ఏ బృందంలో సీడబ్ల్యూసీ డైరెక్టర్ రమేశ్కుమార్, రాష్ట్ర డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్(ఎస్డీఎస్వో) సీఈ ప్రమీల, ఇత ర ఇంజనీర్లు ఉన్నారు. ఈ పరిశీలనలో తెలంగాణ నుంచి చీఫ్ ఇంజనీర్ వి.అజయ్కుమార్, డ్యామ్ ఎస్ఈ పీవీఎస్ నాగేశ్వర్రావు, ఇతర ఇంజనీర్లు పాల్గొనగా.. ఏపీ నుంచి చీఫ్ ఇంజనీర్ మురళీధర్ రెడ్డి, ఎస్ఈ వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. నేడు విద్యుత్ కేంద్రం పరిశీలన ఎన్డీఎస్ఏ బృందం బుధవారం సాగర్ డ్యాం దిగు వన ఉన్న విద్యుత్ కేంద్రాన్ని సందర్శించనుంది. ఈ విద్యుత్ కేంద్రం ద్వారా విడుదలవుతున్న నీటి ని.. తిరిగి జలాశయంలోకి ఎత్తిపోసే సమయంలో నీరేమైనా వృథా అవుతుందా? సీజన్లో బయటికి ఎంతనీరు వెళుతుందనే అంశాలను పరిశీలించనున్నట్టు తెలిసింది. గురువారం కూడా సాగర్ ప్రాజెక్టు పరిధిలో పరిశీలన కొనసాగనుంది. -
ఉమ్మడి ప్రాజెక్టుల అప్పగింతపై సుప్రీంకు
సాక్షి, అమరావతి: శ్రీశైలం, నాగార్జున సాగర్లను కృష్ణా బోర్డుకు అప్పగించకుండా తెలంగాణ సహాయ నిరాకరణ చేస్తే సుప్రీంకోర్టుకు నివేదించాలని కేంద్రం నిర్ణయించింది. గత నెల 17న కేంద్ర జల్ శక్తి శాఖ నిర్వహించిన సమావేశంలో నెలలోగా ఉమ్మడి ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించేందుకు రెండు రాష్ట్రాల అధికారులు అంగీకరించారు. కానీ, ఢిల్లీ నుంచి హైదరాబాద్కు చేరుకోగానే తెలంగాణ అధికారులు మాటమార్చారు. ఉమ్మడి ప్రాజెక్టుల అప్పగింత విధి విధానాల ఖరారుకు ఈనెల 1న హైదరాబాద్లో జరిగిన కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశంలోనూ ఉమ్మడి ప్రాజెక్టులకు రెండు రాష్ట్రాల అధికారులు అంగీకరించినట్లు ప్రకటించినా, ఆ తర్వాత తెలంగాణ అధికారులు మరోసారి మాటమార్చారు. ఈ నేపథ్యంలో గత నెల 17న తీసుకున్న నిర్ణయాల అమలుపై ఈనెల 16న ఢిల్లీలో కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ రెండు రాష్ట్రాల అధికారులతో సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ప్రాజెక్టుల అప్పగింతకు తెలంగాణ అధికారులు అంగీకరించకపోయినా లేదా గైర్హాజరైనా అదే అంశాన్ని సుప్రీంకోర్టుకు నివేదించి, కోర్టు మార్గదర్శకాల మేరకు చర్యలు తీసుకోవాలని కేంద్రం నిర్ణయించినట్లు అధికారవర్గాలు తెలిపాయి. శ్రీశైలం ప్రాజెక్టుకు 2021లో ఎగువ నుంచి వరద రాకుండానే తెలంగాణ జెన్కో విద్యుదుత్పత్తి ప్రారంభించింది. ఇక్కడి నుంచి నీటిని సాగర్కు తరలించింది. ఇలా శ్రీశైలం జలాశయాన్ని ఖాళీ చేస్తూ రాష్ట్ర హక్కులను హరిస్తుండటంతో సీఎం వైఎస్ జగన్ న్యాయ పోరాటానికి దిగారు. కృష్ణాబోర్డు పరిధిని నోటిఫై చేసి, అక్రమంగా విద్యుదుత్పత్తి చేయకుండా తెలంగాణను కట్టడి చేయాలని కోరుతూ సుప్రీం కోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. దాంతో కృష్ణాబోర్డు పరిధిని నిర్దేశిస్తూ 2021 జూలై 15న కేంద్ర జల్ శక్తి శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఉమ్మడి ప్రాజెక్టులను ఏడాదిలోగా బోర్డుకు అప్పగించాలని కేంద్రం ఆదేశించింది. శ్రీశైలం, సాగర్లో రాష్ట్ర భూభాగం పరిధిలోని ఆరు అవుట్లెట్లను బోర్డుకు అప్పగించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. తెలంగాణ సర్కారు మాత్రం తమ భూభాగంలోని తొమ్మిది అవుట్లెట్లను అప్పగించేందుకు నిరాకరించింది. యథేచ్ఛగా తెలంగాణ జలచౌర్యం శ్రీశైలం ప్రాజెక్టు నుంచి గతేడాది అక్టోబర్ 6న కృష్ణా బోర్డు రాష్ట్రానికి కేటాయించిన 30 టీఎంసీల్లో 17 టీఎంసీలను ఎడమ గట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ నాగార్జునసాగర్కు తెలంగాణ సర్కార్ తరలించింది. ఆ 17 టీఎంసీలను గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాల తాగునీటి అవసరాల కోసం సాగర్ కుడి కాలువ ద్వారా విడుదల చేయాలని రాష్ట్ర అధికారులు చేసిన వి/æ్ఞప్తులను తెలంగాణ పట్టించుకోలేదు. ఇదే విషయాన్ని సీఎం వైఎస్ జగన్కు అధికారులు వివరించారు. శ్రీశైలం ప్రాజెక్టు నిర్వహణ బాధ్యత కేంద్రం రాష్ట్రానికి అప్పగిస్తే.. తెలంగాణ భూభాగంలో ఉందంటూ ఎడమ గట్టు విద్యుత్కేంద్రాన్ని తెలంగాణ సర్కారు అధీనంలోకి తీసుకుందని, అదే తరహాలో రాష్ట్ర భూభాగంలో ఉన్న నాగార్జునసాగర్ స్పిల్ వే 13 గేట్లతోసహా కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్ను అధీనంలోకి తీసుకుని, నీటిని విడుదల చేయాలని అధికారులకు సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. దాంతో నవంబర్ 30 తెల్లవారుజామున సీఈ మురళీనాథ్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర పోలీసులు, జలవనరుల అధికారులు సాగర్ స్పిల్ వేలో సగాన్ని, కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్ను స్వాధీనం చేసుకున్నారు. తాగు నీటి అవసరాల కోసం కుడి కాలువకు 2,300 క్యూసెక్కులు విడుదల చేశారు. దీనిపై తెలంగాణ సర్కారు కేంద్రానికి ఫిర్యాదు చేసింది. దాంతో డిసెంబర్ 1న రెండు రాష్ట్రాల సీఎస్లతో కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ బల్లా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, సంయమనం పాటించాలని ఆదేశించారు. సాగర్పై నవంబర్ 30 నాటి యథాస్థితిని కొనసాగిస్తూ నిర్వహణ బాధ్యతను బోర్డుకు అప్పగించారు. ఈ వివాదాన్ని పరిష్కరించాలని కేంద్ర జల్ శక్తి శాఖను ఆదేశించారు. -
ఉమ్మడి ప్రాజెక్టులు బోర్డు నియంత్రణలోకి..
సాక్షి, హైదరాబాద్: కృష్ణా బేసిన్లోని ఉమ్మడి ప్రాజెక్టుల నిర్వహణను కృష్ణా నది యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) నియంత్రణలోకి తీసుకెళ్లడానికి తెలంగాణ, ఏపీ నీటిపారుదల శాఖల ఈఎన్సీలు గురువారం హైదరాబాద్లోని జలసౌధలో జరిగిన కేఆర్ఎంబీ సమావేశంలో అంగీకరించారు. ఇకపై శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల నుంచి నీటి విడుదలను కేఆర్ఎంబీ ప్రత్యక్ష నియంత్రణలో జరపాలని, ఇందుకోసం రెండు ప్రాజెక్టులకు సంబంధించిన ప్రతి కాంపొనెంట్ (విభాగం) వద్ద తెలంగాణ నుంచి ఒకరు, ఏపీ నుంచి మరొక ఉద్యోగిని పెట్టాలని నిర్ణయించారు. జలవిద్యుత్ కేంద్రాలు మినహా మిగిలిన 10 ఔట్లెట్లు (శ్రీశైలం ప్రాజెక్టు స్పిల్వేతోపాటు రివర్ స్లూయిస్, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, హంద్రీనీవా సుజల స్రవంతి ఎత్తిపోతల పథకం, ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం, మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం, నాగార్జునసాగర్ లెఫ్ట్ కెనాల్ హెడ్ రెగ్యులేటర్, నాగార్జునసాగర్ ఫ్లడ్ కెనాల్–హెడ్ రెగ్యులేటర్–పరిసరాలు, ఏఎంఆర్ ఎత్తిపోతల పథకం– పంప్హౌస్ పరిసరాలు, నాగార్జునసాగర్ ప్రాజెక్టు స్పిల్వేతోపాటు రివర్, చూట్ స్లూయిస్, నాగార్జునసాగర్ రైట్ కెనాల్ హెడ్ రెగ్యులేటర్)లను బోర్డు నియంత్రణలోకి తీసుకెళ్లడానికి ఇరువురు ఈఎన్సీలు అంగీకారం తెలిపారు. ఇరు రాష్ట్రాలకు చెందిన ఉద్యోగులు కూడా 10 కాంపోనెంట్ల వద్ద మూడేసీ షిఫ్టులు (ఒక్కో షిప్టు 8 గం ఉండేలా ఇరు 30 మంది చొప్పున బోర్డు నియంత్రణలో పనిచేయడానికి అంగీకరించారు. అయితే నీటి విడుదల మాత్రం బోర్డుకు చెందిన త్రిసభ్య కమిటీ (బోర్డు సభ్య కార్యదర్శి డీఎం రాయిపూరే, తెలంగాణ ఈఎన్సీ సి. మురళీధర్, ఏపీ ఈఎన్సీ సి.నారాయణరెడ్డి)ల నేతృత్వంలోని కమిటీ నిర్ణయం మేరకు జరుగుతుందనే అంగీకారం ఇరువురి మధ్య కుదిరింది. అయితే నాగార్జునసాగర్ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ (ఓ అండ్ ఎం) పనులు తెలంగాణ, శ్రీశైలం పనులను ఏపీ చేపట్టాలని నిర్ణయించారు. గంటన్నరపాటు సమావేశం... కేఆర్ఎంబీ చైర్మన్ శివనందన్కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి తెలంగాణ నుంచి నీటిపారుదల శాఖ ఈఎన్సీ సి.మురళీధర్, అంతర్రాష్ట్ర విభాగం చీఫ్ ఇంజనీర్ మోహన్ కుమార్, నాగార్జున సాగర్ చీఫ్ ఇంజనీర్ అజయ్ కుమార్, కృష్ణా బేసిన్ డిప్యూటీ డైరెక్టర్ ఎస్.విజయకుమార్లు హాజరవగా ఏపీ నుంచి ఆ రాష్ట్ర జలవనరుల శాఖ ఈఎన్సీ సి. నారాయణరెడ్డితోపాటు ఆ రాష్ట్ర అధికారులు హాజరయ్యారు. దాదాపు గంటన్నరపాటు సమావేశం జరిగింది. కృష్ణా బోర్డుకు ప్రాజెక్టులను అప్పగించాలని తాము సమ్మతించినట్లు ఈ సమావేశం అనంతరం ఇరు రాష్ట్రాల ఈఎన్సీలు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ వెల్లడించారు. అప్పటిదాకా అప్పగింత కుదరదు: తెలంగాణ నీటిపారుదల శాఖ కార్యదర్శి ఉమ్మడి ప్రాజెక్టుల అప్పగింతపై మీడియాలో వార్తలు రావడంతో తెలంగాణ నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా రంగంలోకి దిగారు. నీటి వాటాలు తేలేదాకా, శ్రీశైలం, సాగర్ ఆపరేషనల్ ప్రొటోకాల్స్పై స్పష్టత వచ్చేదాకా ప్రాజెక్టులను అప్పగించేది లేదంటూ తేల్చిచెప్పారు. దీనిపై జనవరి 27న కేంద్ర జలశక్తి శాఖకు రాసిన లేఖను బహిర్గతం చేశారు. కేంద్ర జలశక్తి శాఖ జనవరి 17న ఢిల్లీలో నిర్వహించిన సమావేశంలో ప్రాజెక్టుల అప్పగింతకు తెలంగాణ అంగీకరించకున్నా అంగీకరించినట్లు పేర్కొంటూ మినిట్స్ విడుదల చేసిందని ఆ లేఖలో ఆయన ఆరోపించారు. ఆ సమావేశంలో తాము లేవనెత్తిన పలు అంశాలను మినిట్స్లో పేర్కొనలేదని గుర్తుచేశారు. ఆ మినిట్స్ను సవరించాలని లేఖలో కోరారు. మరోవైపు కృష్ణా బోర్డు సమావేశం ముగిసిన వెంటనే ప్రాజెక్టుల అప్పాగింతకు సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్రావు తీవ్ర విమర్శలు చేశారు. తొలుత భేటీకి వెళ్లరాదనుకొని... అసలు కృష్ణా బోర్డు సమావేశాలకు హాజరు కాకూడదని అధికారులు తొలుత భావించినప్పటికీ తెలంగాణ అభిప్రాయాలను స్పష్టంగా బోర్డుకు చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించడంతో అధికారులు స్వయంగా హాజరయ్యారు. అయితే లేఖకు కట్టుబడే ఉండాలని సమావేశంలో తెలంగాణ భావించగా తద్విరుద్ధంగా పరిణామాలు చోటుచేసుకున్నాయి. సాగర్ పరిధిలో మొత్తం 8 కాంపోనెంట్లు ఉండగా అందులో 7 తెలంగాణ అదీనంలో ఉన్నాయి. వాటిలో ఐదింటిని అప్పగించడానికి, శ్రీశైలం పరిధిలో 7 కాంపోనెంట్లు ఉండగా అందులో తెలంగాణ అదీనంలో ఉన్న కాంపోనెంట్ను అప్పగించడానికి నిర్ణయం తీసుకున్నట్లు సమావేశం అనంతరం ఈఎన్సీ (జనరల్) సి. మురళీధర్ ప్రకటన చేశారు. దాంతో విస్తుపోవడం తోటి అధికారుల వంతైంది. ఈ విషయం ప్రసార, సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో నష్టనివారణ చర్యల్లో భాగంగా జనవరి 27న కేంద్ర జలశక్తి శాఖకు రాసిన లేఖను నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా మీడియాకు విడుదల చేశారు. దాంతో అధికారులు ముక్కున వేలేసుకున్నారు. ఈఎన్సీ ఒకదారిలో నడుస్తుండగా నీటిపారుదల శాఖ కార్యదర్శి మరోదారిలో నడుస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. -
కృష్ణా బోర్డు ప్రాజెక్టుల నిర్వహణకు ఏపీ,తెలంగాణ అంగీకారం
సాక్షి, హైదరాబాద్: కృష్ణా బోర్డు పరిధిలోకి ప్రాజెక్టుల ఆపరేషన్కు ఏపీ, తెలంగాణ అంగీకారం తెలిపాయి. హైదరాబాద్లో కృష్ణా రివర్ బోర్డు సమావేశం గురువారం జరిగింది. అనంతరం మీడియాతో ఏపీఈఎన్సీ నారాయణరెడ్డి మాట్లాడుతూ, బోర్డు పరిధిలో మొత్తం 15 కాంపోనెంట్స్లో 9 తెలంగాణ, 6 ఆంధ్రప్రదేశ్వి ఉన్నాయని, కృష్ణా బోర్డుకు ప్రాజెక్టుల అప్పగింత పై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. ‘‘ఆపరేషన్ కోసం ఇరు రాష్ట్రాల నుంచి స్టాప్ కేటాయింపు ఉంటుంది. వాటర్ కేటాయింపులపై త్రిసభ్య కమిటీ దే తుది నిర్ణయం. ప్రాజెక్టుల ఆపరేషనల్ ప్రోటోకాల్ త్రిసభ్య కమిటీ అప్పుడున్న పరిస్థితుల్లో తీసుకుంటారు. లెఫ్ట్ మెన్ కెనాల్ నుంచి రెండు టీఎంసీ, మార్చిలో రైట్ మెన్ కెనాల్ నుంచి మూడు టీఎంసీలు ఏపీకి విడుదలకు ఒప్పుకున్నారన్నారు. ఏప్రిల్ ఐదు టీఎంసీ లు ఏపీకి ముందుగానే ఉన్నాయి. ప్రాజెక్టుల ఆపరేషన్ కోసం తెలంగాణ ఒప్పుకుందని నారాయణరెడ్డి వెల్లడించారు. తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ మాట్లాడుతూ, ప్రాజెక్టుల ఆపరేటింగ్ అంతా కేఆర్ఎంబీకి ఇచ్చామని, పవర్ స్టేషన్స్పై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. నాగార్జున సాగర్ తెలంగాణ, శ్రీశైలం ఏపీ చూసుకుంటుంది. ప్రాజెక్టులన్నీ ఇక నుంచి బోర్డు పరిధిలో నడుస్తాయి. మా డిమాండ్స్ అన్ని కేంద్రానికి లేఖలు రాశాం. ఇంకా అక్కడ నుంచి నిర్ణయం రాలేదు’’ అని ఆయన పేర్కొన్నారు. ‘‘నీటి వాటాల పంపకంపై త్రిసభ్య కమిటీనే నిర్ణయం తీసుకుంటుంది. ప్రాజెక్టుల వద్ద భద్రత అనేది పరిస్థితిని బట్టి బోర్డు కనుసన్నల్లో జరుగుతుంది. కేఆర్ఎంబీ పరిధిలో ఉన్న 15 హౌట్లెట్స్ బోర్డు పరిధిలోకి వెళ్తాయి. ప్రాజెక్టులను పూర్తిగా అప్పగించలేదు ఆపరేషనల్, నీటి విడుదల బోర్డు చూసుకుంటుంది. సీఆర్పీఎఫ్ సైతం కృష్ణా బోర్డు పరిధిలోనే ఉంటాయి. నిర్వహణ కోసం స్టాప్ కేటాయింపు 40: 45 కావాలని అడుగుతున్నారు’’ అని మురళీధర్ వివరించారు. -
నీటి వాటాలపైనా అడ్డం తిరిగిన తెలంగాణ
సాక్షి, అమరావతి: ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్లను కృష్ణా బోర్డుకు అప్పగించేందుకు కేంద్ర జల్ శక్తి శాఖ ఈనెల 17న నిర్వహించిన సమావేశంలో అంగీకరించి ఆ తర్వాత అడ్డం తిరిగిన తరహాలోనే.. కృష్ణా జలాల వాటాపైనా తెలంగాణ తొండాటకు దిగింది. బచావత్ ట్రిబ్యునల్ అవార్డు ప్రాజెక్టుల వారీగా చేసిన కేటాయింపుల ఆధారంగా.. ఆంధ్రప్రదేశ్కు 512.04, తెలంగాణకు 298.96 టీఎంసీల చొప్పున పంపిణీ చేస్తూ 2015 జూలై 18–19న కేంద్ర ప్రభుత్వం తాత్కాలిక సర్దుబాటు చేసింది. దీనిని అంగీకరిస్తూ ఏపీ, తెలంగాణ జలవనరుల శాఖల ఉన్నతాధికారులు సంతకాలు చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి ఏటా కేంద్రం ఏర్పాటు చేసిన తాత్కాలిక సర్దుబాటుపై కృష్ణా బోర్డులో చర్చించి.. దాని ప్రకారమే రెండు రాష్ట్రాలు నీటిని వినియోగించుకుంటున్నాయి. మరోవైపు కృష్ణా జలాల్లో సగం వాటా కావాలని గతంలో తెలంగాణ సర్కార్ డిమాండ్ చేసినా.. బ్రిజేశ్కుమార్ ట్రిబ్యునల్ అవార్డు వెలువడే వరకూ పాత వాటాలే చెల్లుబాటు అవుతాయని కేంద్రం స్పష్టం చేసింది. తెలంగాణ ప్రభుత్వం తాజాగా ఈ నీటి వాటాలపైనా అడ్డం తిరిగింది. కేంద్రం చేసిన తాత్కాలిక సర్దుబాటును అంగీకరించబోమని పేర్కొంది. ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు చేయాలని డిమాండ్ చేసింది. కానీ.. 1976 మే 31న బచావత్ ట్రిబ్యునల్ జారీ చేసిన అవార్డులో ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు చేసింది. ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించిన 811 టీఎంసీల్లో.. 1976కు ముందే పూర్తయిన ప్రాజెక్టులకు 749.16, ప్రతిపాదన దశలో ఉన్న జూరాలకు 17.84, శ్రీశైలం ఆవిరి నష్టాలకు 33 టీఎంసీల వాటా ఇచ్చింది. పునరుత్పత్తి కింద 11 టీఎంసీలు కేటాయించింది. వాటి ఆధారంగానే రెండు రాష్ట్రాలకు నీటిని పంపిణీ చేస్తూ 2015లో కేంద్రం తాత్కాలిక సర్దుబాటు చేసింది. అంతరాష్ట్ర నదీ జల వివాదాల చట్టం–1956లోని సెక్షన్–6(2) ప్రకారం.. కేడబ్ల్యూడీటీ–1 అవార్డు సుప్రీంకోర్టు డిక్రీతో సమానం. దాన్ని పునఃసమీక్షించడం చట్టవిరుద్ధం. అందుకే కేడబ్ల్యూడీటీ–2 వాటి జోలికి వెళ్లలేదు. 65 శాతం లభ్యత కింద ఉన్న మిగులు జలాలు 194 టీఎంసీలను ఉమ్మడి రాష్ట్రానికి కేడబ్ల్యూడీటీ–2 అదనంగా కేటాయించింది. వీటిని పరిశీలిస్తే.. బ్రిజేశ్కుమార్ ట్రిబ్యునల్ అవార్డు అమల్లోకి వచ్చినా.. బచావత్ ట్రిబ్యునల్ చేసిన కేటాయింపులు మారబోవని జలవనరుల నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
ఉమ్మడి ప్రాజెక్టుల అప్పగింతపై.. మళ్లీ అడ్డం తిరిగిన తెలంగాణ
సాక్షి, అమరావతి: ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్లను కృష్ణా బోర్డుకు అప్పగింతపై తెలంగాణ రాష్ట్రం మళ్లీ అడ్డం తిరిగింది. కేంద్ర జల్శక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ ఈనెల 17న ఢిల్లీలో నిర్వహించిన ఉన్నతస్థాయి సమావేశంలో కృష్ణా బోర్డుకు ఉమ్మడి ప్రాజెక్టులను అప్పగించేందుకు అంగీకరించిన తెలంగాణ నీటిపారుదల శాఖాధికారులు.. ఢిల్లీ నుంచి హైదరాబాద్కు చేరుకోగానే ప్లేటు ఫిరాయించి ఉమ్మడి ప్రాజెక్టుల అప్పగింతకు తాము అంగీకరించలేదని బుకాయించారు. బ్రిజేష్కుమార్ ట్రిబ్యునల్ తీర్పు అమల్లోకి వచ్చేవరకూ ప్రాజెక్టుల అప్పగింతకు అంగీకరించబోమని తెలంగాణ సర్కార్ చెబుతోంది. కానీ.. ప్రాజెక్టుల అప్పగింతకు అంగీకరించినట్లు సమావేశపు మినిట్స్లో స్పష్టంగా ఉంది. ఈ మినిట్స్పై ఏపీ అధికారులతోపాటు తెలంగాణ అధికారులు కూడా సంతకాలు చేశారు. అప్పుడూ ఇలాగే ప్లేటు ఫిరాయింపు.. గతంలో కృష్ణా బోర్డు 16వ సర్వసభ్య సమావేశంలో ఉమ్మడి ప్రాజెక్టుల అప్పగింతకు అంగీకరించిన తెలంగాణ అధికారులు.. ఆ మరుసటి రోజే అడ్డం తిరిగారు. ఇప్పుడూ అదే రీతిలో అడ్డం తిరగడంతో కేంద్ర జల్శక్తి శాఖ తీవ్రంగా పరిగణించింది. మరోవైపు.. ఉన్నతస్థాయి సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు ఈనెల 24లోగా త్రిసభ్య కమిటీ సమావేశమై ఉమ్మడి ప్రాజెక్టుల అప్పగింత విధానాన్ని ఖరారు చేయాలి. ఈ సమావేశంలో తెలంగాణ తరఫున హాజరయ్యే నీటిపారుదల శాఖ ఈఎన్సీ స్పందనను బట్టి చర్యలు తీసుకోవడానికి కేంద్ర జల్శక్తి శాఖ సిద్ధమైనట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఏపీలో ఆరు.. తెలంగాణలో తొమ్మిది ఔట్లెట్లు.. నిజానికి.. విభజన నేపథ్యంలో కృష్ణా జలాల వినియోగంలో రెండు రాష్ట్రాల మధ్య విభేదాలు తలెత్తకుండా చూసేందుకు కేంద్రం కృష్ణాబోర్డును ఏర్పాటుచేసింది. ఈ బోర్డు పరిధిని నిర్దేశిస్తూ 2021, జూలై 15న గెజిట్ నోటిఫికేషన్ జారీచేసిన కేంద్రం.. ఉమ్మడి ప్రాజెక్టులను ఏడాదిలోగా బోర్డుకు అప్పగించాలని నిర్దేశించింది. శ్రీశైలం, నాగార్జునసాగర్లలో ఏపీ భూభాగంలోని ఆరు, తెలంగాణ భూభాగంలోని తొమ్మిది అవుట్లెట్లను స్వాధీనం చేయాలని 16వ సర్వసభ్య సమావేశంలో రెండు రాష్ట్రాలను బోర్డు కోరింది. ఇందుకు రెండు రాష్ట్రాలు తొలుత అంగీకరించాయి. తెలంగాణ భూభాగంలోని అవుట్లెట్లను స్వాధీనం చేసుకుంటే.. తమ భూభాగంలోని అవుట్లెట్లను అప్పగిస్తామని ఏపీ ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తంచేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. కానీ.. తెలంగాణ సర్కార్ తన భూభాగంలోని అవుట్లెట్లను బోర్డుకు అప్పగించబోమని అడ్డం తిరిగింది. ఈ నేపథ్యంలో.. రాష్ట్ర హక్కులను పరిరక్షించుకోవడానికి మన భూభాగంలోని సాగర్ స్పిల్ వే సగం, కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్ను జలవనరుల శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తమ నిర్వహణలో ఉన్న సాగర్ను ఏపీ అధికారులు అక్రమంగా స్వాధీనం చేసుకున్నారంటూ కేంద్రానికి తెలంగాణ సర్కార్ ఫిర్యాదు చేసింది. ఈ వివాదాన్ని పరిష్కరించడమే అజెండాగా ఈనెల 17న ఢిల్లీలో కేంద్ర జల్శక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. -
తెలంగాణ గొంతుకోసిన కాంగ్రెస్
సాక్షి, హైదరాబాద్: నాగార్జునసాగర్, శ్రీశైలం నీటి ప్రాజెక్టులపై పూర్తి అధికారాన్ని కృష్ణా నదీ యాజ మాన్య మండలి(కేఆర్ఎంబీ)కి అప్పగించి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ గొంతు కోసిందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి విమర్శించారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి గెలిపించిన ఖమ్మం, నల్లగొండ, మహబూబ్నగర్ జిల్లాల ప్రజలకు ఈ ప్రభుత్వం తీరని అన్యాయం చేసిందని ధ్వజమెత్తారు. శనివారం తెలంగాణ భవన్లో ఆయన ఎమ్మెల్సీ ఎంఎస్ ప్రభాకర్, మాజీ చైర్మన్ గెల్లు శ్రీనివాస్యాదవ్తో కలిసి మీడియాతో మాట్లాడారు. ఈ ప్రాజెక్టులపై అధికారాన్ని కేఆర్ ఎంబీకి అప్పగించడం రాష్ట్ర ప్రయోజనాలకు గొడ్డలి పెట్టు అని వ్యాఖ్యానించారు. గోదావరి, కృష్ణా జలాల్లో తెలంగాణ నీటి వాటా తేలే దాకా ఏ కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను ఒప్పుకో మని నాటి కేసీఆర్ ప్రభుత్వం తేల్చిచెప్పిందని మాజీ మంత్రి గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండా అక్కడ మినిట్స్ రాసినట్లయితే వెంటనే ఆ విషయం స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు కేఆర్ఎంబీ అనుమతి లేకుండా ఆ డ్యాంల మీదికి అడుగు పెట్టే అవకాశం ఉండదన్నారు. తెలంగాణకు సాగునీళ్లు, తాగునీళ్లు ప్రశ్నార్థకం చేశారని ఆరోపించారు. రాష్ట్రం ఇక పూర్తిగా థర్మల్ విద్యుత్ కేంద్రంపైనే ఆధారపడేలా చేశారన్నారు. అలా అన్న వాళ్లే బొందలో కలిసిపోయారు తెలంగాణలో తన శిష్యుడు రాజ్యం ఏలుతున్నాడని చంద్రబాబు సంతోషపడుతున్నారని నిరంజన్రెడ్డి వ్యాఖ్యానించారు. చంద్రబాబు శిష్యుడు విదేశాల్లో తిరుగుతూ కేసీఆర్ పార్టీని బొందపెడతానని అంటున్నారని, అలా అన్నవాళ్లు అందరూ బొందలో కలిసిపోయారన్నారు. గోదావరి బేసిన్లో రైతులకు సాగునీళ్లు ఇవ్వకుండా కాళేశ్వరం మీద దుష్ప్రచా రం చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. -
నెలలోగా ప్రాజెక్టుల అప్పగింత
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్లను నెల రోజుల్లోగా కృష్ణా నది యాజమాన్య బోర్డు(కేఆర్ఎంబీ)కి అప్పగించేందుకు తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు సమ్మతి తెలిపా యి. ఇరు రాష్ట్రాల నీటిపారుదల శాఖల ఈఎన్ సీలు, కృష్ణా బోర్డు సమావేశమై.. నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టులకు సంబంధించిన 15 ప్రధాన కాంపోనెంట్లు/ఔట్ లెట్లను కృష్ణా బోర్డుకు అప్పగించడంలో అనుసరించాల్సిన విధివిధానాల(హ్యాండింగ్ ఓవర్ ప్రొటోకాల్స్)కు అంగీకారం తెలిపాయి. అదేవిధంగా పూర్తి స్థాయి కార్యాచరణ ప్రణా ళికను వారం రోజుల్లోగా సిద్ధం చేస్తామని తెలిపా యి. ఈ విషయాన్ని స్వయంగా కేంద్ర జలశక్తి శాఖ తాజాగా ప్రకటించింది. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మధ్య కృష్ణా జల వివాదాల పరిష్కారానికి ఈ నెల 17న ఢిల్లీలో కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ నేతృత్వంలో జరిగిన సమావేశంలో ఇరు రాష్ట్రాలు ఈ మేరకు అంగీకరించినట్టు సమావేశపు మినట్స్లో ఆ శాఖ పొందుపరిచింది. తెలంగాణ తరఫున రాష్ట్ర నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా, ఈఎన్సీ సి.మురళీధర్, ఏపీ తర ఫున ఆ రాష్ట్ర జలవనరుల శాఖ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్కుమార్, ఈఎన్సీ సి.నారాయణ రెడ్డితో పాటు కృష్ణా బోర్డు చైర్మన్ శివనందన్కుమార్, కేంద్ర జలసంఘం చైర్మన్ కుశ్వీందర్సింగ్ వోరా ఈ సమావేశంలో పాల్గొన్నారు. సాగర్ వద్ద నో ఎంట్రీ నాగార్జునసాగర్ డ్యామ్ పరిసరాల్లో సీఆర్పీఎఫ్ బలగాలు పటిష్ట బందోబస్తును కొనసాగించను న్నాయి. కృష్ణా బోర్డు నుంచి ముందస్తు అనుమతి లేకుంటే ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఇంజనీర్లు / అధికారులను సైతం ఇకపై డ్యామ్ పరిసరాల్లోకి అనుమతించరు. ఈ విషయంపై సైతం రెండు రాష్ట్రాలు అంగీకారం తెలిపాయి. నాగార్జునసాగర్ డ్యామ్ రెండు రాష్ట్రాల భూభాగాల పరిధిలో చెరి సగం వస్తుండగా, ఏదైనా మరమ్మతు పనులు చేపట్టేందుకు సంబంధిత భూభాగం పరిధిలోని రాష్ట్రం ముందస్తుగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. కృష్ణా బోర్డు పర్యవేక్షణలోనే ఈ పనులు చేయాల్సి ఉంటుంది. కేఆర్ఎంబీకి చెల్లించాల్సిన బకాయిలను సైతం తక్షణమే చెల్లిస్తామని రెండు రాష్ట్రాలు సమ్మతి తెలిపాయి. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలులో పురోగతిని సమీక్షించేందుకు 15 రోజుల తర్వాత మళ్లీ కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి సమీక్ష నిర్వహించనున్నారు. తెలంగాణ, ఏపీ వాదనలు ఇవే.. ఇతర అంశాలపై చర్చించి పరిష్కరించుకోవ డానికి ముందు నాగార్జునసాగర్ వద్ద 2023 డిసెంబర్ 28కి ముందు నెలకొని ఉన్న పరిస్థితులను పునరుద్ధరించాలని తెలంగాణ నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా ఈ సమావేశంలో కోరారు. కృష్ణా జలాల్లో ఏపీ, తెలంగాణకు 50:50 నిష్పత్తిలో కేటాయింపులు జరపాలని విజ్ఞప్తి చేశారు. విద్యుదుత్పత్తి ద్వారా నీళ్లను తెలంగాణ కిందికి విడుదల చేస్తుండడంతో శ్రీశైలం జలాశ యంలో నిల్వలు అడుగంటిపోతున్నాయని ఏపీ జలవనరుల శాఖ ముఖ్యకార్యదర్శి శశి భూషణ్కుమార్ సమావేశం దృష్టికి తీసుకె ళ్లారు. సాగర్ కుడికాల్వ ద్వారా ఏపీకి నీటి విడుదల కోసం కృష్ణా బోర్డు అనుమతి ఇచ్చినా తెలంగాణ అధికారుల దయాదా క్షిణ్యాలపై ఆధారపడి ఉండాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర హోంశాఖ కార్యదర్శి నిర్వహించిన సమావేశంలో తీసు కున్న నిర్ణయాలకు కట్టుబడి సాగర్ నుంచి నీటివిడుదలను నిలుపుదల చేశామని తెలిపారు. -
కృష్ణా బోర్డుకు సాగర్
-
కృష్ణా బోర్డుకు ‘సాగర్’
సాక్షి, అమరావతి/మాచర్ల/విజయపురిసౌత్: ఉమ్మడి ప్రాజెక్టు నాగార్జునసాగర్ నిర్వహణ బాధ్యతను కేంద్ర ప్రభుత్వం కృష్ణా బోర్డుకు అప్పగించింది. కేంద్ర హోంశాఖ, జల్ శక్తి శాఖల కార్యదర్శులు అజయ్ బల్లా, దేబశ్రీ ముఖర్జీ ఆదేశాల మేరకు తెలంగాణ భూభాగంలోని నాగార్జునసాగర్ సగం స్పిల్ వే, ఎడమ కాలువ హెడ్ రెగ్యులేటర్ను సీఆర్పీఎఫ్ బలగాలు ఇప్పటికే స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ భూభాగంలోని స్పిల్వే, కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్ను కూడా అప్పగించాలన్న కేంద్ర జల్ శక్తి శాఖ విజ్ఞప్తికి రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. ఈ క్రమంలో ఏపీ భూభాగంలోని స్పిల్వే, కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్ను రాష్ట్ర పోలీసులు ఆదివారం సీఆర్పీఎఫ్ బలగాలకు అప్పగించి నీటి విడుదలను నిలిపివేశారు. 13వ క్రస్ట్గేటు వద్ద ఏర్పాటు చేసిన కంచెను తొలగించారు. ఇకపై నాగార్జున సాగర్ను సీఆర్పీఎఫ్ బలగాల పహారాలో కృష్ణా బోర్డు నిర్వహించనుంది. ఉమ్మడి ప్రాజెక్టుల బాధ్యత బోర్డుకే.. కృష్ణాలో వరద ప్రారంభం కాకుండానే తెలంగాణ సర్కార్ 2021 జూలైలో బోర్డు అనుమతి తీసుకోకుండా అక్రమంగా ఎడమ గట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తి చేపట్టి నీటిని దిగువకు వదిలేసి శ్రీశైలాన్ని ఖాళీ చేస్తూ రాష్ట్ర హక్కులను హరిస్తుండటంపై ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. ఏపీ హక్కులను పరిరక్షించేలా కృష్ణా బోర్డు పరిధిని నిర్దేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసేలా కేంద్రాన్ని ఆదేశించాలని కోరింది. ఈ కేసు విచారణలో ఉండగానే కృష్ణా బోర్డు పరిధిని నిర్దేశిస్తూ 2021 జూలై 15న కేంద్ర జల్ శక్తి శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్లను బోర్డుకు అప్పగించాలని ఆదేశించింది. శ్రీశైలం, నాగార్జునసాగర్లలో ఆరు అవుట్లెట్లను ఏపీ ప్రభుత్వం, తొమ్మిది అవుట్లెట్లను తెలంగాణ సర్కార్కు అప్పగించేందుకు కృష్ణా బోర్డు 15వ సర్వ సభ్య సమావేశంలో అంగీకారం తెలిపాయి. తెలంగాణ సర్కార్ తన భూభాగంలోని అవుట్ లెట్లను అప్పగిస్తే తమ భూ భాగంలోని ఆరు అవుట్లెట్లను అప్పగించడానికి సమ్మతి తెలుపుతూ 2021 అక్టోబర్ 14న ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే తన భూభాగంలోని 9 అవుట్లెట్లను అప్పగించకుండా తెలంగాణ సర్కార్ అడ్డం తిరగడంతో అప్పట్లో గెజిట్ నోటిఫికేషన్ అమల్లోకి రాలేదు. తొమ్మిదేళ్లుగా తెలంగాణ సర్కార్ అనుసరిస్తున్న దుందుడుకు వైఖరితో ప్రజల్లో అసంతృప్తి పెల్లుబికి శాంతి భద్రతల సమస్యగా మారుతుండటంతో ఏపీ హక్కుల పరిరక్షణకు సాగర్ స్పిల్వేలో సగం, కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్ను రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఈ వివాదాన్ని పరిష్కరించడానికి రంగంలోకి దిగిన కేంద్రం నాగార్జునసాగర్ను కృష్ణా బోర్డుకు అప్పగించడం ద్వారా నోటిఫికేషన్ అమలుకు శ్రీకారం చుట్టింది. ఈనెల 6న ఢిల్లీలో ఇరు రాష్ట్రాల సీఎస్లతో కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి నిర్వహించే సమావేశంలో వెల్లడైన అంశాల ఆధారంగా శ్రీశైలాన్ని బోర్డుకు అప్పగించే అవకాశం ఉంది. ఉమ్మడి ప్రాజెక్టులను కృష్ణా బోర్డుకు అప్పగించడం ద్వారా వివాదాలకు చరమగీతం పాడాలని కేంద్రం నిర్ణయించింది. నీటిపై నేడు త్రిసభ్య కమిటీ భేటీ నాగార్జునసాగర్ కుడి కాలువకు 5 టీఎంసీలు విడుదల చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శనివారం కృష్ణా బోర్డుకు ప్రతిపాదన పంపింది. దీనిపై త్రిసభ్య కమిటీ సమావేశాన్ని నిర్వహించి నిర్ణయం తీసుకోవాలని బోర్డును కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ ఆదేశించారు. ఈ నేపథ్యంలో కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ సోమవారం సమావేశమై నిర్ణయం తీసుకోనుంది. -
