
మూడు టీఎంసీలివ్వండి
నారాయణపూర్ నుంచి విడుదల చేయాలని కర్ణాటక సీఎంను కోరిన టీ కాంగ్రెస్
సాక్షి, బెంగళూరు: తెలంగాణలో నెలకొన్న తీవ్ర కరువు పరిస్థితుల దృష్ట్యా కర్ణాటకలోని నారాయణ్పూర్ జలాశయం నుంచి జూరాలకు మూడు టీఎంసీల నీటిని విడుదల చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రతిపక్ష నేత జానారెడ్డి, టీపీసీసీ చీఫ్ ఉత్తమ్కుమార్రెడ్డి, ఇతర నేతలు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను కోరారు. తెలంగాణ ప్రతిపక్ష నేతల బృందం మంగళవారం బెంగళూరులోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సిద్ధరామయ్యతో సమావేశమైంది.
ఈ సందర్భంగా తెలంగాణలో ఏర్పడ్డ తీవ్ర కరువు పరిస్థితుల గురించి తెలంగాణ నేతలు సీఎంకు వివరించారు. మహబూబ్నగర్ జిల్లా ప్రజల దాహార్తిని తీర్చేందుకు కర్ణాటక నుంచి 3 టీఎంసీల నీటిని విడుదల చేయాలని కోరారు. కర్ణాటక పరిధిలో జరగాల్సిన రాజోలిబండ మళ్లింపు పథకం ఆధునీకరణ పనులను త్వరగా పూర్తి చేయాలని కోరారు. దీనిపై సిద్ధరామయ్య స్పందిస్తూ ‘కర్ణాటకలో సైతం ప్రస్తుతం తీవ్ర కరువు తాండవిస్తోంది. అయినప్పటికీ మానవతా దృక్పథంతో తెలంగాణకు ఒక టీఎంసీ నీటిని ఇస్తాం’’ అని హామీ ఇచ్చారు. తమ వినతిపై సానుకూలంగా స్పందించిన సిద్ధరామయ్యకు తెలంగాణ నేతలు క ృతజ్ఞతలు తెలిపారు.