ప్లాట్ల కేటాయింపులో అవకతవకలు, సొసైటీ రికార్డులు నిర్వహణలో రూ.కోట్ల దుర్వినియోగం, కార్యవర్గ సభ్యులపై నమోదైన అభియోగాలు..
=అవకతవకలపై చర్యలు కరువు
=అన్నీ పక్కన పెట్టి 25న ఎన్నికలకు నిర్ణయం
బంజారాహిల్స్, న్యూస్లైన్: ప్లాట్ల కేటాయింపులో అవకతవకలు, సొసైటీ రికార్డులు నిర్వహణలో రూ.కోట్ల దుర్వినియోగం, కార్యవర్గ సభ్యులపై నమోదైన అభియోగాలు.. ఇవన్నీ తేలకముందే ఫిలింనగర్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీకి ఎన్నికలు జరిపేందుకు సహకార శాఖాధికారులు రంగం సిద్ధం చేశారు. జనవరి 25న ఫిలింనగర్ సొసైటీ ఎన్నికలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. ఫిలింనగర్ సొసైటీలో భారీగా అవినీతి అక్రమాలు జరిగాయని అప్పటి సొసైటీ స్పెషల్ ఆఫీసర్ కిరణ్మయి ఉన్నతాధికారులకు 500 పేజీల నివేదికను సమర్పించారు.
దీనిపై ఇంతవరకు చర్యలు తీసుకోని ఉన్నతాధికారులు ఆగమేఘాలపై మళ్లీ అక్రమార్కులకు పట్టం కట్టే పనులకు తెర తీశారు. ఈ ఎన్నికలు జరిపించేందుకు రూ.2 కోట్లు చేతులు మారినట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. సొసైటీ సభ్యుల అభ్యంతరాలను పక్కనపెట్టి అక్రమార్కులు మళ్లీ పోటీ చేసేలా నిబంధనలు కూడా సడలించినట్లు ఆరోపణలున్నాయి. సొసైటీలో అక్రమాలకు పాల్పడ్డారంటూ గత కమిటీ సభ్యులకు ఒక్కొక్కరికి రూ.లక్ష పైచిలుకు జరిమానా విధించారు. ఇంతవరకు దీన్ని చెల్లించనే లేదు. కొందరు అక్రమార్కుల సభ్యత్వాలు రద్దు చేయాలని నివేదికలో సూచించారు. వీటిలో ఏ ఒక్క చర్యా తీసుకోకుండానే ఎన్నికలకు సిద్ధం కావడంపై ముఖ్యమంత్రిని కలిసి వినతిపత్రం సమర్పించాలని కాలనీ మహిళలు సమాయత్తమవుతున్నారు.
అభ్యంతరాలుంటే చెప్పవచ్చు
ఫిలింనగర్ సొసైటీ ఎన్నికలు జనవరి 25న జరిపేందుకు నిర్ణయించినట్లు హైదరాబాద్ జిల్లా సహకార శాఖాధికారి (డీఎస్ఓ), సొసైటీ స్పెషలాఫీసర్ రాజేష్శ్యామ్ వెల్లడించారు. సభ్యుల ఓటరు జాబితాను రెండ్రోజుల్లో సొసైటీ కార్యాలయంలో ప్రదర్శిస్తామన్నారు. అభ్యంతరాలు, ఇతరత్రా ఫిర్యాదులుంటే తమ దృష్టికి తేవాలని కోరారు.