కరెంట్ పేరుతో 'శ్రీశైలం ఖాళీ'
సాక్షి, అమరావతి: ‘కృష్ణా బోర్డు అనుమతి లేకున్నా అక్రమంగా వాటాకు మించి నీటిని వినియోగించి తెలంగాణ రాష్ట్రం విద్యుదుత్పత్తి చేస్తూ.. నాగార్జునసాగర్కు తరలిస్తోంది. సాగర్ ఎడమ కాలువ రెగ్యులేటర్తోపాటు ఏపీ భూభాగంలో ఉన్న సాగర్ కుడి కాలువ రెగ్యులేటర్ను తన అధీనంలో ఉంచుకుంది. ఏపీకి హక్కుగా దక్కాల్సిన వాటా జలాలను దక్కినివ్వకుండా అడ్డుకుంటోంది. గత తొమ్మిదేళ్లుగా ఇదే రీతిలో తెలంగాణ సర్కార్ ఏపీ హక్కులను హరిస్తోంది. దీనిపై కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేసినా ఎలాంటి ఫలితం ఉండటం లేదు’ అని ఆంధ్రప్రదేశ్ సీఎస్ కేఎస్ జవహర్రెడ్డి తెలిపారు. కృష్ణా బోర్డు పరిధి నిర్దేశిస్తూ 2021 జూలై 15న కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్ అమలుకు ఏపీ ప్రభుత్వం అంగీకరించిందని, ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, సాగర్లను బోర్డుకు అప్పగించడానికి ఒప్పుకున్నామని గుర్తు చేశారు. విభజన చట్టం, కృష్ణా బోర్డు ఆదేశాల మేరకు శ్రీశైలం ప్రాజెక్టు నిర్వహణ బాధ్యతను కర్నూలు సీఈ.. నాగార్జునసాగర్ నిర్వహణ బాధ్యతను ఆ రాష్ట్ర సీఈ 2014 నుంచి నిర్వహిస్తున్నారని చెప్పారు. శ్రీశైలం ఎడమ గట్టు విద్యుత్కేంద్రం తన భూభాగంలో ఉందని చెబుతూ.. దాన్ని తన అధీనంలోకి తీసుకుని తెలంగాణ సర్కార్ స్వేచ్ఛగా నిర్వహిస్తూ, అక్రమంగా నీటిని తరలిస్తోందని గణాంకాలతో సహా వివరించారు. తన భూభాగంలోని నాగార్జునసాగర్ స్పిల్ వేలో సగం, కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్ను గురువారం ఏపీ ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడంతో రెండు రాష్ట్రాల మధ్య ఉత్పన్నమైన వివాదంతోపాటు కృష్ణా జలాల పంపకాలు, ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, సాగర్లను కృష్ణా బోర్డుకు అప్పగింతపై చర్చించడానికి కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ శనివారం రెండు రాష్ట్రాల సీఎస్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్కు విజయవాడలో క్యాంపు కార్యాలయం నుంచి ఏపీ సీఎస్ కేఎస్ జవహర్రెడ్డి, జల వనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్కుమార్, ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానంద్, ఈఎన్సీ సి.నారాయణరెడ్డిలు హాజరయ్యారు. తెలంగాణ సీఎస్ శాంతికుమారి, ఆ రాష్ట్ర అధికారులు వీడియో కాన్ఫరెన్స్కు గైర్హాజరయ్యారు. దాంతో వీడియో కాన్ఫరెన్స్లోనే తెలంగాణ సీఎస్ శాంతికుమారికి కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ ఫోన్ చేశారు. తెలంగాణ శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఆదివారం చేపట్టనుండటం వల్ల.. ఆ ఏర్పాట్లలో నిమగ్నమయ్యామని, దాని వల్లే వీడియో కాన్ఫరెన్స్కు హాజరుకాలేకపోతున్నామని ఆ రాష్ట్ర సీఎస్ శాంతికుమారి తెలిపారు. సమావేశాన్ని 5కు వాయిదా వేస్తే హాజరవుతామన్నారు. దీనిపై కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ స్పందిస్తూ.. ఈనెల 6న ఢిల్లీలో నిర్వహించే సమావేశానికి రెండు రాష్ట్రాల సీఎస్లు, జల వనరుల శాఖ అధికారులు హాజరుకావాలని కోరారు. ఇందుకు రెండు రాష్ట్రాల సీఎస్లు అంగీకరించారు. తెలంగాణ సీఎస్ హాజరుకాలేని నేపథ్యంలో ఏపీ సీఎస్, అధికారులతో కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ తాజా పరిస్థితిని సమీక్షించారు. మా హక్కులను కాపాడుకోడానికే.. ‘తెలంగాణ సర్కార్ ఎప్పటికప్పుడు నిర్ణయాలు మార్చుతూ ఉమ్మడి ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించడం లేదు. ఎల్ నినో ప్రభావం వల్ల వర్షాభావం నెలకొందని.. శ్రీశైలం, సాగర్లలో లభ్యతగా ఉన్న నీటిని తాగునీటి కోసమే వాడుకోవాలని అక్టోబర్ 6న జరిగిన త్రిసభ్య కమిటీ సమావేశంలో నిర్ణయించారు. ఆ కమిటీ చేసిన సిఫార్సు మేరకు శ్రీశైలంలో 30 టీఎంసీలు, సాగర్లో 15 టీఎంసీలు ఏపీకి.. రెండు ప్రాజెక్టుల నుంచి తెలంగాణకు 35 టీఎంసీలు కేటాయిస్తూ అక్టోబర్ 9న కృష్ణా బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఉత్తర్వులను తుంగలో తొక్కుతూ ఎడమ గట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ శ్రీశైలాన్ని ఖాళీ చేస్తూ.. సాగర్కు తెలంగాణ నీటిని తరలించింది’ అని ఏపీ సీఎస్ జవహర్రెడ్డి స్పష్టం చేశారు. శ్రీశైలంలో నీటి మట్టం తగ్గిపోవడం వల్ల.. కృష్ణా బోర్డు కేటాయించిన 30 టీఎంసీల్లో కేవలం 13 టీఎంసీలు మాత్రమే వాడుకోగలమని, మిగతా 17 టీఎంసీలు కోల్పోవాల్సి వచ్చిందని.. దీనికి తెలంగాణ సర్కార్ దుందుడుకు వైఖరి, కృష్ణా బోర్డు ప్రేక్షక పాత్ర వహించడమే కారణమని తెలిపారు. సాగర్లో కుడి కాలువకు కేటాయించిన 15 టీఎంసీలను ఇదే రీతిలో తెలంగాణ దక్కకుండా చేస్తుందేమోననే ఆందోళన ప్రజల్లో మొదలైందని.. ఇది శాంతిభద్రతల సమస్యకు దారితీస్తుండటంతో.. మా హక్కులను కాపాడుకోవడం ద్వారా దాన్ని నివారించడానికే మా భూభాగంలో ఉన్న సాగర్ స్పిల్ వేలో సగం, కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్ను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఎల్ నినో ప్రభావం వల్ల గుంటూరు, పల్నాడు, ప్రకాశం, పల్నాడు జిల్లాల్లో వర్షాభావం నెలకొనడంతో తాగునీటి అవసరాల కోసం కుడి కాలువకు నీటిని విడుదల చేశామని ఏపీ సీఎస్ స్పష్టం చేశారు. ఏపీ అధీనంలో స్పిల్ వేలో సగం, కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్ సీఆర్పీఎఫ్ బలగాల పహారాలో సాగర్ నిర్వహణ బాధ్యతను కృష్ణా బోర్డుకు అప్పగించాం కాబట్టి.. ఇక అలాంటి పరిస్థితులు ఉత్పన్నం కావని ఏపీ సీఎస్కు కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ హామీ ఇచ్చారు. ఈ క్రమంలోనే సాగర్లో సీఆర్పీఎఫ్ బలగాల మొహరింపుపై ఆ విభాగం అడిషనల్ డీజీ చారుసిన్హాను ఆరా తీశారు. సాగర్ స్పిల్ వే, ఎడమ కాలువ హెడ్ రెగ్యులేటర్ నుంచి తెలంగాణ పోలీసులు వెనక్కి వెళ్లారని, అక్కడ సీఆర్పీఎఫ్ బలగాలు మొహరించామని చారుసిన్హా చెప్పారు. ఏపీ పోలీసులు ఆ రాష్ట్ర భూభాగంలోని స్పిల్ వే, కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్ వద్ద ఉన్నారని.. పరిస్థితి శాంతియుతంగా ఉందన్నారు. ఏపీ వైపు స్పిల్ వే, కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్ను సీఆర్పీఎఫ్కు అప్పగించాలని కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి చేసిన సూచనను ఏపీ సీఎస్ సున్నితంగా తోసిపుచ్చారు. కుడి కాలువ కింద తమ రాష్ట్ర ప్రయోజనాలు మాత్రమే ముడిపడి ఉన్నాయని.. ఈ నేపథ్యంలో వాటిని తమ స్వాధీనంలో ఉంచుకుంటామని స్పష్టం చేశారు. ఏపీ సీఎస్ కేఎస్ జవహర్రెడ్డి లేవనెత్తిన అంశాలపై కృష్ణా బోర్డు ఛైర్మన్ను కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ వివరణ కోరారు. సాగర్ కుడి కాలువకు నీటిని విడుదల చేయాలని ఏపీ ప్రభుత్వం ప్రతిపాదన పంపకుండానే.. నీటిని విడుదల చేసుకున్నారని కృష్ణా బోర్డు ఛైర్మన్ చెప్పారు. కుడి కాలువకు 5 టీఎంసీలను విడుదల చేయాలని ప్రతిపాదన పంపామని ఏపీ సీఎస్ చెప్పారు. ఆ ప్రతిపాదనను పరిశీలించి.. ఈనెల 4లోగా నీటి విడుదలపై నిర్ణయం తీసుకోవాలని కృష్ణా బోర్డు ఛైర్మన్ను కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి ఆదేశించారు. కృష్ణా బోర్డు నీటి విడుదలపై నిర్ణయం తీసుకునే వరకూ అంటే 4వ తేదీ వరకు కుడి కాలువకు నీటి విడుదలను ఆపాలని ఆమె చేసిన సూచనకు ఏపీ సీఎస్ అంగీకరించారు. కృష్ణా జలాల వివాదంపై ఈనెల 6న ఢిల్లీలో రెండు రాష్ట్రాల ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శుల(సీఎస్)తో సమావేశం నిర్వహిస్తామని.. అప్పటిదాకా సంయమనం పాటించాలని రెండు రాష్ట్రాలకు ముఖర్జీ సూచించారు. విభజన చట్టం మేరకు కృష్ణా జలాల వివాదాన్ని పరిష్కరించి.. రెండు రాష్ట్రాల హక్కులను పరిరక్షించడానికి కట్టుబడి ఉన్నామని చెప్పారు. ఈ సమీక్షలో సీఐఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్, కృష్ణా బోర్డు ఛైర్మన్ శివ్నందన్కుమార్, సీడబ్ల్యూసీ ఛైర్మన్ కుశ్వీందర్సింగ్ వోరాలు పాల్గొన్నారు. రెండు గేట్ల ద్వారా కొనసాగిన నీటి విడుదల మాచర్ల / విజయపురిసౌత్: నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు సంబంధించిన 13 క్రస్ట్ గేట్లు, హెడ్ రెగ్యులేటర్ స్వాధీన పర్చుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నీటి హక్కు కోసం పోరాటం కొనసాగుతూనే ఉంది. అందులో భాగంగా శనివారం సాగర్ కుడికాలువ రెండు గేట్ల ద్వారా 3,300 క్యూసెక్కులు విడుదల కొనసాగించారు. మూడు రోజులుగా ప్రజల తాగునీటి అవసరాల కోసం నీటిని విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్ కుడికాలువ ద్వారా 5వ గేటు నుంచి 2వేల క్యూసెక్కులు, 2వ గేటు నుంచి 1300 మొత్తం 3300 క్యూసెక్కుల నీటిని బుగ్గవాగు రిజర్వాయర్కు పంపుతున్నారు. తద్వారా పల్నాడు, గుంటూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాల ప్రజల తాగునీటి అవసరాలు తీరుస్తున్నారు. జలవనరుల శాఖ అధికారులు, గుంటూరు రేంజి ఐజీ పాల్రాజ్, పల్నాడు జిల్లా ఎస్పీ రవిశంకర్రెడ్డి ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. తుపాను నేపథ్యంలో సాయంత్రం నుంచి నీటి విడుదలను 2,550 క్యూసెక్కులకు తగ్గించారు. నాగార్జునసాగర్ డ్యాం ప్రధాన ముఖద్వారం వద్ద ఉన్న తెలంగాణ స్పెషల్ ప్రోటెక్షన్ ఫోర్స్ పోలీస్ గార్డ్ రూమ్ పేరును తొలగించి, ఆంధ్రప్రదేశ్ పోలీస్గార్డ్ రూమ్గా మార్చారు. కాగా, వివాదం నేపథ్యంలో శనివారం కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు సభ్యులు ఎస్ఈ అశోక్కుమార్, ఈఈ రఘునా««థ్, సెంట్రల్ వాటర్ కమిషన్ అసిస్టెంట్ డైరెక్టర్ వీఎన్రావు డ్యామ్ను సందర్శించారు. -
‘సాగర్’లో సగం ఏపీ స్వాధీనం
సాక్షి, అమరావతి/సాక్షి, నరసరావుపేట/మాచర్ల/విజయపురిసౌత్ :కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కుల పరిరక్షణలో నాలుగున్నరేళ్లుగా రాజీలేని పోరాటం చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. రాష్ట్రానికి హక్కుగా దక్కిన జలాల వినియోగం విషయంలో ఇప్పుడు సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర భూభాగంలో ఉన్న నాగార్జునసాగర్ స్పిల్ వే 13 గేట్లతో సహా కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్ను ఆధీనంలోకి తీసుకుని, నీటిని విడుదల చేయాలని అధికారులకు సీఎం వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు. దీంతో గురువారం తెల్లవారుజామున సీఈ మురళీనాథ్రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర పోలీసులు, జలవనరుల శాఖాధికారులు నాగార్జునసాగర్కు చేరుకున్నారు. అక్కడ బందోబస్తు నిర్వహిస్తున్న తెలంగాణ పోలీసులకు వాస్తవాలను వివరించి.. రాష్ట్ర భూభాగంలోని సాగర్ స్పిల్ వే 13 గేట్లతో పాటు కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్ను స్వాధీనం చేసుకున్నారు. తాగునీటి అవసరాల కోసం కుడి కాలువకు 2,300 క్యూసెక్కులు విడుదల చేశారు. కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కుల పరిరక్షణలో సీఎం జగన్ రాజీలేని పోరాటం చేస్తున్నారనడానికి ఇది మరో తార్కాణమని సాగునీటిరంగ నిపుణులు ప్రశంసిస్తున్నారు. తెలంగాణ తొండాట.. నిజానికి.. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి అక్టోబరు 6న కృష్ణా బోర్డు రాష్ట్రానికి 30 టీఎంసీలు కేటాయించింది. ఇందులో ఎడమ గట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ 15 టీఎంసీలను నాగార్జునసాగర్కు తెలంగాణ సర్కార్ తరలించింది. మాకు కేటాయించిన ఆ 15 టీఎంసీలను గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాల తాగునీటి అవసరాల కోసం సాగర్ కుడి కాలువ ద్వారా విడుదల చేయాలని ఏపీ అధికారుల విజ్ఞప్తులను తెలంగాణ సర్కార్ పట్టించుకోవడంలేదు. ఇదే అంశాన్ని సీఎం వైఎస్ జగన్కు రాష్ట్ర జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్కుమార్, ఈఎన్సీ సి. నారాయణరెడ్డిలు వివరించారు. వాస్తవానికి.. శ్రీశైలం ప్రాజెక్టు నిర్వహణ బాధ్యతను కేంద్రం రాష్ట్రానికి అప్పగిస్తే.. తమ భూభాగంలో ఉందని ఎడమ గట్టు విద్యుత్కేంద్రాన్ని తెలంగాణ సర్కార్ తన ఆధీనంలోకి తీసుకుంది. ఇదే తరహాలో ఏపీ భూభాగంలో ఉన్న నాగార్జునసాగర్ స్పిల్ వే 13 గేట్లతో సహా కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్ను సీఎం జగన్ ఆదేశాలతో అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్ర హక్కులు తెలంగాణకు చంద్రబాబు తాకట్టు.. ♦ విభజన నేపథ్యంలో కృష్ణా జలాల వినియోగంలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య విభేదాలు తలెత్తకుండా చేసేందుకు విభజన చట్టం ద్వారా 2014లో కేంద్రం కృష్ణా బోర్డును ఏర్పాటుచేసింది. దీని పరిధిని నోటిఫై చేసేదాకా ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలంను ఆంధ్రప్రదేశ్, నాగార్జునసాగర్ను తెలంగాణ సర్కార్ నిర్వహించాలని నిర్దేశించింది. ♦ దీంతో సాగర్ను 2014–15లో పూర్తిగా తన ఆధీనంలోకి తీసుకున్న తెలంగాణ సర్కార్.. శ్రీశైలం ఎడమ గట్టు విద్యుత్కేంద్రం తమ భూభాగంలో ఉందనే సాకు చూపి దాన్ని తన ఆధీనంలోకి తీసుకుంది. అదే సాకు చూపి పులిచింతల విద్యుత్కేంద్రాన్ని సైతం తన ఆధీనంలోకి తీసుకుంది. అయినాసరే.. నాటి సీఎం చంద్రబాబు ఇటు రాష్ట్రంలో.. అటు తెలంగాణలో టీడీపీని బతికించుకోవాలన్న రెండు కళ్ల సిద్ధాంతంతో కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కులను తెలంగాణకు తాకట్టు పెట్టారు. ♦ ఇక శ్రీశైలం ప్రాజెక్టులో 881 అడుగుల స్థాయిలో నీటి మట్టం ఉన్నప్పుడు మాత్రమే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా ప్రస్తుత డిజైన్ మేరకు 44 వేల క్యూసెక్కుల నీటిని రాయలసీమ, నెల్లూరు జిల్లాలకు తరలించవచ్చు. నీటి మట్టం 854 అడుగుల స్థాయిలో ఉంటే ఆరేడు వేల క్యూసెక్కులు మాత్రమే తరలించడానికి సాధ్యమవుతుంది. అంతకంటే తగ్గితే.. శ్రీశైలంలో నీటి కోటా ఉన్నా సరే సీమ అవసరాల కోసం నీటిని వినియోగించలేని దుస్థితి. కానీ, శ్రీశైలం ప్రాజెక్టులో 796 అడుగుల నుంచే రోజుకు 4 టీఎంసీలను తరలించే సామర్థ్యం తెలంగాణకు ఉంది. దిగువన నీటి అవసరాలు లేకున్నా.. కృష్ణా బోర్డు అనుమతి తీసుకోకుండానే ఎడమ గట్టు కేంద్రం నుంచి యథేచ్ఛగా విద్యుదుత్పత్తి చేస్తూ.. శ్రీశైలంలో నీటిమట్టం తగ్గేలా తెలంగాణ సర్కార్ చేస్తోంది. తద్వారా శ్రీశైలంలో రాష్ట్ర వాటా జలాలు వినియోగించుకోకుండా చేస్తోంది. ♦ శ్రీశైలం నుంచి 2015లో ఇదే రీతిలో సాగర్కు తెలంగాణ తరలించిన నీటిని.. కుడి కాలువ కింద సాగు అవసరాల కోసం విడుదల చేయాలని అప్పటి రాష్ట్ర జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ చేసిన విజ్ఞప్తిని తెలంగాణ అధికారులు తోసిపుచ్చారు. దీంతో రాష్ట్ర భూభాగంలోని సాగర్ స్పిల్ వేలో 13 గేట్లతోపాటు కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్ను స్వాధీనం చేసుకునేందుకు 2015, ఫిబ్రవరి 13న ఆదిత్యనాథ్ దాస్ పోలీసులతో కలిసి సాగర్కు చేరుకున్నారు. కానీ, తక్షణమే వెనక్కి రావాలని ఆదిత్యనాథ్ దాస్ను చంద్రబాబు ఆదేశించారు. తద్వారా కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కులను ఆయన తెలంగాణకు తాకట్టు పెట్టారు. ♦ శ్రీశైలం నుంచి 800 అడుగుల నుంచే రోజుకు రెండు టీఎంసీలు తరలించేలా పాలమూరు–రంగారెడ్డి, డిండి ఎత్తిపోతలతోపాటు కల్వకుర్తి, నెట్టెంపాడుల సామర్థ్యం పెంచి.. సుంకేశుల బ్యారేజ్ జలవిస్తరణ ప్రాంతంలో తుమ్మిళ్ల ఎత్తిపోతల, భక్తరామదాస ఎత్తిపోతలను తెలంగాణ సర్కార్ అక్రమంగా చేపట్టింది. కృష్ణా జలాలపై ఏపీ హక్కులను హరించి వేస్తున్నా ఓటుకు కోట్లు కేసు నుంచి తప్పించుకునేందుకు వాటిని తెలంగాణ సర్కార్కు చంద్రబాబు తాకట్టు పెట్టారు. సాగర్ నుంచి నీరు విడుదల గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో తీరనున్న తాగునీటి కష్టాలు రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితుల వలన తాగునీరు లేక మూడు జిల్లాల చెరువులు, భూగర్భ జలాలు తగ్గిపోయి ప్రజలు మంచినీటికి అల్లాడుతున్న నేపథ్యంలో.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న సాహసోపేత నిర్ణయం గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాలకు ఊపిరిపోసింది. ఏపీ భూభాగంలోని 13 గేట్లను, కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్ను రాష్ట్ర జలవనరుల శాఖాధికారులు స్వాధీనం చేసుకుని కుడికాలువ రెండు గేట్ల ద్వారా 2,300 క్యూసెక్కుల నీటిని గురువారం విడుదల చేశారు. అంతకుముందు.. భారీ స్థాయిలో ఏపీ పోలీసులు అక్కడ మోహరించారు. కుడికాలువపై పట్టు సాధించే క్రమంలో డ్యాంపై ఘర్షణ వాతావరణం ఏర్పడింది. తెలంగాణ పోలీసులు ఏపీ జలవనరుల శాఖ అధికారులపై దౌర్జన్యానికి దిగారు. దీంతో ఏపీ పోలీసులు శాంతియుత వాతావరణంలోనే వారిని అక్కడి నుంచి పంపించి వేశారు. అనంతరం.. సాగర్ డ్యాంపై ఏపీకి చెందిన భూభాగంలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటుచేసిన గేట్లను దాటి సగభాగం వరకు స్వాధీనం చేసుకున్నారు. దీంతో ఏపీ పరిధిలోని 13 క్లస్టర్ గేట్ల వరకు బారికేడ్లు ఏర్పాటుచేశారు. ఈ చర్యలతో నాగార్జునసాగర్లో ఏపీ హక్కులను రాష్ట్ర ప్రభుత్వం పరిరక్షించినట్లయ్యింది. మరోవైపు.. నీరు విడుదల చేసి ప్రజల దాహార్తిని తీర్చేందుకు సీఎం జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయంపై ఆ జిల్లాల ప్రజలు హర్షం వ్యక్తంచేస్తున్నారు. హక్కుల పరిరక్షణకు సీఎం జగన్ రాజీలేని పోరాటం.. ఇక వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక కృష్ణా జలాల విషయంలో రాష్ట్ర హక్కుల పరిరక్షణ కోసం రాజీలేని పోరాటం చేస్తున్నారు. తెలంగాణ సర్కార్ అక్రమ ప్రాజెక్టులను నిలిపేయాలని కేంద్రానికి ఫిర్యాదు చేశారు. రాయలసీమ, నెల్లూరు జిల్లాల సాగు, తాగునీటి అవసరాల కోసం తెలంగాణ తరహాలోనే శ్రీశైలంలో 800 అడుగుల స్థాయిలో నుంచి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్లోకి రోజుకు 3 టీఎంసీలు ఎత్తిపోసేలా రాయలసీమ ఎత్తిపోతలను చేపట్టారు. దీనిపై రెండు రాష్ట్రాల మధ్య వివాదం తలెత్తడంతో.. దాన్ని పరిష్కరించడానికి 2020, అక్టోబర్ 6న కేంద్ర జల్శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్రానికి హక్కుగా దక్కిన నీటిని వినియోగించుకోవడం కోసమే రాయలసీమ ఎత్తిపోతలను చేపట్టామని స్పష్టంచేసిన సీఎం జగన్.. తెలంగాణ అక్రమ ప్రాజెక్టులను నిలుపుదల చేయాలని డిమాండ్ చేయడమే కాక.. సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. ♦ శ్రీశైలానికి ఎగువ నుంచి వరద ప్రవాహం ప్రారంభం కాకుండానే 2021లో తెలంగాణ జెన్కో విద్యుదుత్పత్తి ప్రారంభించి.. సాగర్కు తరలిస్తూ శ్రీశైలాన్ని ఖాళీచేస్తూ రాష్ట్ర హక్కులను హరిస్తుండటంతో సీఎం వైఎస్ జగన్ న్యాయపోరాటానికి దిగారు. కృష్ణా బోర్డు పరిధిని నోటిఫై చేయడం ద్వారా అక్రమంగా విద్యుదుత్పత్తి చేయకుండా తెలంగాణను కట్టడి చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ♦ దీంతో కృష్ణా బోర్డు పరిధిని నిర్దేశిస్తూ 2021, జూలై 15న కేంద్ర జల్శక్తి శాఖ నోటిఫికేషన్ జారీచేసింది. ఉమ్మడి ప్రాజెక్టులను ఏడాదిలోగా బోర్డుకు అప్పగించాలని కేంద్రం ఆదేశించింది. శ్రీశైలం, సాగర్లలో రాష్ట్ర భూభాగం పరిధిలోని ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధంకాగా.. తెలంగాణ నిరాకరించింది. ఈ నేపథ్యంలో.. రాష్ట్ర భూభాగంలోని సాగర్ స్పిల్ వే 13 గేట్లతోపాటు కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్ను రాష్ట్రానికి అప్పగించాలని.. లేదంటే ఉమ్మడి ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తీసుకోవాలని జగన్ డిమాండ్ చేస్తూ వస్తున్నారు. 1,311 మంది పోలీసులతో బందోబస్తు ఇక నాగార్జునసాగర్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే అవకాశమున్న నేపథ్యంలో.. ఏపీ పోలీసు శాఖ భారీ సంఖ్యలో పోలీసులను మోహరించింది. గుంటూరు రేంజ్ ఐజి పాల్రాజ్, పల్నాడు జిల్లా ఎస్పీ రవిశంకర్రెడ్డి, ఎస్పీ రవీంద్రబాబుల ఆ«ధ్వర్యంలో 1,311 మంది సిబ్బంది బందోబస్తులో పాల్గొన్నారు. సాగర్ వద్ద పరిస్థితులు చక్కబడే వరకు వీరు అక్కడే ఉండే అవకాశముంది. -
విశాఖకు కృష్ణాబోర్డు
సాక్షి, అమరావతి: కృష్ణాబోర్డు కార్యాలయాన్ని విశాఖపట్నంలో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు అన్ని వసతులతో కూడిన భవనాన్ని సిద్ధం చేసింది. తక్షణమే హైదరాబాద్ నుంచి విశాఖకు కార్యాలయాన్ని తరలించాలని బోర్డు చైర్మన్ శివ్నందన్కుమార్కు జలవనరులశాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్కుమార్ లేఖ రాశారు. కృష్ణా, గోదావరి నదీజలాల వినియోగంలో రెండు రాష్ట్రాల మధ్య విభేదాలు రాకుండా చూసేందుకు కృష్ణా, గోదావరి బోర్డులను విభజన చట్టం ద్వారా కేంద్రం ఏర్పాటుచేసింది. కృష్ణాబోర్డు కార్యాలయం ఆంధ్రప్రదేశ్లోను, గోదావరి బోర్డు కార్యాలయం తెలంగాణలోను ఏర్పాటుచేయాలని నిర్దేశించింది. ప్రస్తుతం రెండు బోర్డుల కార్యాలయాలు హైదరాబాద్ కేంద్రంగానే పనిచేస్తున్నాయి. 2020లో కృష్ణాబోర్డు కార్యాలయాన్ని ఆంధ్రప్రదేశ్కు తరలించాలని కేంద్ర జల్శక్తిశాఖ మంత్రి ఆదేశించారు. కార్యాలయాన్ని ఎక్కడ ఏర్పాటు చేయాలనుకుంటున్నారో అక్కడ భవనం, వసతులు కల్పిస్తే హైదరాబాద్ నుంచి తరలిస్తామని రాష్ట్ర ప్రభుత్వానికి కృష్ణాబోర్డు తెలిపింది. విశాఖపట్నంలో నార్త్కోస్ట్ సీఈ కార్యాలయం ప్రాంగణంలో నిర్మిం చిన భవనంలో ఒక అంతస్తును కృష్ణాబోర్డు కార్యాలయానికి ప్రభుత్వం కేటాయించి, బోర్డుకు తెలిపింది. -
5న కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ భేటీ
సాక్షి, అమరావతి: వర్షాభావ పరిస్థితులవల్ల దిగువ కృష్ణా బేసిన్లోని ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్లలో నీటి నిల్వలు కనిష్టంగా ఉన్న నేపథ్యంలో మే 31 వరకూ తాగునీటి అవసరాలపై చర్చించేందుకు హైదరాబాద్లో అక్టోబర్ 5న త్రిసభ్య కమిటీ సమావేశాన్ని కృష్ణా బోర్డు నిర్వహించనుంది. శ్రీశైలం, నాగార్జునసాగర్ల నుంచి మే 31 వరకూ తాగునీటి అవసరాలకు ఎన్ని నీళ్లు అవసరమో అక్టోబర్ 3లోగా ప్రతిపాదనలు పంపాలని రెండు రాష్ట్రాల ఈఎన్సీలకు కోరింది. కమిటీలో సభ్యులందరూ ఈ సమావేశంలో తప్పనిసరిగా పాల్గొనాలని సూచించింది. ఈ మేరకు రెండు రాష్ట్రాల ఈఎన్సీలకు కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి డీఎం రాయ్పురే శుక్రవారం లేఖ రాశారు. శ్రీశైలం, నాగార్జునసాగర్లలో నీటి లభ్యతను బట్టి, రెండు రాష్ట్రాల అవసరాలను పరిగణలోకి తీసుకుని నీటి కేటాయింపులపై కృష్ణా బోర్డుకు సిఫార్సు చేయడానికి సభ్య కార్యదర్శి కన్వీనర్గా రెండు రాష్ట్రాల ఈఎన్సీలు సభ్యులుగా త్రిసభ్య కమిటీని కృష్ణాబోర్డు ఛైర్మన్ ఏర్పాటుచేశారు. ప్రస్తుత నీటి సంవత్సరంలో మొదటిసారిగా జూలైలో సమావేశమైన త్రిసభ్య కమిటీ.. తాగునీటి అవసరాల కోసం రెండు ప్రాజెక్టుల నుంచి 12.7 టీఎంసీలను విడుదల చేయాలని సిఫార్సు చేయడంతో ఆ మేరకు నీటి విడుదల ఉత్తర్వులను జూలై 21న కృష్ణా బోర్డు జారీచేసింది. ఆ తర్వాత ఆగస్టు 21, 24న త్రిసభ్య కమిటీ రెండోసారి సమావేశమైంది. ఉమ్మడి ప్రాజెక్టుల్లో నీటినిల్వ తక్కువగా ఉన్న నేపథ్యంలో.. తాగునీటి అవసరాల కోసం నిల్వచేయాలని రెండు రాష్ట్రాలు ఏకాభిప్రాయానికి వచ్చాయి. తాగునీటి అవసరాల కోసం రెండు రాష్ట్రాలు పంపిన ప్రతిపాదనలపై సంప్రదింపులు జరపకపోవడంతో అప్పట్లో నీటి విడుదల ఉత్తర్వులను కృష్ణాబోర్డు జారీచేయలేదు. ఇదే అంశాన్ని కృష్ణా బోర్డు చైర్మన్ శివ్నందన్కుమార్ దృష్టికి సభ్య కార్యదర్శి డీఎం రాయ్పురే తీసుకెళ్లారు. తక్షణమే త్రిసభ్య కమిటీ సమావేశం నిర్వహించి.. రెండు రాష్ట్రాల తాగునీటి అవసరాలను చర్చించి.. నీటి కేటాయింపులకు సిఫార్సు చేయాలని కృష్ణా బోర్డు చైర్మన్ ఆదేశించారు. దాంతో అక్టోబర్ 5న త్రిసభ్య కమిటీ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు సభ్య కార్యదర్శి డీఎం రాయ్పురే తెలిపారు. -
