
స్నేక్ గ్యాంగ్ సభ్యులు
హైదరాబాద్: నగర శివారులో సంచలనం సృష్టించిన స్నేక్ గ్యాంగ్ కేసులో పహాడి షరీఫ్ సిఐ, ఎస్ఐలను సస్పెండ్ చేశారు. ఈ కేసు విషయంలో సిఐ భాస్కరరెడ్డి, ఎస్ఐ విఎస్ ప్రసాద్లు నిర్లక్ష్యంగా వ్యవహరించారని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ సస్పెండ్ చేశారు. స్నేక్ గ్యాంగ్ యువతులను పాములతో బెదిరించి, వారిపై అత్యాచారాలకు పాల్పడిన విషయం తెలిసిందే. పహాడీ షరీఫ్ షాహీన్నగర్లో స్నేక్ గ్యాంగ్ సాగించిన అత్యాచారాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఫామ్ హౌజ్లో ఉన్న జంటపై దాడి చేసి కాబోయే భర్త కళ్ల ఎదుటే యువతిని పాముతో బెదిరించారు. సెల్ఫోన్తో నగ్నంగా ఫోటో తీశారు. ఆ యువతి ఎంతరోధిస్తున్నా వినకుండా సామూహికంగా అత్యాచారం చేశారు. ఈ కేసులో ఫైసల్ దయానీ, ఖాదర్ బారక్బా, తయ్యబ్ బాసలామా, మహ్మద్ పర్వేజ్లు నిందితులు.
ఈ సంఘటనతో ఈ గ్యాంగ్ అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఈ ముఠా ఇప్పటి వరకు దాదాపు 37 మంది యువతులపై అత్యాచారం చేసినట్లు తెలుస్తోంది. వికలాంగుడైన తమ్ముడితో ఒక ఇంటిలో ఉంటున్న యువతిపై లైంగిక దాడి చేశారు. మరో చోట పెళ్లి ఏర్పాట్లలో ఉన్న ఇంట్లోకి చొరబడి వృద్ధురాలైన తల్లి మెడపై కత్తి పెట్టి బెదిరించారు. పెళ్ళి కుదిరిన యువతిపై అత్యాచారం చేశారు. ఈ ముఠా అతి కిరాతకంగా అనేక ఘోరాలకు పాల్పడింది. యువతులపై అత్యాచారాలకు పాల్పడడమే కాకుండా ఆ ఘటనలను సెల్ఫోన్ ద్వారా ఫోటోలు తీసి బయట పెడతామని బెదిరించేవారు.
ఈ గ్యాంగ్ ఇన్ని దారుణాలకు పాల్పడుతున్నా సిఐ భాస్కరరెడ్డి, ఎస్ఐ విఎస్ ప్రసాద్లు నిర్లక్ష్యంగా వ్యవహరించారని వారిపై సస్పెన్షన్ వేటు వేశారు.
**