
ప్రైవేట్ ఉద్యోగులూ అర్హులే..
రేషన్ కార్డులపై సర్కార్ స్పష్టత
వార్షిక ఆదాయ పరిమితి
రూ.2 లక్షలకు పెంపు
వచ్చే నెలలో కార్డుల జారీ!
సిటీబ్యూరో:గ్రేటర్ హైదరాబాద్లో ఆహారభద్రతా (రేషన్) కార్డులకు ప్రైవేటు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు అర్హులేనని పౌర సరఫరాల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు హైదరాబాద్-రంగారెడ్డి జిల్లా యంత్రాంగాలకు ఆదివారం ఈ ఆదేశాలు అందాయి. ఏడాదికి రూ.2 లక్షల ఆదాయ పరిమితినే ప్రాతిపదికగా తీసుకొని అర్హులకు కార్డులు జారీ చేయాలని ఆ శాఖ అధికారులు సూచించారు. ఒకే ఇంట్లో రెండు, మూడు కుటుంబాలు దరఖాస్తు చేసుకుంటే, వాటిపై పరిశీలనాధికారి పరిశీలించి సంతృప్తి చెందితే కార్డులు జారీ చేయవచ్చని స్పష్టం చేశారు. ఇప్పటివరకు హైదరాబాద్లో 9,40,437 దరఖాస్తులు రాగా అందులో 56 వేలు, రంగారెడ్డి జిల్లాలో 13,68,039 దరఖాస్తులకు గాను 3,67,775 దరఖాస్తుల పరిశీలన పూర్తయింది.
గతంలో పరిశీలన జరిపిన దరఖాస్తులకు కొత్త పరిమితుల మేరకు పునఃపరిశీలన చేయాల్సి ఉంటుంది. ఆహార భద్రత కార్డుల జారీలో ఎలాంటి అవకతవకలు జరిగినా.. అర్హులకు అందకున్నా, అనర్హులకు అందినా పూర్తిగా పరిశీలనాధికారే బాధ్యుడని ప్రభుత్వం ఇదివరకే స్పష్టం చేసింది. కార్డుల జారీపై వినతుల స్వీకరణకు గ్రీవెన్స్ సెల్, సీనియర్ అధికారులతో బృందాలు ఏర్పాటు చేసుకోవాలని సర్కార్ సూచించింది. వచ్చే నెలలో నూతన కార్డులను జారీ చేసే అవకాశం ఉంది.
పెరగనున్నబియ్యం కోటా..
ఆహార భద్రత కార్డు కింద యూనిట్కు బియ్యం కోటా పెరగనుంది. ఇప్పటివరకు రేషన్ కార్డులో యూనిట్కు నాలుగు కిలోల చొప్పున బియ్యం సరఫరా చేసేవారు. ఆహార భద్రత కార్డు కింద ఒక్కో సభ్యుడికి (యూనిట్) ఆరు కిలోల చొప్పున బియ్యం అందించనున్నారు. కార్డుకు ఐదు యూనిట్లు వరకే పరిమితి చేశారు. కార్డుకు గరిష్టంగా 30 కిలోలు అందజేస్తారు.