కృష్ణా ప్రాజెక్టులపై గెజిట్ను రద్దు చేయాలి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పునర్విభజన చట్టంలోని 11వ షెడ్యూల్లో పొందుపర్చిన ఆరు ప్రాజెక్టులకు రక్షణ కల్పిస్తూ గత ఏడాది జూలై 27న కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన గెజిట్ నోఫికేషన్కు చట్టబద్ధత లేదని, దానిని తక్షణమే రద్దు చేయాలని తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేసింది. బేసిన్ వెలుపల ఉన్న ఏపీలోని నాలుగు ప్రాజెక్టులకు ఎలాంటి నీటి కేటాయింపులు లేకున్నా.. అనుమతుల నుంచి మినహాయింపు కల్పించడం సరికాదని స్పష్టం చేసింది. నీటి కేటాయింపులు జరిపే అధికారం కేవలం ట్రిబ్యునల్కు మాత్రమే ఉందని పేర్కొంది. పునర్విభజన చట్టంలోని 11వ షెడ్యూల్లో పేర్కొన్న ప్రాజెక్టుల జాబితా అసంపూర్తిగా ఉందని.. 2002 నుంచే వినియోగంలో ఉన్న ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును అందులో చేర్చలేదని వివరించింది. బ్రిజేశ్కుమార్ ట్రిబ్యునల్ నిర్ణయాలను ప్రభావితం చేసేలా ఉన్న ఈ గెజిట్ను రద్దు చేయాలని కోరింది. ఈ మేరకు రాష్ట్ర నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్కుమార్ తాజాగా కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శికి లేఖ రాశారు. తెలంగాణకు అన్యాయం.. కృష్ణా జలాల వినియోగంలో ఇరు రాష్ట్రాల మధ్య విభేదాలు తలెత్తకుండా చూసేందుకు విభజన చట్టం కింద కేంద్రం కృష్ణా బోర్డును ఏర్పాటు చేసింది. ఆ బోర్డుకు పరిధిని నిర్దేశిస్తూ 2021 జూలై 15న కేంద్ర జలశక్తి శాఖ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. అందులో కృష్ణానదిపై తెలంగాణలోని కల్వ కుర్తి (అదనపు 15 టీఎంసీల సామర్థ్యం పెంపు), నెట్టెంపా డు (సామర్థ్యం పెంచనిది)తోపాటు ఏపీలోని తెలుగుగంగ, గాలేరు–నగరి, హంద్రీ–నీవా, వెలిగొండ ఎత్తిపోతల పథకా లను అనుమతి లేని ప్రాజెక్టుల జాబితాలో చేర్చింది. వీటికి ఏడాదిలోగా అపెక్స్ కౌన్సిల్ అనుమతి తీసుకోవాలని పే ర్కొంది. కానీ కేంద్రం వీటిని విభజన చట్టంలో 11వ షెడ్యూ ల్లో పొందుపరిచి, పూర్తి చేసుకోవడానికి అనుమతి ఇచ్చిన నేపథ్యంలో.. మళ్లీ అనుమతి తీసుకోవాల్సిన అవసరం లే దంటూ గత ఏడాది జూలై 27న సవరణ గెజిట్ జారీ చేసింది. అయితే.. ఇలా మినహాయింపు పొందిన ప్రాజెక్టుల్లో తెలంగాణలోని రెండే ప్రాజెక్టులు ఉండగా, ఏపీలోని 4 ప్రాజె క్టులు ఉండటంపై తెలంగాణ తాజాగా అభ్యంతరం తెలిపింది. కృష్ణా బేసిన్ పరిధిలో ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులను కోరుతూ కృష్ణా ట్రిబ్యునల్ ఎదుట వాదనలు వినిపి స్తున్నామని.. ఈ సమయంలో బేసిన్ వెలుపల ఉన్న ఏపీలో ని 4 ప్రాజెక్టులకు మినహాయింపు ఇస్తే తెలంగాణకు తీవ్ర అన్యాయమని ఆందోళన వ్యక్తం చేసింది. బేసిన్ పరిధిలోని పాలమూరు–రంగారెడ్డి, డిండి, ఎస్ఎల్బీసీ ప్రాజెక్టులకు అ నుమతుల కోసం చేస్తున్న ప్రయత్నాలకు గెజిట్ నోటిఫికేషన్ అడ్డంకిగా మారే అవకాశం ఉందని పేర్కొంది. కృష్ణాలో 75 శాతం లభ్యత ఆధారంగా నీటి కేటాయింపులు కోరుతు న్నామని తెలిపింది. -
కృష్ణా బోర్డు & తెలంగాణ
సాక్షి, హైదరాబాద్: శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల్లో మిగిలి ఉన్న కొద్దిపాటి నిల్వల పంపిణీ విషయంలో..తెలంగాణ రాష్ట్రం, కృష్ణా నది యాజమాన్య బోర్డు(కేఆర్ఎంబీ) మధ్య వివాదం తీవ్రమైంది. తాగునీటి అవసరాల కోసం సెప్టెంబర్ 30 వరకు ఏపీకి 25.29 టీఎంసీలు, తెలంగాణకు కేవలం 6.04 టీఎంసీల కృష్ణా జలాలను విడుదల చేయాలని ప్రతిపాదిస్తూ గత నెలలో ‘త్రిసభ్య కమిటీ’ పేరుతో రూపొందించిన వివాదాస్పద ముసాయిదా మినిట్స్ను ఆమోదించాలని తాజాగా కృష్ణా బోర్డు ఇరు రాష్ట్రాలను కోరినట్టు తెలిసింది. ఈ మేరకు ముసాయిదా మినిట్స్ను తాజాగా రెండు రాష్ట్రాలకూ కృష్ణా బోర్డు పంపించింది. ఇప్పటికే తెలంగాణ తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేసినా బేఖాతరు చేస్తూ మినిట్స్ను కృష్ణా బోర్డు రెండు రాష్ట్రాలకు పంపించడం గమనార్హం. కృష్ణా బోర్డుపై సీఎం కేసీఆర్ ఆగ్రహం... గత నెల 21న హైదరాబాద్లోని జలసౌధలో కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం జరగ్గా తెలంగాణ నీటిపారుదల శాఖ ఈఎన్సీ సి.మురళీధర్ గైర్హాజర య్యారు. కమిటీ కన్వీనర్ డీఎం రాయిపూరే, ఏపీ జలవనరుల శాఖ ఈఎన్సీ సి.నారాయణరెడ్డి హాజ రై నీటి కేటాయింపులపై చర్చించారు. ఈ సమా వేశా న్ని వాయిదా వేయాలని అంతకుముందే తెలంగాణ లేఖ రాసినా, కృష్ణా బోర్డు సమావేశాన్ని నిర్వహించింది. సమావేశం నిర్ణయాల మేరకు ఏపీకి 25.29 టీఎంసీలు, తెలంగాణకు కేవలం 6.04 టీఎంసీల కృష్ణా జలాలను కేటాయించాలని ప్రతిపాదిస్తూ.. ముసాయిదా మినిట్స్ను కృష్ణా బోర్డు రూపొందించింది. తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ గైర్హాజరైనా, రాష్ట్రానికి అవసరమైన నీటి కేటాయింపులను కోరు తూ గతంలో ఆయన రాసిన లేఖను పరిగణనలోకి తీసుకుని ఈ ప్రతిపాదనలను సిద్ధం చేసింది. తెలంగాణకు నామమాత్రంగా నీటి కేటాయింపులు జరుపుతూ మినిట్స్ను రూపొందించినట్టు పత్రికల్లో వార్తలు రావడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర ఆగ్ర హం వ్యక్తం చేశారు. దీంతో ఈఎన్సీ సి.మురళీధర్ కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ కన్వీనర్ డీఎం రాయి పూరేను కలిసి మినిట్స్పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అసలు త్రిసభ్య కమిటీ సమావేశమే జరగలే దని, నీటి కేటాయింపులపై ఎలాంటి ప్రతిపాదనలు చేయలేదని, ఒకవేళ చేసినా తెలంగాణ సమ్మతి తెలపలేదని స్పష్టం చేస్తూ రాష్ట్ర నీటిపారుదల శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. త్రిసభ్య కమిటీ సమావేశాన్ని సత్వరంగా నిర్వహించి నీటికేటాయింపులపై నిర్ణయం తీసుకోవాలని కృష్ణా బోర్డును కోరినట్టు వెల్లడించింది. మొత్తంగా.. తెలంగాణ అభ్యంతరాలను పట్టించుకోకుండా నీటి కేటాయింపుల ప్రతిపాదనలను కృష్ణా బోర్డు రెండు రాష్ట్రాలకు పంపించడం వివాదాస్పదంగా మారింది. -
‘కృష్ణా’లో కేటాయింపులే జరగలేదు
సాక్షి, హైదరాబాద్: శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల నుంచి తాగునీటి అవసరాలకు సెప్టెంబర్ 30వ తేదీ వరకు ఏపీకి 26.29 టీఎంసీలు, తెలంగాణకు 6.04 టీఎంసీలను విడుదల చేయాలని కృష్ణానది యాజమాన్య బోర్డు నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ సిఫారసు చేసిందని పత్రికల్లో వచ్చిన వార్తల్లో నిజం లేదని రాష్ట్ర నీటిపారుదల శాఖ స్ప ష్టం చేసింది. ఈ నెల 21న త్రిసభ్య కమిటీ సమావేశమే జరగలేదని గురువారం ఓ ప్రకటనలో పేర్కొంది. ఆ రోజు త్రిసభ్య కమిటీ క న్వినర్, కృష్ణా బోర్డు సభ్యకార్యదర్శి డీఎం రాయిపూరే, ఏపీ జల వనరు ల శాఖ ఈఎన్సీ సి.నారాయణరెడ్డి మాత్రమే సమా వేశమై తాగునీటి అవసరాలపై మాత్రమే చర్చించా రని తెలియజేసింది. రెండు రాష్ట్రాలకు తాగునీటి కేటాయింపులు జరగలేదని, అసలు తెలంగాణ అంగీకారం తెలపలేదని వివరణ ఇచ్చింది. కృష్ణాబోర్డు సభ్యకార్యదర్శితో తెలంగాణ ఈఎన్సీ భేటీ కృష్ణాబోర్డు త్రిసభ్య కమిటీ కన్వీనర్ డీఎం.రాయిపూరేను రాష్ట్ర నీటిపారుదల శాఖ ఈఎన్సీ సి.మురళీధర్ గురువారం జలసౌధలో కలిసి కృష్ణా జలాల కేటాయింపులపై పత్రికల్లో వచ్చిన వార్తల పట్ల తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఈ నెల 21న ఏపీ జల వనరుల శాఖ ఈఎన్సీతో నిర్వహించిన సమావేశంలో తాగునీటి అవసరాలకుపై చర్చించిన అనంతరం, నీటి కేటాయింపులపై సిఫారసులతో రూపొందించిన ముసాయిదా ప్రతిపాదనలు(మినట్స్) అంతర్గతంగా సర్క్యులేట్ చేశామని, పత్రికలకు అధికారికంగా విడుదల చేయలేదని రాయిపూరే వివరణ ఇచ్చినట్టు తెలిసింది. త్వరలో త్రిస భ్య కమిటీ సమావేశం నిర్వహించాలని తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ సూచించారు. ఇప్పటివరకు రెండు రాష్ట్రాల జలవినియోగం, నీటి నిల్వ లు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని తాగునీటి అవసరాలను మదింపు చేసిన తర్వాత కేటాయింపులు జరపాలని కోరారు. తాగునీటి అవసరాలను త్రిసభ్య కమిటీలో చర్చించి, ఇరుపక్షాల అంగీకారం మేరకే నిర్ణయం తీసుకోవాలని కోరారు. -
‘కృష్ణా’లో చుక్కెదురు
సాక్షి, హైదరాబాద్: శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల నుంచి తాగునీటి అవసరాల కోసం సెపె్టంబర్ 30 తేదీ వరకు తెలంగాణకు 6.04 టీఎంసీలు, ఏపీకి 25.29 టీఎంసీల నీటిని విడుదల చేయాలని కృష్ణాబోర్డు ఆధ్వర్యంలోని త్రిసభ్య కమిటీ సిఫారసు చేసింది. ఈనెల 21న హైదరాబాద్లోని జలసౌధలో జరిగిన త్రిసభ్య కమిటీ సమావేశంలో కన్వినర్ డీఎం రాయిపూరే ఈ నిర్ణయం తీసుకున్నారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టులో 15.609 టీఎంసీలు, శ్రీశైలంలో 58.865 టీఎంసీల లభ్యత మాత్రమే ఉందని, ఇండెంట్లలో కోరిన విధంగా తాగు, సాగునీటి అవసరాల కోసం రెండు రాష్ట్రాలకు కేటాయింపులు చేసేందుకు నిల్వలు సరిపోవని త్రిసభ్య కమిటీ అభిప్రాయపడింది. తీవ్ర వర్షాభావం నెలకొని ఉండడంతో ప్రస్తుత నీటి సంవత్సరంలో ఎగువ నుంచి ఆశించిన మేర వరద వచ్చే అవకాశం లేదని పేర్కొంది. ఈ నేపథ్యంలో తాగునీటి అవసరాలకు మాత్రమే నీటి కేటాయింపులు జరపాలని నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే తెలంగాణ 12 టీఎంసీలు, ఏపీ 7 టీఎంసీలు వాడుకున్నాయి ప్రస్తుత నీటి సంవత్సరం ప్రారంభం నుంచి ఈ నెల 16వ తేదీ వరకు ఏపీ 7.427 టీఎంసీ లు, తెలంగాణ 12.595 టీఎంసీలు కలిపి మొ త్తం 20.022 టీఎంసీల కృష్ణా జలాలను వినియోగించుకున్నట్టు త్రిసభ్య కమిటీ చెప్పింది. ♦ నాగార్జునసాగర్ కుడికాల్వ ద్వారా ఏపీ 3.592 టీఎంసీలు, శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడు ద్వారా 2.088 టీఎంసీలు, సీడబ్ల్యూఎస్(తాగునీటి పథకం) ద్వారా 1.748 టీఎంసీలను ఏపీ వాడుకున్నట్టు పేర్కొంది. ♦ నాగార్జునసాగర్ప్రాజెక్టు నుంచి జంట నగరాల తాగునీటి అవసరాలకు 3.493 టీఎంసీలు, ఏఎంఆర్పీ ద్వారా 2.921 టీఎంసీలు, ఎడమకాల్వ ద్వారా 1.536 టీఎంసీలు కలిపి మొత్తం 7.95 టీఎంసీలను తెలంగాణ వాడుకుంది. శ్రీశైలం నుంచి కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా 3.771 టీఎంసీలు, తాగునీటి కోసం 0.874 టీఎంసీలను తెలంగాణ వాడుకుంది. కృష్ణాబోర్డుకు లేఖ: కోటికి పైగా జనాభా కలిగిన హైదరాబాద్ అవసరాలకు కేవలం 4.8 టీఎంసీలను నాగార్జునసాగర్ నుంచి కేటాయించడం పట్ల తెలంగాణ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు తెలంగాణ నీటిపారుద ల శాఖ ఈఎన్సీ సి.మురళీధర్ కృష్ణా బోర్డుకు లేఖ రాసినట్టు తెలిసింది. కృష్ణా బోర్డు నిర్ణయంతో తెలంగాణలో తీవ్ర తా గునీటి సమస్యలు ఉత్పన్నం అవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. -
అప్పటివరకు పాత వాటాలే
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు పాత వాటాల ప్రకారమే నీటిని పంపిణీ చేస్తామని కేంద్ర జల్శక్తి శాఖ, కృష్ణాబోర్డు తేల్చిచెప్పాయి. బ్రిజేష్కుమార్ ట్రిబ్యునల్ అవార్డు అమల్లోకి వచ్చే వరకు ఉమ్మడి రాష్ట్రానికి బచావత్ కేటాయించిన కృష్ణా జలాల్లో 66 శాతం ఏపీకి, 34 శాతం తెలంగాణకు పంపిణీ చేస్తామని స్పష్టం చేసింది. చిన్న నీటివనరుల విభాగంలో వినియోగించిన జలాలు, ప్రకాశం డెల్టాకు మళ్లించే గోదావరి జలాలను పంపిణీ నుంచి మినహాయించినట్టు పునరుద్ఘాటించింది. ఈ మేరకు ఈ నెల 2న పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతలపై సుప్రీంకోర్టులో కేంద్ర జల్శక్తి శాఖ, కృష్ణాబోర్డు సంయుక్తంగా దాఖలు చేసిన అఫిడవిట్లో స్పష్టం చేశాయి. కృష్ణా జలాలను ప్రస్తుత నీటి సంవత్సరంలోనూ పాత పద్ధతిలోనే వినియోగించుకోవడానికి మే 10న నిర్వహించిన కృష్ణా బోర్డు 17వ సర్వసభ్య సమావేశంలో రెండు రాష్ట్రాలు అంగీకరించాయి. కానీ.. ఆ తర్వాత తెలంగాణ అడ్డం తిరిగింది. కృష్ణా జలాల్లో సగం వాటా ఇవ్వాల్సిందేనని పట్టుబట్టింది. దీన్ని కేంద్ర జల్ శక్తి శాఖ దృష్టికి కృష్ణా బోర్డు తీసుకెళ్లింది. అర్ధ భాగం డిమాండ్ అసంబద్ధమే.. కృష్ణా జలాల పంపిణీకి 1969లో జస్టిస్ బచావత్ అధ్యక్షతన కేంద్రం ఏర్పాటు చేసిన ట్రిబ్యునల్.. 75 శాతం లభ్యత ఆధారంగా 2,130 టీఎంసీల లభ్యత ఉంటుందని అంచనా వేసింది. మహారాష్ట్రకు 585 టీఎంసీలు, కర్ణాటకకు 734, ఉమ్మడి ఏపీకి 811 టీఎంసీలు పంపిణీ చేస్తూ 1976 మే 27న బచావత్ ట్రిబ్యునల్ తీర్పు ఇచ్చిందనే అంశాన్ని సుప్రీం కోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్లో కేంద్ర జల్ శక్తి శాఖ, కృష్ణాబోర్డు గుర్తుచేశాయి. ఉమ్మడి రాష్ట్రానికి చేసిన కేటాయింపుల్లో 1976కు ముందే పూర్తయిన ప్రాజెక్టులకు 749.16, ప్రతిపాదన దశలో ఉన్న జూరాలకు 17.84, శ్రీశైలం ఆవిరి నష్టాలకు 33 టీఎంసీల వాటా ఇచ్చిందని, పునరుత్పత్తి కింద 11 టీఎంసీలు కేటాయించిందని పేర్కొన్నాయి. ఆ తర్వాత ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం కేటాయించుకున్న నీటిని పరిగణనలోకి తీసుకుని.. ఆంధ్రప్రదేశ్కు 512.04 టీఎంసీలు, తెలంగాణకు 298.96 టీఎంసీలను తాత్కాలిక ప్రాతిపదికన పంపిణీ చేసుకోవడానికి అంగీకరిస్తూ 2015 జూన్ 18–19న కేంద్ర జల్ శక్తిశాఖ సమక్షంలో రెండు రాష్ట్రాలు ఒప్పందం చేసుకున్నాయనే అంశాన్ని ఎత్తిచూపాయి. ఆ తర్వాత 2016–17లోనూ అదే పద్ధతిలో నీటిని పంపిణీ చేసుకున్నాయి. ఆ తర్వాత చిన్న వనరుల విభాగం, మళ్లించిన గోదావరి జలాలను మినహాయించి.. మిగతా నీటిలో ఏపీ 66 శాతం, తెలంగాణ 33 శాతం చొప్పున పంచుకుంటున్నాయనే అంశాన్ని పేర్కొంది. రెండు రాష్ట్రాల మధ్య కృష్ణాజలాలను పంపిణీ చేయడానికి బ్రిజేష్కుమార్ ట్రిబ్యునల్ విచారణ చేస్తోందని.. ఆ ట్రిబ్యునల్ అవార్డు వస్తేనే నీటి లెక్కలు తేలతాయని అఫిడవిట్లో కేంద్ర జల్ శక్తి శాఖ, కృష్ణా బోర్డు స్పష్టం చేశాయి. అంతర్ రాష్ట్ర నదీ వివాదాల చట్టం 1956 ప్రకారం బచావత్ ట్రిబ్యునల్ అవార్డు సుప్రీంకోర్టు డిక్రీతో సమానమని.. దాన్ని పునఃసమీక్షించే అధికారం ఎవరికీ లేదని సాగునీటిరంగ నిపుణులు చెబుతున్నారు. స్పష్టం చేస్తున్నారు. బ్రిజేష్కుమార్ ట్రిబ్యునల్ మహారాష్ట్ర, కర్ణాటక, ఉమ్మడి ఏపీకి నీటిని పునఃపంపిణీ చేసే సమయంలో బచావత్ ట్రిబ్యునల్ చేసిన కేటాయింపుల జోలికి వెళ్లలేదని గుర్తుచేస్తున్నారు. -
విద్యుదుత్పత్తిని ఆపేయండి
సాక్షి, అమరావతి: శ్రీశైలం ప్రాజెక్టు ఎడమగట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తిని తక్షణమే నిలిపేయాలని తెలంగాణ జెన్కోను కృష్ణా బోర్డు ఆదేశించింది. నీటి కేటాయింపులు చేయాలని ఎలాంటి ప్రతిపాదన పంపకుండా, బోర్డు అనుమతి లేకుండా విద్యుదుత్పత్తి చేస్తూ ప్రాజెక్టు నుంచి నీటిని దిగువకు తరలిస్తుండటంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు తెలంగాణ జెన్కో సీఎండీకి కృష్ణాబోర్డు చైర్మన్ శివ్నందన్కుమార్ శుక్రవారం లేఖ రాశారు. శ్రీశైలం ప్రాజెక్టులో తెలంగాణ జెన్కో విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు నీటిని వదిలేస్తుండటం వల్ల రెండు రాష్ట్రాల ప్రయోజనాలు దెబ్బతింటున్నాయని కృష్ణా బోర్డుకు బుధవారం ఏపీ ఈఎన్సీ సి.నారాయణరెడ్డి లేఖ రాశారు. తక్షణమే విద్యుదుత్పత్తిని ఆపేసేలా తెలంగాణ జెన్కోను ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన కృష్ణాబోర్డు చైర్మన్ శివ్నందన్కుమార్ తక్షణమే విద్యుదుత్పత్తిని నిలిపేయాలని తెలంగాణ జెన్కోను ఆదేశించారు. కృష్ణాబేసిన్లో ఈ ఏడాది సగటు వర్షపాతం కంటే తక్కువగా కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేయడాన్ని ఎత్తిచూపారు. దాంతో కృష్ణానదిలో నీటిలభ్యత తగ్గుతుందని, ఆ మేరకు శ్రీశైలం ప్రాజెక్టులోను లభ్యత తగ్గుతుందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో శ్రీశైలం ప్రాజెక్టులో ఉన్న నీటిని సంరక్షించుకుని తాగు, సాగునీటి అవసరాల కోసం వాడుకోవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ఇకపై ఎడమగట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తి చేయవద్దని తెలంగాణ జెన్కోను ఆదేశించారు. కానీ.. తెలంగాణ జెన్కో కృష్ణా బోర్డు ఆదేశాల భేఖాతరు చేస్తూ శుక్రవారం సాయంత్రం 6 గంటల నుంచి ఎడమగట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ 38,140 క్యూసెక్కులను దిగువకు వదలేస్తుండటం గమనార్హం. -
శ్రీశైలంలో విద్యుదుత్పత్తి ఆపండి
సాక్షి, హైదరాబాద్: శ్రీశైలం ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రంలో తక్షణమే విద్యుదుత్పత్తి నిలుపుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కృష్ణాబోర్డు ఆదేశించింది. బోర్డు జారీ చేసే నీటి కేటాయింపుల ఉత్తర్వులను కచ్చితంగా పాటించాలని సూచించింది. ఈ మేరకు కృష్ణాబోర్డు శుక్రవారం తెలంగాణ రాష్ట్ర విద్యుదుత్పత్తి సంస్థ(జెన్కో)కు లేఖ రాసింది. నీటి అవసరాల కోసం తెలంగాణకు ఇంకా ఎలాంటి ఇండెంట్ ఇవ్వలేదని గుర్తు చేసింది. సాగర్కు నీటి విడుదల కోరుతూ ఇండెంట్ ఇస్తేనే శ్రీశైలంలో జలవిద్యుదుత్పత్తి చేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ప్రస్తుతం కృష్ణానది పరీవాహక ప్రాంతంలో తీవ్ర వర్షాభావం నెలకొని ఉన్న నేపథ్యంలో, వార్షిక సగటు వర్షపాతం కన్నా తక్కువగా వర్షాలు కురిసే అవకాశాలున్నాయని అభిప్రాయపడింది. ప్రస్తుతం జలాశయాలు పూర్తిగా నిండకపోవచ్చని, ఈ నేపథ్యంలో నీటిని సంరక్షించాల్సిన అవసరముందని చెప్పింది. కృష్ణా బోర్డుకు సంబంధం లేదు సాగర్కు నీటి విడుదల కోరుతూ ఇండెంట్ ఇస్తేనే శ్రీశైలంలో జలవిద్యుదుత్పత్తి జరపాలని కృష్ణాబోర్డు కోరడం పట్ల తెలంగాణ నీటిపారుదలశాఖ వర్గాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. సాగర్కు నీటి విడుదల కోసమే శ్రీశైలం జలాశయం నిర్మించాలని ప్రణాళిక సంఘం అనుమతిచ్చిందని, శ్రీశైలం నిండిన తర్వాతే సాగర్కు నీటిని విడుదల చేయాలని ఎక్కడా చెప్పలేదని స్పష్టం చేస్తున్నాయి. పూర్తిగా జలవిద్యుదుత్పత్తి అవసరాల కోసమే శ్రీశైలం ప్రాజెక్టు నిర్మించారని గుర్తు చేస్తున్నాయి. ఈ విషయంలో కృష్ణాబోర్డు తన పరిధిని దాటి వ్యవహరించిందని, జలవిద్యుదుత్పత్తి బోర్డు పరిధిలోకి రాదని స్పష్టం చేస్తున్నారు. ఈ మేరకు నీటిపారుదలశాఖ త్వరలో కృష్ణా బోర్డుకు లేఖ రాయనున్నట్టు తెలిసింది. జల విద్యుదుత్పత్తి కొనసాగుతుంది ప్రస్తుతం వర్షాభావం నెలకొని ఉండడంతో రాష్ట్రంలో వ్యవసాయ విద్యుత్కు డిమాండ్ భారీ పెరిగింది. విద్యుత్ డిమాండ్ గరిష్ట స్థాయికి చేరినప్పుడు లోటును పూడ్చుకోవడానికి మాత్రమే శ్రీశైలం జలాశయంలో విద్యుదుత్పత్తి చేస్తున్నామని జెన్కో ఉన్నతస్థాయి వర్గాలు పేర్కొన్నాయి. నిరంతర విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగకుండా విద్యుత్ కొరత నెలకొన్న సమయంలో జలవిద్యుత్ ఉత్పత్తిని కొనసాగిస్తామని స్పష్టం చేశాయి. -
120 టీఎంసీలు తరలించేలా ‘పాలమూరు’ పనులు!
సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కింద తాగునీటి అవసరాలకు కేవలం 7.15 టీఎంసీలు అవసరం కాగా, శ్రీశైలం జలాశయం నుంచి రోజుకు 2 టీఎంసీలు చొప్పున 60 రోజుల్లో 120 టీఎంసీల తరలింపునకు వీలుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీ ఎత్తున నిర్మాణ పనులు కొనసాగిస్తోందని కృష్ణా బోర్డు సుప్రీంకోర్టుకు నివేదించింది. శ్రీశైలం నుంచి తరలించుకోవడానికి ప్రతిపాదించిన నీటి పరిమాణంతో పోల్చితే తాగునీటి అవసరాలు చాలా స్వల్పమేనని పేర్కొంది. 7.15 టీఎంసీల తాగునీటిని తరలించుకోవాలనుకున్నా ప్రాజెక్టులో అంతర్భాగంగా నిర్మించిన అన్ని జలాశయాల్లోకి కలిపి 67.97 టీఎంసీలను ఎత్తిపోయాల్సి ఉంటుందని పేర్కొంది. వాస్తవ తాగునీటి అవసరాల కంటే తరలించే జలాలు ఎక్కువ అని తెలియజేసింది. ఈ మేరకు తనతో పాటు కేంద్ర జలశక్తి శాఖ తరఫున కృష్ణా బోర్డు తాజాగా అఫిడవిట్ దాఖలు చేసింది. 3.4 టీఎంసీలకే 65 టీఎంసీలు నింపాలి పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టులో భాగంగా మొత్తం 6 రిజర్వాయర్లను ప్రతిపాదించగా, చివరి కేపీ లక్ష్మీదేవి పల్లి రిజర్వాయర్ పనులను ఇంకా ప్రారంభించలేదు. తొలి 5 రిజర్వాయర్లలో పూర్తి నిల్వ సామర్థ్యం మేరకు మొత్తం 65.17 టీఎంసీలను నింపిన తర్వాతే, ఈ ఐదింటి కింద తాగునీటి అవసరాలకు ప్రతిపాదించిన మొత్తం 3.4 టీఎంసీలను (కేపీ లక్ష్మీదేవిపల్లి కింద తాగునీటి అవసరాలు 4.11 టీఎంసీలు) తరలించుకోవడానికి వీలు కలిగే రీతిలో ప్రాజెక్టుకు రూపకల్పన చేశారని సుప్రీంకోర్టుకు బోర్డు తెలిపింది. ఈ విషయాలను పరిగణనలోకి తీసుకుని ప్రాజెక్టు విషయంలో సరైన నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. అఫిడవిట్లోని ప్రధానాంశాలు.. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతలను రూ.55,086 కోట్లతో ప్రభుత్వం చేపట్టింది. దీని కింద అంజనగిరి (8.51 టీఎంసీలు), వీరాంజనేయ (6.55 టీఎంసీలు), వెంకటాద్రి (16.74 టీఎంసీలు), కరుమూర్తిరాయ (17.34 టీఎంసీలు), ఉద్దండాపూర్ (16.03 టీఎంసీలు), కేపీ లక్ష్మీదేవిపల్లి (2.80 టీఎంసీల) రిజర్వాయర్లను ప్రతిపాదించింది. ఈ ఎత్తిపోతల ద్వారా తరలించే 120 టీఎంసీల్లో తాగునీటికి కేటాయించింది 7.15 టీఎంసీలు. ఇప్పటికే 65.17 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో అంజనగిరి, వీరాంజనేయ, వెంకటాద్రి, కరుమూర్తిరాయ, ఉద్దండాపూర్ రిజర్వాయర్లను.. 120 టీఎంసీలు తరలించేలా ఎత్తిపోతలు, కాలువల వ్యవస్థను పూర్తి చేసింది. ఆరో రిజర్వాయర్ కేపీ లక్ష్మీదేవిపల్లి వద్ద ఇప్పటిదాకా పనులు చేపట్టలేదు. ఇప్పటిదాకా పూర్తయిన ఐదు రిజర్వాయర్ల కింద తాగునీటి అవసరాల కోసం కేటాయించింది 3.40 టీఎంసీలే. పోలవరం ద్వారా కృష్ణా డెల్టాకు మళ్లించే గోదావరి జలాలకుగానూ కృష్ణా జలాల్లో అదనంగా దక్కే 45 టీఎంసీలకు, చిన్న నీటిపారుదల విభాగంలో మిగులుగా ఉన్న 45 టీఎంసీలను జతచేసి.. 90 టీఎంసీలతో పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతలను చేపట్టామంటూ తెలంగాణ ప్రభుత్వం డీపీఆర్ను సమరి్పంచింది. కానీ ఈ ప్రాజెక్టుకు నీటి కేటాయింపులు లేవు. నీటి కేటాయింపులపై బ్రిజే‹Ùకుమార్ ట్రిబ్యునల్ విచారణ చేస్తున్న నేపథ్యంలో ప్రాజెక్టు డీపీఆర్ను మదింపు చేయలేమని గతంలోనే తిప్పి పంపాం. పనులు ఆపాలని గతంలో బోర్డు సమావేశాల సందర్భంగా తెలంగాణను కోరాం. కేసు నేపథ్యం ఇదీ...: పర్యావరణ అనుమతి తీసుకోకుండా చేపట్టిన పాలమూరు, డిండి ఎత్తిపోతల పనులను ఆపాలంటూ ఎన్జీటీ గతంలో ఆదేశించింది. అయినా ప్రభుత్వం పనులు ఆపకపోవడంతో ఎన్టీటీ రూ.920.85 కోట్ల జరిమానా విధించింది. దీనిపై రాష్ట్రం సుప్రీంను ఆశ్రయించగా ఎన్జీటీ ఉత్తర్వులపై స్టే ఇచ్చింది. అలాగే తాగునీటి కోసం 7.15 టీఎంసీలను తరలించేలా పాలమూరు ఎత్తిపోతల పనులకు 2023 ఫిబ్రవరి 17న అనుమతిస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. అదే సమయంలో ఎత్తిపోతలను తమ అనుమతి ప్రకారమే తెలంగాణ ప్రభుత్వం చేపట్టిందో లేదో చెప్పాలని కేంద్రాన్ని, కృష్ణా బోర్డును ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే కేంద్రం, బోర్డు అఫిడవిట్ దాఖలు చేశాయి. వాస్తవానికి ఈ నెల 4న కేసు విచారణ జరగాల్సి ఉండగా అక్టోబర్ 6కి వాయిదా పడింది. -
నీటి దోపిడీ కోసమే పాలమూరు–రంగారెడ్డి
సాక్షి, అమరావతి: పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనుల్లో సుప్రీం కోర్టు మధ్యంతర ఉత్తర్వుల్లో అనుమతి ఇచ్చిన దానికంటే తెలంగాణ సర్కార్ భారీ ఎత్తున పనులు చేసిందని సుప్రీం కోర్టుకు కేంద్ర జల్ శక్తి శాఖ, కృష్ణా బోర్డు నివేదించాయి. తాగునీటి అవసరాల పేరుతో భారీ ఎత్తున సాగునీటి అవసరాలకు నీటిని తరలించేలా తెలంగాణ ప్రభుత్వం పనులు పూర్తి చేసిందని స్పష్టం చేశాయి. 7.15 టీఎంసీలను తాగునీటి అవసరాలకు తరలించేలా పనులు చేపట్టడానికి అనుమతి ఇస్తే.. శ్రీశైలం రిజర్వాయర్ నుంచి రోజుకు 2 టీఎంసీల చొప్పున 60 రోజుల్లో 120 టీఎంసీలు తరలించేలా ఎత్తిపోతలు, కాలువల వ్యవస్థ, 65.17 టీఎంసీలను నిల్వ చేసేలా 5 రిజర్వాయర్లను తెలంగాణ పూర్తి చేసిందని తేల్చిచెప్పాయి. ఇప్పటివరకూ పూర్తయిన పనులను పరిశీలిస్తే.. తెలంగాణ సర్కార్ భారీ ఎత్తున కృష్ణా జలాలను తరలించేలా చేపట్టిందని పేర్కొన్నాయి. ఆ ఎత్తిపోతలకు నీటి కేటాయింపులు లేని నేపథ్యంలో దాని డీపీఆర్ను మదింపు చేయలేమని తెలంగాణ సర్కార్కు తేల్చిచెప్పామని గుర్తు చేశాయి. ఈ మేరకు సుప్రీం కోర్టులో ఈ నెల 2న కేంద్ర జల్ శక్తి శాఖ, కృష్ణా బోర్డు సంయుక్తంగా అఫిడవిట్ దాఖలు చేశాయి. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతలపై ఈ నెల 4న జరగాల్సిన విచారణను సుప్రీం కోర్టు అక్టోబర్కు వాయిదా వేసింది. అఫిడవిట్లో ఏం చెప్పాయంటే.. కేంద్ర జల్ శక్తి శాఖ, కృష్ణా బోర్డు సుప్రీం కోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో పేర్కొన్న వివరాల ప్రకారం.. శ్రీశైలం జలాశయం నుంచి రోజుకు రెండు టీఎంసీల చొప్పున 60 రోజుల్లో 120 టీఎంసీలు తరలించేలా పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతలను రూ.55,086.57 కోట్లతో తెలంగాణ సర్కార్ చేపట్టింది. ఇందులో నీటిపారుదల వ్యయం రూ.50,508.88 కోట్లు, తాగునీటి విభాగం వ్యయం రూ.4,577.69 కోట్లు. ఈ ఎత్తిపోతల కింద అంజనగిరి (8.51 టీఎంసీలు), వీరాంజనేయ (6.55 టీఎంసీలు), వెంకటాద్రి (16.74 టీఎంసీలు), కరుమూర్తిరాయ (17.34 టీఎంసీలు), ఉద్దండాపూర్ (16.03 టీఎంసీలు), కేపీ లక్ష్మిదేవిపల్లి (2.80 టీఎంసీల) రిజర్వాయర్లను చేపట్టింది. మహబూబ్నగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో 10 లక్షల ఎకరాలకు సాగునీరు.. ఆ జిల్లాల్లో తాగు, పారిశ్రామిక అవసరాలు తీర్చాలన్నది ఈ ప్రాజెక్ట్ లక్ష్యం. ఈ ఎత్తిపోతల కింద తరలించే 120 టీఎంసీల్లో తాగునీటి అవసరాల కోసం కేటాయించింది 7.15 టీఎంసీలు. ఇప్పటికే 65.17 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో అంజనగిరి, వీరాంజనేయ, వెంకటాద్రి, కరుమూర్తిరాయ, ఉద్దండాపూర్ రిజర్వాయర్లను.. 120 టీఎంసీలు తరలించేలా ఎత్తిపోతలు, కాలువల వ్యవస్థను పూర్తి చేసింది. ఆరో రిజర్వాయర్ కేపీ లక్ష్మిదేవిపల్లి వద్ద ఇప్పటిదాకా చేపట్టలేదు. పూర్తయిన 5 రిజర్వాయర్ల కింద తాగునీటి అవసరాల కోసం కేటాయించింది 3.40 టీఎంసీలే. కృష్ణా డెల్టాకు మళ్లించే గోదావరి జలాలకుగానూ కృష్ణా జలాల్లో అదనంగా దక్కే 45 టీఎంసీలకు, చిన్న నీటిపారుదల విభాగంలో మిగులుగా ఉన్న 45 టీఎంసీలను జతచేసి.. 90 టీఎంసీలతో పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతలను చేపట్టామని తెలంగాణ సర్కార్ డీపీఆర్ను సమర్పించింది. కానీ.. ఈ ప్రాజెక్టుకు బచావత్ ట్రిబ్యునల్ నీటి కేటాయింపులు చేయలేదు. నీటి కేటాయింపులపై బ్రిజేష్కుమార్ ట్రిబ్యునల్ విచారణ చేస్తున్న నేపథ్యంలో ఆ ప్రాజెక్టు డీపీఆర్ను మదింపు చేయలేమని తెలంగాణ సర్కార్కు వెనక్కి పంపాం. నేపథ్యం ఇదీ.. చంద్రమౌళీశ్వరరెడ్డి అనే రైతు దాఖలు చేసిన పిటిషన్ను విచారించిన జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) పర్యావరణ అనుమతి తీసుకోకుండా చేపట్టిన పాలమూరు–రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాల పనులను నిలిపేయాలని 2021 అక్టోబర్ 29న ఆదేశాలు జారీ చేసింది. ఆ ఆదేశాలను ఉల్లంఘించి యథేచ్ఛగా పనులు కొనసాగించిన తెలంగాణ సర్కార్పై 2022 డిసెంబర్ 22న ఆగ్రహం వ్యక్తం చేసిన ఎన్జీటీ.. ఆ రెండు ఎత్తిపోతల పథకాల వ్యయంపై 1.50 శాతం చొప్పున రూ.620.85 కోట్లను తెలంగాణ సర్కార్కు జరిమానా విధించింది. తెలంగాణ ఉద్దేశపుర్వకంగా చట్టాలను ఉల్లంఘిస్తున్నందున రూ.300 కోట్లు జరిమానా చెల్లించాలని ఆదేశించింది. మొత్తం రూ.920.85 కోట్లు మూడు నెలల్లోగా కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) వద్ద డిపాజిట్ చేయాలని నిర్దేశించింది. దీనిపై తెలంగాణ సర్కార్ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఎన్జీటీ ఉత్తర్వుల అమలును నిలుపుదల చేస్తూ.. తాగునీటి అవసరాల కోసం 7.15 టీఎంసీలు తరలించేలా పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పనులకు అనుమతిస్తూ 2023 ఫిబ్రవరి 17న సుప్రీం కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. -
ఈసారైనా కొలిక్కివచ్చేనా!?
