
తెలంగాణ సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్ : 2018-19 ఆర్థిక సంవత్సరానికిగాను ప్రవేశ పెట్టిన బడ్జెట్ అంచనా అన్ని రంగాల అభివృద్ధికి, అన్ని వర్గాల సంక్షేమానికి ఉపయోగపడే విధంగా పూర్తి సమతుల్యతతో ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్నారు. నేడు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్పై కేసీఆర్ స్పందించారు. రాష్ట్ర ఆదాయ వనరులకు, అవసరాలకు, ప్రభుత్వ లక్ష్యాలకు నడుమ సమన్వయాన్ని బడ్జెట్ కూర్పు సాధించిందని తెలిపారు. వ్యవసాయ రంగానికి అత్యధిక నిధులు ప్రతిపాదించడంపై కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు.
సాగునీటి ప్రాజెక్టుల కోసం, పంట పెట్టుబడి మద్దతు పథకం, విద్యుత్ సబ్సిడీలకు అధిక నిధులు సమకూర్చడం ద్వారా తెలంగాణలో వ్యవసాయ రంగ అభివృద్ధి సాధ్యపడుతుందని అభిప్రాయపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు మరింత విజయవంతంగా ముందుకు సాగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్ర అభివృద్ధి ప్రణాళికలను సమర్థవంతంగా అమలు పరిచేందుకు వార్షిక ఆర్థిక ప్రణాళికను రూపొందించిన ఆర్థికశాఖ మంత్రి ఈటెల రాజేందర్ని, ఆ శాఖ ఉన్నతాధికారులను ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment