
'హైదరాబాద్ నాలెడ్జ్ హబ్ కాదు.. దోపిడీ అడ్డా'
హైదరాబాద్: హైదరాబాద్ నాలెడ్జి హబ్ కాదని, దోపిడీకి అడ్డాగా మారిందని ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య అన్నారు. విద్యా వ్యాపారం ప్రజాస్వామ్యానికి దెబ్బ అని ఆయన పేర్కొన్నారు. ప్రైవేటు పాఠశాలల ఫీజుల దోపిడీకి వ్యతిరేకంగా శనివారం ఇందిరాపార్క్ వద్ద భారీ ధర్నా జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యావేత్తలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా చుక్కా రామయ్య మాట్లాడుతూ... తల్లిదండ్రులను కస్టమర్లుగా చూస్తున్నారని, ఇది మంచి పద్ధతి కాదన్నారు. పిల్లల ఫీజులను పెట్టుబడిగా పెట్టి మంత్రుల పదవులను కొంటున్నారని వ్యాఖ్యానించారు. మధ్య తరగతి ప్రజలను రోడ్డెక్కించిన ఘటన ఈ ప్రభుత్వాలదేనని మండిపడ్డారు. విప్లవం ఎంతో దూరంలో లేదన్నారు. స్కూల్ మేనేజ్మెంట్లు దిగిరావాలని, స్కూల్ కమిటీలో తల్లిదండ్రులకు చోటు కల్పించాలని డిమాండ్ చేశారు.