సాక్షి, అమరావతి: కృష్ణాజలాల వినియోగంలో రెండు రాష్ట్రాల మధ్య తరచు విభేదాలు తలెత్తడానికి దారితీస్తున్న మూడు అంశాలను ఈసారైనా రిజర్వాయర్స్ మేనేజ్మెంట్ కమిటీ (ఆర్ఎంసీ) కొలిక్కి తెస్తుందా? లేదా? అన్నది చర్చనీయాంశంగా మారింది. కృష్ణాబోర్డు 16వ సర్వసభ్య సమావేశంలో తీర్మానించిన మేరకు మూడు అంశాలపై ఆర్ఎంసీ చర్చించి, పరిష్కారానికి రూపొందించిన నివేదికపై సంతకాలు చేయడానికి తొలుత అంగీకరించిన తెలంగాణ అధికారులు తర్వాత అడ్డంతిరిగారు. దీంతో కృష్ణాబోర్డు సభ్యులు, ఏపీ అధికారులు సంతకాలు చేసిన నివేదికనే బోర్డుకు ఆర్ఎంసీ అందజేసింది. ఆ తర్వాత కృష్ణాబోర్డు ఆర్ఎంసీని రద్దుచేసింది. గత నెల 10న నిర్వహించిన 17వ సర్వసభ్య సమావేశంలో ఇదే అంశంపై చర్చించిన కృష్ణాబోర్డు.. రెండు రాష్ట్రాల అధికారుల సమ్మతి మేరకు ఆర్ఎంసీని పునర్ధురించింది. ఆ మూడు అంశాలపై నెల రోజుల్లోగా మళ్లీ అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని ఆర్ఎంసీని కృష్ణాబోర్డు చైర్మన్ శివ్నందన్కుమార్ ఆదేశించారు. దిగువ కృష్ణా బేసిన్లో శ్రీశైలం, నాగార్జునసాగర్ ఉమ్మడి ప్రాజెక్టులు. ఇందులో శ్రీశైలం ప్రాజెక్టు ఏపీ ప్రభుత్వం ఆధీనంలోను, నాగార్జునసాగర్ తెలంగాణ సర్కార్ ఆధీనంలోను ఉన్నాయి. ఈ రెండు ప్రాజెక్టుల నిర్వహణలో.. అంటే వాటి ద్వారా ఆయకట్టుకు నీటిని విడుదల చేయడంలో రెండు రాష్ట్రాల మధ్య తరచు వివాదాలు తలెత్తుతున్నాయి. ప్రధానంగా శ్రీశైలం ప్రాజెక్టులో తెలంగాణ సర్కార్ యథేచ్ఛగా విద్యుదుత్పత్తి చేస్తుండటం కూడా వివాదాలకు కారణమవుతోంది. కృష్ణాకు వరద వచ్చే రోజుల్లో.. జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల, ప్రకాశం బ్యారేజ్ నిండి.. జలాలు కడలిలో కలుస్తున్న సమయంలో రెండు రాష్ట్రాలు మళ్లించిన జలాలను కోటాలో కలపకూడదని ఏపీ సర్కార్ ప్రతిపాదిస్తుండగా.. తెలంగాణ సర్కార్ వ్యతిరేకిస్తోంది. ఈ మూడు అంశాలపై అధ్యయనం చేయడానికి బోర్డు సభ్యుడు అనిల్కుమార్ గుప్తా అధ్యక్షతన బోర్డు సభ్యుడు ఎల్.బి.ముయన్తంగ్, రెండు రాష్ట్రాల ఈఎన్సీలు, జెన్కో డైరెక్టర్లు సభ్యులుగా ఆర్ఎంసీని కృష్ణాబోర్డు పునరుద్ధరించింది. ఏకాభిప్రాయం సాధ్యమేనా? బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపుల ఆధారంగా శ్రీశైలం, నాగార్జునసాగర్ రూల్ కర్వ్స్పై కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) రూపొందించిన ముసాయిదాపై చర్చించి, రెండు రాష్ట్రాల అభిప్రాయాల మేరకు వాటిలో మార్పులు చేయాలని ఆర్ఎంసీకి బోర్డు నిర్దేశించింది. కృష్ణాబోర్డు అనుమతి లేకుండానే.. దిగువన నీటి అవసరాలు లేకున్నా శ్రీశైలం ప్రాజెక్టులో తెలంగాణ సర్కార్ యథేచ్ఛగా విద్యుదుత్పత్తి చేస్తుండటం వల్ల జలాలు వృథా అవుతున్న నేపథ్యంలో.. దానిపై చర్చించి విద్యుదుత్పత్తికి నియమావళిని రూపొందించాలి. వరద రోజుల్లో మళ్లించిన జలాలను కోటాలో కలపాలా? వద్దా? అనే అంశంపైన కూడా చర్చించాలి. ఈ అంశాలపై ఆర్ఎంసీలో సభ్యులైన కృష్ణాబోర్డు సభ్యులిద్దరు, ఏపీ అధికారులు ఏకాభిప్రాయం వ్యక్తం చేస్తుండగా.. తెలంగాణ అధికారులు విభేదిస్తున్నారు. -
ఎప్పటి నీటి లెక్కలు అప్పటికే..
సాక్షి, అమరావతి: ఒక నీటి సంవత్సరం (జూన్ 1 నుంచి మే 31 వరకు)లో ఒక రాష్ట్రం వాడుకోని కోటా జలాలను మరుసటి నీటి సంవత్సరంలో వాడుకోవడానికి ఆ రాష్ట్రానికే అనుమతిస్తే.. మరో రాష్ట్రం హక్కులను దెబ్బతీసినట్లవుతుందని తెలంగాణ సర్కార్కు కృష్ణాబోర్డు తేల్చిచెప్పింది. కోటాలో వాడుకోకుండా మిగిలిన నీళ్లు క్యారీ ఓవర్ జలాలే అవుతాయని స్పష్టం చేసింది. బచావత్ ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం క్యారీ ఓవర్ జలాలపై రెండు రాష్ట్రాలకు హక్కు ఉంటుందని తెగేసి చెప్పింది. రెండు రాష్ట్రాలు సంప్రదింపులు జరుపుకొని.. ఏకాభిప్రాయం ద్వారా వాటిని వాడుకోవడానికి అవకాశం ఉంటుందని సూచించింది. గతేడాది జూన్ 6న ఇదే అంశాన్ని అటు తెలంగాణ సర్కార్కు.. ఇటు కృష్ణాబోర్డుకు సీడబ్ల్యూసీ తేల్చిచెప్పింది. అయినా సరే.. తెలంగాణ సర్కార్ కోటాలో మిగిలిన నీటిని వచ్చే ఏడాది వాడుకుంటామంటూ వితండవాదన మళ్లీ తెరపైకి తెస్తూ వివాదం రాజేస్తుండటం గమనార్హం. నీటి నిల్వపై నేరుగా ప్రభావం నాగార్జునసాగర్లో కోటాలో వాడుకోని జలాలను మరుసటి సంవత్సరం వాడుకుంటామని తెలంగాణ సర్కార్ ఇటీవల కృష్ణాబోర్డును కోరింది. తెలంగాణ సర్కార్ ప్రతిపాదనకు కృష్ణాబోర్డు అంగీకరిస్తే.. సాగర్లో నీటినిల్వపై నేరుగా ప్రభావం చూపుతుంది. కొత్త నీటి సంవత్సరంలో వచ్చే వరద జలాలతో నిండాక.. మిగులు జలాలను దిగువకు వదిలేయాల్సి ఉంటుంది. అంటే తెలంగాణ సర్కార్ కోటాలో వాడుకోని నీటిని మరుసటి సంవత్సరం వాడుకోవడానికి అనుమతిస్తే ఏపీ హక్కులను దెబ్బతీసినట్లవుతుందన్నది స్పష్టమవుతోంది. కేంద్ర జలసంఘం తెగేసిచెప్పినా సరే.. కృష్ణాజలాల్లో 2021–22లో కోటాలో వాడుకోకుండా మిగిలిన 47.79 టీఎంసీలను 2022–23లో నాగార్జునసాగర్ కింద వినియోగించుకుంటామని గతేడాది తెలంగాణ సర్కార్ కృష్ణాబోర్డును కోరింది. దీనిపై కృష్ణాబోర్డు సీడబ్ల్యూసీని సంప్రదించింది. కోటాలో వాడుకోని నీళ్లన్నీ క్యారీ ఓవర్ జలాలే అవుతాయని సీడబ్ల్యూసీ స్పష్టం చేసింది. బచావత్ ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం వాటిపై రెండు రాష్ట్రాలకు హక్కు ఉంటుందని తేల్చిచెప్పింది. అయినా తెలంగాణ సర్కార్ అదే ప్రతిపాదనను తెరపైకి తేవడంపై కృష్ణాబోర్డు అసహనం వ్యక్తం చేస్తోంది. (చదవండి: ‘అమరావతి’ పట్టాల పంపిణీని హర్షిస్తూ భారీ ర్యాలీ) -
తాగు, సాగు నీటికే తొలి ప్రాధాన్యం
సాక్షి, అమరావతి: శ్రీశైలం జలాశయంలోని నీటి వినియోగంలో సాగు, తాగు అవసరాలకే తొలి ప్రాధాన్యం ఇవ్వాలని కృష్ణా బోర్డుకు కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) తేల్చి చెప్పింది. ప్రాజెక్టు కనీస నీటి మట్టాన్ని 854 అడుగులుగా ఖరారు చేసింది. నీటి సంవత్సరం ప్రారంభమయ్యే జూన్ 1 నుంచి అక్టోబర్ 31 వరకు జలాశయంలో కనీస నీటి మట్టానికి ఎగువన నీటి నిల్వ ఉండేలా చూడాలని నిర్దేశించింది. శ్రీశైలంలో విద్యుదుత్పత్తికంటే 75 శాతం లభ్యత ఆధారంగా రెండు రాష్ట్రాలకు బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన నికర జలాలను వాడుకోవడానికే అధిక ప్రాధాన్యం ఇవ్వాలని సూచించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ సాగు, తాగు నీటి అవసరాలను దెబ్బతీసేలా ఇతర అవసరాలకు అంటే విద్యుదుత్పత్తికి నీటిని వాడుకోకూడదని స్పష్టం చేసింది. ఈ మేరకు శ్రీశైలం ప్రాజెక్టు రూల్ కర్వ్స్ (నిర్వహణ నియమావళి)లో ఈ విషయాలను స్పష్టంగా చెబుతూ కృష్ణా బోర్డుకు సీడబ్ల్యూసీ నివేదిక ఇచ్చింది. నాగార్జునసాగర్ రూల్ కర్వ్స్పైనా సీడబ్ల్యూసీ ముసాయిదా నివేదిక ఇచ్చింది. వీటిపై రిజర్వాయర్ల మేనేజ్మెంట్ కమిటీ (ఆర్ఎంసీ)లో చర్చించినా ఏకాభిప్రాయం కుదరలేదు. మరోసారి ఆర్ఎంసీలో చర్చ ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్లలో విద్యుదుత్పత్తికి నియమావళి, రెండు ప్రాజెక్టుల రూల్ కరవ్స్, మళ్లించిన వరద జలాలను కోటాలో కలపాలా వద్దా అనే అంశాలపై అధ్యయనం చేసి, నివేదిక ఇచ్చేందుకు గతేడాది మే 10న కృష్ణా బోర్డు ఆర్ఎంసీని ఏర్పాటు చేసింది. కృష్ణా బోర్డు అప్పటి సభ్యులు ఆర్కే పిళ్లై అధ్యక్షతన రెండు రాష్ట్రాల ఈఎన్సీలు, జెన్కో డైరెక్టర్లు ఇందులో సభ్యులు. ఆర్ఎంసీ ఆరు సార్లు సమావేశమై.. గతేడాది డిసెంబర్ 8న కృష్ణా బోర్డుకు నివేదిక ఇచ్చింది. సమావేశాల్లో అన్ని అంశాలపై చర్చించి, అంగీకారం తెలిపిన తెలంగాణ అధికారులు.. నివేదికపై సంతకం చేసేందుకు మాత్రం నిరాకరించారు. ఈ అంశంపై ఈనెల 10న జరిగిన కృష్ణా బోర్డు సమావేశంలో చర్చించి, ఆర్ఎంసీని పునరుద్ధరించారు. రూల్ కరŠవ్స్, విద్యుదుత్పత్తికి నియమావళి, వరద జలాల మళ్లింపుపై మరోసారి చర్చించి నెలలోగా నివేదిక ఇవ్వాలని బోర్డు చైర్మన్ శివ్నందన్కుమార్ ఆర్ఎంసీని ఆదేశించారు. వివాదాలకు చరమగీతం పాడటానికే కృష్ణా జలాల వినియోగంలో రెండు రాష్ట్రాల మధ్య తరచుగా విభేదాలు తలెత్తడానికి ప్రధాన కారణం ఉమ్మడి ప్రాజెక్టుల నిర్వహణ, విద్యుదుత్పత్తి, వరద జలాల మళ్లింపే. ఆర్ఎంసీ నివేదికను బోర్డు సమావేశంలో మరో మారు చర్చించి 2023–24లో అమలు చేయడం ద్వారా వివాదాలకు చెక్ పెట్టాలని చైర్మన్ శివ్నందన్కుమార్ నిర్ణయించారు. గతంలో తరహాలోనే ఆర్ఎంసీ నివేదికపై ఈసారీ తెలంగాణ అధికారులు సంతకాలు చేయడానికి నిరాకరిస్తే.. కేంద్ర జల్ శక్తి శాఖ దృష్టికి తీసుకెళ్లి తదుపరి చర్యలు చేపట్టాలని భావిస్తున్నారు. -
వివాదాల ముగింపునకు సిద్ధం.. నేడు కృష్ణాబోర్డు సర్వసభ్య సమావేశం
సాక్షి, అమరావతి: కృష్ణా జలాలపై రెండు రాష్ట్రాల మధ్య వివాదాలకు ముగింపు పలికేందుకు కృష్ణా బోర్డు సిద్ధమైంది. అనుమతి లేని ప్రాజెక్టులే ప్రధాన అజెండాగా బోర్డు చైర్మన్ శివ్నందన్కుమార్ అధ్యక్షతన 17వ సర్వ సభ్య సమావేశాన్ని బుధవారం హైదరాబాద్లో నిర్వహిస్తోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు ప్రతిపాదించిన అంశాలతోపాటు బోర్డు పరిధిని నిర్దేశిస్తూ కేంద్రం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ అమలు, బడ్జెట్, 2023–24 నీటి సంవత్సరంలో జలాల పంపిణీతో సహా 21 అంశాలతో అజెండాను ఖరారు చేసింది. కృష్ణా తాగు నీటి సరఫరా పథకం ఒకటి, రెండు, మూడు దశల ద్వారా ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు కాలువ కింద ప్రస్తుతం తెలంగాణ సర్కారు ఆయకట్టుకు నీటిని అందిస్తోంది. ఇందుకోసం నాగార్జున సాగర్ జల విస్తరణ ప్రాంతంలో రూ.1,450 కోట్లతో సుంకిశాల ఇన్టేక్ వెల్ ప్రాజెక్టును తెలంగాణ చేపట్టింది. దీనిపై ఏపీ ప్రభుత్వం గతేడాది నవంబర్లో అభ్యంతరం తెలిపింది. సుంకిశాల ఇన్టేక్ వెల్, పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతలను నిలిపివేయాలని బోర్డును కోరింది. నీటి కేటాయింపులు లేనందున పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతలకు అనుమతిని కూడా సీడబ్ల్యూసీ తిరస్కరించింది. కృష్ణా ట్రిబ్యునల్–2 కేటాయించిన 4 టీఎంసీలను వాడుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆర్డీఎస్ (రాజోలిబండ డైవర్షన్ స్కీం) కుడి కాలువను చేపట్టడంపై తెలంగాణ కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేసింది. ట్రిబ్యునల్ తీర్పు నోటిఫై అయ్యాకే పనులు చేపడతామని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. ఆర్డీఎస్ను మరోసారి ప్రస్తావించేందకు తెలంగాణ సిద్ధమైంది. గెజిట్ నోటిఫికేషన్ అమలయ్యేనా? బోర్డు పరిధిని నిర్దేశిస్తూ 2021 జూలై 15న కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆర్నెళ్లలోగా దాన్ని అమలు చేయాలని పేర్కొంది. మరో ఆర్నెల్లు పొడిగించినా నోటిఫికేషన్ అమలుపై రెండు రాష్ట్రాలు ఏకాభిప్రాయానికి రాలేదు. దీనిపై రెండు రాష్ట్రాలను ఒప్పించేందుకు బోర్డు సిద్ధమైంది. ఉమ్మడి రాష్ట్రానికి ట్రిబ్యునల్ కేటాయించిన 811 టీఎంసీల జలాల్లో 66 శాతం (512 టీఎంసీలు) ఏపీ, 34 శాతం (299 టీఎంసీలు) తెలంగాణ వాడుకునేలా 2015 జూన్ 19న తాత్కాలిక ఒప్పందం కుదిరింది. కానీ.. సగ భాగం వాటా కావాలని తెలంగాణ డిమాండ్ చేయడంతో నీటి పంపిణీపై కూడా బోర్డు చర్చించనుంది. హిందీలో కార్యకలాపాలా? కేంద్రంతో బోర్డు ఉత్తర ప్రత్యుత్తరాలు, కార్యకలాపాలు హిందీ భాషలోనే జరగాలని కేంద్ర జల్ శక్తి శాఖ కోరుతోంది. కానీ.. రెండు రాష్ట్రాల అధికారులకు హిందీ భాషలో ప్రావీణ్యం లేదు. దీనిపై బోర్డు సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నారు. కేంద్ర జల్ శక్తిశాఖ అనుమతి లేకుండా బోర్డులో పనిచేస్తున్న సిబ్బందికి మూలవేతనంలో 25శాతం ప్రోత్సాహకంగా ఇచ్చిన నిధులు రికవరీ చేయాలన్న కేంద్రం ఆదేశాలపైనా చర్చించనున్నారు. -
అనుమతుల్లేని ప్రాజెక్టులే ఎజెండా
సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదిపై రెండు రాష్ట్రాలు అనుమతి లేకుండా చేపట్టిన ప్రాజెక్టులపై చర్చించి.. జల వివాదాలకు ముగింపు పలికేందుకు కృష్ణా బోర్డు సిద్ధమైంది. అనుమతి లేని ప్రాజెక్టులే ప్రధాన అజెండాగా హైదరాబాద్లోని బోర్డు కార్యాలయంలో చైర్మన్ శివ్నందన్కుమార్ అధ్యక్షతన 17వ సర్వసభ్య సమావేశాన్ని బుధవారం నిర్వహిస్తోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు ప్రతిపాదించిన అంశాలతోపాటు పరిధిని నిర్దేశిస్తూ కేంద్రం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ అమలు, బడ్జెట్, 2023–24 నీటి సంవత్సరంలో నీటి పంపిణీతో సహా 21 అంశాలతో ఎజెండాను ఖరారు చేసింది. కృష్ణా తాగునీటి సరఫరా పథకం ఒకటి, రెండో, మూడో దశల ద్వారా ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు కాలువ కింద ప్రస్తుతం తెలంగాణ సర్కారు ఆయకట్టుకు నీటిని అందిస్తోంది. తాగునీటి పథకం ద్వారా కాకుండా ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు కాలువ కింద ఆయకట్టుకు నీటిని అందించడానికి నాగార్జునసాగర్ జలవిస్తరణ ప్రాంతంలో రూ.1,450 కోట్లతో సుంకిశాల ఇన్టేక్ వెల్ ప్రాజెక్టును తెలంగాణ చేపట్టడంపై గతేడాది నవంబర్ 3న కృష్ణా బోర్డు దృష్టికి ఏపీ ప్రభుత్వం తీసుకెళ్లింది. పాలమూరు–రంగారెడ్డి, సుంకిశాల ఇన్టేక్ వెల్పై... సుంకిశాల ఇన్టేక్ వెల్తోపాటు పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతలను నిలుపుదల చేయాలని కృష్ణా బోర్డును కోరింది. నీటి కేటాయింపులు లేని నేపథ్యంలో పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి అనుమతి ఇవ్వలేమని డీపీఆర్ను ఇటీవల తెలంగాణ సర్కార్కు సీడబ్ల్యూసీ తిప్పిపంపింది. ఈ నేపథ్యంలో పాలమూరు–రంగారెడ్డితోపాటు సుంకిశాల ఇన్టేక్ వెల్ ప్రాజెక్టు పనులను నిలిపేసేలా తెలంగాణను ఆదేశించాలని బోర్డు సమావేశంలో ఏపీ ప్రభుత్వం డిమాండ్ చేయనుంది. కృష్ణా ట్రిబ్యునల్–2 కేటాయించిన 4 టీఎంసీలను వాడుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆర్డీఎస్(రాజోలిబండ డైవర్షన్ స్కీం) కుడి కాలువను చేపట్టడంపై తెలంగాణ సర్కారు కృష్ణా బోర్డుకు ఫిర్యాదు చేసింది. ట్రిబ్యునల్ తీర్పు నోటిఫై అయ్యాకే పనులు చేపడతామని ఏపీ ప్రభుత్వం కృష్ణా బోర్డుకు ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఆర్డీఎస్ ఆధునీకరణ కోసం మరోసారి కోరేందుకు తెలంగాణ సర్కారు సిద్ధమైంది. గెజిట్ నోటిఫికేషన్ అమలయ్యేనా?: బోర్డును పరిధిని నిర్దేశిస్తూ 2021, జూలై 15న కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆర్నెల్లలోగా దాన్ని అమలు చేయాలని పేర్కొంది. మరో ఆర్నెల్లు గడువు పొడిగించినా నోటిఫికేషన్ అమలుపై రెండు రాష్ట్రాలు ఏకాభిప్రాయానికి రాలేదు. ఈ నేపథ్యంలో గెజిట్ నోటిఫికేషన్ అమలుపై రెండు రాష్ట్రాలను ఒప్పించేందుకు బోర్డు సిద్ధమైంది. ఉమ్మడి రాష్ట్రానికి ట్రిబ్యునల్ కేటాయించిన 811 టీఎంసీల కృష్ణా జలాల్లో 66 శాతం(512 టీఎంసీలు) ఏపీ, 34 శాతం(299 టీఎంసీలు) తెలంగాణ వాడుకునేలా 2015, జూన్ 19న తాత్కాలిక ఒప్పందం కుదిరింది. 2022–23 వరకూ అదే విధానం ప్రకారం బోర్డు నీటిని పంపిణీ చేస్తోంది. కానీ.. సగ భాగం వాటా కావాలని తెలంగాణ సర్కారు మరోసారి డిమాండ్ చేసిన నేపథ్యంలో నీటి పంపిణీపై కూడా సమావేశంలో బోర్డు చర్చించనుంది.2023–24 నీటి సంవత్సరంలో నీటి కేటాయింపులు, విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడంపై త్రిసభ్య కమిటీ క్రమం తప్పకుండా సమావేశమవడంపైనా చర్చించనున్నారు. హిందీలో కార్యకలాపాలా..? కేంద్రంతో బోర్డు ఉత్తర ప్రత్యుత్తరాలు, కార్యకలాపాలు హిందీ భాషలోనే జరగాలని కేంద్ర జల్ శక్తి శాఖ క్రమం తప్పకుండా కోరుతూ వస్తోంది. కానీ.. రెండు రాష్ట్రాల అధికారులకూ హిందీ భాషలో ప్రావీణ్యం లేని నేపథ్యంలో, కేంద్ర జల్ శక్తి శాఖ ఉత్తర్వుల అమలుపై బోర్డు సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నారు. కేంద్ర జల్ శక్తి శాఖ అనుమతి లేకుండా బోర్డులో పనిచేస్తున్న సిబ్బందికి మూలవేతనంలో 25 శాతం ప్రోత్సాహకంగా ఇచ్చిన నిధులను రికవరీ చేయాలని కేంద్రం ఆదేశించడంపై కూడా చర్చించి, చర్యలు చేపట్టనున్నారు. -
నీటి లెక్కలు తేల్చకుండా వాడుకోవద్దని ఎలా అంటారు?
సాక్షి, అమరావతి: నాగార్జున సాగర్ ఎడమ కాలువ కింద ఆయకట్టుకు నీళ్లందించడానికి సాగర్ కుడి కాలువ ద్వారా నీటిని వాడుకోవద్దంటూ కృష్ణా బోర్డు ఆదేశించడంపై రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కోటా నీటిని తాగు నీటి అవసరాల కోసం వాడుకుంటున్నామని, దాన్ని ఆపేయాలని ఆదేశించడమేమిటని మండిపడుతున్నారు. సాగర్ ఎడమ కాలువలో రాష్ట్ర కోటా కింద మిగిలిన 13 టీఎంసీలను విడుదల చేసేలా తెలంగాణ అధికారులను ఎందుకు ఆదేశించలేదని బోర్డును నిలదీస్తున్నారు. ప్రస్తుత నీటి సంవత్సరంలో రెండు రాష్ట్రాలు వాడుకున్న నీటి లెక్కలు తేల్చాకే ఇతర అంశాలపై చర్చిద్దామని స్పష్టం చేస్తున్నారు. లెక్కలు తేల్చకుండా నీటిని వాడుకోవద్దని ఎలా అంటారని ప్రశ్నిస్తున్నారు. ఇదే అంశంపై సోమవారం కృష్ణా బోర్డుకు లేఖ రాస్తామని ఈఎన్సీ సి.నారాయణరెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. సాగర్ కుడి కాలువ ద్వారా రోజూ 9 వేల క్యూసెక్కులను ఏపీ వాడుకుంటోందంటూ తెలంగాణ ఈఎన్సీ రాసిన లేఖకు స్పందించిన కృష్ణా బోర్డు.. ఆ నీటి వాడుకాన్ని ఆపేయాలని శుక్రవారం ఏపీ ఈఎన్సీకి లేఖ రాసింది. బోర్డు ఆదేశాలపై రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు మండిపడుతున్నారు. ప్రస్తుత నీటి సంవత్సరంలో వరద రోజుల్లో వాడుకున్నదిపోనూ మిగతా రోజుల్లో తెలంగాణ ప్రభుత్వం కోటా కంటే 73.56 టీఎంసీలు ఎక్కువ వినియోగించుకుందని, ఏపీ కోటాలో ఇంకా 199.31 టీఎంసీలు మిగిలే ఉన్నాయని అధికారులు తెలిపారు. నీటి లెక్కలు తేల్చి.. మా కోటా నీటిని రబీలో సాగు, వేసవిలో తాగు నీటి అవసరాలకు విడుదల చేయాలని మార్చి 13న కృష్ణా బోర్డుకు లేఖ రాశామని ఏపీ ఈఎన్సీ గుర్తు చేస్తున్నారు. కోటా కంటే అధికంగా వాడుకున్న తెలంగాణను కట్టడి చేసి, సాగర్ ఎడమ కాలువ కోటా కింద ఏపీకి ఇంకా రావాల్సిన 13 టీఎంసీలను విడుదల చేసేలా ఆ రాష్ట్ర అధికారులను ఆదేశించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశంపై సోమవారం లేఖ రాస్తామని అధికారులు చెప్పారు. నీటి లెక్కలు తేల్చేందుకు తక్షణమే సర్వ సభ్య సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కోరతామన్నారు. కోటా మేరకే తాగు అవసరాలకు సాగర్ కుడి కాలువ నుంచి నీటిని వాడుకుంటున్నామని, ఆపే ప్రశ్నే లేదని స్పష్టం చేస్తున్నారు. -
నీటిలెక్కలు తేల్చడానికి రెడీ
సాక్షి, అమరావతి: కృష్ణా జలాలను కోటా కంటే అధికంగా వాడుకున్నారంటూ రెండు రాష్ట్రాలు పరస్పరం ఫిర్యాదులు చేసుకున్న నేపథ్యంలో.. నీటిలెక్కలు తేల్చేందుకు కృష్ణాబోర్డు సిద్ధమైంది. ప్రస్తుత నీటి సంవత్సరంలో కృష్ణా బేసిన్లో రెండు రాష్ట్రాలు వినియోగించుకున్న నీటిలెక్కలు తేల్చి.. కోటాలో మిగిలిన నీటిని లభ్యత ఆధారంగా కేటాయించేందుకు బోర్డు చైర్మన్ శివ్నంద్కుమార్ సిద్ధమయ్యారు. ఏప్రిల్ మొదటి వారంలో సర్వసభ్య సమావేశం నిర్వహించడానికి అనువైన రోజును ఎంపిక చేయాలని రెండు రాష్ట్రాల జలవనరులశాఖ ఉన్నతాధికారులను కృష్ణాబోర్డు కోరింది. 2022–23 నీటి సంవత్సరంలో ఫిబ్రవరి 28 వరకు దిగువ కృష్ణా బేసిన్లో 972.46 టీఎంసీల లభ్యత ఉందని.. ఇందులో ఏపీ వాటా 641.82 (66 శాతం) టీఎంసీలు, తెలంగాణ వాటా 330.64 (34 శాతం) టీఎంసీలని ఏపీ ఈఎన్సీ నారాయణరెడ్డి కృష్ణాబోర్డుకు లేఖ రాశారు. ఫిబ్రవరి వరకు రెండు రాష్ట్రాలు 846.72 టీఎంసీలను వాడుకున్నాయని తెలిపారు. అందులో ఏపీ 442.52 (52.2 శాతం) టీఎంసీలు, తెలంగాణ 404.20 (47.8 శాతం) టీఎంసీలు వాడుకున్నాయని వివరించారు. వీటిని పరిగణనలోకి తీసుకుంటే ఏపీ కోటాలో ఇంకా 199.31 టీఎంసీలు మిగిలే ఉన్నాయని, తెలంగాణ ఆ రాష్ట్ర కోటా కంటే అధికంగా 73.56 టీఎంసీలు అదనంగా వాడుకుందని కృష్ణాబోర్డుకు ఫిర్యాదు చేశారు. ఇదిలాఉంటే.. ఉమ్మడి ప్రాజెక్టుల్లో కోటా కంటే ఏపీ ప్రభుత్వం అదనంగా 38.72 టీఎంసీలు వాడుకుందని, ఇకపై నీటిని వాడుకోకుండా కట్టడిచేయాలని తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ కృష్ణాబోర్డుకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే నీటిలెక్కలు తేల్చి వివాదానికి తెరదించడానికి కృష్ణాబోర్డు సిద్ధమైంది. -
శ్రీశైలం, సాగర్లో ఉన్న నీళ్లన్నీ మావే
సాక్షి, అమరావతి: ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జున సాగర్లో లభ్యతగా ఉన్న నీళ్లన్నీ తమవేనని కృష్ణా బోర్డుకు ఏపీ ప్రభుత్వం తేల్చి చెప్పింది. రబీలో సాగు చేసిన పంటలను రక్షించుకోవడం, వేసవిలో తాగు నీటి కోసం ఆ నీటిని విడుదల చేయాలని కోరింది. ఉమ్మడి ప్రాజెక్టుల్లో కోటాకంటే 38.72 టీఎంసీలను అధికంగా ఏపీ వాడుకుందని తెలంగాణ చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించింది. తెలంగాణ ప్రభుత్వమే కోటాకంటే అదనంగా 82.08 టీఎంసీలను వాడుకుందని తెలిపింది. మొత్తం కృష్ణా జలాల్లో ఏపీ కోటాలు ఇంకా 199.31 టీఎంసీలు మిగులు ఉందని తేల్చిచెప్పింది. ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జున సాగర్లలో ఏపీ కోటాలో ఇంకా 148.06 టీఎంసీలు మిగులు ఉన్నాయని స్పష్టంచేసింది. ఈ నీటిని మొత్తాన్ని ఏపీకి విడుదల చేయాలని కోరింది. ఈ మేరకు కృష్ణా బోర్డు చైర్మన్ శివ్నందన్కుమార్కు ఏపీ ఈఎన్సీ సి.నారాయణరెడ్డి సోమవారం లేఖ రాశారు. ఆ లేఖలో ప్రధానాంశాలు.. ♦ ప్రస్తుత నీటి సంవత్సరంలో శ్రీశైలంలో నీటిమట్టం కనీస స్థాయికి చేరుకోక ముందే, కృష్ణా బోర్డు అనుమతి లేకుండా తెలంగాణ సర్కారు విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు నీటిని వదిలేసింది. విభజన చట్టం 11వ షెడ్యూలు 9వ పేరాలో పేర్కొన్న నిబంధనల ప్రకారం.. బోర్డు అనుమతి తీసుకోకుండా విద్యుదుత్పత్తి కోసం వాడుకున్న నీటిని ఆ రాష్ట్ర కోటాలోనే కలపాలని ఆదిలోనే కోరాం. ♦ తెలంగాణ సర్కారు విద్యుదుత్పత్తి కోసం శ్రీశైలంలో 392.45 టీఎంసీలు, సాగర్లో 295.24 టీఎంసీలను.. మొత్తం 687.69 టీఎంసీలను వాడుకుంది. ఇందులో వరద రోజుల్లో వాడుకున్న 359.76 టీఎంసీలు, బోర్డు అనుమతితో వాడుకున్న 126.86 టీఎంసీలను మినహాయిస్తే.. 201.07 టీఎంసీలు అక్రమంగా వాడుకున్నట్లు స్పష్టమవుతోంది. ఈ నీరంతా వృథాగా సముద్రంలో కలిసింది. తెలంగాణ విద్యుదుత్పత్తి చేయకుండా ఉంటే 201.07 టీఎంసీలు ఉమ్మడి ప్రాజెక్టుల్లో నిల్వ ఉండేవి. రెండు రాష్ట్రాల సాగు, తాగు అవసరాలకు ఉపయోగపడేవి. ♦ వరద వచ్చే రోజుల్లో జూరాల, శ్రీశైలం, సాగర్, పులిచింతల, ప్రకాశం బ్యారేజ్ గేట్లు ఎత్తేసి సముద్రంలో జలాలు కలిసే సమయంలో ఏపీ ప్రభుత్వం 191.09 టీఎంసీలు, తెలంగాణ 48.488 టీఎంసీలు వాడుకున్నాయి. ఆ నీటిని ఏ రాష్ట్ర కోటాలో కలపకూడదు. ♦ రెండు రాష్ట్రాల సంయుక్త లెక్కల ప్రకారం జూరాలలో తెలంగాణ 42.22 టీఎంసీలను వాడుకుంది. కానీ, కృష్ణా బోర్డుకు మాత్రం 35.959 టీఎంసీలే వాడుకున్నట్లు తప్పుడు లెక్కలు చెప్పింది. అంటే జూరాల నుంచి అదనంగా 6.261 టీఎంసీలను తెలంగాణ వాడుకుంది. ♦ పాకాల చెరువు, వైరా, పాలేరు, లంకసాగర్, ఆర్డీఎస్, కోయిల్సాగర్ వంటి చిన్న, మధ్య తరహా ప్రాజెక్టుల కింద తెలంగాణ వాడుకుంటున్న నీటి వివరాలను 2021 నుంచి బోర్డు దృష్టికి తీసుకురాలేదు. ♦ 2022–23 నీటి సంవత్సరంలో ఫిబ్రవరి 28 వరకు కృష్ణా బేసిన్లో 972.46 టీఎంసీల లభ్యత ఉంది. ఇందులో ఏపీ వాటా 641.82 (66 శాతం), తెలంగాణ వాటా 330.64 (34 శాతం) టీఎంసీలు. ఫిబ్రవరి వరకు రెండు రాష్ట్రాలు 846.71 టీఎంసీలను వాడుకున్నాయి. ఇందులో ఏపీ వాడుకున్నది 442.52 (52.2 శాతం), తెలంగాణ వాడుకున్నది 404.20 (47.8 శాతం) టీఎంసీలు. వీటిని పరిగణనలోకి తీసుకుంటే ఏపీ కోటాలో ఇంకా 199.31 టీఎంసీలు మిగిలే ఉన్నాయి. తెలంగాణ ఆ రాష్ట్ర కోటా కంటే 73.56 టీఎంసీలు అదనంగా వాడుకుంది. ♦ ఉమ్మడి ప్రాజెక్టుల్లో నిల్వ ఉన్న నీటిలో ఏపీ కోటాలో ఇంకా 148.06 టీఎంసీలు మిగిలి ఉంటే.. తెలంగాణ అదనంగా 82.08 టీఎంసీలను వాడుకుంది. ♦ తక్షణమే నీటి లెక్కలను తేల్చి.. ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, సాగర్లో నీటిని వాడుకోకుండా తెలంగాణను కట్టడి చేయండి. ఆ నీటిని ఆంధ్రప్రదేశ్కు కేటాయించండి. -
