మిగులు కాదు లోటు! | The deficit is a surplus! | Sakshi
Sakshi News home page

మిగులు కాదు లోటు!

Published Tue, Feb 9 2016 3:26 AM | Last Updated on Fri, Nov 9 2018 5:52 PM

మిగులు కాదు లోటు! - Sakshi

మిగులు కాదు లోటు!

♦ 2015-16లో డిసెంబర్ వరకు రూ.8 వేల కోట్ల లోటు
♦ రాష్ట్ర రెవెన్యూ వ్యయం రూ.54 వేల కోట్లు.. రాబడి రూ.46 వేల కోట్లు
♦ అంచనాలు గల్లంతు  భూముల అమ్మకంపై ఆశలు ఆవిరి
♦ అంచనా రూ.13,500 కోట్లు... ఇప్పటికి వచ్చింది రూ.350 కోట్లు
 
 సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఆదాయ వ్యయాలు ఇప్పటికీ కుదుటపడలేదు! ఆశించినంత ఆదాయం రాకపోవటం.. అంతకు మించి ఖర్చులుండటంతో ఈ ఏడాది కూడా అంచనాలు తలకిందులయ్యాయి. నిరుడు మిగులు బడ్జెట్ ప్రకటించినప్పటికీ వాస్తవ ఆదాయ వ్యయాలు లోటు దిశగానే పయనిస్తున్నాయి. ఏనెలకానె లా గడ్డు పరిస్థితులు వెంటాడుతున్నాయి. రెవెన్యూ రాబడులతో పోలిస్తే రెవెన్యూ వ్యయం ఎక్కువగా నమోదవుతోంది.

ఈ లోటును సర్దుబాటు చేసేందుకు నెలనెలా బాండ్ల విక్రయం ద్వారా అప్పులు తెచ్చుకోవటం తప్ప గత్యంతరం లేని పరిస్థితి నెలకొంది. వచ్చే బడ్జెట్ తయారీకి కసరత్తు చేస్తున్న నేపథ్యంలో వాస్తవ ఆదాయ వ్యయాలను ప్రభుత్వం నిశితంగా సమీక్షించుకుంటోంది. మూస పద్ధతిలో కాకుండా కొత్త పంథాలో బడ్జెట్ తయారు చేస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించటంతో వచ్చే బడ్జెట్ ఆసక్తి రేపుతోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు (2015-16) ఆదాయ వ్యయాలు పరిశీలిస్తే ఖజానాలో డొల్లతనం కనిపిస్తుండటం గమనార్హం. డిసెంబర్ నెలాఖరు వరకు రాష్ట్ర ప్రభుత్వ ఖజనాకు రూ.46 వేల కోట్ల రెవెన్యూ ఆదాయం రాగా... రూ.54 వేల కోట్ల వ్యయం నమోదైంది. నికరంగా రూ.8 వేల కోట్ల లోటు ఉన్నట్లు స్పష్టమవుతోంది.

 ప్రణాళికేతర వ్యయమే ఎక్కువ
 ప్రణాళికేతర వ్యయం ప్రభుత్వానికి గుదిబండగా మారింది. డిసెంబర్ వరకు నమోదైన ఖ ర్చులో ప్రణాళిక వ్యయం కేవలం రూ.16 వేల కోట్లే ఉన్నట్లు తెలుస్తోంది. మిగతా రూ.38 వేల కోట్లు ప్రణాళికేతర వ్యయమే కావడం గమనార్హం. అందుకే వచ్చే బడ్జెట్‌లో దుబారాను తగ్గించాలని, ప్రణాళికేతర వ్యయాన్ని కట్టడి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

 ఆదాయ లక్ష్యం గగనమే: గత బడ్జెట్‌లో రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక వ్యయం రూ.52,383 కోట్లు, ప్రణాళికేతర వ్యయం రూ.63,306 కోట్లుగా ప్రకటించింది. మొత్తం రూ.1.15 లక్షల కోట్లతో బడ్టెట్ ప్రతిపాదించింది. కానీ.. మొదటి తొమ్మిది నెలల వ్యవధిలో రెవెన్యూ ఆదాయం రూ.46 వేల కోట్లకు పరిమితమైంది. దీన్నిబట్టి ప్రతినెలా సగటున రాష్ట్ర ఆదాయం రూ.5,100 కోట్లకు మించటం లేదని అర్థమవుతోంది. ఈ లెక్కన మిగిలిన మూడు నెలల్లో రూ.16 వేల కోట్ల నుంచి రూ.20 వేల కోట్ల వరకు ఆదాయం సమకూరే అవకాశాలున్నాయి. ఆర్థిక సంవత్సరం చివర్లో పన్నుల ద్వారా వచ్చే రాబడి పెద్దమొత్తంలో ఉంటుందని అంచనా వేస్తున్నప్పటికీ.. మొత్తం ఆదాయం రూ.70 వేల కోట్ల నుంచి రూ.75 వేల కోట్లు దాటేలా లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ లెక్కన మిగులు బడ్జెట్‌ను ప్రతిపాదించిన సర్కారు తమ అంచనాలను ఎంత మేరకు సవరించుకుంటుందో అన్న అంశం ఆసక్తి రేపుతోంది.
 
 భూముల అమ్మకంతో అంతంతే..
 భూముల అమ్మకంపై ప్రభుత్వం భారీ ఆశలు పెట్టుకున్నా అవి నెరవేరలేదు. భూములు, ఆస్తుల అమ్మకం ద్వారా రూ.13,500 కోట్ల ఆదాయం వస్తుందని బడ్జెట్‌లో ప్రభుత్వం ప్రకటించింది. కానీ భూముల అమ్మకంతో కేవలం రూ.350 కోట్ల ఆదాయం వచ్చింది. ఇప్పటికే విక్రయానికి సిద్ధంగా ఉన్న భూములు అమ్ముడు పోయినా ఈ ఏడాదిలో రూ.1,000 కోట్లకు మించి ఆదాయం వచ్చే పరిస్థితి లేదు. దీంతో స్టాంపులు రిజిస్ట్రేషన్లు, వాణిజ్య పన్నులు, ఎక్సైజ్, ఎన్‌ఫోర్స్‌మెంట్ ద్వారా వచ్చే ఆదాయంపైనే ప్రభుత్వం ఆశలు పెట్టుకుంది. నిరుటి కంటే వీటి ద్వారా వచ్చే ఆదాయం 15 శాతం వృద్ధి చెందిందని ఇటీవల సీఎం కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement