
ప్రజల ప్రాణాలతో చెలగాటమా?
సాక్షి, హైదరాబాద్: ప్రజల ప్రాణాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోందని.. అది సరైంది కాదని వైఎస్సార్ సీపీ తెలంగాణ అధికార ప్రతినిధి, జాతీయ ప్రధాన కార్యదర్శి కొండా రాఘవరెడ్డి హితవు పలికారు. శుక్రవారం ఆయన లోటస్ పాండ్లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. వైద్యం కోసం పేదలు పడుతున్న ఇబ్బందులు తెలుసుకున్న వైఎస్సార్ 2007లో మూడు జిల్లాల్లో ఆరోగ్యశ్రీని ప్రారంభించి తొమ్మిది నెలలు తిరగక ముందే మిగతా 20 జిల్లాలకు వర్తింపజేశారన్నారు. 500 రోగాలను అందులో చేర్చడంతో పథకం ద్వారా వేలాది మంది లబ్ధి పొందారన్నారు.
వైఎస్సార్ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు ఆరోగ్యశ్రీని పూర్తిగా నిర్లక్ష్యం చే శారన్నారు. ఇక రాష్ట్రం ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ ఆరోగ్య శ్రీని మూసివేయడానికి కంక ణం కట్టుకున్నట్లు కన్పిస్తోందని తెలిపారు. ప్రైవేట్ ఆస్పత్రులకు రూ. 450 కోట్లు బకాయి చెల్లించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని విమర్శించారు. తక్షణమే బకాయిలు చెల్లించి... ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఎటువంటి లోపాలు లేకుండా ఆరోగ్యశ్రీ కింద వైద్యం అందేటట్లు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఆరోగ్య శ్రీపై ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని వీడకుంటే వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు.
ముఖ్యమంత్రులు స్పందించాలి...
హైకోర్టు రూపొందించిన ప్రాథమిక కేటాయింపుల జాబితాను ఉపసంహరించుకోవాలని, తమకు న్యాయం కావాలని తెలంగాణ న్యాయాధికారులు చేస్తున్న డిమాండ్ విషయంలో ఇరు రాష్ట్రాల సీఎంలు వెంటనే స్పందించి పరిష్కారం చూపాలని రాఘవరెడ్డి డిమాండ్ చేశారు. ఇద్దరు సీఎంలు, గవర్నర్, చీఫ్ జస్టిస్ కూర్చొని తక్షణమే చట్టపరంగా దీనికి పరిష్కార మార్గం వెతకాలన్నారు.