పాత పద్ధతిలోనే కృష్ణా జలాల పంపిణీ
సాక్షి, అమరావతి: కృష్ణా జలాలను 2022–23 సంవత్సరంలోనూ ఏపీ, తెలంగాణకు పాత పద్ధతిలోనే పంపిణీ చేయాలని కృష్ణా బోర్డుకు కేంద్ర జల్ శక్తి శాఖ తేల్చిచెప్పింది. ప్రస్తుత నీటి సంవత్సరంలో పాత విధానంలోనే నీటి పంపిణీకి అంగీకరించిన తెలంగాణ సర్కారు.. ఆ తర్వాత అడ్డం తిరిగి సగం వాటా కావాలని డిమాండ్ చేయడంతో కేంద్ర జల్ శక్తి శాఖ ఈ స్పష్టతనిచ్చింది. 2015 జూన్ 19న రెండు రాష్ట్రాల అంగీకారంతో ఏపీకి 512.04 టీఎంసీలు, తెలంగాణకు 298.96 టీఎంసీలు పంపిణీ చేసేలా తాత్కాలిక సర్దుబాటు చేశామని పేర్కొంది. 2016–17లో ఇదే విధానానికి రెండు రాష్ట్రాలు అంగీకరించాయని తెలిపింది. 2017 నుంచి 2022 వరకు ఇదే విధానంలో నీటిని వినియోగించుకున్నాయని గుర్తు చేసింది. ఈ నీటి సంవత్సరంలోనూ ఇదే విధానాన్ని అమలు చేయాలని పేర్కొంది. ట్రిబ్యునల్ నీటి కేటాయింపులు చేసే వరకూ ఈ విధానంలోనే రెండు రాష్ట్రాలకు జలాలను పంపిణీ చేయాలని కృష్ణా బోర్డుకు కేంద్ర జల్ శక్తి శాఖ స్పష్టం చేసినట్లు బోర్డు అధికారవర్గాలు తెలిపాయి. -
ఏకాభిప్రాయంపై చివరి ప్రయత్నం
సాక్షి, అమరావతి: కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిని నిర్దేశిస్తూ కేంద్రం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ల అమలుకు సంబంధించి తెలుగు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయ సాధనకు చివరి ప్రయత్నంగా ఈనెల 3న గోదావరి బోర్డు, 11న కృష్ణా బోర్డు సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాలలో రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరకుంటే కేంద్ర జల్ శక్తి శాఖ దృష్టికి తెచ్చి తదుపరి చర్యలు తీసుకోవాలని బోర్డులు నిర్ణయించాయి. కృష్ణా, గోదావరి జలాల వినియోగంలో రెండు రాష్ట్రాల మధ్య వివాదాలకు చరమగీతం పాడేందుకు బోర్డుల పరిధిని నిర్దేశిస్తూ నోటిఫికేషన్ జారీ చేయాలని 2020 అక్టోబర్ 6న అపెక్స్ కౌన్సిల్ రెండో భేటీలో సీఎం జగన్ కోరారు. తెలంగాణ జెన్కో యథేచ్ఛగా విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు నీటిని వదిలేయడం వల్ల ప్రకాశం బ్యారేజ్ నుంచి కృష్ణా జలాలు వృథాగా కడలిపాలయ్యాయి. కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కులను తెలంగాణ సర్కారు హరిస్తుండటంపై సుప్రీం కోర్టును ఆంధ్రప్రదేశ్ ఆశ్రయించడంతో కేంద్రంలో కదలిక వచ్చింది. ఈ నేపథ్యంలో కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిని నిర్దేశిస్తూ 2021 జూలై 15న నోటిఫికేషన్ను జారీ చేసింది. తెలంగాణ సహాయ నిరాకరణ.. గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిన రోజు నుంచి షెడ్యూల్–2లో పేర్కొన్న ప్రాజెక్టులను ఆర్నెళ్లలోగా కృష్ణా, గోదావరి బోర్డులకు రెండు రాష్ట్రాలు అప్పగించాలి. అనుమతి లేని ప్రాజెక్టులకు నోటిఫికేషన్ జారీ రోజు నుంచి ఆర్నెళ్లలోగా అనుమతి పొందాలి. లేదంటే ఆ ప్రాజెక్టుల నుంచి నీటి వినియోగానికి అనుమతించరు. బోర్డుల నిర్వహణకు నోటిఫికేషన్ జారీ చేసిన రోజు నుంచి 60 రోజుల్లోగా ఒక్కో రాష్ట్రం రూ.200 కోట్ల చొప్పున సీడ్ మనీగా బోర్డుల ఖాతాల్లో జమ చేయాలి. అయితే ఒకేసారి కాకుండా ఎప్పటికప్పుడు నిధులను సమకూర్చుతామని రెండు రాష్ట్రాలు బోర్డులకు స్పష్టం చేశాయి. కృష్ణా బేసిన్లో ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్లను బోర్డుకు అప్పగించేందుకు రెండు రాష్ట్రాలు తొలుత అంగీకరించాయి. ఈ క్రమంలో తన భూభాగంలో శ్రీశైలం, సాగర్ విభాగాలను కృష్ణా బోర్డుకు అప్పగిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినా తెలంగాణ సర్కార్ మాత్రం తన భూభాగంలోని విభాగాలను అప్పగించబోమని స్పష్టం చేసింది. ఏకాభిప్రాయం సాధ్యమేనా..? బోర్డుల నోటిఫికేషన్ అమలుకు తొలుత కేంద్రం నిర్దేశించిన గడువు గతేడాది జనవరి 15తో పూర్తయింది. రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో గడువును మరో ఆర్నెళ్లు పొడిగిస్తూ జల్ శక్తి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో విభజన చట్టం 11వ షెడ్యూల్లో పేర్కొన్న హంద్రీ–నీవా, వెలిగొండ, తెలుగుగంగ, గాలేరు–నగరి, కల్వకుర్తి(పాతది), నెట్టెంపాడు(పాతది) ప్రాజెక్టులకు అనుమతి ఉన్నట్లు పేర్కొంటూ ఉత్తర్వులు జారీ చేసింది. మిగతా ప్రాజెక్టులకు అనుమతి తెచ్చుకోవాలని ఆదేశించింది. కేంద్రం పొడిగించిన గడువు కూడా గత జూలై 15తోనే పూర్తయింది. తెలంగాణ సర్కార్ కృష్ణా బేసిన్లో అనుమతి లేకుండా చేపట్టిన తుమ్మిళ్ల ఎత్తిపోతల, పాలమూరు–రంగారెడ్డి, భక్తరామదాస, మిషన్ భగీరథ తదితర ప్రాజెక్టులకు అనుమతి తెచ్చుకోలేదు. గోదావరి బేసిన్లో అనుమతి లేకుండా చేపట్టిన ప్రాజెక్టులకు అనుమతి ఇవ్వాలని రెండు రాష్ట్రాలు కేంద్ర జల సంఘానికి (సీడబ్ల్యూసీ) డీపీఆర్లు సమర్పించాయి. శ్రీశైలం, సాగర్ నిర్వహణకు సంబంధించి ఆర్ఎంసీ(రిజర్వాయర్ల మేనేజ్మెంట్ కమిటీ) రూపొందించిన విధి విధానాలను ఆంధ్రప్రదేశ్ ఆమోదించగా తెలంగాణ సర్కార్ వ్యతిరేకిస్తోంది. ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయ సాధనకు చివరి ప్రయత్నంగా సర్వ సభ్య సమావేశాలను నిర్వహించేందుకు బోర్డులు సిద్ధమయ్యాయి. -
కృష్ణా జలాలపై తెలంగాణ సర్కారు తొండాట
సాక్షి, అమరావతి: కృష్ణా జలాల వినియోగంలో తెలంగాణ ప్రభుత్వం తొండాటకు దిగుతోంది. జలాల్లో వాటా నుంచి క్యారీ ఓవర్ జలాల వినియోగం వరకు అన్ని వివాదాల పరిష్కారానికి కృష్ణా బోర్డు సమావేశాల్లో పలు మార్లు అంగీకరించి.. ఇప్పుడు అడ్డం తిరిగింది. ప్రస్తుత నీటి సంవత్సరంలో కృష్ణా జలాల్లో సగం వాటా కేటాయించాలని, క్యారీ ఓవర్ జలాలను వాడుకోవడానికి అనుమతించాలని కృష్ణా బోర్డు చైర్మన్ ఎంపీ సింగ్కు తెలంగాణ ఈఎన్సీ సి.మురళీధర్ లేఖ రాశారు. ఏడు అంశాలను వచ్చే నెల 11న నిర్వహించే కృష్ణా బోర్డు 17వ సర్వ సభ్య సమావేశం అజెండాలో చేర్చాలని కోరారు. ఇప్పటికే పరిష్కారమైన ఈ వివాదాలను తెలంగాణ సర్కార్ తిరగదోడటంచర్చనీయాంశంగా మారింది. కేంద్రం నేతృత్వంలో వాటాలపై ఒప్పందం బచావత్ ట్రిబ్యునల్ ప్రాజెక్టుల వారీగా చేసిన కేటాయింపుల ఆధారంగా ఏపీకి 512.04 (66 శాతం), టీఎంసీలు, తెలంగాణకు 298.96 (34 శాతం) టీఎంసీల పంపిణీ జరిగింది. ఈమేరకు జరిగిన తాత్కాలిక ఒప్పందంపై 2015 జూలై 19న ఏపీతోపాటు తెలంగాణ కూడా సంతకం చేసింది. బ్రిజేష్కుమార్ ట్రిబ్యునల్ తీర్పు అమల్లోకి వచ్చే వరకూ ఇదే ఒప్పందం అమల్లో ఉంటుందని కేంద్ర జల్ శక్తి శాఖ స్పష్టం చెప్పింది. ఈ ఏడాది మే 10న జరిగిన కృష్ణా బోర్డు సమావేశంలోనూ ప్రస్తుత నీటి సంవత్సరంలో 66 : 34 నిష్పత్తిలో పంపిణీకి ఏపీ, తెలంగాణ ఆమోదించాయి. కానీ, ఇప్పుడు దానికి తాము అంగీకరించబోమని, జలాల్లో 50 శాతం వాటా కావాలని తెలంగాణ కోరుతోంది. ఎప్పటి లెక్కలు అప్పటికే ఒక నీటి సంవత్సరంలో వాడుకోని వాటా జలాలను (క్యారీ ఓవర్) మరుసటి ఏడాది వాడుకోవడానికి అవకాశం ఇవ్వాలని తెలంగాణ కోరింది. దీనిపై ఏపీ ప్రభుత్వం అభ్యంతరం తెలిపింది. బచావత్ ట్రిబ్యునల్ తీర్పు ప్రకారం.. ఒక ఏడాదిలో నీటి లెక్కలు ఆ ఏడాదితోనే ముగుస్తాయని, మరుసటి ఏడాది వాడుకోవడానికి అవకాశం ఇస్తే ఏపీ హక్కులను హరించినట్లవుతుందని సీడబ్ల్యూసీ పేర్కొంది. దీంతో క్యారీ ఓవర్ జలాలను వాడుకోవడానికి అనుమతించే ప్రశ్నే లేదని కృష్ణా బోర్డు తేల్చి చెప్పింది. వివాదం సద్దుమణిగింది. ఇప్పుడు మళ్లీ ఆ వివాదాన్ని తెలంగాణ తెరపైకి తెస్తోంది. ఊ అని.. ఊహూ అంటే ఎలా? హైదరాబాద్ తాగునీటికి వినియోగిస్తున్న నీటిలో 20 శాతాన్ని లెక్కలోకి తీసుకోవాలని తెలంగాణ కృష్ణా బోర్డును కోరుతోంది. తాగు నీటిలో 20 శాతం వాడుకోగా మిగిలిన 80 శాతం మురుగు నీటి కాలువల ద్వారా మళ్లీ తెలంగాణలో ఆయకట్టుకే చేరుతోందని ఏపీ చెబుతోంది. హైదరాబాద్ తాగునీటికి వాడుతున్న జలాలను వంద శాతం లెక్కించాలని పేర్కొంది. దీనికి కృష్ణా బోర్డు కూడా ఏకీభవించింది. ఇప్పుడు తెలంగాణ మళ్లీ పాత పల్లవే అందుకుంది. రాజోలిబండ డైవర్షన్ స్కీం (ఆర్డీఎస్) డిజైన్ లోపాలను సరిదిద్దుకోకుండా ఆధునికీకరణ కోసం మంకుపట్టు పడుతోంది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్కు దిగువన టెలీమీటర్లను ఏర్పాటు చేసి ఏపీ వాడుతున్న ప్రతి నీటి బొట్టూను కృష్ణా బోర్డు లెక్కిస్తున్నప్పటికీ, ఇంకా టెలీమీటర్లు ఏర్పాటు చేయలేదని తెలంగాణ ఆరోపిస్తోంది. ఒక వైపు అనుమతి లేకుండానే పాలమూరు–రంగారెడ్డి, డిండి, తుమ్మిళ్ల, భక్త రామదాస, మిషన్ భగీరథ, కల్వకుర్తి (సామర్థ్యం పెంపు), నెట్టెంపాడు (సామర్థ్యం పెంపు) తదితర ప్రాజెక్టులు చేపట్టిన తెలంగాణ ప్రభుత్వం.. మరో వైపు నీటి కేటాయింపులు ఉన్న ఆర్డీఎస్ కుడి కాలువ పనులను బ్రిజేష్కుమార్ ట్రిబ్యునల్ తీర్పు అమల్లోకి వచ్చే వరకూ ఏపీ చేపట్టకూడదని డిమాండ్ చేస్తోంది. -
జల వివాదాలకు తెరపడేనా?
సాక్షి, అమరావతి: జలాశయాల నిర్వహణ కమిటీ(ఆర్ఎంసీ) నివేదికను ఆమోదించి జల వివాదాలకు కృష్ణా బోర్డు తెరదించుతుందా? లేక యథాప్రకారం నివేదికను అటకెక్కించి జల వివాదాలను కొనసాగనిస్తుందా? అన్నది ఆసక్తికరంగా మారింది. ఆర్ఎంసీ నివేదికపై చర్చించి, ఆమోదించడమే అజెండాగా జనవరి 6న కృష్ణా బోర్డు 17వ సర్వసభ్య సమావేశాన్ని ఏర్పాటు చేసినట్టు రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు బోర్డు చైర్మన్ ఎంపీ సింగ్ ఇప్పటికే లేఖలు రాశారు. రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదిరాక ఆర్ఎంసీ రూపొందించిన నివేదికపై సంతకాలు చేయడంలో తెలంగాణ అధికారులు అడ్డం తిరిగిన నేపథ్యంలో.. సర్వసభ్య సమావేశంలో సమగ్రంగా చర్చించి తుది నిర్ణయం తీసుకోవాలని కృష్ణా బోర్డు నిర్ణయించింది. నివేదిక తయారీలోనే తీవ్ర జాప్యం ► కృష్ణా జలాల వినియోగంలో రెండు రాష్ట్రాల మధ్య విభేదాలకు ప్రధానంగా కారణమవుతున్న ఉమ్మడి ప్రాజెక్టుల్లో విద్యుదుత్పత్తి, రూల్ కర్వ్స్(ప్రాజెక్టుల నిర్వహణ విధి విధానాలు), మళ్లించిన వరద జలాలను కోటాలో కలపాలా? వద్దా అనే అంశాలపై 2022, మే 6న సర్వ సభ్య సమావేశంలో చర్చించారు. ఈ మూడు సమస్యల పరిష్కారానికి కృష్ణా బోర్డు సభ్యులు ఆర్కే పిళ్లై అధ్యక్షతన రెండు రాష్ట్రాల ఈఎన్సీ, జెన్కోల డైరెక్టర్లు సభ్యులుగా ఆర్ఎంసీని 2022, మే 10న నియమించారు. ► ఉమ్మడి ప్రాజెక్టుల్లో విద్యుదుత్పత్తిపై 15 రోజుల్లోగా.. రూల్ కర్వ్స్, వరద జలాలపై నెలలోగా నివేదిక ఇవ్వాలని ఆర్ఎంసీని ఆదేశించారు. కానీ.. గడువులోగా ఆర్ఎంసీ నివేదిక ఇవ్వలేదు. ► నివేదికను రూపకల్పనకు ఆరు సార్లు ఆర్ఎంసీ సమావేశమైంది. 3న శ్రీశైలంలో కనీస నీటిమట్టం 854 అడుగులుగానూ, ఉత్పత్తయ్యే విద్యుత్లో చెరి సగం పంచుకునేలా.. దిగువన సాగు, తాగునీటి అవసరాలు ఉంటేనే విద్యుదుత్పత్తి చేస్తూ నీటిని విడుదల చేసేలా రెండు రాష్ట్రాల మద్య ఏకాభిప్రాయం కుదిరింది. సాగర్ రూల్ కర్వ్స్పై సీడబ్ల్యూసీను సంప్రదించి ఖరారు చేసుకునేందుకు రెండు రాష్ట్రాలు అంగీకరించాయి. వరద రోజుల్లో మళ్లించే జలాలను లెక్కించినా.. వాటిని నికర జలాల కోటాలో కలపకూడదని నిర్ణయించాయి. ఇదే అంశాలతో 3న నివేదికను రూపొందించింది. కృష్ణా బోర్డు నిర్ణయమే ఫైనల్ ఆర్ఎంసీ నివేదికపై సంతకం చేయడానికి కొంత సమయం కావాలని తెలంగాణ అధికారులు అడిగారు. దాంతో 5న నివేదికపై సంతకాలు చేయడానికి ఆర్ఎంసీ సమావేశాన్ని ఏర్పాటు చేయగా, సంతకాలు చేసేదిలేదని తెలంగాణ అధికారులు సమావేశానికి డుమ్మాకొట్టారు. దీంతో నివేదికపై కృష్ణా బోర్డు సభ్యులు ఆర్కే పిళ్లై, మౌతాంగ్, ఏపీ అధికారులు సంతకాలు చేసి 8న బోర్డు చైర్మన్కు అందజేశారు. ఈ నివేదికపై జనవరి 6న కృష్ణా బోర్డు తీసుకునే నిర్ణయమే ఫైనల్. నివేదికను అమలు చేస్తే జల వివాదాలకు తెరపడినట్టేనంటున్నారు. -
సాగు, తాగునీటికే తొలి ప్రాధాన్యం
సాక్షి, హైదరాబాద్: శ్రీశైలం రిజర్వాయర్ నీటి వినియోగంలో సాగు, తాగునీటికే తొలి ప్రాధాన్యం ఇవ్వాలని కృష్ణా బోర్డుకు ఆర్ఎంసీ (జలాశయాల నిర్వహణ కమిటీ) తేల్చిచెప్పింది. రుతుపవనాల కాలంలో జూలై 1 నుంచి అక్టోబర్ 31 వరకూ ప్రాజెక్టు కనీస నీటిమట్టం 854 అడుగులకు పైనే ఉండాలని పేర్కొంది. ప్రస్తుతం ఉన్న వర్కింగ్ అరేంజ్మెంట్ ప్రకారం.. శ్రీశైలం వద్ద ఉత్పత్తయ్యే విద్యుత్ను ఇరు రాష్ట్రాలు చెరి సగం (50: 50) పంచుకోవాలని స్పష్టం చేసింది. ఈ మేరకు కృష్ణా బోర్డు చైర్మన్ ఎంపీ సింగ్కు ఆర్ఎంసీ కన్వీనర్ ఆర్కే పిళ్లై తుది నివేదిక ఇచ్చారు. డిసెంబర్ 3న నిర్వహించిన ఆర్ఎంసీ ఆరో సమావేశంలో తుది నివేదికను రెండు రాష్ట్రాలు అంగీకరించినా.. దానిపై సంతకం చేయడానికి కొంత సమయం కావాలని తెలంగాణ అధికారులు అడిగారని నివేదికలో పేర్కొన్నారు. ఈ మేరకు డిసెంబర్ 5న ఏర్పాటుచేసిన సమావేశానికి తెలంగాణ అధికారులు గైర్హాజరయ్యారని, దీంతో ఆర్ఎంసీలో మిగతా సభ్యులైన నలుగురు (కన్వీనర్ ఆర్కే పిళ్లై, కృష్ణా బోర్డు సభ్యులు మౌతాంగ్, ఏపీ ఈఎన్సీ సి.నారాయణరెడ్డి, ఏపీ జెన్కో డైరెక్టర్ ఎమ్వీవీ సత్యనారాయణ) తుది నివేదికపై సంతకాలు చేశారని తెలిపారు. ఈ తుది నివేదికపై బోర్డులో చర్చించి తగిన నిర్ణయం తీసుకోవాలని సూచించారు. కృష్ణా బోర్డు ఆమోదించాకే ఆర్ఎంసీ నివేదిక అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు. కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్ (కేడబ్ల్యూడీటీ)–2 అవార్డు నోటిఫై అయ్యే దాకా ఈ నివేదిక అమల్లో ఉంటుందని తెలిపారు. ఆర్ఎంసీ తుది నివేదిక, సీడబ్ల్యూసీ రూల్ కర్వ్స్ ఆధారంగా నీటి కేటాయింపులకు రక్షణ కల్పి ంచాలంటూ రెండు రాష్ట్రాలు కేడబ్ల్యూడీటీ–2ను కోరడానికి వీల్లేదని తేల్చిచెప్పారు. ఆర్ఎంసీ తుది నివేదికలో మరికొన్ని ప్రధానాంశాలు ఇవీ.. ►శ్రీశైలం జలాశయంలో 75 శాతం లభ్యత ప్రకారం రెండు రాష్ట్రాలు నీటిని వినియోగించుకోవాలి. ఆ తర్వాతే విద్యుదుత్పత్తికి ప్రాధాన్యం ఇవ్వాలి. ►శ్రీశైలంలో నీటి మట్టం తగ్గిపోవడం వల్ల సాగు, తాగునీటి కోసం ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ►ఈ నేపథ్యంలో జూలై 1 నుంచి అక్టోబర్ 31 వరకూ శ్రీశైలంలో కనీస నీటి మట్టం 854 అడుగుల కంటే ఎగువన నీటిని నిల్వ చేయాలి. ►శ్రీశైలంకు వరద రోజుల్లో అంటే.. జూలై 1 నుంచి అక్టోబర్ 31 మధ్య ఉత్పత్తయ్యే విద్యుత్ను రోజూ ఉదయం 8 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 8 గంటల వరకూ మిలియన్ యూనిట్లలో లెక్కకట్టి.. దాన్ని ఇరు రాష్ట్రాలకు చెరి సగం పంపిణీ చేయాలి. ►నాగార్జునసాగర్కు వరద రోజుల్లో అంటే.. జూలై 1 నుంచి అక్టోబర్ 31 మధ్య రూల్ కర్వ్లో నిర్ణయించిన నీటి మట్టం కంటే ఎక్కువగా ఉంటే విద్యుదుత్పత్తి చేసుకోవచ్చు. రోజూ ఉదయం 8 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 8 గంటల వరకూ ఉత్పత్తయిన విద్యుత్ను లెక్కకట్టాలి. వరద తగ్గాక.. దిగువున సాగు, తాగునీటి అవసరాల మేరకు నీటిని విడుదల చేస్తూ ప్రధాన కేంద్రం ద్వారా విద్యుదుత్పత్తి చేయాలి. ►నాగార్జునసాగర్ నిర్వహణ విధి విధానాలపై(రూల్ కర్వ్స్) రెండు రాష్ట్రాలు తమ అభిప్రాయాలను కేంద్ర జలసంఘానికి (సీడబ్ల్యూసీ) తెలియజేసి ఖరారు చేసుకోవాలి. మిగులు జలాలను కోటాలో కలపొద్దు.. ►ప్రతి సంవత్సరం రెండు రాష్ట్రాలు వినియోగించిన నీటిని రెండు విభాగాలుగా లెక్కించాలి. 75 శాతం లభ్యత ఆధారంగా ఏ రాష్ట్రం ఎంత వాడుకుంది.. ఎంత వాడుకోలేదు అన్నది లెక్కట్టాలి. మిగులు జలాలను ఏమేరకు మళ్లించారు అన్నది లెక్కకట్టాలి. ►వరద రోజుల్లో కృష్ణా ప్రధాన పాయపై జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల గేట్లను ఎత్తేసి.. ప్రకాశం బ్యారేజ్ నుంచి సముద్రంలోకి జలాలు కలుస్తున్న సమయంలో రెండు రాష్ట్రాలు ఎవరు ఏ మేరకు మళ్లించినా.. ఆ జలాలను మిగులు జలాలుగానే లెక్కకట్టాలి. ►జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల గేట్లను మూసివేసిన సమయంలో అంటే మిగు లు జలాలు లేని రోజుల్లో వాడుకున్న నీటిని ఆయా రాష్ట్రాల నికర జలాల కోటాలో కలపాలి. ►ఆర్ఎంసీ స్థానంలో జలాశయాల శాశ్వత నిర్వహణ కమిటీ(పీఆర్ఎంసీ) ఏర్పాటు చేసి.. ఉమ్మ డి జలాశయాల నిర్వహణను పర్యవేక్షించాలి. -
శ్రీశైలంపై తెగని పంచాయితీ
సాక్షి, హైదరాబాద్: రిజర్వాయర్ల నిర్వహణ కమిటీ (ఆర్ఎంసీ) చివరి సమావేశం సోమవారం రెండోరోజు కొనసాగగా.. తెలంగాణ అధికారుల గైర్హాజరుతో ఎలాంటి ఫలితం లేకుండానే ముగిసింది. గత శనివారం జలసౌధలో జరిగిన మొదటిరోజు సమావేశానికి ఏపీ, తెలంగాణ అధికారులు హాజరై.. ఆర్ఎంసీ ప్రతిపాదించిన ముసాయిదా నివేదికలోని పలు అంశాలపై ఏకాభిప్రాయం తెలపడంతో పాటు సమావేశాన్ని సోమవారం కూడా కొనసాగించి తుది నివేదికపై సంతకాలు చేయాలని నిర్ణయించారు. శ్రీశైలం జలాశయం రూల్కర్వ్ (నిర్వహణ నిబంధనలు)లో స్వల్ప మార్పులకు రెండు రాష్ట్రాలు ఓకే అన్నాయి. తాగు, సాగునీటి అవసరాలకు నష్టం కలగకుండా శ్రీశైలంలో జల విద్యుదుత్పత్తిని నియంత్రించాలనే మరో నిబంధనకు కూడా అంగీకారం తెలిపాయి. తీరా సోమవారం నాటి సమావేశానికి తెలంగాణ అధికారులు గైర్హాజరు కావడంతో కథ మళ్లీ మొదటికి వచ్చింది. కృష్ణా బోర్డు సభ్యులు, ఆర్ఎంసీ కన్వీనర్ బి.రవికుమార్ పిళ్లై నేతృత్వంలో సోమవారం కమిటీ సమావేశం కాగా, ఏపీ జలవనరుల శాఖ ఈఎన్సీ సి.నారాయణరెడ్డితో పాటు ఆ రాష్ట్ర అధికారులు హాజరయ్యారు. తెలంగాణ నీటిపారుదల శాఖ ఈఎన్సీ సి.మురళీధర్తో పాటు ఇతర అధికారుల రాకకోసం దాదాపు అర్ధగంటకు పైగా నిరీక్షించారు. ఈ విషయాన్ని పిళ్లై తెలంగాణ ఈఎన్సీకి ఎస్ఎంఎస్ ద్వారా తెలపగా, తాము రావడం లేదని ఆయన బదులిచ్చారు. దీంతో ఏపీ ఈఎన్సీ, ఏపీ జెన్కో డైరెక్టర్ (హైడల్) నుంచి తుది నివేదికపై సంతకాలను సేకరించిన ఆర్ఎంసీ కన్వీనర్ ఎలాంటి చర్చ లేకుండానే సమావేశాన్ని ముగించారు. విఫలమైన ఆర్ఎంసీ ప్రయత్నాలు శ్రీశైలం, నాగార్జునసాగర్ రిజర్వాయర్లలో ఎంత మేరకు నిల్వలుంటే ఎంత మేర జలాలను ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు తాగునీరు, సాగునీరు, జలవిద్యుదుత్పత్తి అవసరాలకు వాడుకోవాలి అన్న అంశం రూల్కర్వ్లో ఉంటుంది. రెండు జలాశయాల రూల్కర్వ్తో పాటు జలవిద్యుదుత్పత్తి, మిగులు జలాల వినియోగంపై ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో సంప్రదింపులు జరిపి నివేదికను సిఫారసు చేసేందుకు ఆర్ఎంసీ కమిటీని..కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) ఏర్పాటు చేసింది. ఆరుసార్లు సమావేశమైన ఆర్ఎంసీ రెండు రాష్ట్రాల మధ్య సయోధ్య కుదుర్చేందుకు తీవ్రంగా ప్రయత్నించింది. అయితే చివరి సమావేశం రెండో రోజు భేటీకి తెలంగాణ అధికారులు గైర్హాజరు కావడంతో ఆర్ఎంసీ ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఆర్ఎంసీ తన తుది నివేదికలో చేయనున్న సాంకేతిక సిఫారసులు అమల్లోకి వచ్చే అవకాశం లేకుండా పోయింది. ఆర్ఎంసీ తుది నివేదికపై ఏపీ తరఫున తాము సంతకాలు చేసినట్లు ఏపీ జలవనరుల శాఖ ఈఎన్సీ సి.నారాయణరెడ్డి తెలిపారు. కనీస నిల్వ 830 అడుగులు చాలు శ్రీశైలంలో కనీస నిల్వ మట్టం 854 అడుగులుండాలని ప్రతిపాదించడాన్ని తాము అంగీకరించడం లేదని, 830 అడుగులుంటే సరిపోతుందని స్పష్టం చేశారు. పోతిరెడ్డిపాడు ద్వారా 34 టీఎంసీలను మాత్రమే ఏపీ తరలించుకోవాలన్న నిబంధననను రూల్కర్వ్లో చేర్చాలని డిమాండ్ చేశారు. వరదల తర్వాత శ్రీశైలం, సాగర్ జలాశయాల నుంచి అదనపు జలాలను తరలించుకోవడానికి ఏపీ అంగీకరిస్తేనే మిగులు జలాల వినియోగం విషయంలో ఆ రాష్ట్రంతో ఒప్పందం చేసుకుంటామని తెలిపారు. ఏపీ, తెలంగాణ మధ్య 50:50 నిష్పత్తిలో కృష్ణా జలాల తాత్కాలిక బట్వాడా జరపాలని, వాడని కోటాను వచ్చే ఏడాదికి క్యారీ ఓవర్ చేయాలని సూచించారు. ముసాయిదా నివేదికలో తెలంగాణకి ప్రయోజనం కలిగించే అంశాలేమీ లేవని, తమకు ఆమోదయోగ్యం కాని ఈ నివేదికను నిలుపుదల చేయాలని కృష్ణా బోర్డు చైర్మన్ను కోరారు. పిళ్లై తప్పుడు వార్తలు రాయించారు మా వైఖరిలో మార్పు లేదు: తెలంగాణ ఆర్ఎంసీ నివేదికకు అంగీకరిస్తూ ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు ఒప్పందం చేసుకున్నట్టు ఆర్ఎంసీ కన్వీనర్ రవికుమార్ పిళ్లై మీడియాలో తప్పుడు వార్తలు రాయించారంటూ తెలంగాణ తీవ్ర ఆరోపణలు చేసింది. సరైన వాస్తవాలను మీడియాకు తెలియజేయాలని ఆయన్ను ఆదేశించాలని కృష్ణా బోర్డును కోరింది. నీటి వాటాలు, విద్యుత్ వాటాలు, క్యారీ ఓవర్ నిల్వలు, వరద జలాల లెక్కింపుపై తమ రాష్ట్ర వైఖరిలో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు సోమవారం సాయంత్రం ఆర్ఎంసీ తుది సమావేశం ముగిసిన తర్వాత రాష్ట్ర నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్కుమార్.. కృష్ణా బోర్డు చైర్మన్కు లేఖ రాశారు. 50:50 నిష్పత్తిలో శ్రీశైలం విద్యుత్ను పంచుకోవాలంటూ తమకిచ్చిన ముసాయిదా నివేదికలో ఆర్ఎంసీ చేసిన సిఫారసును అంగీకరించేది లేదని స్పష్టం చేశారు. విద్యుదుత్పత్తి అవసరాలకే శ్రీశైలం జలాశయం ఉందని, జల విద్యుదుత్పత్తితో 240 టీఎంసీలను విడుదల చేయడం ద్వారా నాగార్జునసాగర్ కింద తాగు, సాగునీటి అవసరాలను తీర్చాల్సి ఉంటుందని తెలిపారు. -
70 లేఖలు రాసినా స్పందన లేదు!
సాక్షి, హైదరాబాద్: కృష్ణా ట్రిబ్యునల్–1 తీర్పులోని పలు అంశాల అమలు కోరుతూ 70కి పైగా లేఖలు రాసినా ఇప్పటి వరకు ఎలాంటి స్పందనలేదంటూ కృష్ణా నది యాజమాన్య బోర్డు(కేఆర్ఎంబీ) తీరు పట్ల తెలంగాణ రాష్ట్రం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆ లేఖలపై ఇప్పుడైనా చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ మేరకు రాష్ట్ర నీటిపారుదల శాఖ ఈఎన్సీ సి.మురళీధర్ తాజాగా కృష్ణా బోర్డుకు లేఖ రాశారు. గతంలో రాసిన 70 లేఖల జాబితాతో పాటు ఆ లేఖల్లోని ముఖ్యాంశాలను తాజాగా రాసిన లేఖలో పొందుపరిచారు. ఈ నెల 24న కృష్ణా బోర్డు నిర్వహించనున్న రిజర్వాయర్ల నిర్వహణ కమిటీ(ఆర్ఎంసీ) సమావేశాన్ని నిర్వహించనున్న నేపథ్యంలో బోర్డు అధికారులను ఎండగట్టేందుకు వ్యూహాత్మకంగా తెలంగాణ ఈ లేఖను రాయడం విశేషం. వివరాలివీ... ► రాష్ట్ర పునర్విభజన చట్టంలోని సెక్షన్ 85(8ఏ) ప్రకారం కృష్ణా ట్రిబ్యునల్–1 తీర్పుతో పాటు అంతర్రాష్ట్ర ఒప్పందాల అమలు తప్పనిసరి అని గుర్తు చేశారు. 20% జలాలను తాగునీటికి వినియోగించాలని కృష్ణా ట్రిబ్యునల్–1 పేర్కొనగా, నీటి లెక్కల్లో దీన్ని కృష్ణా బోర్డు పరిగణనలోకి తీసుకోవడం లేదని తెలంగాణ తప్పుబట్టింది. ► వాడుకోని వాటా జలాలను తెలంగాణ మరుసటి జల సంవత్సరానికి బదలాయింపు(క్యారీ ఓవర్) చేస్తుండగా, ఈ జలాలను మరుసటి ఏడాది తెలంగాణ వాటా జలాల కింద లెక్కించవద్దని చేస్తున్న విజ్ఞప్తులను కృష్ణా బోర్డు పట్టించుకోవడం లేదు. కృష్ణా ట్రిబ్యునల్–1 తీర్పులోని స్కీం–ఏ కేటాయింపుల కింద ‘క్యారీ ఓవర్’జలాలను మరుసటి సంవత్సరం వాడుకోవచ్చు. ► ఏపీ, తెలంగాణ మధ్య 66:34 నిష్పత్తిలో జరిపిన కృష్ణా జలాల తాత్కాలిక కేటాయింపులను తెలంగాణ రాష్ట్రం ఇకపై ఏ మాత్రం అంగీకరించ దు. కృష్ణా జలాల్లో తెలంగాణకు 70శాతం హ క్కులున్నప్పటికీ 50:50 నిష్పత్తిలో తాత్కాలిక కే టాయింపులు జరపాలని ఎన్నో లేఖలు రాశాం. ► శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల నిర్వహణకు విధివిధానాల(రూల్కర్వ్)రూపకల్పనలో సీడబ్ల్యూసీ వినియోగించిన సమాచారాన్ని తెలంగాణ ప్రభుత్వం కోరినా కేఆర్ఎంబీ, కేంద్ర ప్రభుత్వం స్పందించలేదు. శ్రీశైలం జలాశయంలో వాటాదారుడిగా రూల్కర్వ్ పరిశీలనల కోసం ఈ సమాచారం మాకు అవసరం. చెన్నై వాటర్ సప్లై ఒప్పందాల ప్రకారం..కేవలం 1500 క్యూసెక్కుల సామర్థ్యంతో గల కాల్వ ద్వారా 15 టీఎంసీలను మాత్రమే తరలించడానికి హెడ్వర్క్స్ నిర్మించాలి, ఈ నిబంధన అమలుకు కేంద్రం తనిఖీలు జరపాల్సి ఉంది. ఈ తనిఖీలకు సంబంధించిన సమాచారం కూడా కావాలి. ఈ నిబంధన మేరకు రూల్కర్వ్ను సవరించాలి. ► గోదావరి ట్రిబ్యునల్ ఒప్పందంతో పాటు పోల వరం ప్రాజెక్టుకు సీడబ్ల్యూసీ ఇచ్చిన అనుమతు లప్రకారం.. నాగార్జునసాగర్ నుంచి కృష్ణా డెల్టా సిస్టం వాటాలో 80 టీఎంసీలను తగ్గించాలి. దీనికి విరుద్ధంగా సీడబ్ల్యూసీ రూపొందించిన రూల్కర్వ్లో నాగార్జునసాగర్నుంచి కృష్ణా డెల్టా సిస్టంకు జరిపిన కేటాయింపులను తొలగించాలి. ► బేసిన్ లోపలి ప్రాంతాల అవసరాలకు తగ్గట్టుగా శ్రీశైలంలో 76:24 నిష్పత్తిలో తెలంగాణ, ఏపీలు విద్యుదుత్పత్తి చేసుకునేందుకు వీలుకల్పించేలా రూల్కర్వ్ను సవరించాలి. తెలంగాణ పరిధిలోని బేసిన్ లోపలి ప్రాంతాల అవసరాలకు 160 టీఎంసీలను కేటాయించడంతో పాటు శ్రీశైలం నుంచి బేసిన్ వెలుపలి అవసరాలకు ఏపీ చేస్తున్న తరలింపులను 34 టీఎంసీలకు పరిమితం చేసేలా రూల్కర్వ్ను సవరించాలి. ► పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్తో అనుసంధానమై ఉన్న అన్ని కాల్వలకు రియల్ టైం డేటా అక్విసైషన్ సిస్టమ్ను ఏర్పాటు చేసి నీటి తరలింపులను కచ్చితంగా లెక్కించాలి. శిథిలావస్థకు చేరిన ఆర్డీఎస్ ఆనకట్ట ఆధునికీకరణ జరపాలి. ఇదీ చదవండి: అదేమో గానీ.. పార్టీని మాత్రం ఎవరూ కాపాడలేరు -
24న కృష్ణా బోర్డు ఆర్ఎంసీ భేటీ
సాక్షి, అమరావతి: కృష్ణా బోర్డు రిజర్వాయర్స్ మేనేజ్మెంట్ కమిటీ(ఆర్ఎంసీ) సమావేశం ఈ నెల 24న హైదరాబాద్లో జరగనుంది. కృష్ణా బేసిన్లో ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్ నిర్వహణ నియమావళిని రూపొందించడమే అజెండాగా ఈ సమావేశం ఉంటుంది. ఇప్పటికే ఆర్ఎంసీ నాలుగుసార్లు సమావేశమై శ్రీశైలం, సాగర్ నిర్వహణపై సమగ్రంగా చర్చించింది. శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల కింద ఏ కాలువకు ఎప్పుడు నీరు విడుదల చేయాలి, విద్యుత్ ఉత్పత్తిని ఎలా చేయాలి, మళ్లించిన వరద జలాలను లెక్కలోకి తీసుకోవాలా... వద్దా... అనే అంశాలపై ముసాయిదాను రూపొందించింది. ఈ ముసాయిదాను 24న జరిగే భేటీలో చర్చించి, ఆమోదించనుంది. ఆ తర్వాత కృష్ణా బోర్డుకు ముసాయిదా నివేదిక సమర్పించనుంది. కృష్ణా బోర్డు సర్వసభ్య సమావేశంలో ఈ ముసాయిదాను చర్చించి, రెండు రాష్ట్రాల అభిప్రాయాల మేరకు దానిలో మార్పులు, చేర్పులు చేసి నిర్వహణ నియమావళిని ఖరారు చేస్తారు. ఈ నియమావళి ఆధారంగా ఉమ్మడి ప్రాజెక్టులను నిర్వహించడం ద్వారా రెండు రాష్ట్రాల మధ్య జలవివాదాలకు చరమగీతం పాడాలనేది బోర్డు లక్ష్యం. -
అనుమతిలేని ప్రాజెక్టులకు ఏపీ టెండర్లు
సాక్షి, హైదరాబాద్: కృష్ణా బోర్డు, అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేకుండా పలు ప్రాజెక్టుల నిర్మాణానికి ఏపీ టెండర్లను ఆహ్వానించిందని, తక్షణమే వాటిని నిలుపుదల చేయించాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ)కు తెలంగాణ విజ్ఞప్తి చేసింది. కృష్ణా జలాలను బేసిన్ వెలుపలి ప్రాంతాలకు తీసుకెళ్లేందుకు చేపట్టిన ఈ పనులు బచావత్ ట్రిబ్యునల్ అవార్డుకు విరుద్ధమని పేర్కొంది. ఈ మేరకు తెలంగాణ నీటిపారుదల శాఖ ఈఎన్సీ సి.మురళీధర్ కృష్ణా బోర్డు చైర్మన్కు లేఖ రాశారు. గండికోట రిజర్వాయర్ నుంచి నీటిని మంగపట్నం, గంగదేవిపల్లి చెరువులకు తరలించడానికి లిఫ్ట్లు, పైపులైన్ల నిర్మాణం, సూళ్లూరుపేట మున్సిపాలిటీకి తాగునీటిని తరలించడానికి సత్యసాయి గంగ కాల్వ వద్ద ఓటీ స్లూయిస్ నిర్మాణానికి ఏపీ టెండర్లు ఆహ్వానించినట్లు ఫిర్యాదు చేసింది. అలాగే ముడిగుబ్బ వద్ద జిల్లెడుబండ రిజర్వాయర్, హంద్రీనీవా ప్రధాన కాల్వ 377.1 కి.మీ. వద్ద సరప్లస్ వేర్, క్రాస్ రెగ్యులేటర్, హంద్రీనీవా–2 ప్యాకేజీ 25 లిఫ్ట్ నిర్మాణ పనులకు కూడా టెండర్లు పిలిచిందని ఫిర్యాదులో పేర్కొంది. గాలేరు నగరి (జీఎన్ఎస్ఎస్) పథకం ద్వారా శ్రీశైలం ప్రాజెక్టు నుంచి కృష్ణా జలాలను పెన్నానదిపై ఉన్న గండికోట జలాశయానికి తరలించడం బచావత్ అవార్డు ఉల్లంఘన అవుతుందని వివరించింది. హెచ్ఎన్ఎస్ఎస్, జీఎన్ఎస్ఎస్, వెలిగొండ, తెలుగు గంగ ప్రాజెక్టుల ద్వారా కృష్ణా జలాలను బేసిన్ వెలుపలి ప్రాజెక్టులకు తరలించడాన్ని కృష్ణా ట్రిబ్యునల్–2 ఎదుట తాము వ్యతిరేకించిన విషయాన్ని గుర్తుచేసింది. ఈ పనులను తక్షణమే నిలుపుదల చేయించాలని, ఈ విషయాన్ని కేంద్ర జలశక్తి శాఖ దృష్టికి తీసుకెళ్లాలని కృష్ణా బోర్డును తెలంగాణ కోరింది. -
తీరు మార్చుకోని తెలంగాణ జెన్కో.. కృష్ణా బోర్డుకు ఏపీ ఈఎన్సీ లేఖ
సాక్షి, అమరావతి : తెలంగాణ జెన్కో తీరు మారలేదు. కృష్ణా నదిలో వరద ప్రవాహం కనిష్ట స్థాయికి చేరింది. దిగువన సాగు, తాగు నీటి అవసరాలు లేవు. అయినా, తెలంగాణ జెన్కో శ్రీశైలం, సాగర్లలో యథేచ్ఛగా విద్యుదుత్పత్తి చేస్తోంది. దాంతో శ్రీశైలం, సాగర్లలో నీటి మట్టాలు తగ్గుతున్నాయి. కృష్ణా నది నికర జలాలు వృథాగా సముద్రంలోకి పోతున్నాయి. ఇదే అంశాన్ని వివరిస్తూ, తక్షణమే విద్యుదుత్పత్తిని నిలిపివేసేలా తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ ఏపీ ఈఎన్సీ సి.నారాయణరెడ్డి కృష్ణా బోర్డు చైర్మన్ ఎంపీ సింగ్కు శుక్రవారం లేఖ రాశారు. లేదంటే రిజర్వాయర్లలో నీరు తగ్గిపోయి, సీజన్ చివర్లో సాగు, తాగు నీటికి ఇబ్బందులు వస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఏడాది మే 27న జరిగిన బోర్డు సమావేశంలో తాగు, సాగు నీటికే ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని, విద్యుత్తుకు కాదని తీసుకున్న నిర్ణయాన్ని ఆయన గుర్తుచేశారు. ఆ లేఖలో ప్రధానాంశాలు ఇవీ.. ► ఈ నెల 24 నాటికి శ్రీశైలం ప్రాజెక్టులో 884.4 అడుగుల్లో 213.401 టీఎంసీలు నిల్వ ఉండేవి. వరద కనిష్ట స్థాయికి చేరడంతో స్పిల్ వే గేట్లు మూసేశాం. తెలంగాణ జెన్కో, ఏపీ జెన్కోలు విద్యుదుత్పత్తిని కొనసాగిస్తూ.. దిగువకు నీటిని వదిలేస్తుండటం వల్ల గురువారం ఉదయం 6 గంటలకు శ్రీశైలంలో నీటి మట్టం 881.3 అడుగుల్లో 195.21 టీఎంసీలకు తగ్గిపోయింది. అంటే.. 18 టీఎంసీలను శ్రీశైలం నుంచి దిగువకు వదిలేశారు. ► గురువారం ఉదయం 6 గంటలకు నాగార్జునసాగర్లో 589.7 అడుగుల్లో 311.150 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. దిగువన ఎలాంటి తాగు, సాగునీటి అవసరాలు లేకున్నా.. తెలంగాణ జెన్కో విద్యుదుత్పత్తి చేస్తూ నీటిని దిగువకు వదిలేస్తోంది. ఆ జలాలు నదిలో కలుస్తున్నాయి. ► పులిచింతల, ప్రకాశం బ్యారేజ్లో గరిష్ట స్థాయిలో నీటి నిల్వ ఉంది. దాంతో.. ఎగువ నుంచి విడుదల చేస్తున్న నీటిని సముద్రంలోకి వదిలేయాల్సి వస్తోంది. ► ఈ ఏడాది మే 27న జరిగిన బోర్డు సమావేశంలో దిగువన సాగు, తాగునీటి అవసరాలు ఉన్నప్పుడే.. బోర్డు అనుమతితో విద్యుదుత్పత్తి చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ అవసరాలు లేకపోతే విద్యుదుత్పత్తి నిలిపివేయాలని నిర్ణయించారు. ► బోర్డు నిర్ణయాన్ని, విభజన చట్టాన్ని తెలంగాణ జెన్కో ఉల్లంఘించి యథేచ్ఛగా విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు నీటిని వదిలేస్తోంది. దాంతో కృష్ణా నికర జలాలు వృథాగా సముద్రంలో కలుస్తున్నాయి. -
17న కృష్ణా బోర్డు ఆర్ఎంసీ భేటీ
సాక్షి, అమరావతి: కృష్ణా నదీ జలాల వినియోగంలో రెండు రాష్ట్రాల మధ్య తరచూ వివాదానికి కారణమవుతోన్న అంశాలను పరిష్కరించడానికి విధివిధానాలను రూపొందించేందుకు కృష్ణా బోర్డు చైర్మన్ ఎంపీ సింగ్ ఏర్పాటు చేసిన రిజర్వాయర్స్ మేనేజ్మెంట్ కమిటీ (ఆర్ఎంసీ) అక్టోబర్ 17న సమావేశం కానుంది. హైదరాబాద్లోని బోర్డు కార్యాలయంలో ఈ సమావేశాన్ని నిర్వహించనున్నారు. శ్రీశైలం, నాగార్జునసాగర్లలో ఏ ప్రాజెక్టుకు ఎప్పుడు నీటిని విడుదల చేయాలనే అంశంపై నియమావళి (రూల్ కర్వ్), విద్యుత్ ఉత్పత్తి, వరద జలాల మళ్లింపుపై విధివిధానాలను రూపొందించి ముసాయిదా నివేదిక ఇవ్వడానికి ఏర్పాటు చేసిన ఆర్ఎంసీ ఇప్పటికే నాలుగు సార్లు సమావేశమైంది. ముసాయిదా నివేదికను ఖరారు చేసేందుకు ఆగస్టు 23న సమావేశం కావాలని ఆర్ఎంసీ చైర్మన్ ఆర్కే పిళ్లై తొలుత నిర్ణయించారు. కానీ, ఆ సమావేశం వాయిదా వేయాలని రెండు రాష్ట్రాలు కోరడంతో ఇప్పటికే నాలుగుసార్లు వాయిదా వేశారు. తాజాగా ఈ నెల 27న సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. తెలంగాణ సర్కార్ మళ్లీ వాయిదా వేయాలని కోరింది. దీంతో అక్టోబర్ 17వ తేదీకి సమావేశాన్ని వాయిదా వేసింది. ఈ సమావేశంలో ముసాయిదా నివేదికను ఖరారు చేసి కృష్ణా బోర్డుకు పంపనుంది. బోర్డు ఆమోదం తెలిపిన తర్వాత ఆ నివేదిక మేరకు ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, సాగర్లను బోర్డు నిర్వహించనుంది. -
23న కృష్ణాబోర్డు ఆర్ఎంసీ సమావేశం
సాక్షి, హైదరాబాద్: కృష్ణా నదీజలాల వినియోగంలో రెండు రాష్ట్రాల మధ్య తరచుగా వివాదానికి కారణమవుతోన్న అంశాలను పరిష్కరించడానికి విధి విధానాలను రూపొందించడానికి కృష్ణా బోర్డు చైర్మన్ ఎంపీ సింగ్ ఏర్పాటు చేసిన ఆర్ఎంసీ (రిజర్వాయర్స్ మేనేజ్మెంట్ కమిటీ) ఈనెల 23న ఉద యం 11 గంటలకు బోర్డు కార్యాలయంలో సమావేశం కానుంది. శ్రీశైలం, నాగార్జునసాగర్లలో ఏ ప్రాజెక్టుకు ఎప్పుడు నీటిని విడుదల చేయడానికి సంబంధించిన నియమావళి (రూల్ కర్వ్), విద్యుదుత్పత్తి, వరద జలాల మళ్లింపుపై విధివిధానాలను రూపొందించి ముసాయిదా నివేదిక ఇవ్వడానికి ఏర్పాటు చేసిన ఆర్ఎంసీ ఇప్పటికే నాలుగు సార్లు సమావేశమైంది. ఈ సమావేశంలో ముసాయిదా నివేదికను ఖరారు చేసి.. కృష్ణా బోర్డుకు పంపనుంది. బోర్డు ఆమోదముద్ర వేశాక, ఆ నివేదిక మేరకు ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, సాగర్లను బోర్డు నిర్వహించనుంది. ఇక 2022–23 సంవత్సరంలో కృష్ణా జలాల లభ్యత, వాటాలు, వినియోగంపై చర్చించడానికి బోర్డు సభ్య కార్యదర్శి డీఎం రాయ్పురే అధ్యక్షతన ఈనెల 23న మధ్యాహ్నం 3.30కు త్రిసభ్య కమిటీ సమావేశమవుతోంది. ఈ సమావేశాలకు హాజరుకావాలని 2 రాష్ట్రాల ఈఎన్సీలకు కృష్ణా బోర్డు లేఖలు రాసింది. -
వడివడిగా ఒడిసిపడుతూ
సాక్షి, అమరావతి: కృష్ణా వరద ఉద్ధృతికి జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల, ప్రకాశం బ్యారేజ్లు నిండిపోవడంతో గేట్లు ఎత్తివేసి సముద్రంలోకి నీటిని వదిలేస్తున్నారు. కడలిలో కలిసే సమయంలో కృష్ణా జలాలను రెండు రాష్ట్రాల్లో ఏ రాష్ట్రం మళ్లించుకున్నా వాటిని నికర జలాల్లో(కోటా) కలపకూడదన్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిపాదనకు కృష్ణా బోర్డు ఆమోదం తెలిపింది. దీంతో గత మూడేళ్ల తరహాలోనే ఈ ఏడాదీ శ్రీశైలం ప్రాజెక్టుపై ఆధారపడ్డ అన్ని ప్రాజెక్టులనూ వరద జలాలతో నింపాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. ఈ మేరకు శ్రీశైలం ప్రాజెక్టులో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి కుడిగట్టు ప్రధాన కాలువ ద్వారా వరద జలాలను తరలిస్తూ– తెలుగుగంగ, గాలేరు–నగరి సుజల స్రవంతి, శ్రీశైలం కుడిగట్టు కాలువ(ఎస్సార్బీసీ)లో అంతర్భాగమైన ప్రాజెక్టులను నింపడంలో అధికారులు నిమగ్నమయ్యారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి 14 వేల క్యూసెక్కులతో ప్రారంభించి గరిష్టంగా 44 వేల క్యూసెక్కులను తరలించి ప్రాజెక్టులన్నీ యుద్ధప్రాతిపదికన నింపేలా చర్యలు చేపట్టారు. శ్రీశైలం ప్రాజెక్టులో మల్యాల ఎత్తిపోతల నుంచి హంద్రీ–నీవా సుజల స్రవంతి కాలువలోకి 1,688 క్యూసెక్కులను ఎత్తిపోస్తున్నారు. గత మూడేళ్ల తరహాలోనే ఈ ఏడాదీ సామర్థ్యం కంటే అధికంగా అంటే 40 టీఎంసీల కంటే ఎక్కువగా తరలించి దుర్భిక్ష ప్రాంతాలను సుభిక్షం చేసేలా చర్యలు చేపట్టారు. ఎన్నడూ లేని రీతిలో పెన్నా బేసిన్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో శ్రీసత్యసాయి, అనంతపురం, వైఎస్సార్, అన్నమయ్య జిల్లాల్లో ప్రాజెక్టులకు జలకళ చేకూరింది. కృష్ణా ఉప నదులైన వేదవతి, హంద్రీలు ఉరకలెత్తుతుండటంతో వాటిపై ఉన్న భైరవానితిప్ప ప్రాజెక్టు, గాజులదిన్నె ప్రాజెక్టులు నిండుకుండలను తలపిస్తున్నాయి. తుంగభద్ర డ్యామ్లో పుష్కలంగా నీటి లభ్యత ఉండటంతో ఎగువ ప్రధాన కాలువ(హెచ్చెల్సీ), దిగువ కాలువ(ఎల్లెల్సీ)లకు కోటా జలాలు వస్తాయి. తుంగభద్ర డ్యామ్ దిగువన తుంగభద్రలో నీటి లభ్యత మెరుగ్గా ఉండటంతో కేసీ కెనాల్ ఆయకట్టుకు సమృద్ధిగా నీళ్లందనున్నాయి. గత మూడేళ్ల తరహాలోనే ఈ ఏడాదీ రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లో రికార్డు స్థాయిలో పంటల సాగుకు రైతులు సన్నద్ధమవుతున్నారు. -
ఏపీ పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టులు ఆపండి
సాక్షి, హైదరాబాద్: కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ), కృష్ణా బోర్డు/అపెక్స్ కౌన్సిల్ నుంచి అనుమతులు లేకుండా ఏపీలో నిర్మిస్తున్న పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టులన్నింటినీ నిలుపుదల చేయించాలని కృష్ణా బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. రూ.60 వేల కోట్లతో ఆదాని గ్రీన్ ఎనర్జీ ప్రతిపాదించిన 3700 మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టులకు ఏపీ ప్రభుత్వం అనుమతినిచ్చిందని తెలిపింది. కడప జిల్లాలోని గండికోటలో 1000 మెగావాట్లు, అనంతపురం జిల్లాలోని చిత్రావతిలో 500 మెగావాట్ల ప్రాజెక్టులను నిర్మించడానికి అనుమతిచ్చినట్టుగా పత్రికల్లో వార్తలొచ్చాయని, వీటి నిర్మాణాన్ని తక్షణమే అడ్డుకోవాలని కోరింది. ఈ మేరకు తెలంగాణ నీటిపారుదల శాఖ ఈఎన్సీ సి.మురళీధర్ తాజాగా కృష్ణా బోర్డు చైర్మన్కు లేఖ రాశారు. గతంలోనే వద్దన్నాం.. ఏపీ తమ రాష్ట్రంలోని కరువు ప్రాంతాల అవసరాలకని చెప్పుకుంటూ ..నీటి కొరత ఉన్న కృష్ణా బేసిన్ నుంచి తరలిస్తున్న జలాలను విద్యుదుత్పత్తి/పంప్డ్ స్టోరేజీ పథకాలకు వినియోగించడం సరికాదన్నారు. చిత్రావతి, గోరకల్లు రిజర్వాయర్ల వద్ద ఏపీ నిర్మిస్తున్న పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టులకు గతంలోనే అభ్యంతరం తెలిపామని, అనుమతులొచ్చే వరకు నిలుపుదల చేయాలని బోర్డుకు లేఖ సైతం రాసినట్టు గుర్తుచేశారు. ఈ రెండు పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టులతో పాటు కొత్త ప్రాజెక్టుల నిర్మాణాన్ని కూడా నిలుపుదల చేయాలని కోరారు. కొత్త బ్యారేజీలనూ నిలిపివేయాలి ప్రకాశం బ్యారేజీ దిగువన ఏపీ రెండు కొత్త బ్యారేజీల నిర్మాణానికి కసరత్తు చేస్తోందని, వీటినిర్మాణం కూడా చేపట్టకుండా ఆ రాష్ట్రాన్ని నిలువరించాలని ఈఎన్సీ మురళీధర్ మరో లేఖలో కృష్ణా బోర్డును కోరారు. ఈ బ్యారేజీలకు సంబంధించిన డీపీఆర్లను ఏపీ సిద్ధం చేసినట్టుగా పత్రికల్లో వచ్చిన వార్తల క్లిప్పింగ్లను బోర్డుకు పంపించారు. -
కృష్ణా, గోదావరి గెజిట్లు అమలయ్యేనా?
సాక్షి, అమరావతి: రెండు రాష్ట్రాల మధ్య జలవివాదాలకు చరమగీతం పాడటమే లక్ష్యంగా కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిని నిర్దేశిస్తూ కేంద్ర జల్శక్తి శాఖ జారీచేసిన గెజిట్ నోటిఫికేషన్ల అమలుకు గడువు సమీపిస్తోంది. కానీ.. ఇప్పటికీ షెడ్యూల్–2లో ప్రాజెక్టులను బోర్డులకు అప్పగించడంపై స్పష్టత లేదు. ఈ నేపథ్యంలో గెజిట్ నోటిఫికేషన్ల గడువును కేంద్రం మరోసారి పొడిగిస్తుందా.. లేదంటే అపెక్స్ కౌన్సిల్ నిర్వహించి రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయానికి కృషిచేస్తుందా.. అన్నది ఆసక్తిగా మారింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో కృష్ణా, గోదావరి జలాల వినియోగంలో తెలుగురాష్ట్రాల మధ్య విభేదాలు తలెత్తకుండా చూసేందుకు కృష్ణా, గోదావరి బోర్డులను ఏర్పాటుచేస్తూ 2014 మే 28న కేంద్రం ఉత్తర్వులు జారీచేసింది. కానీ పరిధిని కేంద్రం ఖరారు చేయకపోవడంవల్ల రెండు రాష్ట్రాల మధ్య వివాదాల పరిష్కారంలో బోర్డులు ప్రభావం చూపలేకపోతున్నాయి. 2020 అక్టోబర్ 6న జరిగిన అపెక్స్ కౌన్సిల్ రెండో సమావేశంలో ఇదే అంశాన్ని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రస్తావించారు. తక్షణమే బోర్డుల పరిధిని ఖరారుచేయాలని విజ్ఞప్తిచేశారు. మరోవైపు నీటి కేటాయింపులు జరిగే వరకు బోర్డుల పరిధిని ఖరారు చేయకూడదని తెలంగాణ సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. దీన్ని కేంద్ర జల్శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ తోసిపుచ్చుతూ బోర్డుల పరిధిని ఖరారు చేస్తామని తేల్చిచెప్పారు. తరువాత కేంద్రం ఈ విషయంలో తీవ్ర జాప్యం చేసింది. దీంతో తెలంగాణ సర్కార్ శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టుల్లో యథేచ్ఛగా విద్యుదుత్పత్తి చేస్తూ కృష్ణా జలాలను వృథాగా సముద్రంలో కలిసేలా చేస్తోంది. ఇలా ఏపీ హక్కులను కాలరాస్తుండటాన్ని గతేడాది జూన్లో ప్రధాని మోదీ, కేంద్ర జల్శక్తి శాఖ మంత్రి షెకావత్లకు ముఖ్యమంత్రి జగన్ వివరించారు. ఎట్టికేలకు గెజిట్ నోటిఫికేషన్లు జారీ ఏపీ హక్కులను కాలరాస్తున్న తెలంగాణ సర్కార్ తీరుపై సీఎం జగన్ సుప్రీంకోర్టులో న్యాయపోరాటానికి సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలోనే గతేడాది జూలై 15న రెండు బోర్డుల పరిధిని నిర్దేశిస్తూ కేంద్ర జల్శక్తి శాఖ గెజిట్ నోటిఫికేషన్లు జారీచేసింది. నోటిఫికేషన్ జారీచేసిన రోజు నుంచి ఆరునెలల్లో అంటే 2022 జనవరి 15న అమల్లోకి రావాలి. నోటిఫికేషన్ అమలుపై పలుమార్లు బోర్డులతో రెండు రాష్ట్రాల జలవనరుల శాఖ అధికారులు సమావేశమయ్యారు. ఒకేసారి సీడ్మనీ కింద రూ.200 కోట్లు డిపాజిట్ చేయలేమని, ఎప్పటికప్పుడు నిర్వహణ వ్యయాన్ని అందజేస్తామని రెండు రాష్ట్రాలు చెప్పాయి. గెజిట్ నోటిఫికేషన్ షెడ్యూల్–2లో పేర్కొన్న ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించేందుకు సిద్ధమేనని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. తెలంగాణ ప్రాజెక్టులను స్వాధీనం చేసుకుంటేనే తమ ప్రాజెక్టులను అప్పగిస్తామని తేల్చిచెప్పింది. ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు చేసేవరకు ప్రాజెక్టులను బోర్డులకు అప్పగించే ప్రసక్తే లేదని తెలంగాణ స్పష్టం చేసింది. అలాగే అనుమతిలేని ప్రాజెక్టులకు అనుమతి తీసుకునేందుకు ఏపీ సర్కార్ సీడబ్ల్యూసీకి డీపీఆర్లు సమర్పించింది. కానీ, తెలంగాణ సర్కార్ కొన్ని ప్రాజెక్టులకు మాత్రమే డీపీఆర్లు ఇచ్చింది. ఈ నేపథ్యంలో గెజిట్ నోటిఫికేషన్ల అమలు గడువును ఆరునెలలు పొడగిస్తూ ఫిబ్రవరి 2న కేంద్రం ఉత్తర్వులు జారీచేసింది. దీంతో ఈ నోటిఫికేషన్లు ఈనెల 15 నుంచి అమలు కావాల్సి ఉంది. కుదరని ఏకాభిప్రాయం గెజిట్ నోటిఫికేషన్ల అమలుపై రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం సాధించడానికి కృష్ణా, గోదావరి బోర్డుల చైర్మన్లు ఎం.పి.సింగ్, ఎం.కె.సిన్హా చేస్తున్న ప్రయత్నాలు ఫలించడంలేదు. ప్రాజెక్టుల అప్పగింతపై తెలంగాణ పాతపాటే పాడుతోంది. దీంతో ఈనెల 15 నుంచి కూడా గెజిట్ నోటిఫికేషన్లు అమల్లోకి వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో గెజిట్ నోటిఫికేషన్ల అమలు గడువును కేంద్రం మరోసారి పొడగిస్తుందా? లేదంటే అపెక్స్ కౌన్సిల్ సమావేశం నిర్వహించి రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయ సాధకు కృషిచేస్తుందా? అన్నది తేలాల్సి ఉంది. -
ఆంధ్రప్రదేశ్కు 13.5 టీఎంసీలు
సాక్షి, అమరావతి: నాగార్జునసాగర్లో కనీస నీటి మట్టానికి ఎగువన లభ్యతగా ఉన్న నీటిలో ఏపీకి 13.5 టీఎంసీలను కృష్ణా బోర్డు కేటాయించింది. తెలంగాణకు 13.25 టీఎంసీలు, శ్రీశైలంలో కల్వకుర్తి ఎత్తిపోతలకు 2.4 టీఎంసీలను.. మొత్తం 15.65 టీఎంసీలను కేటాయించింది. త్రిసభ్య కమిటీ సిఫార్సు మేరకు ఈ ఉత్తర్వులు జారీ చేసినట్లు బోర్డు సభ్య కార్యదర్శి డీఎం రాయ్పురే తెలిపారు. రాయ్పురే కన్వీనర్గా ఏపీ, తెలంగాణ ఈఎన్సీలు సి.నారాయణరెడ్డి, మురళీధర్ సభ్యులుగా ఏర్పాటైన త్రిసభ్య కమిటీ గురువారం వర్చువల్ విధానంలో సమావేశమైంది. గతేడాది తమ కోటాలోని 47.719 టీఎంసీలను శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్కు తరలించామని, వాటిని ఈ ఏడాది వాడుకొంటామని తెలంగాణ ఈఎన్సీ కోరారు. దీనిపై ఏపీ ఈఎన్సీ తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఏ నీటి సంవత్సరం లెక్కలు అదే ఏడాదితో ముగుస్తాయని, కోటాలో మిగిలిన నీటిని క్యారీ ఓవర్గానే పరిగణించాలని బచావత్ ట్రిబ్యునల్ స్పష్టం చేసిందని గుర్తు చేశారు. కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) కూడా బచావత్ ట్రిబ్యునల్ తీర్పునే సమర్ధించిందని, క్యారీ ఓవర్ జలాల్లో ఏపీకి 66, తెలంగాణకు 34 శాతం వాటా ఉంటుందని నివేదిక ఇచ్చిందని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో క్యారీ ఓవర్ జలాల్లో సాగర్ కుడి కాలువకు 10, ఎడమ కాలువకు 3.5 టీఎంసీలు కేటాయించాలని ఏపీ ఈఎన్సీ నారాయణరెడ్డి చేసిన ప్రతిపాదనను రాయ్పురే అంగీకరించారు. సాగర్లో తాగునీటి అవసరాలకు 5.75 టీఎంసీలు, ఎడమ కాలువకు 7.5 టీఎంసీలు, శ్రీశైలంలో కల్వకుర్తి ఎత్తిపోతలకు 2.4 టీఎంసీలను విడుదల చేయాలన్న తెలంగాణ ఈఎన్సీ ప్రతిపాదనకు రాయ్పురే అంగీకరించారు. శ్రీశైలంలో జూన్ 1 నుంచి గురువారం వరకు ఏపీ 10.884 టీఎంసీలు, తెలంగాణ 3.504 టీఎంసీలు వాడుకున్నట్లు లెక్క చెప్పారు. జూలై ఆఖరులో మరోసారి కమిటీ సమావేశమై.. అప్పటి నీటి లభ్యత ఆధారంగా కేటాయింపులు చేయాలని నిర్ణయించారు. ఈసారైనా తెలంగాణ అధికారులు వస్తారా? కృష్ణా బోర్డు ఏర్పాటు చేసిన జలాశయాల నిర్వహణ కమిటీ (ఆర్ఎంసీ) మూడో సమావేశం శుక్రవారం హైదరాబాద్లోని కృష్ణా బోర్డు కార్యాలయంలో జరగనుంది. తొలి రెండు సమావేశాలకు తెలంగాణ రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు హాజరుకాలేదు. వారి అభిప్రాయాలను తెలుసుకోవడానికి ఏర్పాటు చేసిన మూడో సమావేశానికైనా వస్తారా.. రారా.. అన్నది చర్చనీయాంశంగా మారింది. మే 6న జరిగిన కృష్ణా బోర్డు సమావేశంలో ఆర్ఎంసీ ఏర్పాటైంది. ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, సాగర్లలో విద్యుదుత్పత్తికి నిబంధనలు, ఆయకట్టుకు నీటి విడుదల (రూల్ కర్వ్) నియమావళి, వరద రోజుల్లో మళ్లించిన నీటిని కోటాలో కలపాలా? వద్దా? అనే అంశాలపై చర్చించి, నివేదిక ఇచ్చేందకు కృష్ణా బోర్డు సభ్యులు ఆర్కే పిళ్లై, ముయాన్తంగ్, ఏపీ, తెలంగాణల ఈఎన్సీలు, జెన్కో డైరెక్టర్లు సభ్యులుగా ఆర్ఎంసీని ఏర్పాటు చేశారు. జలవిద్యుదుత్పత్తి నియమావళి నివేదికను 15 రోజుల్లోగా, మిగతా రెండు అంశాలపై నెలలోగా నివేదిక ఇవ్వాలని నిర్దేశించారు. ఇందుకోసం మే 20న, 30న జరిగిన తొలి రెండు సమావేశాలకు తెలంగాణ అధికారులు రాకపోవడంతో ఆర్ఎంసీ మూడో భేటీని ఏర్పాటు చేసింది. -
జూలై 1న ఆర్ఎంసీ సమావేశం
సాక్షి, హైదరాబాద్: శ్రీశైలం, నాగార్జునసాగర్ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యు దుత్పత్తితో పాటు కృష్ణాలో మిగులు జలాల వినియోగంపై చర్చించడానికి జూలై 1న జలసౌధలో రిజర్వాయర్ మేనేజ్మెంట్ కమిటీ(ఆర్ఎంసీ) సమావేశం జరగనుంది. ఈ మేరకు తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు కృష్ణానదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) తాజాగా లేఖ రాసింది. ఇప్పటికే రెండుసార్లు ఆర్ఎంసీ సమావేశం జరగగా, తెలంగాణ అధికారులు హాజరు కాలేదు. అయినా రిజర్వాయర్ల నిర్వహణకు సంబం ధించిన ముసాయిదా రూల్కర్వ్ (విధివిధానాలు)పై ఈ సమావేశాల్లో కృష్ణాబోర్డు అధికారులు చర్చించారు. 1న జరగనున్న సమావేశంలో రూల్కర్వ్కు తుదిరూపమిచ్చి తదుపరి నిర్వహించే భేటీలో ఆమో దించాలని కృష్ణాబోర్డు యోచిస్తోంది. శ్రీశైలం నుంచి చెన్నైకి తాగునీటిని విడుదల చేసే అంశంపై బోర్డు శుక్ర వారం నిర్ణయం తీసుకోనుంది. -
తెలంగాణకు మరో అవకాశం.. ఈసారి కూడా హాజరు కాకుంటే...!
సాక్షి, అమరావతి: ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, సాగర్లలో జల విద్యుదుత్పత్తికి విధి విధానాలు, నీటి నిల్వ, నీటి విడుదల ప్రక్రియలు (రూల్ కర్వ్), వరద జలాల మళ్లింపుపై అభిప్రాయాలు చెప్పేందుకు తెలంగాణకు కృష్ణా బోర్డు మరో అవకాశం ఇచ్చింది. వాటిపై రెండు రాష్ట్రాలతో సంప్రదింపులు జరిపేందుకు ఏర్పాటు చేసిన రిజర్వాయర్స్ మేనేజ్మెంట్ కమిటీ (ఆర్ఎంసీ) మూడో సమావేశాన్ని ఈనెల 16న ఏర్పాటు చేసింది. గత నెలలో జరిగిన రెండు ఆర్ఎంసీ సమావేశాలకు తెలంగాణ హాజరుకాలేదు. దీంతో తెలంగాణకు మరో అవకాశమివ్వాలని బోర్డు నిర్ణయించింది. 16న జరిగే మూడో సమావేశానికి కూడా తెలంగాణ అధికారులు గైర్హాజరైతే బోర్డు ఈ విషయాన్ని కేంద్ర జల్ శక్తి శాఖ దృష్టికి తీసుకెళ్లనుంది. కేంద్ర జల్ శక్తి శాఖ ఆదేశాల మేరకు బచావత్ ట్రిబ్యునల్, సీడబ్ల్యూసీ రూల్ కర్వ్ ముసాయిదా ఆధారంగా తుది నిర్ణయం తీసుకుంటామని బోర్డు వర్గాలు వెల్లడించాయి. కృష్ణా జలాల వినియోగంలో రెండు రాష్ట్రాల మధ్య వివాదాలకు ఉమ్మడి ప్రాజెక్టుల్లో విద్యుదుత్పత్తి, నీటి నిల్వ, విడుదల ప్రక్రియ, వరద రోజుల్లో మళ్లించిన నీటిని కోటా కింద లెక్కించాలా? వద్దా? అన్నవే కారణమవుతున్నాయని బోర్డు గుర్తించింది. ఈ సమస్యల పరిష్కారానికి నివేదిక ఇచ్చే బాధ్యతను ఆర్ఎంసీకి అప్పగించింది. గత నెల 20న మొదటి సారి, 30న రెండో సారి ఆర్ఎంసీ భేటీ అయ్యింది. ఈ రెండు సమావేశాలకు ఏపీ అధికారులు హాజరయ్యారు. తెలంగాణ తరఫున అధికారులెవరూ రాలేదు. దీంతో మరోసారి అవకాశమివ్వనున్నారు. మూడో భేటీలో తెలంగాణ అధికారులు హాజరై అభిప్రాయాలు చెబితే ఇరు రాష్ట్రాల వాదనల ఆధారంగా ఆర్ఎంసీ నివేదిక ఇస్తుంది. వాటిని బోర్డు అమలు చేస్తుంది. తెలంగాణ అధికారులు గైర్హాజరైతే కేంద్ర జల్ శక్తి శాఖ మార్గదర్శకాల మేరకు నిర్ణయం తీసుకోవాలని బోర్డు నిర్ణయించింది. స్పష్టమైన అభిప్రాయాలు చెప్పిన ఏపీ శ్రీశైలంలో కనీస నీటి మట్టం 854 అడుగుల్లో ఏడాది పొడవునా నీటి నిల్వ ఉండేలా చూడాలని ఏపీ తరపున ఆర్ఎంసీ భేటీలకు హాజరైన ఈఎన్సీ సి.నారాయణరెడ్డి, ఇతర అధికారులు స్పష్టంగా చెప్పారు. సాగర్, శ్రీశైలంలో తాగు, సాగునీటికే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. సాగుకు నీరు విడుదల చేసినప్పడే విద్యుదుత్పత్తి చేయాలన్నారు. బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపుల మేరకే ఆయకట్టుకు నీటిని విడుదల చేయాలని స్పష్టంచేశారు. కృష్ణాకు వరద వచ్చే రోజుల్లో సముద్రంలో జలాలు కలుస్తున్నప్పుడు వరద జలాలను ఏ రాష్ట్రం మళ్లించినా వాటిని నికర జలాల కోటాలో కలపకూడదని చెప్పారు. ఏపీ వాదనతో ఆర్ఎంసీ ఏకీభవించింది. -
ఆ నాలుగూ అనుమతి ఉన్నవే
సాక్షి, అమరావతి: తెలుగుగంగ, హంద్రీ–నీవా, గాలేరు–నగరి, వెలిగొండ ప్రాజెక్టులకు అన్నీ అనుమతులు ఉన్నాయని కృష్ణా బోర్డుకు తేల్చి చెప్పేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. విభజన చట్టం 11వ షెడ్యూలు సెక్షన్–85(7)(ఈ)లో ఆ నాలుగు ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు వాటిని అనుమతి లేని ప్రాజెక్టులుగా వర్గీకరిస్తే విభజన చట్టాన్ని ఉల్లంఘించినట్లేనని కృష్ణా బోర్డుకు స్పష్టం చేయాలని నిర్ణయించింది. అనుమతి ఉన్న ఆ నాలుగు ప్రాజెక్టుల డీపీఆర్లు ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేయనుంది. కృష్ణా జలాలను వినియోగించుకునేందుకు ఉమ్మడి రాష్ట్రంలో తెలుగుగంగ, గాలేరు–నగరి, హంద్రీ–నీవా, వెలిగొండ, కల్వకుర్తి, నెట్టెంపాడు ప్రాజెక్టులను ప్రభుత్వం చేపట్టింది. రాష్ట్ర విభజన జరిగే నాటికి ఆ ఆరు ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి. నిర్మాణంలో ఉన్న వీటిని పూర్తి చేసేందుకు విభజన చట్టం ద్వారా కేంద్రం అనుమతించింది. వాటికి ఉమ్మడి రాష్ట్రంలో చేసిన నీటి కేటాయింపులు కొనసాగుతాయని స్పష్టం చేసింది. గెజిట్ నోటిఫికేషన్లోనే తప్పిదం.. ఏదైనా అనుమతించిన ప్రాజెక్టు డిజైన్లో మార్పు చేసినా, నీటిని తరలించే సామర్థ్యాన్ని పెంచినా మళ్లీ అనుమతి తీసుకోవాలన్నది కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) నిబంధన. విభజన తర్వాత వెలిగొండ, తెలుగుగంగ, హంద్రీ–నీవా, గాలేరు–నగరి ప్రాజెక్టుల డిజైన్లను గానీ సామర్థ్యాన్ని గానీ రాష్ట్ర ప్రభుత్వం పెంచలేదు. అంటే ఈ నాలుగు ప్రాజెక్టులకు మళ్లీ కొత్తగా అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టమవుతోంది. మరోవైపు కల్వకుర్తి (25 నుంచి 40 టీఎంసీలకు), నెట్టెంపాడు ఎత్తిపోతల పథకాల డిజైన్లను మార్చడంతోపాటు సామర్థ్యాన్ని కూడా తెలంగాణ సర్కార్ పెంచింది. అయితే కేంద్ర జల్ శక్తి శాఖ మాత్రం కల్వకుర్తి, నెట్టెంపాడుతో పాటు వెలిగొండ, తెలుగుగంగ, హంద్రీ–నీవా, గాలేరు–నగరి ప్రాజెక్టులను గతేడాది జూలై 15న కృష్ణా బోర్డు పరిధిని నిర్దేశిస్తూ జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్లో అనుమతి లేని ప్రాజెక్టులుగా గుర్తించింది. వాటికి ఏడాదిలోగా అనుమతి పొందాలని, లేదంటే నీటి వినియోగానికి అనుమతించబోమని స్పష్టం చేసింది. డిజైన్లు మార్చకున్నా, సామర్థ్యం పెంచకున్నా వెలిగొండ, హంద్రీ–నీవా, గాలేరు–నగరి, తెలుగుగంగ ప్రాజెక్టులను అనుమతి లేనివిగా పేర్కొనడంపై రాష్ట్ర ప్రభుత్వం అప్పట్లోనే అభ్యంతరం వ్యక్తం చేసింది. చట్టాన్ని ఉల్లంఘించినట్లే.. కేంద్ర జల్శక్తి శాఖ విధించిన గడువు సమీపిస్తుండటంతో అనుమతి లేని ప్రాజెక్టుల డీపీఆర్లు సమర్పించాలని కృష్ణా బోర్డు రెండు రాష్ట్రాలపై ఒత్తిడి పెంచుతోంది. వెలిగొండ, గాలేరు–నగరి, హంద్రీ–నీవా, తెలుగుగంగలకు అనుమతి తీసుకోవాలని చెబుతోంది. ఇదే అంశాన్ని ఈఎన్సీ సి.నారాయణరెడ్డి దృష్టికి తీసుకెళ్లగా.. నాలుగు ప్రాజెక్టులను అనుమతి ఉన్న వాటిగా విభజన చట్టం గుర్తించిందన్నారు. ఇప్పుడు వాటికి మళ్లీ అనుమతి తీసుకోవాలని కోరడం విభజన చట్టాన్ని ఉల్లంఘించినట్లే అవుతుందన్నారు. ఇదే అంశాన్ని బోర్డుకు, జల్శక్తి శాఖకు స్పష్టం చేస్తామని తెలిపారు. -
కర్నూలు జిల్లాలో కడుతున్న పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టును నిలిపేయండి
సాక్షి, హైదరాబాద్: కర్నూలు జిల్లా పాణ్యం మండలం పిన్నాపూరంలో ఇంటిగ్రేటెడ్ రెన్యువబుల్ ఎనర్జీ ప్రాజెక్టు (ఐఆర్ఈపీ) నిర్మాణానికి ఏపీ ప్రభుత్వం అనుమతి ఇవ్వడంపై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. కృష్ణా జలాల ఆధారంగా పంప్డ్ స్టోరేజీ కాన్సెప్్టతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టుకు అనుమతిస్తూ జారీ చేసిన జీవో రాష్ట్ర పునరి్వభజన చట్టంలోని సెక్షన్ 84, 85లకు విరుద్ధమని స్పష్టం చేసింది. అపెక్స్ కౌన్సిల్ నుంచి అనుమతులు పొందాకే ఇలాంటి ప్రాజెక్టులు చేపట్టాల్సి ఉంటుందని పేర్కొంది. కేఆర్ఎంబీ/అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేకుండా చేపట్టిన అన్ని కొత్త ప్రాజెక్టులు, పాత ప్రాజెక్టులు, కాల్వల విస్తరణ పనులను తక్షణమే నిలుపుదల చేయించాలంటూ కృష్ణా బోర్డు చైర్మన్కు తెలంగాణ నీటిపారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్ ఇటీవల లేఖ రాశారు. నీటి కొరత ఉన్న కృష్ణా బేసిన్ నుంచి నీళ్లను వెలుపల ప్రాంతానికి తరలించి జల విద్యుదుత్పత్తికి వినియోగించడం తీవ్ర అభ్యంతకరమని లేఖలో పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు టెండర్లు, నిర్మాణ పనులను నిలుపుదల చేయించాలని కోరుతూ గతంలో రెండుసార్లు లేఖ రాశామని గుర్తు చేశారు. ఈ నెల 17న ఈ ప్రాజెక్టు నిర్మాణానికి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేశారని ప్రస్తావించారు. గతంలో పలు పర్యాయాలు ఫిర్యాదు చేసినా కృష్ణా బోర్డు చర్యలు తీసుకోలేదని, ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని కోరారు. గాలేరు–నగరికి అనుమతి ఉంది: ఏపీ అధికారులు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి హంద్రీ నీవా సుజల స్రవంతి (హెచ్ఎన్ఎస్ఎస్) కాల్వ ద్వారా గోరకల్లు రిజర్వాయర్కు వచ్చే నీళ్లను మిగులు విద్యుత్ ఉండే సమయాల్లో మరో రిజర్వాయర్లోకి ఎత్తిపోస్తారు. ఇందుకోసం కొత్త రిజర్వాయర్ను ఈ ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్నారు. విద్యుత్ కొరత ఉండే వేళల్లో ఈ కొత్త జలాశయం నుంచి నీళ్లను జలవిద్యుదుత్పత్తి ద్వారా దిగువన ఉండే గోరకల్లు రిజర్వాయర్కు మళ్లీ విడుదల చేస్తారు. కొత్త రిజర్వాయర్పై జలవిద్యుత్ కేంద్రం సైతం నిర్మిస్తున్నారు. పంప్డ్ స్టోరేజీ పద్ధతిలో విద్యుత్ను నిల్వ చేయాలన్న లక్ష్యంతో ఈ వినూత్న ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టారు. వరద జలాల ఆధారంగా హంద్రీ నీవా సు జల స్రవంతి ప్రాజెక్టు నిర్మాణానికి అనుమతులున్న నేపథ్యం లో ఈ పంప్డ్ స్టోరేజీ హైడ్రో ఎలక్రి్టక్ ప్రాజెక్టుపై అభ్యంతరాలకు తావు లేదని ఏపీ ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు. -
శ్రీశైలంలో 854 అడుగుల్లో నీరు నిల్వ ఉండాలి
సాక్షి, అమరావతి: శ్రీశైలం ప్రాజెక్టులో కనీస నీట్టిమట్టం 854 అడుగుల స్థాయిలో నీరు నిల్వ ఉండేలా చర్యలు తీసుకోవాలని కృష్ణా బోర్డు ఆర్ఎంసీ (రిజర్వాయర్ మేనేజ్మెంట్ కమిటీ)కి ఏపీ ఈఎన్సీ సి. నారాయణరెడ్డి కోరారు. కనీస నీటిమట్టానికంటే దిగువ నుంచి నీటిని దిగువకు తరలించకుండా చర్యలు తీసుకోవాలన్నారు. హైదరాబాద్ జలసౌధలోని కృష్ణా బోర్డు కార్యాలయంలో సోమవారం ఆర్ఎంసీ భేటీ జరిగింది. కన్వీనర్ ఆర్కే పిళ్లై, బోర్డు సభ్యులు ఎల్బీ ముయన్తంగ్, ఏపీ ఈఎన్సీ సి.నారాయణరెడ్డి, ఏపీ జెన్కో డైరెక్టర్ ఎమ్వీవీ సత్యనారాయణ పాల్గొన్నారు. తెలంగాణ తరఫున ఆ రాష్ట్ర ఈఎన్సీ, జెన్కో డైరెక్టర్ వరుసగా రెండో సమావేశానికీ గైర్హాజరయ్యారు. దాంతో శ్రీశైలం, నాగార్జునసాగర్ నిర్వహణ నియమావళిపై ఏపీ ప్రభుత్వ అభిప్రాయాలను నారాయణరెడ్డి కమిటీకి వివరించారు. శ్రీశైలం ప్రాజెక్టు కనీస నీటి మట్టం 854 అడుగులని.. అంతకంటే దిగువ స్థాయి నుంచి నీటిని దిగువకు తరలించకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అప్పుడే ఆంధ్రప్రదేశ్ హక్కులను పరిరక్షించవచ్చునని తేల్చిచెప్పారు. సీడబ్ల్యూసీ ఆమోదించిన మేరకు.. కృష్ణాడెల్టా ఆధునికీకరణ పనులకు సాంకేతిక అనుమతిచ్చిన సమయంలో కేంద్ర జలసంఘం ఆమోదించిన ప్రకారం కృష్ణా డెల్టాకు, సాగర్ ఎడమ, కుడి కాలువలకు నీటిని విడుదల చేయాలని ఆర్ఎంసీని ఈఎన్సీ నారాయణరెడ్డి కోరారు. అదే రీతిలో శ్రీశైలం ప్రాజెక్టు నుంచి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా గాలేరు–నగరి, తెలుగుగంగ, ఎస్సార్బీసీలకు హంద్రీ–నీవా, వెలిగొండ ప్రాజెక్టులకు నీటిని విడుదల చేయాలన్నారు. కృష్ణా నదికి వరద వచ్చే రోజుల్లో.. జూరాల, శ్రీశైలం, సాగర్, పులిచింతల గేట్లు ఎత్తేసి.. ప్రకాశం బ్యారేజీ నుంచి నీరు సముద్రంలో కలుస్తున్నప్పుడు.. రెండు రాష్ట్రాల్లో ఏ రాష్ట్రం వరద జలాలను మళ్లించినా.. వాటిని నికర జలాల్లో (కోటా) కలపకూడదని పునరుద్ఘాటించారు. ఆ అధికారం ట్రిబ్యునల్దే.. పోలవరం కుడి కాలువ ద్వారా కృష్ణా డెల్టాకు మళ్లించే గోదావరి జలాలకుగానూ.. కృష్ణా జలాల్లో సాగర్కు ఎగువన 45 టీఎంసీలను అదనంగా వాడుకునే అవకాశాన్ని గోదావరి ట్రిబ్యునల్ కల్పించిందని ఆర్ఎంసీ కన్వీనర్ ఆర్కే పిళ్లై గుర్తుచేశారు. వాటిని రెండు రాష్ట్రాలకు పంపిణీ చేస్తామంటూ ఆయన చేసిన ప్రతిపాదనపై నారాయణరెడ్డి అభ్యంతరం వ్యక్తంచేశారు. ఆ అంశం బ్రిజేష్కుమార్ ట్రిబ్యునల్ పరిధిలో ఉందని.. దానిపై నిర్ణయాధికారం ట్రిబ్యునల్దేనన్నారు. ఏపీ ప్రభుత్వ అభిప్రాయాలను విన్నాక పిళ్లై స్పందిస్తూ.. 6న మూడో సమావేశాన్ని ఏర్పాటుచేస్తామన్నారు. దానికి తెలంగాణ అధికారులు గైర్హాజరైతే.. బోర్డు చైర్మన్ ఎంపీ సింగ్ దృష్టికి తీసుకెళ్లి.. తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. -
రూల్ కర్వ్ ఓకే అయితే.. శ్రీశైలం, సాగర్ అప్పగిస్తాం!
సాక్షి, హైదరాబాద్: శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల నిర్వహణకు సంబంధించిన రూల్ కర్వ్లపై అంగీకారానికి వచ్చాక.. రెండు జలాశయాలను కృష్ణా బోర్డు (కేఆర్ఎంబీ)కు అప్పగిస్తామని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. జలాశయాల అప్పగింత పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి అభ్యంతరం లేదని.. రూల్వ్ కర్వ్లకు తుది రూపునిచ్చే ప్రక్రియను వేగిరం చేయాలని కోరింది. ఈ నెల 6న జరిగిన కృష్ణాబోర్డు 16వ సమావేశంలో తెలంగాణ నీటిపారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్ ఈ మేరకు హామీ ఇచ్చారు. ఆ సమావేశానికి సంబంధించి ఇరు రాష్ట్రాల వాదనలు, అభిప్రాయాల మినిట్స్ను కృష్ణా బోర్డు తాజాగా ఈ మేరకు రెండు రాష్ట్రాలకు పంపింది. ట్రిబ్యునల్ తీర్పునకు అనుగుణంగా.. ఆ మినిట్స్ ప్రకారం.. రూల్వ్ కర్వ్ ఖరారైన తర్వాత ప్రాజెక్టుల అప్పగింతకు అవసరమైన ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేస్తుందని తెలంగాణ నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్కుమార్ సైతం కృష్ణాబోర్డుకు హామీ ఇచ్చారు. కృష్ణా ట్రిబ్యునల్–1 తీర్పునకు అనుగుణంగా రూల్ కర్వ్ ఉండాలనే రాష్ట్ర ప్రభుత్వం సవరణలను కోరిందని గుర్తు చేశారు. ప్రాజెక్టుల అప్పగింతలో అనుసరించాల్సిన రోడ్ మ్యాప్ తయారీపై సబ్ కమిటీకి పూర్తి సహకారం అందిస్తామని తెలంగాణ జెన్కో డైరెక్టర్ (హైడల్) వెంకటరాజం కృష్ణాబోర్డుకు హామీ ఇచ్చారు. మరోవైపు రూల్వ్ కర్వ్లతో ప్రాజెక్టుల అప్పగింతకు ఎలాంటి సంబంధం లేదని ఏపీ నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శి, ఈఎన్సీ అభ్యంతరం తెలిపారు. ప్రాజెక్టుల అప్పగింతను తెలంగాణ వేగిరం చేయాలని ఈ సందర్భంగా బోర్డు చైర్మన్ ఆదేశించారు. ఆధునీకరణ తర్వాత తుమ్మిళ్లను వాడం ఆర్డీఎస్ ఆనకట్ట ఆధునీకరణ పూర్తయిన తర్వాత తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకాన్ని వినియోగించబోమని రజత్కుమార్ కృష్ణా బోర్డుకు హామీ ఇచ్చారు. తుంగభద్ర రిజర్వాయర్ నుంచి 15.9 టీఎంసీల కోటా నీరు ఆర్డీఎస్ ఎడమ కాల్వకు రాకపోవడంతోనే తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకాన్ని చేపట్టాల్సి వచ్చిందని వివరించారు. ఆర్డీఎస్ ఆధునీకరణ తర్వాత గ్రావిటీ ద్వారా నీళ్లు వస్తాయని, తుమ్మిళ్ల ఎత్తిపోతల అవసరం ఉండదని, భారీ విద్యుత్ బిల్లులు సైతం మిగులుతాయని పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వం చేపట్టిన ఆర్డీఎస్ కుడి ప్రధాన కాల్వ నిర్మాణానికి సంబంధించిన పేరాను ఆర్డీఎస్ ఆనకట్ట ఆధునీకరణ రోడ్మ్యాప్ నుంచి తొలగించాలని ఏపీ చేసిన విజ్ఞప్తి పట్ల సమ్మతి తెలిపారు. ఇక కృష్ణా ట్రిబ్యునల్–2 తీర్పు అమల్లోకి వచ్చేవరకు మల్లమ్మకుంట రిజర్వాయర్ నిర్మాణాన్ని నిలిపేసేందుకు తెలంగాణ అంగీకరించినట్టు సమావేశం మినిట్స్లో కృష్ణాబోర్డు పేర్కొంది. ఏమిటీ రూల్ కర్వ్? జలాశయాలకు సంవత్సరం పొడవునా ఎప్పుడెప్పుడు, ఏయే పరిమాణాల్లో నీళ్లు వస్తే.. అందులో నుంచి ఎప్పుడెప్పుడు, ఎంతెంత నీటిని తీసుకోవచ్చనే నిబంధనలను రూల్ కరŠవ్స్ అంటారు. జలాశయం గేట్లను ఎప్పుడెప్పుడు ఎత్తాలి?, ఏయే నెలల్లో ఎంతెంత కనీస నీటి మట్టాన్ని ఉంచాలన్న అంశాలను కూడా అందులో పేర్కొంటారు. శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులకు సంబంధించి.. తెలంగాణ, ఏపీలకు ఎంతెంత నీటిని కేటాయించాలన్న దానిపై గతంలో సీడబ్ల్యూసీ రూల్ కరŠవ్స్ను రూపొందించింది. అందులో పలు అంశాలను సవరించి తుది నిబంధనలను ఖరారు చేయాలని తెలంగాణ కోరింది. -
కృష్ణా జల వివాదాలకు ముగింపు!
సాక్షి, అమరావతి: తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదాలకు ముగింపు పలికేందుకు కృష్ణా బోర్డు సిద్ధమైంది. ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్లలో విద్యుదుత్పత్తిని నియంత్రణ, నిర్వహణ నియమావళి ద్వారా ప్రాజెక్టులకు నీటిని విడుదల చేస్తే జల వివాదాలకు తావే ఉండదని కృష్ణా బోర్డు భావిస్తోంది. మళ్లించే వరద జలాలను లెక్కలోకి తీసుకోవాలా? వద్దా? అనే అంశాలపై సమగ్రంగా అధ్యయనం చేసి, తుది నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించింది. ఈ అంశాలపై సమగ్రంగా అధ్యయనం చేసేందుకు బోర్డు సభ్యులు ఆర్కే పిళ్లై కన్వీనర్గా, ఎల్బీ ముయన్తంగ్, రెండు రాష్ట్రాల ఈఎన్సీలు, జెన్కోల సీఈలు సభ్యులుగా రిజర్వాయర్ మేనేజ్మెంట్ కమిటీ (ఆర్ఎంసీ)ని నియమించింది. ఈ కమిటీ ఈనెల 20న హైదరాబాద్లోని కృష్ణా బోర్డు కార్యాలయంలో సమావేశమవుతోంది. బచావత్ ట్రిబ్యునలే ప్రామాణికంగా బచావత్ ట్రిబ్యునల్ ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు చేసింది. వాటిని ప్రామాణికంగా తీసుకున్న కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) శ్రీశైలం, నాగార్జునసాగర్ల నుంచి ఏ ప్రాజెక్టుకు ఎప్పుడు నీటిని విడుదల చేయాలో విధి విధానాల ముసాయిదా (రూల్ కర్వ్ డ్రాఫ్ట్)ను రూపొందించింది. దీనిపై అధ్యయనం చేసి మార్పులు ఉంటే చేసి, నెలలోగా నివేదిక ఇవ్వాలని ఆర్ఎంసీని బోర్డు ఆదేశించింది. దిగువ రాష్ట్రమైన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు వరద జలాలను వాడుకునే స్వేచ్ఛను బచావత్ ట్రిబ్యునల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో కృష్ణాకు వరద వచ్చే రోజుల్లో జూరాల, శ్రీశైలం, సాగర్, పులిచింతల గేట్లు ఎత్తేసి.. ప్రకాశం బ్యారేజీ ద్వారా సముద్రంలోకి జలాలు కలుస్తున్నప్పుడు.. రెండు రాష్ట్రాలు మళ్లించే వరద జలాలను కోటా కింద లెక్కించాలా? వద్దా? అనే అంశంపైన కూడా అధ్యయనం చేసి, నెలలోగా నివేదిక ఇవ్వాలని ఆర్ఎంసీని ఆదేశించింది. ఆర్ఎంసీ నివేదికను బోర్డులో చర్చించి.. అమలు చేయడం ద్వారా జల వివాదాలకు చరమగీతం పాడాలని నిర్ణయించింది. విద్యుదుత్పత్తి నియంత్రణే కీలకం గతేడాది శ్రీశైలం ప్రాజెక్టులో నీటి మట్టం డెడ్ స్టోరేజీ స్థాయిలో ఉన్నా, ఎగువ నుంచి వరద రాకున్నా.. బోర్డు అనుమతి తీసుకోకుండానే తెలంగాణ ప్రభుత్వం విద్యుదుత్పత్తి చేసింది. ఏపీ ప్రభుత్వం అభ్యంతరం తెలిపినా తెలంగాణ యథేచ్ఛగా విద్యుదుత్పత్తి కొనసాగించింది. విద్యుదుత్పత్తి చేయొద్దని బోర్డు జారీ చేసిన ఆదేశాలనూ తుంగలో తొక్కింది. ఇష్టారాజ్యంగా శ్రీశైలం, సాగర్, పులిచింతల్లో తెలంగాణ విద్యుదుత్పత్తి చేయడం వల్ల ప్రకాశం బ్యారేజీ ద్వారా వందలాది టీఎంసీలు సముద్రం పాలయ్యాయి. దీనిపై కేంద్రానికి ఏపీ ప్రభుత్వం ఫిర్యాదు చేసింది. తెలంగాణ తీరుపై సుప్రీంకోర్టులో న్యాయపోరాటం చేసింది. 2022–23 నీటి సంవత్సరంలో కూడా ఈ పరిస్థితి పునరావృతం కాకుండా బోర్డు చర్యలు చేపట్టింది. ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, సాగర్లలో విద్యుదుత్పత్తికి 15 రోజుల్లోగా నియమావళిని రూపొందించాలని ఆర్ఎంసీని కృష్ణా బోర్డు ఛైర్మన్ ఎంపీ సింగ్ ఆదేశించారు. -
మళ్లించిన వరద నీటినీ కోటాలో కలిపేస్తారా?
సాక్షి, అమరావతి: విజయవాడ ప్రకాశం బ్యారేజీ నుంచి కృష్ణా జలాలు వృథాగా సముద్రంలో కలుస్తున్న సమయంలో మళ్లించిన వరద జలాలనూ రాష్ట్ర కోటా (నికర జలాలు)లో కృష్ణా బోర్డు కలపడంపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది. కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) సాంకేతిక కమిటీ కూడా వరద నీటిని ఏ రాష్ట్రం మళ్లించినా.. వాటిని ఆ రాష్ట్ర కోటాలో కలపకూడదని స్పష్టంచేసిన విషయాన్ని గుర్తుచేసింది. వరద జలాలను వినియోగించుకునే స్వేచ్ఛను దిగువ రాష్ట్రమైన ఏపీకి బచావత్ ట్రిబ్యునల్ ఇచ్చిందని, ఈ నేపథ్యంలో.. మళ్లించిన వరద నీటిని రాష్ట్ర కోటాలో కలపడమంటే బచావత్ ట్రిబ్యునల్ అవార్డును ఉల్లంఘించడమేనని స్పష్టంచేసింది. ఈ మేరకు కృష్ణా బోర్డు చైర్మన్ ఎంపీ సింగ్కు రాష్ట్ర జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్కుమార్ లేఖ రాశారు. విభజన చట్టంలోని 11వ షెడ్యూలు, ఆరో పేరా ప్రకారం.. కృష్ణా, గోదావరి వరదలను నియంత్రించడం, విపత్తు నివారణ చర్యలు చేపట్టడం రెండు రాష్ట్రాలపై ఉందని లేఖలో గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో.. కృష్ణా నదికి వరద వచ్చే రోజుల్లో జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల గేట్లు ఎత్తేసి.. ప్రకాశం బ్యారేజీ ద్వారా కడలిలో వరద జలాలు కలుస్తున్న సమయంలో రెండు రాష్ట్రాల్లో ఎవరు వరద నీటిని మళ్లించినా.. దాన్ని విపత్తు నివారణ చర్య కింద పరిగణించాలేగానీ కోటా కింద లెక్కించకూడదని పునరుద్ఘాటించారు. దుర్భిక్ష ప్రాంతాలకు వరద జలాల మళ్లింపు నిజానికి.. వరద జలాలను పూర్తిస్థాయిలో వినియోగించుకునే స్వేచ్ఛను కృష్ణా బేసిన్లో దిగువ రాష్ట్రమైన ఉమ్మడి ఏపీకి బచావత్ ట్రిబ్యునల్ ఇచ్చింది. అలాగే, విభజన నేపథ్యంలో దిగువ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) నిర్ధారించింది. దీంతో.. బచావత్ ట్రిబ్యునల్ తీర్పే ఇప్పటికీ అమల్లో ఉన్నందున వరద జలాలను వినియోగించుకునే స్వేచ్ఛ ఆంధ్రప్రదేశ్కు ఉంటుందని సాగునీటిరంగ నిపుణులు గుర్తుచేస్తున్నారు. ఈ ఉద్దేశ్యంతోనే 2019లో జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల నిండిపోవడంతో కృష్ణా జలాలు ప్రకాశం బ్యారేజీ ద్వారా సముద్రంలోకి కలిసే సమయంలో శ్రీశైలం ప్రాజెక్టు నుంచి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ (పీహెచ్ఆర్) ద్వారా ఏపీ సర్కార్ వరద నీటిని దుర్భిక్ష రాయలసీమ, నెల్లూరు జిల్లాలకు మళ్లించింది. కోటా కింద లెక్కించొద్దు : సీడబ్ల్యూసీ కమిటీ వరద జలాలు వృథాగా కడలిలో కలుస్తున్న సమయంలో రెండు రాష్ట్రాల్లో ఏ రాష్ట్రం మళ్లించినా వాటిని కోటా కింద పరిగణించకూడదని ఏపీ ప్రభుత్వం కృష్ణా బోర్డును గతంలోనే కోరింది. దీన్ని తెలంగాణ సర్కార్ వ్యతిరేకించింది. ఈ వ్యవహారంపై అధ్యయనం చేసి 2020, జూన్లోగా నివేదిక ఇవ్వాలని సీడబ్ల్యూసీని 2019లో కృష్ణా బోర్డు కోరింది. దాంతో ఈ అంశంపై అధ్యయనం చేయడానికి 2020, మార్చి 3న సీడబ్ల్యూసీ సాంకేతిక కమిటీ ఏర్పాటుచేసింది. 2020 మేలో రెండు రాష్ట్రాల జలవనరుల శాఖ అధికారులతో ఒకసారి మాత్రమే సీడబ్ల్యూసీ సమావేశాన్ని నిర్వహించింది. ఆ కమిటీ అడిగిన వివరాలన్నీ ఏపీ ఇచ్చినప్పటికీ తెలంగాణ మాత్రం ఇవ్వలేదు. దీంతో.. మళ్లించిన వరద నీటిని కోటా కింద పరిగణించాలా? వద్దా? అని 2020, అక్టోబర్ 7న కృష్ణా బోర్డు కోరింది. దీనిపై సాంకేతిక కమిటీ 2020, అక్టోబర్ 20న స్పందిస్తూ.. మళ్లించిన వరద నీటిని కోటా కింద పరిగణించకూడదని స్పష్టంచేసింది. బచావత్ ట్రిబ్యునల్ తీర్పును ఉల్లంఘించినట్లే.. ఇక ప్రకాశం బ్యారేజీ నుంచి 2019–20లో 798.29 టీఎంసీలు, 2020–21లో 1,289, 2021–22లో 501.36 టీఎంసీలు వృథాగా సముద్రంలో కలిశాయి. మూడేళ్లలోనూ సగటున 72 రోజులపాటు వరద ప్రవాహం సముద్రంలో కలిసింది. సీడబ్ల్యూసీ సాంకేతిక కమిటీ నివేదిక వచ్చేవరకూ ఏపీ మళ్లించిన వరద జలాల్లో 50 శాతాన్ని కోటా కింద పరిగణించాలని తెలంగాణ ప్రతిపాదనను కృష్ణా బోర్డు అంగీకరించింది. దీనిపై ఏపీ సర్కార్ అభ్యంతరం వ్యక్తంచేసినా.. వాటిని తోసిపుచ్చింది. 2020–21లో 22 టీఎంసీల వరద జలాలను మళ్లిస్తే 11, 2021–22లో 40 టీఎంసీల వరద జలాలను మళ్లిస్తే 20 టీఎంసీలను ఏపీ కోటాలో బోర్డు కలిపింది. ఇక 2021–22లో కృష్ణాలో 953 టీఎంసీల లభ్యత ఉంటే ఇందులో 66 శాతం అంటే 629 టీఎంసీలు ఏపీకి, 34 శాతం అంటే 324 టీఎంసీలు తెలంగాణకు రావాలి. ఏపీ వాడుకున్న వరద జలాల్లో 20 టీఎంసీలను నికర జలాల కోటాలో కలిపింది. లేదంటే.. ఏపీకి అదనంగా 20 టీఎంసీల జలాలు వచ్చేవే. ఇది బచావత్ ట్రిబ్యునల్ తీర్పును ఉల్లంఘించడమేనని సాగునీటిరంగ నిపుణులు చెబుతున్నారు. -
కృష్ణా జలాలపై తెలంగాణ తొండాట
సాక్షి, అమరావతి: కృష్ణా జలాల్లో వాటాపై తెలంగాణ నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు వ్యవహరిస్తున్న తీరుపై నీటిపారుదలరంగ నిపుణులు విస్మయం వ్యక్తంచేస్తున్నారు. శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా ఆంధ్రప్రదేశ్ 34 టీఎంసీల (ఎస్సార్బీసీకి 19, చెన్నై తాగునీటికి 15)ను మాత్రమే వాడుకుంటేనే.. ఉమ్మడి ప్రాజెక్టుల్లో 66 : 34 నిష్పత్తిలో ఏపీ, తెలంగాణలకు నీటిని పంపిణీ చేయాలని సోమవారం కృష్ణాబోర్డు చైర్మన్ ఎంపీ సింగ్కు తెలంగాణ నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్కుమార్ లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీశైలం నుంచి 34 టీఎంసీల కంటే అధికంగా వాడుకుంటే.. కృష్ణాజలాల్లో ఏపీ, తెలంగాణలకు చెరిసగం పంపిణీ చేయాలని.. ఇదే అంశాన్ని గత సమావేశంలో ప్రస్తావించినా వాటిని మినిట్స్లో పేర్కొనలేదని లేఖలో పేర్కొన్నారు. ఈనెల 6న జరిగే సమావేశంలో ఈ అంశంపై చర్చించాలని కోరడంపై నిపుణులు నివ్వెరపోతున్నారు. ‘బచావత్’ కేటాయింపులే ఆధారం బచావత్ ట్రిబ్యునల్ ప్రాజెక్టుల వారీగా ఉమ్మడి రాష్ట్రానికి చేసిన 811 టీఎంసీల కేటాయింపుల ఆధారంగా.. ఏపీకి 512.04, తెలంగాణకు 298.96 టీఎంసీలను పంపిణీ చేస్తూ 2015, జూన్ 19న కేంద్రం తాత్కాలిక ఒప్పందం కుదుర్చింది. దీనిపై అటు తెలంగాణ.. ఇటు ఏపీ జలవనరుల శాఖ ఉన్నతాధికారులు సంతకాలు చేశారు. 2015–16, 2016–17 సంవత్సరాల్లో ఇదే పద్ధతిలో కృష్ణా బోర్డు నీటిని పంపిణీ చేసింది. 2017, నవంబర్ 4న జరిగిన బోర్డు సమావేశంలో.. ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, సాగర్లలో లభ్యతగా ఉన్న నీటిని 66 : 34 నిష్పత్తిలో ఏపీ, తెలంగాణలకు పంపిణీ చేయాలని రెండు రాష్ట్రాలు ప్రతిపాదించాయి. దాంతో.. ఆ పద్ధతి ప్రకారమే 2017–18, 2018–19, 2020–21, 2021–22లలో కృష్ణాబోర్డు నీటిని పంపిణీ చేసింది. ఏమిటీ వితండ వాదన.. ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు చేసిన బచావత్ ట్రిబ్యునల్.. వాటాగా దక్కిన జలాలను రాష్ట్రంలో ఎక్కడైనా వినియోగించుకునే స్వేచ్ఛనూ ఇచ్చింది. బచావత్ ట్రిబ్యునల్ చేసిన కేటాయింపులను బ్రిజేష్కుమార్ ట్రిబ్యునల్ కూడా కొనసాగించింది. బ్రిజేష్కుమార్ ట్రిబ్యునల్ తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించిన నేపథ్యంలో.. ఇప్పటికీ బచావత్ ట్రిబ్యునల్ తీర్పే అమల్లో ఉంది. ఇక వరద జలాలను వాడుకునే స్వేచ్ఛను దిగువ రాష్ట్రమైన ఏపీకి బచావత్ ట్రిబ్యునల్ ఇచ్చింది. ట్రిబ్యునల్ కేటాయింపుల ద్వారా హక్కుగా దక్కిన జలాలను.. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి ఎస్సార్బీసీ, తెలుగుగంగ, గాలేరు–నగరి, హంద్రీ–నీవాతోపాటు వెలిగొండ ప్రాజెక్టు ద్వారా ఆంధ్రప్రదేశ్ వాడుకోవడం తప్పెలా అవుతుందని నీటిపారుదలరంగ నిపుణులు ప్రశ్నిస్తున్నారు. బ్రిజేష్కుమార్ ట్రిబ్యునల్ తీర్పు అమల్లోకి వచ్చినా.. కృష్ణా జలాల్లో ఏపీ వాటా ఇంకా పెరుగుతుందే తప్ప తగ్గదని గుర్తుచేస్తున్నారు. తెలంగాణ ఉన్నతాధికారులకు వాస్తవాలు తెలిసి కూడా వితండవాదనకు దిగడాన్ని వారు తప్పుపడుతున్నారు. -
శ్రీశైలం, సాగర్కు డబ్బులివ్వండి
సాక్షి, అమరావతి: ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్కు మరమ్మతులు, ఆధునికీకరణ పనులను చేపట్టేందుకు రూ.1,123.41 కోట్లు అవసరమని కృష్ణా బోర్డు అంచనా వేసింది. ఇక ఈ రెండు ప్రాజెక్టుల స్పిల్ వేలు, విద్యుత్కేంద్రాలు, ఎత్తిపోతల పథకాల నిర్వహణకు ఏటా మరో రూ.819.62 కోట్లు అవసరమని తేల్చింది. ఈ నేపథ్యంలో కేంద్ర జల్ శక్తి శాఖ గతేడాది జూలై 15న జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం ఏపీ, తెలంగాణ చెరో రూ.200 కోట్లు చొప్పున సీడ్ మనీగా బోర్డు ఖాతాలో జమ చేయాలని కోరింది. ఈ మేరకు కేంద్ర జల్ శక్తి శాఖతో పాటు తెలుగు రాష్ట్రాలకు కృష్ణా బోర్డు ఛైర్మన్ ఎంపీ సింగ్ లేఖ రాశారు. అందులో ప్రధానాంశాలు ఇవీ.. ► శ్రీశైలం ప్రాజెక్టులో ప్రస్తుతం చేపట్టిన పనులను పూర్తి చేసేందుకు రూ.73.66 కోట్లు అవసరం కాగా నాగార్జునసాగర్లో పనులను పూర్తి చేసేందుకు రూ.207.25 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ రెండు ప్రాజెక్టుల్లో పనులను పూర్తి చేసేందుకు రూ.280.91 కోట్లు అవసరమవుతాయి. ► శ్రీశైలం ప్రాజెక్టు స్పిల్ వే ఫ్లంజ్ ఫూల్ దెబ్బతింది. స్పిల్ వే మరమ్మతులు, ఆధునికీకరణకు రూ.810.89 కోట్లు అవసరం. సాగర్ స్పిల్వే ఆధునికీకరణకు రూ.31.61 కోట్లు అవసరం. ► ప్రస్తుతం చేపట్టిన పనులతో పాటు మరమ్మతులు, ఆధునికీకరణ పనులను పూర్తి చేసేందుకు మూడు నాలుగేళ్ల సమయం పడుతుంది. ఇందుకు రూ.1,123.41 కోట్లు వ్యయం కానుంది. ► ఏటా శ్రీశైలం ప్రాజెక్టు నిర్వహణకు రూ.38.39 కోట్లు, రెండు విద్యుత్ కేంద్రాల నిర్వహణకు రూ.4.13 కోట్లు, శ్రీశైలంపై ఆధారపడిన ఎత్తిపోతల పథకాలు(హంద్రీ–నీవాలో భాగమైన మల్యాల, ముచ్చుమర్రి.. కల్వకుర్తి) నిర్వహణకు రూ.372.89 కోట్లు అవసరం. శ్రీశైలం నిర్వహణకు ఏటా రూ.415.41 కోట్లు అవసరం. ► నాగార్జునసాగర్ స్పిల్ వేకు రూ.17.45 కోట్లు, విద్యుత్కేంద్రాలకు రూ.14.70, ఎత్తిపోతల పథకాలకు రూ.372.06 కోట్లు వెరసి నిర్వహణకు రూ.404.21 కోట్లు కావాలి. ► ఉమ్మడి ప్రాజెక్టులను ఏటా నిర్వహించడం, చేపట్టిన పనులను పూర్తి చేయడం, మరమ్మతులు, ఆధునికీకరణకు రూ.1,943.03 కోట్లు అవ సరం. ► సీడ్ మనీని తగ్గించాలని రెండు రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన ప్రతిపాదనను తిరస్కరిస్తున్నాం. గెజిట్ నోటిఫికేషన్ మేరకు ఒక్కో రాష్ట్రం ఒకేసారి రూ.200 కోట్లు చొప్పున బోర్డు ఖాతాలో జమ చేయాలి. వ్యయాన్ని నీటి వాటాలు, విద్యుత్ వాటాల దామాషా పద్ధతిలో రెండు రాష్ట్రాలు భరించాలి. -
'కృష్ణా'పై ఇదేం కిరికిరి?
సాక్షి, అమరావతి: ఉమ్మడి రాష్ట్రానికి బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన 811 టీఎంసీల కృష్ణా జలాలను రెండు రాష్ట్రాలకు చెరి సగం పంపిణీ చేయాలని తెలంగాణ సర్కారు తాజాగా కృష్ణా బోర్డుకు లేఖ రాయడాన్ని నీటిపారుదల రంగ నిపుణులు తప్పుబడుతున్నారు. బచావత్ ట్రిబ్యునల్ ప్రాజెక్టుల వారీగా చేసిన కేటాయింపుల ఆధారంగా ఏపీకి 512.04, తెలంగాణకు 298.96 టీఎంసీలను పంపిణీ చేస్తూ 2015 జూన్ 19న కేంద్రం తాత్కాలిక సర్దుబాటు చేసింది. దీనికి అంగీకరిస్తూ తెలంగాణ ప్రభుత్వం సంతకం కూడా చేసింది. 2017–18 నీటి సంవత్సరంలో ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్లలో ఆవిరి నష్టాలు పోనూ లభ్యతగా ఉన్న నీటిని 66 : 34 చొప్పున పంపిణీ చేసుకునేందుకు ఏపీ, తెలంగాణ అంగీకరించాయి. బ్రిజేష్కుమార్ ట్రిబ్యునల్ తీర్పు వెలువడే వరకూ ఇదే పద్ధతిలో నీటిని పంచుకోవాలని నిర్ణయించడంతో 2018–19, 2019–20, 2020–21, 2021–22లలో అదే విధానం ప్రకారం నీటిని కృష్ణా బోర్డు పంపిణీ చేస్తూ వస్తోంది. పదే పదే పేచీ.. తెలంగాణ సర్కార్ 2015, 2017–18లలో కుదిరిన ఒప్పందాలను తుంగలో తొక్కుతూ ప్రస్తుత నీటి సంవత్సరంలో కృష్ణా జలాల పంపిణీపై పదేపదే పేచీకి దిగుతోంది. రెండు రాష్ట్రాలకు చెరి సగం పంపిణీ చేయాలని తెలంగాణ సర్కార్ లేఖ రాయడంతో మే 6న నిర్వహించే బోర్డు సర్వ సభ్య సమావేశంలో చర్చించాలని బోర్డు ఛైర్మన్ ఎంపీ సింగ్ నిర్ణయించి అజెండాలో చేర్చారు. చెరి సగం అసాధ్యం.. కృష్ణా నదిలో 75 శాతం నీటి లభ్యత ఆధారంగా 2,060 టీఎంసీలు, పునరుత్పత్తి 70 టీఎంసీలతో కలిపి 2,130 టీఎంసీలు అందుబాటులో ఉంటాయని అంచనా వేసిన బచావత్ ట్రిబ్యునల్.. మహారాష్ట్రకు 585, కర్ణాటకకు 734, ఏపీకి 811 టీఎంసీలను కేటాయించింది. మిగులు జలాలను హక్కుగా కాకుండా వినియోగించుకునే స్వేచ్ఛను దిగువ రాష్ట్రమైన ఏపీకి ఇచ్చింది. ► ఉమ్మడి రాష్ట్రానికి బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన 811 టీఎంసీల్లో 1976కు ముందే పూర్తయిన ప్రాజెక్టులకు 749.16 టీఎంసీల వాటా కల్పించింది. నిర్మాణం, ప్రతిపాదన దశలో ఉన్న జూరాలకు 17.84, శ్రీశైలంలో ఆవిరి నష్టాలకు 33 టీఎంసీల వాటా ఇచ్చింది. పునరుత్పత్తి కింద 11 టీఎంసీలు కేటాయించింది. ► ఆ కేటాయింపుల ఆధారంగానే ఏపీకి 512.04, తెలంగాణకు 298.96 టీఎంసీలను పంపిణీ చేస్తూ 2015లో కేంద్రం తాత్కాలిక ఏర్పాటు చేసింది. ► బచావత్ ట్రిబ్యునల్ తీర్పు సుప్రీం కోర్టు డిక్రీతో సమానం. దాన్ని పునఃసమీక్షించడం చట్టవిరుద్ధం కాబట్టే బ్రిజేష్కుమార్ ట్రిబ్యునల్ వాటిని కొనసాగించింది. వీటిని పరిగణలోకి తీసుకుంటే చెరి సగం వాటా కావాలని తెలంగాణ సర్కార్ లేఖ రాయడం చట్టవిరుద్ధమని న్యాయ నిపుణులు తేల్చి చెబుతున్నారు. -
తెలంగాణను కట్టడి చేయండి కేఆర్ఎంబీకి ఏపీ సర్కార్ విజ్ఞప్తి
-
సాగర్లో విద్యుదుత్పత్తి చేయకుండా తెలంగాణను కట్టడి చేయండి
సాక్షి, అమరావతి: నాగార్జునసాగర్లో కేవలం విద్యుదుత్పత్తి కోసం నీటిని వృథా చేయకుండా తెలంగాణ సర్కార్ను కట్టడి చేయాలని కృష్ణా బోర్డుకు ఏపీ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. వేసవిలో తాగునీటి అవసరాల కోసం రెండు రాష్ట్రాలు సాగర్పైనే ఆధారపడతాయని గుర్తుచేసింది. విద్యుదుత్పత్తి కోసం విలువైన నీటిని వృథా చేస్తే వేసవిలో తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి డీఎం రాయ్పురేకు ఏపీ జలవనరుల శాఖ ఈఎన్సీ సి.నారాయణరెడ్డి సోమవారం లేఖ రాశారు. ఆ లేఖలో ప్రధానాంశాలు ఇవీ.. దిగువన కృష్ణా డెల్టా సాగునీరు, తాగునీరు అవసరాల కోసం నీటిని విడుదల చేయాలని ప్రతిపాదనలు పంపకున్నా తెలంగాణ సర్కార్ నాగార్జునసాగర్లో విద్యుదుత్పత్తి చేస్తూ నీటిని దిగువకు వదిలేస్తోంది. పులిచింతల ప్రాజెక్టులో 45.77 టీఎంసీలకుగానూ ఇప్పటికే 40.80 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. గతేడాది ఆగస్టులో నాగార్జునసాగర్ నుంచి తెలంగాణ సర్కార్ ఇష్టారాజ్యంగా విద్యుదుత్పత్తిని చేస్తూ దిగువకు నీటిని వదిలేయడంతో పులిచింతలలో నీటి నిల్వను నియంత్రించటానికి అనేక సార్లు గేట్లను ఎత్తాల్సి వచ్చింది. సమాచారం ఇవ్వకుండా విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు నీటిని వదిలేయడం వల్ల వరద ఉధృతికి గతేడాది పులిచింతల గేటు కొట్టుకుపోయింది. దాన్ని పునరుద్ధరించే పనిలో ఉన్నాం. ప్రకాశం బ్యారేజీలోనూ నీటి నిల్వ గరిష్ట స్థాయిలో ఉంది. సాగర్ నుంచి విద్యుదుత్పత్తి ద్వారా దిగువకు నీటిని విడుదల చేస్తే.. పులిచింతల, ప్రకాశం బ్యారేజీ గేట్లు ఎత్తి ఆ నీటిని వృథాగా సముద్రంలోకి వదిలేయాల్సిన పరిస్థితి ఉంది. వేసవిలో తాగునీటి అవసరాలు అధికంగా ఉన్న నేపథ్యంలో.. విలువైన నీటిని నిల్వ ఉంచకుండా.. విద్యుదుత్పత్తి కోసం వృథాగా సముద్రంలోకి వదిలేయాల్సిన పరిస్థితిని సృష్టించడం న్యాయమా? -
తెలంగాణకు 85, ఏపీకి 20 టీఎంసీలు
సాక్షి, హైదరాబాద్: వేసవిలో తాగు, సాగు నీటి అవసరాల కోసం నాగార్జునసాగర్ జలా శయంలోని నిల్వల నుంచి ఆంధ్రప్రదేశ్కు 20 టీఎంసీలు, తెలంగాణకు 85 టీఎం సీలను కేటాయిస్తూ కృష్ణానది యాజ మాన్య బోర్డు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 10న జరిగిన త్రిసభ్య సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు ఈ కేటాయింపులు జరిపింది. -
తెలంగాణకు 92 .. ఏపీకి 21 టీఎంసీలు
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం నాగార్జునసాగర్ జలాశయంలో లభ్యతగా ఉన్న 113 టీఎంసీల నుంచి 92 టీఎంసీలను తెలంగాణకు, 21 టీఎంసీలను ఏపీకి కేటాయిస్తూ కృష్ణా బోర్డు నిర్ణయం తీసుకుంది. శ్రీశైలంలో నీటి మట్టం అడుగంటిన నేపథ్యంలో నాగార్జునసాగర్ నుంచి రివర్స్ పంపింగ్ చేసిన జలాలను తాగునీటి అవసరాల కోసం వాడుకోవాలని తెలంగాణకు సూచించింది. రబీలో సాగునీరు.. వర్షాకాలం ప్రారంభమయ్యే వరకు తాగునీటి అవసరాలపై చర్చించేందుకు హైదరాబాద్లోని కృష్ణా బోర్డు కార్యాలయంలో గురువారం బోర్డు సభ్య కార్యదర్శి డీఎం రాయ్పురే అధ్యక్షతన త్రిసభ్య కమిటీ సమావేశమైంది. తెలంగాణ ఈఎన్సీ మురళీధర్. ఏపీ ఈఎన్సీ తరఫున కర్నూలు ప్రాజెక్టుల సీఈ మురళీనాథ్రెడ్డి పాల్గొన్నారు. ప్రస్తుత నీటి సంవత్సరంలో కృష్ణాలో మొత్తం లభ్యతగా ఉన్న 953 టీఎంసీల్లో 629 టీఎంసీలు(66 శాతం) ఏపీకి, 324 టీఎంసీలు (34 శాతం) తెలంగాణకు దక్కుతాయని రాయ్పురే తేల్చారు. అయితే శ్రీశైలం, సాగర్, పులిచింతల, ప్రకాశం బ్యారేజీ గేట్లు ఎత్తేసి.. కృష్ణా జలాలు వృథాగా సముద్రంలో కలుస్తున్న సమయంలో రెండు రాష్ట్రాలు మళ్లించిన వరద జలాలను కోటా కింద లెక్కించకూడదని ఏపీ సీఈ వాదించారు. దీనిపై తెలంగాణ ఈఎన్సీ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ జలాలను కోటా కింద లెక్కించాల్సిందేనన్న తెలంగాణ డిమాండ్కు రాయ్పురే అంగీకరించారు. మళ్లించిన వరద జలాలతో కలుపుకొని ఏపీ ఇప్పటిదాకా 608, తెలంగాణ 232 టీఎంసీలు వాడుకున్నట్లు చెబుతూ.. ఆ మేరకు నాగార్జునసాగర్లో ప్రస్తుతం లభ్యతగా ఉన్న జలాలను ఇరు రాష్ట్రాలకు కేటాయించారు. పది టీఎంసీలపై ప్రభుత్వంతో మాట్లాడి చెబుతాం.. మే 31తో నీటి సంవత్సరం ముగుస్తున్నందున ఆలోగానే కోటా నీటిని వాడుకోవాలని.. లేదంటే మిగిలిన నీటిపై రెండు రాష్ట్రాలకు హక్కు ఉంటుందని ఏపీ సీఈ చెప్పగా.. రాయ్పురే ఏకీభవించారు. సాగు, తాగునీటి అవసరాల కోసం 82 టీఎంసీలు విడుదల చేయాలని తెలంగాణ ప్రతిపాదన పంపిన నేపథ్యంలో.. ఆ రాష్ట్ర కోటాలో మిగులుగా ఉన్న 10 టీఎంసీలను తమకు కేటాయించాలని ఏపీ సీఈ కోరగా.. దీనిపై తమ ప్రభుత్వంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలంగాణ ఈఎన్సీ చెప్పారు. గెజిట్ను అబయన్స్లో పెట్టమన్నాం.. కృష్ణా బోర్డు గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసి ఆర్నెల్లు పూర్తయినా.. అనుమతి లేని ప్రాజెక్టులకు రెండు రాష్ట్రాలు ఇప్పటిదాకా కేంద్ర జలసంఘం నుంచి అనుమతులు తెచ్చుకోలేదని, అందువల్ల వచ్చే నీటి సంవత్సరం నుంచి ఆ ప్రాజెక్టుల నుంచి నీటి వినియోగాన్ని ఆపేయాలని రాయ్పురే సూచించారు. అయితే తాము గెజిట్ నోటిఫికేషన్ను పరిగణనలోకి తీసుకోవడం లేదని, ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు చేసేదాకా దీనిని అబయన్స్లో పెట్టాల్సిందిగా కేంద్ర జల శక్తి శాఖను తాము కోరామని తెలంగాణ ఈఎన్సీ తెలిపారు. దీంతో ఈ అంశంపై బోర్డు సర్వసభ్య సమావేశంలో చర్చిద్దామని రాయ్పురే చెప్పారు. -
ఆర్డీఎస్పై అధ్యయనం
సాక్షి, అమరావతి: రాజోలిబండ డైవర్షన్ స్కీం (ఆర్డీఎస్) లక్ష్యాలు నెరవేరుతున్నాయా? లక్ష్యాలు సాధించలేకపోతే దానికి కారణం నిర్వహణ లోపమా? డిజైన్ లోపమా? అనే అంశాలను తేల్చనున్నారు. ఈ అధ్యయనం బాధ్యతలను పుణెలోని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ (సీడబ్ల్యూపీఆర్ఎస్ )కు అప్పగించనున్నారు. ఈమేరకు కృష్ణా బోర్డు సభ్యుడు ఆర్కే పిళ్లై చేసిన ప్రతిపాదనకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలు అంగీకారం తెలిపాయి. అధ్యయనానికి ఆర్నెళ్ల గడువు ఇచ్చారు. వచ్చే రబీ నాటికి ఆ నివేదికను అమలు చేస్తామని ఆర్కే పిళ్లై చెప్పారు. బుధవారం హైదరాబాద్లో కృష్ణా బోర్డు కార్యాలయంలో పిళ్లై అధ్యక్షతన ఆర్డీఎస్పై ప్రత్యేక సమావేశం జరిగింది. తుంగభద్ర బోర్డు సభ్య కార్యదర్శి నాగమోహన్, ఏపీ సీఈ సి.మురళీనాథ్రెడ్డి, తెలంగాణ సీఈ మోహన్కుమార్, కర్ణాటక సీఈ ఈ సమావేశంలో పాల్గొన్నారు. తుంగభద్ర జలాశయం నుంచి ఏపీకి చెందిన కేసీ కెనాల్ కోటా కింద విడుదల చేసిన నీటిని కర్ణాటక, తెలంగాణ మళ్లిస్తున్నట్లుగా జనవరి 28న బోర్డు జాయింట్ కమిటీ నిర్వహిం చిన క్షేత్రస్థాయి తనిఖీల్లో వెల్లడైంది. ఈ అంశాన్ని పిళ్లై ప్రస్తావించారు. దిగువ రాష్ట్రమైన ఏపీ హక్కులను హరించడం సరికాదన్నారు. దీనిపై తెలంగాణ సీఈ స్పందిస్తూ.. ఆర్డీఎస్కు బచావత్ ట్రిబ్యునల్ 17.1 టీఎంసీలను కేటాయించిందని, ఇందులో తుంగభద్ర డ్యామ్ నుంచి 7 టీఎంసీలను విడుదల చేయాలని పేర్కొందని అన్నారు. ఆర్డీఎస్ ఎడమ కాలువ కింద ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో 87,500 ఎకరాల ఆయకట్టు ఉందని, ఏపీ జల చౌర్యం కారణంగా నీళ్లందక ఆ రైతులు తీవ్రంగా ఇబ్బందిపడుతున్నారని చెప్పారు. దీనిపై ఏపీ సీఈ మురళీనాథ్రెడ్డి తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఈ దశలో పిళ్లై స్పందిస్తూ... కేసీ కెనాల్ కోటా కింద వి డుదల చేసిన నీటినే ఆర్డీఎస్ ఎడమ కాలువ ద్వారా కర్ణాటక, తెలంగాణ మళ్లిస్తున్నాయని తేల్చిచెప్పారు. దీంతో తెలంగాణ సీఈ మిన్నకుండిపోయారు. బచావత్ ట్రిబ్యునల్ తమకు కేటాయించిన జలాలు దక్కడం లేదని తెలంగాణ సీఈ వాదించడంతో దాన్ని తేల్చేందుకు సీడబ్ల్యూపీఆర్ఎస్తో అధ్యయనం చేయిస్తామని కృష్ణా బోర్డు తెలిపింది. తుమ్మిళ్ల ఆపేయాల్సిందే.. తుంగభద్ర డ్యామ్ నుంచి కేసీ కెనాల్కు 10, ఆర్డీ ఎస్కు 7 టీఎంసీల కోటా ఉన్నందున నదిలో సహజప్రవాహం లేనప్పుడు.. తుంగభద్ర నుంచి 10:7 నిష్పత్తిలో నీటిని విడుదల చేసి.. దామాషా పద్ధతి లో ఆర్డీఎస్ వద్ద మూడు రాష్ట్రాలకు నీటిని పంపిణీ చేయాలని ఏపీ సీఈ మురళీనాథ్రెడ్డి చేసిన ప్రతిపాదనను కృష్ణా బోర్డు అంగీకరించింది. ఆర్డీఎస్కు దిగువన సుంకేశుల బ్యారేజీ జల విస్తరణ ప్రాంతంలో తెలంగాణ సర్కారు అక్రమంగా నిర్మించిన తుమ్మిళ్ల ఎత్తిపోతలను నిలిపివేయాలన్న డిమాండ్తోనూ కృష్ణాబోర్డు ఏకీభవించింది. తుమ్మిళ్ల ఎత్తిపోతలను ఆపేయాలని ఆర్కేపిళ్లై ఆదేశించారు. -
9న కృష్ణా బోర్డు భేటీ
సాక్షి, అమరావతి: తుంగభద్ర జలాల్లో చౌర్యానికి అడ్డుకట్ట వేయడమే అజెండాగా ఈనెల 9న హైదరాబాద్లో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల జలవనరుల శాఖ ఉన్నతాధికారులతో కృష్ణా బోర్డు చైర్మన్ ఎంపీ సింగ్ ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నారు. కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలు నీళ్లను మళ్లించకుండా అడ్డుకట్ట వేసి.. దిగువ రాష్ట్రమైన ఏపీ హక్కులను పరిరక్షించడమే ఈ సమావేశం ప్రధాన లక్ష్యమని బోర్డు వర్గాలు తెలిపాయి. తుంగభద్ర జలాశయంలో కేసీ కెనాల్కు 10 టీఎంసీల కోటా ఉంది. నదిలో సహజ ప్రవాహం లేనప్పుడు, సుంకేశుల బ్యారేజీ వద్ద నీటి లభ్యత లేనప్పుడు.. ఈ కోటా నీటిని విడుదల చేయాలని తుంగభద్ర బోర్డుకు ఏపీ ఈఎన్సీ ప్రతిపాదనలు పంపిస్తుంటుంది. ఆ మేరకు తుంగభద్ర బోర్డు నీటిని విడుదల చేస్తుంది. తుంగభద్ర జలాశయం నుంచి ఆ నీళ్లు నదీ మార్గంలో రాజోలిబండ డైవర్షన్ స్కీం(ఆర్డీఎస్)కు చేరగానే.. వాటిని ఎడమ కాలువ ద్వారా కర్ణాటక, తెలంగాణ ప్రభుత్వాలు మళ్లిస్తున్నాయి. సుంకేశుల బ్యారేజీ జలవిస్తరణ ప్రాంతంలో తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన తుమ్మిళ్ల ఎత్తిపోతల ద్వారా నీళ్లను చౌర్యం చేస్తోంది. కృష్ణా బోర్డు జాయింట్ కమిటీ ఇటీవల క్షేత్ర స్థాయిలో నిర్వహించిన తనిఖీల్లో కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల జలచౌర్యం బయటపడింది. దీనికి అడ్డుకట్ట వేయకపోతే ఏపీ హక్కులకు భంగం కలుగుతుందని జాయింట్ కమిటీ తేల్చిచెబుతూ కృష్ణా బోర్డుకు నివేదిక ఇచ్చింది. ఈ నివేదికను 9వ తేదీన నిర్వహించే బోర్డు సమావేశంలో చైర్మన్ ఎంపీ సింగ్ ప్రవేశపెట్టనున్నారు. జలచౌర్యానికి అడ్డుకట్ట వేసేందుకు.. ఆర్డీఎస్ను ఏపీ, తెలంగాణ, కర్ణాటక అధికారులతో కూడిన జాయింట్ కమిటీ పర్యవేక్షణలో నిర్వహించాలని ప్రతిపాదించనున్నారు. ఎడమ కాలువపై టెలీమీటర్లు ఏర్పాటు చేసి.. నీటి వినియోగాన్ని ఎప్పటికప్పుడు లెక్కించాలని సూచించే అవకాశముంది. కోటాకు మించి వాడుకుంటే.. అదనంగా ఉపయోగించుకున్న నీటిని ఆ రాష్ట్ర కోటాలో కలిపి.. కోత వేయనున్నట్లు సమాచారం. అనుమతి లేకుండా నిర్మించిన తుమ్మిళ్ల ఎత్తిపోతలను పూర్తిగా ఆపేయాలని స్పష్టం చేసే అవకాశముంది. వీటిపై సమావేశంలో మూడు రాష్ట్రాల అభిప్రాయాలు తీసుకుని.. తుది నిర్ణయం తీసుకోనున్నారు. -
తుమ్మిళ్ల ఎత్తిపోతలను ఆపాల్సిందే
సాక్షి, అమరావతి: కర్నూలు–కడప (కేసీ) కెనాల్ కోటా నీటిని తెలంగాణ, కర్ణాటక ప్రభుత్వాలు చోరీ చేస్తున్నాయని కృష్ణా బోర్డు సభ్యులు ఆర్కే పిళ్లై నేతృత్వంలో అధికారుల బృందం తేల్చింది. ఆంధ్రప్రదేశ్ హక్కులను పరిరక్షించాలంటే తుమ్మిళ్ల ఎత్తిపోతల ద్వారా నీటి తరలింపును తక్షణమే నిలిపేయాలని, బ్రిజేష్కుమార్ ట్రిబ్యునల్ తీర్పు అమల్లోకి వచ్చేవరకు మల్లమ్మకుంట రిజర్వాయర్ పంపింగ్ స్కీంను ఆపేయాలని స్పష్టం చేసింది. తుమ్మిళ్ల ఎత్తిపోతల, మల్లమ్మకుంట పంపింగ్ స్కీమ్ను నిలిపివేసేలా తెలంగాణ సర్కార్ను ఆదేశించాలని బోర్డుకు ఇచ్చిన నివేదికలో సూచించింది. బ్రిజేష్కుమార్ ట్రిబ్యునల్ తీర్పు అమల్లోకి వచ్చేవరకు ఆర్డీఎస్ (రాజోలిబండ డైవర్షన్ స్కీమ్) కుడి కాలువ పనులనూ ఆపేసేలా ఏపీ సర్కార్ను నియంత్రించాలని పేర్కొంది. ఆర్డీఎస్ కోటా నీటిని ఏపీ ప్రభుత్వం చౌర్యం చేస్తోందని గతేడాది అక్టోబర్ 30న కృష్ణా బోర్డుకు తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ ఫిర్యాదు చేశారు. స్పందించిన కృష్ణా బోర్డు చైర్మన్ ఎంపీ సింగ్ క్షేత్రస్థాయిలో తనిఖీ చేసి, వాస్తవాలను తేల్చి నివేదిక ఇచ్చేందుకు బోర్డు సభ్యులు ఆర్కే పిళ్లై అధ్యక్షతన ముగ్గురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేశారు. తెలంగాణ తప్పుడు ఫిర్యాదు కృష్ణా బోర్డు కమిటీ గత నెల 28న ఆర్డీఎస్, తుమ్మిళ్ల ఎత్తిపోతల, సుంకేశుల బ్యారేజీలు, కాలువల వ్యవస్థలను క్షేత్ర స్థాయిలో తనిఖీ చేసింది. కర్ణాటక సర్కార్తో కలిసి తెలంగాణ ప్రభుత్వం ఏపీ కోటా కింద కేసీ కెనాల్కు విడుదల చేసిన నీటిని చౌర్యం చేస్తున్నట్లు బోర్డు కమిటీ తేల్చింది. తానే చౌర్యం చేస్తూ ఏపీ సర్కార్పై తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ తప్పుడు ఫిర్యాదు చేసినట్లు స్పష్టం చేసింది. తుంగభద్ర డ్యామ్లో కేసీ కెనాల్ వాటా 10 టీఎంసీల్లో రోజుకు 2 వేల క్యూసెక్కుల చొప్పున విడుదల చేయాలని తుంగభద్ర బోర్డుకు ఏపీ సర్కార్ ప్రతిపాదనలు పంపింది. ఆ మేరకు తుంగభద్ర బోర్డు విడుదల చేస్తోంది. ఆర్డీఎస్ కోటా కింద నీటిని విడుదల చేయాలని తెలంగాణ సర్కార్ ప్రతిపాదనలు పంపలేదు. కేసీ కెనాల్ కోటా కింద తుంగభద్ర బోర్డు విడుదల చేస్తున్న 2 వేల క్యూసెక్కుల్లో ఆర్డీఎస్ ఎడమ కాలువ ద్వారా కర్ణాటక సర్కార్ 219, తెలంగాణ ప్రభుత్వం 419 క్యూసెక్కుల చొప్పున రోజూ చౌర్యం చేస్తున్నట్లు బోర్డు కమిటీ తనిఖీల్లో వెల్లడైంది. తుమ్మిళ్ల ఎత్తిపోతల ద్వారా కేసీ కెనాల్ కోటా కింద విడుదల చేసిన నీటిలో 300 క్యూసెక్కులను తెలంగాణ సర్కార్ అక్రమంగా తరలిస్తున్నట్లు బోర్డు కమిటీ తేల్చింది. మల్లమ్మకుంట రిజర్వాయర్కు కూడా కేసీ కెనాల్ కోటా నీటిని ఎత్తిపోతల ద్వారా తరలిస్తున్నట్లు వెల్లడైంది. ఏపీ హక్కులను పరిరక్షించాలంటే.. ఆంధ్రప్రదేశ్ హక్కులను పరిరక్షించాలంటే ఆర్డీఎస్ నిర్వహణను సంయుక్త కమిటీ నేతృత్వంలో చేపట్టాలని బోర్డుకు కమిటీ సూచించింది. టెలీ మీటర్లు ఏర్పాటు చేసి కర్ణాటక, తెలంగాణ వినియోగిస్తున్న నీటిని లెక్కించి.. వాటి కోటాలో కలపాలని పేర్కొంది. అనుమతి లేకుండా తెలంగాణ సర్కార్ నిర్వహిస్తున్న తుమ్మిళ్ల ఎత్తిపోతలను తక్షణమే ఆపేసేలా ఆదేశాలివ్వాలని బోర్డుకు స్పష్టం చేసింది. మల్లమ్మకుంట రిజర్వాయర్కు నీటి తరలింపులను నిలిపేయాలని సూచించింది. బోర్డు కమిటీ ఇచ్చిన నివేదికపై చర్యలు తీసుకోవడానికి చైర్మన్ ఎంపీ సింగ్ సిద్ధమైనట్లు అధికార వర్గాల సమాచారం. -
మా నీరు మిగిలే ఉంది
సాక్షి, అమరావతి: కృష్ణా జలాల్లో రాష్ట్ర వాటాలో మిగిలిన 171.163 టీఎంసీల నీటిని వాడుకోవడానికి అనుతించాలని రాష్ట్ర ప్రభుత్వం కృష్ణా బోర్డును కోరింది. ప్రస్తుత నీటి సంవత్సరంలో అంటే జూన్ 1 నుంచి ఇప్పటివరకూ రాష్ట్రానికి కేటాయించిన కృష్ణా జలాల్లో 350.585 టీఎంసీలు వాడుకున్నామని పేర్కొంది. అదేవిధంగా తెలంగాణ వాటాలో 108.235 టీఎంసీలు వాడుకోగా ఇంకా 160.545 టీఎంసీలు మిగిలాయని తెలిపింది. ఈ మేరకు కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి డీఎం రాయ్పురేకు ఏపీ ఈఎన్సీ సి.నారాయణరెడ్డి ప్రతిపాదనలు పంపారు. తెలంగాణ కూడా ఇదే విధమైన ప్రతిపాదన పంపింది. ఈ ప్రతిపాదనలు కృష్ణా బోర్డు నుంచి త్రిసభ్య కమిటీకి వచ్చాయి. గురువారం డీఎం రాయ్పురే అధ్యక్షతన ఏపీ, తెలంగాణ ఈఎన్సీలు సభ్యులుగా ఏర్పాటైన త్రిసభ్య కమిటీ సమావేశమవుతుంది. ఇప్పటిదాకా రెండు రాష్ట్రాలు వాడుకున్న నీటి లెక్కలు తేల్చి, వాటాలో మిగిలిన నీటి కేటాయింపులుపై నిర్ణయం తీసుకోనుంది. ఈ కేటాయింపుల ఆధారంగా రబీలో ఆయకట్టుకు నీటి విడుదలపై రాష్ట్రాలు నిర్ణయం తీసుకోనున్నాయి. మూడో ఏడాదీ కృష్ణాలో నీటి లభ్యత పుష్కలం కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలో 2019–20, 2020–21 తరహాలోనే ఈ ఏడాదీ సమృద్ధిగా వర్షాలు కురిశాయి. దీంతో సాగు, తాగునీటి కోసం అవసరమైన జలాలు వాడుకోవాలని, డిసెంబర్లో లెక్కలు తేల్చి.. వాటాలో మిగిలిన జలాలపై నిర్ణయం తీసుకుంటామని రెండు రాష్ట్రాలకు ఆదిలోనే కృష్ణా బోర్డు చెప్పింది. ఈ ఏడాది ప్రాజెక్టుల్లో 790.528 టీఎంసీలు అందుబాటులో ఉన్నట్లు లెక్కతేలింది. ఏపీ, తెలంగాణకు 66 : 34 నిష్పత్తిలో పంపిణీ చేస్తామని బోర్డు ఆదిలోనే చెప్పింది. ఈ విధంగా ఏపీకి 521.75 టీఎంసీలు, తెలంగాణకు 260.78 టీఎంసీలు కేటాయింపు జరిగింది. ఇందులో జూన్ 1 నుంచి ఇప్పటివరకూ ఏపీ 350.585 టీఎంసీలు, తెలంగాణ 108.235 టీఎంసీలు.. మొత్తం 458.82 టీఎంసీలను వాడుకున్నాయి. ఇంకా 331.708 టీఎంసీల లభ్యత కృష్ణాలో నీటి లభ్యత ఇప్పటికీ పుష్కలంగా ఉంది. ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జున సాగర్లలో కనీస నీటి మట్టాలకు ఎగువన 253.311 టీఎంసీలు ఉంది. జూరాలలో 5.853, పులిచింతల ప్రాజెక్టులో 38.17 టీఎంసీలు ఉంది. తుంగభద్ర డ్యామ్లో ఏపీ, తెలంగాణ కోటా కింద ఇంకా 24.474 టీఎంసీలు మిగిలి ఉన్నాయి. ఉభయ రాష్ట్రాల్లోని కృష్ణా బేసిన్లో మధ్య తరహా ప్రాజెక్టుల్లో 9.90 టీఎంసీలు ఉన్నాయి. ఈ మొత్తం కలిపితే డిసెంబర్ రెండో వారానికి కృష్ణా బేసిన్లో 331.708 టీఎంసీలు అందుబాటులో ఉన్నాయి. అంటే ఏపీ వాటా నీటిలో ఇంకా 171.163 టీఎంసీలు, తెలంగాణకు 160.545 టీఎంసీలు ఉంటాయి. ఇలా మిగిలిన నీటిని ఇప్పుడు వాడుకుంటామని రాష్ట్రాలు కోరుతున్నాయి. 49.72 టీఎంసీల మిగులు జలాలు మళ్లింపు శ్రీశైలం, సాగర్, పులిచింతల గేట్లు ఎత్తేసి.. ప్రకాశం బ్యారేజీ ద్వారా వరద జలాలు వృథాగా సముద్రంలో కలుస్తున్న సమయంలో రెండు రాష్ట్రాలు మళ్లించిన వరద నీటిని లెక్కలోకి తీసుకోకూడదని ఏపీ సర్కార్ చేసిన ప్రతిపాదనకు కృష్ణా బోర్డు అంగీకరించింది. వృథాగా సము ద్రంలో కలిసే నీటిని ఎవరు వాడుకున్నా నష్టం లేదని పేర్కొంది. ఈ ఏడాది ప్రకాశం బ్యారేజీ నుంచి 17.96, పోతిరెడ్డిపాడు 21.24, హంద్రీ–నీవా 2.73, సాగర్ కుడి కాలువ 7.28, ఎడమ కాలువ 0.91 వెరసి 49.72 టీఎంసీల మిగులు జలాలను ఏపీ సర్కార్ మళ్లించింది. ఇదే విధంగా తెలంగాణ సర్కారు ఏఎమ్మార్పీ, ఎఫ్ఎఫ్సీ, కల్వకుర్తి, ఎడమ కాలువ ద్వారా 11.94 టీఎంసీలను వాడుకుంది. -
తీరు మారని తెలంగాణ సర్కార్
సాక్షి, అమరావతి/విజయపురిసౌత్ (మాచర్ల): నాగార్జునసాగర్ పరిశీలనకు కృష్ణా బోర్డు సబ్ కమిటీని అనుమతించినట్లుగానే అనుమతించిన తెలంగాణ సర్కార్ ఆ తర్వాత యథావిధిగా అడ్డం తిరిగింది. ప్రధాన విద్యుత్ కేంద్రం, ఎడమ కాలువపై ఉన్న విద్యుత్ కేంద్రం పరిశీలనకు సబ్ కమిటీని అనుమతించేది లేదని తెలంగాణ జెన్కో అధికారులు తేల్చిచెప్పారు. సాగర్ నిర్వహణ నియమావళిని రూపొందించేందుకు క్షేత్రస్థాయి పర్యటనను సోమవారం సబ్ కమిటీ చేపట్టింది. సోమవారం కుడి కాలువ విదుŠయ్త్ కేంద్రం, కుడి కాలువ హెడ్ రెగ్యులేటర్ను పరిశీలించిన సబ్ కమిటీ..మంగళవారం సాగర్ స్పిల్ వే, ఏఎమ్మార్పీ, ఎడమ కాలువ హెడ్ రెగ్యులేటర్, వరద కాలువలను పరిశీలించింది. సాగర్ ప్రధాన విద్యుత్ కేంద్రం, ఎడమ కాలువపై ఉన్న విద్యుత్ కేంద్రం పరిశీలించేందుకు వెళ్లిన సబ్ కమిటీని తెలంగాణ జెన్కో అధికారులు అడ్డుకున్నారు. శ్రీశైలం, సాగర్ల నుంచి నేరుగా నీటిని వాడుకునే 15 ప్రాజెక్టులను బోర్డు స్వాధీనం చేయడానికి 2 రాష్ట్రాల ప్రభుత్వాలు అంగీకరించాయని..అందులో సాగర్ ప్రధాన విద్యుత్ కేంద్రం, ఎడమ కాలువపై ఉన్న విద్యుత్ కేంద్రం ఉన్నాయని.. వాటిని పరిశీలించడానికి అనుమతివ్వాలని సబ్ కమిటీ చైర్మన్ ఆర్కే పిళ్లై చేసిన సూచనను తెలంగాణ జెన్కో అధికారులు తోసిపుచ్చారు. గత నెల 26న శ్రీశైలం ఎడమ గట్టు విద్యుత్ కేంద్రం పరిశీలనకూ ఇదే తరహాలో అనుమతి ఇవ్వలేదని..వారం రోజుల్లోగా విద్యుత్ కేంద్రాల పరిశీలనకు అనుమతివ్వకపోతే అదే అంశాన్ని కృష్ణా బోర్డు ఛైర్మన్కు నివేదిక ఇస్తామని చెప్పారు. తెలంగాణ జెన్కో సీఎండీతో చర్చించి తుది నిర్ణయం చెబుతామని అధికారులు చెప్పడంతో సబ్ కమిటీ వెనుతిరిగింది. ఆ తర్వాత సాగర్లో నిర్వహించిన సమీక్ష సమావేశానికి తెలంగాణ జెన్కో సీఈ గైర్హాజరయ్యారు. దాంతో సాగర్ సీఈ, 2 రాష్ట్రాల ఎస్ఈలతో సబ్ కమిటీ సమీక్ష చేపట్టింది. సాగర్ కుడి కాలువకు సంబంధించిన కార్యాలయాలు, సిబ్బంది తదితర వివరాలను ఏపీ అధికారులు అందజేశారు. కానీ..ఎడమ కాలువ, ఏఎమ్మార్పీ, వరద కాలువ తదితర ప్రాజెక్టుల వివరాలను తెలంగాణ నీటిపారుదల అధికారులు మౌఖికంగా మాత్రమే చెప్పడంపై పిళ్లై అసంతృప్తి వ్యక్తం చేశారు. రికార్డులను అందజేయాలని, అప్పుడే ప్రాజెక్టుల నిర్వహణ నియమావళి ముసాయిదాను రూపొందించడానికి అవకాశముంటుందని తేల్చిచెప్పారు.